Tuesday 27 January 2015

దటీజ్ 'హైదరాబాద్ హౌస్' .. సీతాకోకచిలుక ఆకారంలో నిర్మాణం

* ప్రతిష్ఠాత్మక చర్చలకు ఏకైక వేదిక.. నిజాం నిర్మాణ కౌశలానికి ప్రతీక
   ఒబామా భారత పర్యటన సందర్భంగా హైదరాబాద్ హౌస్ మరోసారి వార్తలకెక్కింది. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా చర్చలకు వేదికగా నిలిచిన ఈ హైదరాబాద్ హౌస్‌ను నిర్మించింది మన నిజాంనవాబే. అంటే ఆ భవనం ఒకనాటి మన హైదరాబాద్ సంస్థానం ఆస్తే. స్వాతంత్య్రానంతరం దశాబ్దాల అనంతరం కూడా ఇవాల్టికీ ఢిల్లీ నగరంలో విదేశీ ప్రముఖులతో భేటీలకు ఇంతకు మించిన భవనం నిర్మాణం జరగలేదంటే హైదరాబాద్ హౌస్ గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. 1919లో కొత్తఢిల్లీ నిర్మాణం ప్రారంభమైంది. నాడు నిజాం వంశంలో ఏడవ నవాబుగా ఉన్న ఉస్మాన్ ఆలీ ఖాన్ ఢిల్లీలో హైదరాబాద్ సంస్థానానికి ఒక భవనం ఉండాలని ప్రతిపాదించారు. నాడు ఢిల్లీలో బ్రిటిష్ భవనాలకు రూపకల్పన చేస్తున్న అప్పటి బ్రిటిష్ ఇంజనీరు సర్ ఎడ్విన్ ల్యూటెన్స్‌ను నిజాం సంప్రదించారు. ఆయన ఇచ్చిన డిజైన్ ప్రకారం 1920వ దశకం చివర్లో బాబూఖాన్ ప్రాపర్టీస్ ఆధ్వర్యంలో ఇండియా గేట్‌కు సమీపంలో ఈ భవనం నిర్మాణమైంది. సుమారు 8.77 ఎకరాల విస్తీర్ణం ఉన్న స్థలంలో మొఘల్-యూరోపియన్ భవనాల తరహాలో సీతాకోకచిలుక ఆకారంలో దీన్ని నిర్మించారు. కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలో (1929-31)నే నిర్మాణం పూర్తయింది. ఈ భవనంలో 36 గదులున్నాయి. అయితే ఈ భవనంలో ఎక్కువగా పశ్చిమ దేశాల పోకడలు ఉండడం నచ్చని నిజాం కుటుంబ సభ్యులు దీన్ని చాలా తక్కువసార్లు మాత్రమే వాడుకున్నారు. హైదరాబాద్ నిజాం నవాబు ప్యాలెస్‌గా ప్రాచూర్యం పొందిన ఈ భవనాన్ని భారత యూనియన్‌లో నిజాం సంస్థానాన్ని విలీనం చేసేంత వరకూ నిజాం వంశస్తులు నిర్ణయించారు. ఆ తర్వాత కేంద్రం ఈ భవనాన్ని సంవత్సరానికి రూ. 1.24 లక్షల చొప్పున లీజు ప్రాతిపదికన దీన్ని కేంద్ర ప్రభ్వుత్వం తీసుకుంది. 
             యాజమాన్య హక్కులు మాత్రం హైదరాబాద్ రాష్ట్రం వద్దే ఉండేవి. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడంతో యాజమాన్య హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించబడ్డాయి. 1976 నాటికి ఈ భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించిన కేంద్రం రాష్ర్టాన్ని సంప్రదించింది. ఇరు ప్రభుత్వాల బేరసారాలు చాలా కాలం సాగాయి. కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా, పీవీ నర్సింహారావు ప్రధానిగానూ ఉన్న 1993లో బదలాయింపు పూర్తయింది. ఈ భవనానికి బదులుగా సమీపంలోనే ఉన్న పటోడీ హౌస్ ప్రాంగణాన్ని ఇచ్చింది. అయితే అక్కడ స్థలం 7.64 ఎకరాలు మాత్రమే ఉండడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవన్ వెనకవైపున 3.78 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓల్డ్ నర్సింగ్ హాస్టల్ స్థలాన్ని ఇచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ర్టానికీ ఢిల్లీలో అధికారిక భవన్‌ను నిర్మించుకోడానికి స్థలం ఇస్తున్న క్రమంలో 1వ నెంబర్ అశోకారోడ్డులో ప్రస్తుతం ఉన్న భవనానికి స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది సుమారు 8.42 ఎకరాల మేరకు ఉన్నది. ఆ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 8.42 ఎకరాల స్థలం, హైదరాబాద్ హౌస్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన 11.42 ఎకరాల స్థలం ఇపుడు ఇరు రాష్ర్టాల మధ్య పంపకానికి సిద్ధంగా ఉంది.
- (నమస్తే తెలంగాణ)

No comments:

Post a Comment