Tuesday 3 July 2018

ఒకే ఒక్కడు.. వందల ప్రాణాలు కాపాడాడు!


రైల్వేట్రాక్ వెంట చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకునే వ్యక్తి.. తన సమయస్ఫూర్తి, సాహసంతో వందలాది మంది ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. త్రిపురాలోని ధలాయ్ జిల్లా దంచార గ్రామానికి చెందిన స్వపన్ దిబ్బార్మ అనే వ్యక్తి.. స్వపన్‌ దిబ్రామ రైల్వేట్రాక్‌ వెంబడి సేకరించిన చిత్తుకాగితాలనూ, ప్లాస్టిక్‌ బాటిల్లనూ అమ్ముకుంటూ వాటితో జీవనం సాగిస్తున్నాడు. రోజూలానే ఆ రోజు కూడా పనికోసం, తన చిన్నారి కూతురుతో కలిసి రైల్వేట్రాక్ మీదకి వచ్చాడు. అలా ముందుకు నడుస్తూ… దొరికిన ప్లాస్టిక్‌ బాటిల్లను, చేతిక తగిలించుకున్న సంచిలో వేసుకుంటున్నాడు. ఇంతలో ఓ దృశ్యాన్ని చూసి సడన్‌గా ఆగిపోయాడు. ఎదురుగా విరిగి ఉన్న రైలు పట్టా చూసి షాక్ తిన్నాడు. అక్కడికి కొద్ది దూరంలోనే ఒక రైలు కూత వేసుకుంటూ.. విరిగిన రైలు పట్టావైపు వస్తోంది. రైలు ఇంతవరకూ వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో తనకి తెలుసు. ఎవరికైనా చెబుదామంటే చుట్టూ ఎవరూ లేరు. చెప్పే టైము కూడా లేదు. ఎలాగోలా తనే ధైర్యం చేశాడు. కూతురిని పక్కనే ఉండమని చెప్పి, పట్టాల మధ్యలో నిలబడ్డాడు.

తనపాప వేసుకున్న చొక్కాను తిప్పుతూ… రైలుని ఆపమని డ్రైవర్‌కి సైగ చేశాడు. ఎలాంటి స్పందన లేదు. తన చొక్కానూ విప్పి, రెండింటిని కలుపి ఊపుతూ పెద్దగా కేకలేసాడు. ఈ సారి కూడా ఎలాంటి మార్పూ లేదు. ఇక లాభం లేదనుకుని, ఒకసారి తన కూతురు మొహం వైపు చూసి.. రైలుకు ఎదురుగా, కేకలు వేస్తూ, చొక్కాలు తిప్పుతూ పరిగెత్తాడు. ఈసారికి డ్రైవర్‌ తనను గమనించాడు. అయితే ఆ రైలుకు స్పీడ్‌ బ్రేకుల్లేవు. డ్రైవర్‌ అలర్ట్‌ అయి బ్రేకులు వేసాక, రైలు క్రమక్రమంగా వేగం తగ్గుతూ కదులుతోంది. అది గమనించి తన దగ్గరకు వచ్చాక స్వపన్‌ పక్కకి తప్పుకున్నాడు. పట్టాలు విరిగిన స్థలానికి, కొన్ని గజాల ముందు వరకూ వచ్చి రైలు ఆగిపోయింది. ఏ స్టేషనూ లేనిచోట రైలు ఆగడంతో, ఎంతోమంది ప్రయాణికులు అసహనంతో రైలు దిగారు. కారణం తెలుసుకుని విస్తుపోయి, దిబ్బార్మకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ సమయంలో రైలులో దాదాపు 2000 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న త్రిపుర మినిస్టర్ రాయ్ బర్మన్.. ఈ తండ్రీకూతుళ్లను.. అతని అధికార నివాసానికి పిలిపించి.. ఇద్దరికీ మంచి బట్టలు కొనిపెట్టి వీఐపీలు డిన్నర్ చేసే చోట వారితో కలిసి భోజనం చేశారు. అంతేకాకుండా త్రిపుర అసెంబ్లీ వీరిని అభినందించి, వీరు సౌకర్యంగా బ్రతికేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటుగా రైల్వే శాఖ వీరికి ప్రత్యేక నగదు బహుమతి ప్రకటించనుంది. వీరికి త్రిపుర ప్రభుత్వం కూడా అవార్డు ప్రకటించనుంది. దేశంలోని ప్రముఖులందరి ఇప్పుడు వీరిద్దరిని అభినందనలతో ముచ్చెతడంతో పాటు.. వారికి ప్రభుత్వం వెంటనే అవార్డులు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.


భారత మాజీ క్రికెటర్ వీరెంద్రసెహ్వాగ్ కూడా దిబ్రామ సాహసాన్ని మెచ్చుకున్నారు. రియల్ హీరోస్ అంటూ ఈ తండ్రీకూతుళ్లను కొనియాడారు.
https://twitter.com/virendersehwag/status/1008936071466401792

No comments:

Post a Comment