Wednesday 20 April 2016

ఈ వేసవి చల్లగా...

సమ్మర్ మళ్లీ వచ్చింది. వచ్చిన టైమ్‌లో తేడా లేదు. కానీ, తెచ్చిన హీట్‌లో మాత్రం చాలానే తేడా వుంది. అందుకే ఈ కవర్‌స్టోరీ. ఇంటిపట్టునే తయారు చేసుకోగల గృహ పానీయాలతో ఈ వేసవి చల్లగా గడపండి మరి! 
  పాత రోజుల్లో వేసవి అంటే వేపపూత వగరు, మామిడి కాయ పులుపు, తాటిముంజల చల్లదనం, నోరూరించే చెరకు రసం, మళ్లీ మళ్లీ తాగాలనిపించే నిమ్మరసం, మరోవైపు ఈతకాయలు, చీమ చింతకాయలు, సాయంత్రాలు మల్లెలు మోసుకొచ్చే పరిమళాలు, సెలవుల్లో పిల్లల హడావుడులు అంతా సందడి. ఇపుడు ఎండాకాలంలో వేడిదెబ్బకు వీధులు, పంటపొలాలు ఠారెత్తిపోతున్నాయి. ఉదయం ఎనిమిది దాటితో పల్లెల్లో, పట్టణాల్లో రోడ్డు మీదకు రావాలంటే భయపడిపోతున్నారు. ఈ హీట్‌నుంచి తాత్కాలికంగా తప్పించుకోవడానికి మార్కెట్‌లో దొరికే కూల్‌డ్రింక్స్, ఫ్రూట్ ఎసెన్స్‌లు, ఆర్టిఫిషియల్ డ్రింక్స్ మీద ఆధారపడుతున్నారు. కానీ వీటివల్ల చల్లదనం సంగతేమో గానీ మనం మరింత డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదమూ వుంది. వీటివల్ల రక్తంలో ఫాస్పరస్ అధికంగా పెరిగి ఎముకలు దెబ్బతింటాయి. దంతాలు, కిడ్నీలు దెబ్బతినే అవకాశమూ ఉంది. ఇలాంటి పరిస్ధితుల్లో మనం ఇంట్లోనే అందుబాటులో వున్న వాటితో ఆరోగ్య అమృతాలు తయారు చేసుకోవడం మంచిది. సులభంగా తయారు చేసుకున్న శీతల పానీయాలను హాయిగా సేవిస్తూ మండు వేసవిని ఎదుర్కొందాం. మరి చదవండి... తయారు చేసుకోండి... 
 వాటర్ మెలన్
ఎండాకాలంలో ఒంటి నిండా నీటిని దాచుకునే వాటర్ మెలన్ సమ్మర్ హీట్‌ను కూల్ చేయడంలో నెంబర్‌వన్. ఇది ఉదరంలో మంటను తగ్గిస్తుంది. శరీరంలోని ఆమ్లాలను తగ్గిస్తుంది. దీన్ని షుగర్ లేకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుంది. ఇది ప్రత్యేకంగా కిడ్నీ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
పుచ్చకాయ జ్యూస్
కావలసిన పదార్ధాలు:
పుచ్చకాయ: సగం 
పుదీనా: 2-3 రెమ్మలు 
నల్ల ఉప్పు : ఒక టీ స్ఫూన్ 
నిమ్మకాయ: అర ముక్క 
ఐస్ క్యూబ్స్: నాలుగు
తయారీ: మిక్సీ జార్‌లో గింజలు లేని పుచ్చకాయ ముక్కలు, పుదీనా ఆకలు, ఐస్ క్యూబ్స్ వేసి గ్రైండ్ చేయాలి. ద్రావణాన్ని గ్లాస్‌లో పోసి నల్ల ఉప్పు, ఐస్ క్యూబ్స్ వేసుకొని సేవించడమే... ప్రకృతి ఏ రుతువులో మనకు కావలసిన ఆహారాన్ని ఆ కాలంలో అందుబాటులోకి తెచ్చింది. వాటిని సవ్యంగా వాడుకుంటే సరి! 
మామిడితో మజా మజా
మామిడితో ఆమ్‌కా పనా, క్యారట్ మ్యాంగో జ్యూస్, మ్యాంగో పైనాపిల్ జ్యూస్ వంటి పలు రకాల పానీయాలను తయారుచేసుకోవచ్చు. ఇది మొఘల్ చక్రవర్తులను సైతం తన మాధుర్యంలో ముంచెత్తింది. మామిడి ప్రత్యేకత ఏమిటంటే తక్కువ కొలెస్ట్రాల్ కలిగివుండి రోగనిరోధకశక్తిని, దృష్టిని, జ్ఞాపక శక్తిని పెంపు చేస్తుంది. 
