Friday 4 October 2013

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...

బతికించే అమ్మ ‘బతుకమ్మ’

                               
తెలంగాణ ఆడపడుచులు ఆడుతూ, పాడుతూ తమ జానపద సాహిత్యం జోడించి ఆబాల గోపాలాన్నీ అలరించేదే బతుకమ్మ పండుగ.
             వినోదాత్మక ప్రభోద గీతాలను ఆలపిస్తుండగా జానపదమంతా భక్తి శ్రద్ధలతో చేసుకునే ఈ పండుగలో తొలినాడు ఎంగిలి పువ్వులతో మొదలుపెట్టి, ఆఖరి రోజున పసుపు ముద్దను గౌరమ్మగా భావించి ఊరి బయటకు కోలాహలంగా స్త్రీలందరు ముఖ్యంగా ముత్తయిదువలు పళ్ళాలతో పోటీ పడి ఒకరికన్నా ఒకరు పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి మురిసిపోతారు.
           బతుకమ్మ పండుగ వచ్చిందంటే పల్లెల్లో ఉండే ఆడవారికి ముఖ్యంగా పిల్లల నుండి మధ్య వయస్కుల వరకు అందరికీ సందడే సందడి. హడావుడిగా పొద్దుపొద్దున లేచి పోటీ పడుతూ తంగేడు పూల వేటకై గుంపులు గుంపులుగా బయలుదేరుతరు. గడ్డిపూలు, సోయపూలు, నూగుపూలు తీసుకొచ్చి రంగులు వేసి సిద్ధం చేసుకుంటరు. ఇక బతుకమ్మను పేర్చడంలో ముత్తయిదువలు ఎంతో నేర్పరితనం చూపిస్తరు. గుండ్రని పెద్ద పళ్ళెం తీసుకొని అడుగున లేత తంగేడు ఆకులను పరచి, ఆపైన తంగేడు పూలు, ఒక వరుసలో గడ్డిపూలు, మరో వరుసలో... ఇలా ఓపిక ఉన్నంత వరకు రంగు రంగుల బతుకమ్మలను గోపురంలా పేర్చి ఆపైన పసుపు ముద్దను గోపుర ఆకారం చేసి పెడతరు. 
           దాంతోపాటు చిన్న బతుకమ్మను పేరుస్తరు. జానపద పాటలు, కోలాటాలు, కథలు గుర్తుకు తెచ్చుకుంటూ మునిసంధ్య వేళలో ఆడవాళ్ళు అందంగా తయారై ఒకరినొకరు పలకరించుకుంటూ వయ్యారంగా        బతుకమ్మలను రెండు చేతులతో పట్టుకొని దేవాలయ ప్రాంగణంలోకి గాని, చెరువు ఒడ్డుమీదకు కాని చేరుకుంటరు. బతుకమ్మలన్నింటినీ ఒక దగ్గర గుండ్రంగా పెట్టి వాటి చుట్టూ ఒకరి నొకరు చేతులు పట్టుకుంటూ తిరుగుతూ పద విన్యాసంలో ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అని చప్పట్లు కొడుతూ లయాత్మకంగా ఆడుతూ, పాడుతూ వినోదిస్తరు. మరికొందరు బాలనాగమ్మ కథ, మహాలక్ష్మమ్మ కథ, కాంభోజరాజు కథ, గంగాగౌరి సంవాదం, గౌరీ కళ్యాణం లాంటి జానపద గాథలను గానం చేస్తారు.
         ఇంకొందరు కోలాటాలాడుతూ ఆనందిస్తుంటారు. దినమంతా పడిన కష్టాన్ని మరచిపోయి ఆటపాటలతో ఆనందంగా గడిపేస్తారు. ఈ అమాయక పల్లె జీవులు, ప్రపంచీకరణం వచ్చి పడ్డా మన సంస్కృతిని కాపాడుకుంటూ పండుగలు, పబ్బాలు జరుపుకుంటున్నారు.
పండుగ మంగళగౌరీ వ్రతం కనుక మహిళలు తమ పసుపు కుంకుమలను కలకాలం కాపాడవలసిందిగా గౌరీదేవిని వివిధ పుష్పాలతో అలంకరించి, భక్తిక్షిశద్ధలతో పూజిస్తరు. 
        ‘మా బతుకులను కాపాడమ్మా’ అంటూ సంఘీభావంతో సమైక్యతా వాదంతో వర్గ భేదాలు లేకుండా కాలపరిస్థితులు, మార్పులను బట్టి తమ పాటలను సామాజిక చైతన్య తరంగాలుగా మార్చుకుంటున్న విధానమూ ఈ పండుగలో కనిపిస్తుంది. 
‘‘ఒక్కొక్క పూవేసి చందమామ
పలకా బలపం చేబడుదాం చందమామ
ఓనమాలు దిద్దుకుందాం చందమామ
ఒంట్లు నేర్చుకుందాం చందమామ
వేలిమువూదలు మాని చందమామ
సంతకాలు నేరుద్దాం చందమామ...’’అని,
 కొందరైతే-
‘‘ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల
బెల్టు షాపులు వచ్చె ఉయ్యాలో
సారా రక్కసిని ఉయ్యాలో
మా కొంపలే కూల్చె ఉయ్యాలో
సార రక్కసి తరమంగ ఉయ్యాలో...’’
    అంటూ సారాభూతంపై ధ్వజమెత్తుతూ తమ వ్యతిరేకతను చాటుకుంటున్నరు. 
ఇంకా నవ సమాజ నిర్మాణం కోసం ప్రపంచీకరణ పెత్తనం గురించి పాడుతూ...
‘‘పసుపు కుంకుమలు మోటాయె చందమామ
బొట్టు కాటుక కరువాయె చందమామ
బొట్టు బిళ్ళ లొచ్చె చందమామ
అమ్మనాన్న పాడాయె చందమామ
మమ్మీ డాడీ ఇంపాయె చందమామ...’’
 అంటూ తమ చేతకాని తనాన్ని వెలి బుచ్చుతున్నారు. ‘‘ఎరువు కరువొచ్చె చందమామ, కరెంటు కోతవచ్చె చందమామ, నేతన్నల బతుకులు బుగ్గి పాలాయె చందమామ...’’ అంటూ తమ కష్టాలను, గోడులను, బాధలను తెలుపుకునే వాళ్ళు మరి కొందరు.
         ఈ విధంగా ఆధునిక జీవితంలోని కష్టనష్టాలను ఏకరువు పెడుతూ తొమ్మిది రోజులు పాటలు పాడతరు. చివరి రోజున సద్దుల బతుకమ్మను అందంగా పేర్చి అగరుబత్తులతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో తమ గడపలకు పసుపు కుంకుమలు ఇచ్చి, ‘‘చల్లా (మజ్జిగతో) గుమ్మాలను ఇంటి ఆడపడుచులను సుతారంగా తాకి తమ బతుకులను చల్లగా చూస్తూ కాపాడు గౌరమ్మా’’ అని వేడుకుంటరు.
        బతుకమ్మను పేర్చిన పళ్ళాలను నీళ్ళలోకి వదిలి అవి వయ్యారంగా సాగిపోతూ ఉంటే ‘‘పోయి రావమ్మా పోయి రావమ్మా, బతుకమ్మ పోయిరా గౌరమ్మా, మా బతుకులను చల్లగా చూడు తల్లి’’ అని వీడ్కోలు పలుకుతరు. 
వృత్తాంతాలు