ఆమ్‌కా పనా
కావలసిన పదార్ధాలు:
మామిడికాయలు: అర కేజీ
బెల్లం : 150 గ్రా 
నీళ్లు : లీటర్ 
జీలకర్ర: టీ స్పూన్ (వేయించి పొడి చేయాలి) 
ఉప్పు: తగినంత 
నల్ల ఉప్పు: టీ స్పూన్ 
పుదీనా: ఆరు రెమ్మలు 
ఐస్ క్యూబ్స్ : రెండు
తయారీ: మామిడికాయలను కడిగి తగినంత నీరుపోసి ఉడికించాలి. చల్లారిన తరువాత గుజ్జు తీసి మిక్సర్‌లో వేసి గ్రైండ్ చేయాలి. నీళ్లలో బెల్లం, గుజ్జు, ఉప్పు, నల్ల ఉప్పు, జీలకర్ర, పుదీనా వేసి కలపాలి. రెండు ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవచ్చు. 
ఉపయోగాలు: ఎండ వేడిమి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఎండాకాలం విపరీతంగా కారే చెమట నుంచి సోడియం, ఐరన్‌లను నష్టపోకుండా నివారిస్తుంది. జీర్ణ సంబంధ, రక్త సంబంధ లోపాలను నియంత్రిస్తుంది. కొత్త రక్తకణాల తయారీలో తోడ్పడుతుంది.
సబ్జా సమ్మర్ డ్రింక్
కావలసిన పదార్ధాలు:
సబ్జా గింజలు : 1 టీ స్పూన్
నిమ్మకాయ : అర ముక్క
పంచదార: ఒక టేబుల్ స్పూన్ 
జీలకర్ర పొడి : టీ స్ఫూన్ 
ఉప్పు : చిటికెడు 
నల్ల ఉప్పు: కొంచెం 
నీరు: తగినంత
తయారీ: మొదటగా నానబెట్టిన సజ్జాగింజలను ఒక గిన్నెలో వేసి 20 నిముషాల పాటు నానబెట్టుకుంటే అవి ఉబ్బుతాయి. తరువాత ఒక గ్లాస్‌లో ఐస్ ముక్కలను మెత్తగా చేసుకుని, పంచదార, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో సబ్జాగింజలను నీటితో సహా కలపాలి. ఇందులో జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి కొంచెం నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇది డీహైడ్రేషన్ నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఎండకు చర్మం నల్లబడి పోతుందనుకోండి, నిమ్మరసానికి కొద్దిగా అల్లం రసాన్ని కలిపి తాగితే ఒంటిపై నలుపన్నదే కానరాదు. 
రాగి మజ్జిగ
కావలసిన పదార్ధాలు: 
రాగి పిండి: ఒక కప్పు
పెరుగు: ఒక కప్పు
నిమ్మకాయ: అర ముక్క
అల్లం : చిన్న ముక్క
ఉప్పు : తగినంత 
కొత్తిమీర : రెండు రెమ్మలు 
నీరు: 3 కప్పులు
తయారీ: ఒక పాత్రలో రాగి పిండి వేసి మూడు కప్పుల నీటిలో ఒక కప్పు రాగిపిండి కలపాలి. 5 నిముషాల పాటు ఉండలు లేకుండా కలిపి తక్కువ మంటతో ఉడికించాలి. జావగా అయిన తరువాత కొంత సేపు చల్లార బెట్టుకోవాలి. ఈ లోపు అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి గ్రైండ్ చేపి ఒక గిన్నెలో పక్కకు పెట్టుకోవాలి. రాగి జావలో గ్రైండ్ చేసిన పేస్ట్ కలిపి, దానికి పెరుగును జత చేయాలి. ఈ మిశ్రమాన్ని మెత్తగా మజ్జిగలా గ్రైండ్ చేసి తరువాత నీరు కలిపి మళ్లీ గ్రైండ్ చేయాలి. తరువాత ఉప్పు, నిమ్మరసం కలిపి గ్రైండ్ చేయాలి. దీనిని ఫిల్టర్ చేసుకుని, ఐస్‌క్యూబ్స్ కలుపుకుని తాగితే శరీరం క్షణాల్లో చల్లబడుతుంది.చెమట రూపంలో కోల్పోయిన లవణాలను తిరిగి పొందాలంటే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం లాంటివి తరచూ తీసుకోవాలి.
మసాలా బట్టర్ మిల్క్
కావలసిన పదార్ధాలు:
పెరుగు : పావు కప్పు
జీలకర్ర : పావు టీ స్పూన్
మసాలా : పావు టీ స్పూన్
నల్ల ఉప్పు : కొంచెం
అల్లం : కొంచెం
ఇంగువ : కొంచెం
పుదీనా : 5 నుంచి 8 ఆకులు
కొత్తిమీర : కొన్ని ఆకులు
పచ్చి మిరపకాయ : 1
నీరు : 1 గ్లాస్ 
తయారీ: ఒక మిక్సర్‌లో కొత్తిమీర, పుదీనా ఆకులు, ఉప్పు మినహా మిగిలినవి వేసి మెత్తని ద్రావణం చేసుకోవాలి. తరువాత రుచి కొరకు ఉప్పును కలిపి గ్లాస్‌లో పోయాలి. సర్వ్ చేసేటపుడు కొత్తిమీర, పుదీనాతో అలంకరించుకుని సేవించండి.
ఉసిరి తులసి డ్రింక్ 
కావలసిన పదార్ధాలు: 
ఉసిరికాయలు: నాలుగు 
తులసి ఆకులు: రెండు కొమ్మలు 
నీళ్లు: 1 లీటర్
తయారీ: మొదట తులసి ఆకులను తుంచి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉసిరిని ముక్కలుగా ముక్కలుగా చేయాలి. ఈ రెండింటిని మెత్తగా నూరి నీటిలో వేసి మరగబెట్టాలి. తరువాత స్టవ్ మీద నుంచి దించి చల్లారిన తరువాత ఫిల్టర్ చేసి సర్వ్ చేయాలి. ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా వుంటుంది. 
పోమోగ్రనేట్ లస్సీ
కావలసిన పదార్ధాలు:
దానిమ్మ : 2 
పెరుగు : 1 కప్పు
కుంకుమ పువ్వు : కొద్దిగా
పటిక బెల్లం పొడి : 6 స్పూన్లు
బ్లాక్ సాల్ట్ : కొంచెం
తయారీ: మొదటగా జార్‌లో పెరుగు, దానిమ్మ గింజలు, పటిక బెల్లం పొడి, బ్లాక్ సాల్ట్, కుంకుమ పువ్వు వేయాలి . దీన్ని మిక్సర్‌లో వేసి కొద్దిగా నీరు కలిపి జ్యూస్ అయ్యేంత వరకు వుంచాలి. దీనికి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. 
నిమ్మకాయ షర్బత్
కావలసిన పదార్ధాలు:
నిమ్మకాయ : ఒకటి
అల్లం : చిన్న ముక్క
పంచదార : రెండు టేబుల్ స్పూన్స్
ఉప్పు : తగినంత
తయారీ: ఒక గ్లాస్‌లో నిమ్మరసం పోసి అందులో పంచదార, ఉప్పు కలిపి, మెత్తగా నూరిన అల్లాన్ని కలిపి బాగా కలపాలి. దీనికి చల్లని నీటిని కలిపి తీసుకోవడమే తరువాయి.
గ్రేప్ జ్యూస్
కావలసిన పదార్ధాలు:
ద్రాక్ష : పావు కేజీ
అల్లం : చిన్న ముక్క
తేనె : ఒక టేబుల్ స్పూన్
ఐస్ క్యూబ్స్ : 4
తయారీ: మొదటగా ద్రాక్షను ఒక మిక్సర్‌లో వేసి మెత్తగా చేసి, కొంచెం నీటిని కలిపి పూర్తి ద్రావణంగా మారే వరకు మిక్సీలో వుంచాలి. తరువాత దీనిని వడగట్టి కొంచెం అల్లం రసం కలిపి, ఐస్ క్యూబ్స్‌ను జతచేస్తే చల్లచల్లని ద్రాక్ష రసం తయారవుతుంది. 
ద్రాక్ష ఉపయోగాలు : వేసవిలో తాజాగా దొరికే ద్రాక్షపళ్లు దేహాన్ని సులువుగా చల్లబరుస్తాయి. ద్రాక్ష మన రక్తాన్ని గడ్డ కట్టిస్తుంది. నల్ల ద్రాక్షలోని విత్తనాలు కేన్సర్‌ను అరికట్టడంలో బాగా ఉపయోగపడతాయి. 