 
           కరువు కాటకాలు సంభవించి, ఊళ్ళకు ఊళ్ళు అంతరించి పోతున్న సమయంలో ప్రజలు బతుకమ్మను ఆరాధించారని అంటారు. ప్రశాంతత నెలకొనడంతో అప్పటి నుంచి తల్లిని కొలుస్తూ రావడం, లోక కంఠకుడైన మహిషాసురుణ్ని వధించేందుకు దుర్గామాత యుద్ధం చేస్తుందని, ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని స్పృహ కోల్పోతుందని, మాత స్పృహ నుంచి తేరుకోవడానికి ‘తల్లి గౌరమ్మ... నువ్వు బతకాలమ్మా’ అంటూ వేడుకున్నారని పురాణాలు చెబుతున్నయి. 
          రాత్రింబవళ్లు కొలువగా చివరికి దశమి రోజున ఆ అమ్మవారికి స్పృహ వచ్చి, మహిషాసురుణ్ని వధిస్తుందని, అప్పటినుంచి తల్లిని బతుకమ్మగా కొలుస్తున్నట్లు ఒక కథనం ఉంది.
           మరో కథనం ప్రకారం ఒక అమ్మాయి భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. కానీ, ఆ ఊరి ప్రజలందరూ ఆమెను మర్చిపోలేకపోయారు. అందుకే ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం తమ మనస్సులో ‘బతుకమ్మ’ అని దీవించారట. అందుకే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిందిగా భావిస్తరు. ఆమెను కీర్తిస్తూ జరుపుకొనే పండుగగా భావిస్తరు.
    ఇంకొకటి దక్షిణ భారతాన్ని పాలించిన చోళవంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం లేక అనేక పూజలు, పునస్కారాలు చేశాడు. లక్ష్మీదేవి అనుక్షిగహంతో ఆయనకు ఒక బిడ్డ జన్మించింది. తాను అనేక గండాలను దాటింది. కాబట్టి, ఆమె పేరును ‘బతుకమ్మ’ అని నామకరణం చేశారు. ఆమె పేరు మీదే ఈ పండుగ వినుతి కెక్కిందంటరు. 
ఎక్కడ ఎలా ఉన్నా, తెలంగాణకు బతుకమ్మ ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఈ పండుగ. ఈ పండుగ వర్షాకాలపు చివర్లో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలవల్ల చెరువులన్నీ మంచినీటితో నిండి ఉంటాయి. రంగురంగుల పూలను వరుసగా పేర్చి చెరువులలో నిమజ్జనం చేస్తరు.
     మునిసంధ్య వేళలో ఆడవాళ్ళు అందంగా తయారై ఒకరినొకరు పలకరించుకుంటూ వయ్యారంగా బతుకమ్మలను రెండు చేతులతో పట్టుకొని దేవాలయ ప్రాంగణంలోకి గాని, చెరువు ఒడ్డుమీదకు కాని చేరుకుంటరు. బతుకమ్మలన్నింటినీ ఒక దగ్గర గుండ్రంగా పెట్టి వాటి చుట్టూ ఒకరి నొకరు చేతులు పట్టుకుంటూ తిరుగుతూ పద విన్యాసంలో ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అని చప్పట్లు కొడుతూ లయాత్మకంగా ఆడుతూ, పాడుతూ వినోదిస్తరు.
           ఈ బతుకమ్మ పండుగలో నవవిధ పుష్పాలంకరణ నవవిధ భక్తికి మూలం. నవ జీవనానికి సంకేతం. నవ వసంతానికి నాంధి. నవ చైతన్యానికి ప్రతీక. వివిధ జాతుల పూలు సమైక్యతతో వున్నట్లే, మానవులంతా కలిసి ఉండాలని ప్రబోధించే పండుగ బతుకమ్మ పండుగ.