మల్లెల ద్రావణం.. పరిమళాల సౌరభం 
కావలసిన పదార్ధాలు:
నీరు : 1 లీటర్
చక్కెర: 1 కేజీ
యాలకుల పొడి : కొంచెం
మల్లెపూలు : గుప్పెడు
తయారీ: 1 లీటర్ నీటిలో 1 కేజీ చక్కెర కలిపి స్టవ్ మీద మరగబెట్టాలి. పాకం వచ్చిన తరువాత స్టవ్ మీద నుంచి కిందకు దించి కొంచెం చల్లారిన తరువాత మల్లెపూలను వేసి కలపకుండా అలాగే ఎనిమిది గంటలపాటు వుంచాలి. ఆలోపు మల్లెల సుగంధం చక్కెర పాకంలోకి దిగుతుంది. దానిని ఫిల్టర్ చేసి గాజు సీసాలో భద్రపరచుకోవాలి. కావలసినపుడు పావుగ్లాస్ మల్లె పూల జ్యూస్‌కి, తగినంత నీరు కలిపి సర్వ్ చేయాలి.    ఇలా మనకు అందుబాటులో వున్న వాటితో, ఈ సీజన్‌లో దొరికే పళ్లతో రకరకాల పానీయాలను తయారుచేసుకోవచ్చు. అతిధులు ఇంటికి రాగానే ఏ కూల్‌డ్రింక్సో, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్డ్ డ్రింక్సో ఇవ్వకుండా ఇలా ఇంట్లో తయారు చేసుకున్న పానీయాలను కూల్‌కూల్‌గా అందిస్తే రుచితో పాటు ఆరోగ్యం కూడా అదనం. 
పల్లె బ్రాండ్స్ ....
చల్ల: చల్ల తాగిన వాడే మొనగాడుని, కవ్వం తిరగాడినచోట కరవుకు తావుండదని పాత సామెతలు. ఇవెలా ఉన్నా మన పాతకాలంలో పాలు, పెరుగు, చల్ల దొరకని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. మరి చల్ల వల్ల ఏం ప్రయోజనాలూ అంటే చాలా ఉన్నాయి. చల్ల తాగితే అది ఉదరాగ్నిని పూర్తిగా హరించివేస్తుంది. అరకప్పు చల్లలో పావు స్పూన్ శొంఠిపొడి కలిపి తాగితే కడుపు మంటగా ఉంటే వెటనే ఉపశమనం కలుగుతుంది. చల్లలో వేయించిన జీలకర్ర కలిపి తాగితే వడదెబ్బ తగలదు. వాంతులయ్యేటప్పుడు జాజికాయను మెత్తగా చేసుకుని చల్లలో కలుపుకుని సేవిస్తే అవి తగ్గుతాయి. ఎక్కిళ్లు వస్తున్నప్పుడు ఒక గ్లాస్ చల్లలో చెంచా శొంఠి కలుపుకుని సేవించవచ్చు. ప్రతిరోజు చల్ల తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
చెరకు రసమే చేవ: వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించి శరీరానికి కావలసిన పోషకాలను అందించడంలో చెరకు ఎంతో తోడ్పడుతుంది. వడదెబ్బ తగిలిన వారికి చెరకు రసాన్ని అందిస్తే, శరీరానికి కావలసిన షుగర్, ప్రోటీన్స్, ఎలక్ట్రోలైట్స్ అంది ఉపశమనం కలుగుతుంది.ఈ రసం మూత్ర సంబంధ వ్యాధులను కూడా తగ్గిస్తుంది. అలాగే శరీర బరువునూ తగ్గిస్తుంది. కేన్సర్‌తో పోరాడే శక్తినిస్తుందనీ వైద్యులు చెబుతారు.
తాటిముంజలు: వీటి వల్ల శరీరానికి బాగా చలువ చేస్తుంది. ముఖ్యంగా శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడంలో అలాగే జీర్ణక్రియను సాఫీగా నడిపించడానికీ ముంజలు చాలా మేలు. వీటిలో ఐరన్ ఎక్కువగా వుంటుంది. అంతేకాదు, కొవ్వు శాతం తక్కువగా వుండటం వల్ల చిన్నపిల్లలకు, హృద్రోగులకు ఇవి చాలా మంచిది. దాహార్తికి కూడా ఇవి మంచి విరుగుడని వేరే చెప్పనవసరం లేదు. 