Monday 2 September 2013

హైద్రాబాద్‌లో చారిత్రక కట్టడాలు, నిర్మాణాలు
1507:  గోల్కొండ స్వతంత్ర రాజ్యంగా అవతరణ
1562:  హుస్సేన్ సాగర్ నిర్మాణం
1578:  పురానాపూల్ నిర్మాణం
1578:  హైదరాబాద్ నగరం గోల్కొండ కోట నుండి మూసీకి దక్షిణం విస్తరణ
1589-94: చార్మినార్, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్ల నిర్మాణం
1793:  సరూర్‌నగర్‌లో జనావాసాలు ఏర్పడటం
1803:  సుల్తాన్ షాహీలో టంకశాల ఏర్పాటు
1805:  మీరాలం మండీ ఏర్పాటు
1806:  మీరాలం చెరువు నిర్మాణం 
1808:  బ్రిటీష్ రెసిడెన్సీ భవన నిర్మాణం
1828:  చందూలాల్ బారాదరీ నిర్మాణం
1831:  చాదర్‌ఘాట్ వంతెన నిర్మాణం
1859-66:  అఫ్జల్‌గంజ్ వంతెన నిర్మాణం
1862:  పోస్టాఫీసుల నిర్మాణం
1873:  బాగేఅం - పబ్లిక్ గార్డెన్ నిర్మాణం
1873:  బొంబాయి - సికిందరాబాద్ రైల్వేలైన్ల నిర్మాణం
1874:  నిజాం రైల్వే సంస్థ ఏర్పాటు
1884: ఫలక్‌నామా ప్యాలెస్ నిర్మాణం
1882:  చంచల్‌గూడా జైలు నిర్మాణం
1883:  నాంపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం
1884:  ముస్లింజన్ వంతెన నిర్మాణం
1885:  టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు
1890:  నిజామియా అబ్జర్వేటరీ టెలిస్కోపు ఏర్పాటు.......
1893:  హనుమాన్ వ్యాయామశాల
1920:  హైకోర్టు నిర్మాణం
1920:  ఉస్మాన్‌సాగర్ నిర్మాణం
1927:  హిమాయత్‌సాగర్ ఆనకట్ట నిర్మాణం
1930:  హైదరాబాద్ నగరంలో సిమెంటు రోడ్ల నిర్మాణం