వంటిల్లే వైద్యశాల..మన వంటిల్లే వైద్యశాల. మన ఆహారమే మన మొదటి ఔషధం. అందులో మనం వాడే సమస్త వస్తువులు ఆరోగ్య హేతువులే. ఇదే భారతీయ ఆహార వేదం. అయితే వంటల్లో వాడే వీటిని మనం తయారు చేసుకునే పానీయాల్లో కూడా వాడుకోగలిగితే కలిగే ప్రయోజనాలు బోలెడు...
అల్లం: జీర్ణక్రియని మెరుగు పరుస్తుంది. అన్ని రకాల నొప్పులను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
పుదీనా: పుదీనా రుచి వాసనతో పాటు చాలా ఔషధ గుణాలను కలిగివుంది. ధాయ్ వంటకాలలో దీనిని సూప్‌లలో, కూరలలో వాడతారు. ఇది పొట్టనొప్పిని తగ్గించి జీర్ణవ్యవస్ధను మెరుగుపరుస్తుంది. అంతేకాదు, పుదీనా ఆకులు చర్మానికి చల్లదనాన్నిచ్చి, చర్మపు మంటలను పోగొడతాయి. పుదీనా రక్తాన్ని శుభ్రపరుస్తుంది కూడా.
కొత్తిమీర: కొత్తిమీర ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్‌లను కలిగి వుండటం వలన కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా నియంత్రిస్తుంది. దీనిలో విటమిన్ సి, కె తో పాటు ప్రొటీన్స్ కూడా ఎక్కువే. అన్నట్టు, కొత్తిమీర మహిళల్లో నెలసరి ఇబ్బందులను తగ్గిస్తుంది. మధుమేహ రోగులకు ఇది మంచి ఔషధం. కొత్తిమీర నుంచి వచ్చే ధనియాలు రకరకాల రోగాలను తగ్గిస్తాయి కాబట్టి వీటికి ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యం ఉంది. ధనియాలను ఆయుర్వేదంలో కుస్తుంబురు, వితున్నక అనే పర్యాయదాలతో వాడుతారు. వితున్నక అంటే వేడిని తగ్గించేది అని అర్ధం.
మిరియాలు: మిరియాల చూర్ణం, బెల్లం, పెరుగు కలిపి తింటే జలుబు తగ్గుతుంది. 
నిమ్మ: వీటిలో సి విటమిన్ పుష్కలంగా కలిగి జలుబును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. నిమ్మలో వుండే సిట్రిక్ ఆసిడ్ ఎంజైమ్‌ల విధిని మెరుగు పరచడమే కాకుండా, కాలేయాన్ని డీటాక్సిఫై చేసి శరీరంలోని విషపదార్ధాలను తొలగిస్తుంది.
యాలకులు: దీనిని ఆయుర్వేదంలో ఇలద్వయ అంటారు. సువాసన కలిగిన సుగంధ ద్రవ్యాలలో ఇది ప్రధానమైంది. ఇవి రుచితో పాటు సువాసనను కలిగి వుంటాయి. యాలకులు అనాదిగా ఆయుర్వేద వైద్యంలో వున్నట్టు చరక సంహిత, శుశ్రూత సంహితలో వుంది. శరీరానికి చలువ చేసే గుణాలు వీటికి ఎక్కువ. యాలకుల కషాయం సేవిస్తే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఇది దివ్యౌషధం.
జీలకర్ర: ఇది శ్వాస సంబంధ వ్యాధులను నియంత్రిస్తుంది. షుగర్ వ్యాధి నియంత్రణలో పనిచేస్తుంది. అన్నట్టు, నిద్రలో నడిచే వ్యాధిని సైతం తగ్గించడం జీలకర్ర ప్రత్యేకత. ఇది రక్తహీనతను కూడా తగ్గిస్తుంది.
నల్ల ఉప్పు: శరీరాన్ని చల్లబరచడంలో నల్ల ఉప్పు ముందుంటుంది. ఇది సముద్రపు ఉప్పు కన్నా మేలైంది. కీళ్లనొప్పులు, పక్షవాతం, అధిక రక్తపోటు నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. దీనిలో సల్ఫర్ ఎక్కువగా వుండటం వల్ల మామూలు ఉప్పుకన్నా తక్కువ పరిమాణంలో తీసుకోవలసి వుంటుంది.