నైజాం కాలంలో పరిశ్రమల స్థాపన
1871:  సింగరేణి బొగ్గు గనులు
1873: మొదటి స్పిన్నింగ్ మిల్లు
1876: ఫిరంగుల ఫ్యాక్టరీ
1876: ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్
1910: సోడా ఫ్యాక్టరీ
1910: ఐరన్ ఫ్యాకరీ
1916: దక్కన్ బటన్ ఫ్యాక్టరీ
1919: వి.ఎస్.టి ఫ్యాక్టరీ
1921: కెమికల్ లాబోరేటరీ
1927: దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ
1929: డి.బి.ఆర్.మిల్స్
1931: అజంజాహి మిల్స్, వరంగల్
1932: ఆర్.టి.సి. స్థాపన
1937: నిజాం షుగర్ ఫ్యాక్టరీ
1939: సిర్పూర్ పేపర్ మిల్లు
1941: గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ
1942: హైదరాబాద్ స్టేట్ బ్యాంక్
1942: హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్
1943: ప్రాగా టూల్స్
1946: హైదరాబాద్ అస్బెస్టాస్
1947:  హైదరాబాద్ లామినేషన్ ప్రొడక్ట్

హైదరాబాద్‌లో స్కూళ్లు, కాలేజీల స్థాపన
1856: దారుల్ ఉలూం పాఠశాల
1872: చాదర్‌ఘాట్ పాఠశాల
1879: ముఫీదుల్ అనాం హైస్కూల్
1879: అలియా స్కూల్
1884: సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ 
1874: నిజాం కాలేజీ
1887: నాంపల్లి బాలికల పాఠశాల
1894: అసఫియా స్కూల్
1894: మెడికల్ కాలేజీ
1904: వివేక వర్ధిని పాఠశాల
1910: మహబూబియా బాలికల పాఠశాల, గన్‌ఫౌండ్రి..
1918: ఉస్మానియా యూనివర్సిటీ
1920: సిటీ కాలేజీ భవనం
1923: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (జాగిర్దార్ కాలేజీ)
1924: మార్వాడీ హిందీ విద్యాలయ
1926: హిందీ విద్యాలయ, సికింద్రాబాద్
హైద్రాబాద్ స్టేట్‌లో గ్రంథాలయాల స్థాపన
1872: ముదిగొండ శంకరారాధ్యుల లైబ్రరీ, సికింద్రాబాద్
1892: ఆసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ
1895: భారత్ గుణ వర్ధక్ సంస్థ లైబ్రరీ, శాలిబండ
1896: బొల్లారం లైబ్రరీ
1901: శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రబాషా నిలయం, సుల్తాన్‌బజార్...
1904: రాజ రాజనరేంద్ర ఆంధ్రభాషా నిలయం, హన్మకొండ
1905: విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి, హైద్రాబాద్
1913: ప్రతాపరుద్ర ఆంధ్రభాషా నిలయం, మదికొండ, వరంగల్ జిల్లా
1913: సంస్కక్షుత కళావర్ధినీ గ్రంథాలయం, సికింద్రాబాద్
1923: బాల సరస్వతీ గ్రంథాలయం, హైద్రాబాద్
1930: జోగిపేట గ్రంథాలయం, మెదక్ జిల్లా

దవాఖానాల నిర్మాణం
1890: ఆయుర్వేదం, యునానీ వైద్యశాలల ఏర్పాటు....
1894: మెడికల్ కాలేజీ
1897: మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ
1905: జిజ్గిఖానా (విక్టోరియా మెమోరియల్ ప్రసూతి దవాఖాన)
1916: హోమియోపతి కాలేజీ
1927: చార్మినార్ యునానీ, ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నిర్మాణం
1945: నీలోఫర్ చిన్నపిల్లల దవాఖాన
1925: ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గాంధీ దవాఖాన, సికింద్రాబాద్, టి.బి. దవాఖాన, ఎర్రగడ్డ కాన్సర్ దవాఖాన, ఇ.ఎన్.టి. దవాఖాన, నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్, కోరంటి దవాఖాన.

హైదరాబాద్ స్టేట్‌లో ప్రభుత్వ శాఖల స్థాపన
1875: సర్వే, సెటిల్‌మెంట్ శాఖ
1876: లాండ్ సెటిల్‌మెంట్ శాఖ
1881: జనాభా లెక్కల సేకరణ
1882: ఎకై్సజ్ లెక్కల సేకరణ
1883: పోలీస్ శాఖ
1892: గనుల శాఖ
1892: పరిశ్రమలు, వాణిజ్యం శాఖలు
1893: లోకల్ ఫండ్ శాఖ
1896: నీటి పారుదల శాఖ
1911: స్టేట్ లైఫ్ ఇన్యూరెన్స్ ఫండ్
1912: సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు
1913: వ్యవసాయ శాఖ
1913: హైదరాబాద్ సివిల్ సర్వీసు
1914: ఆర్కియాలజీ శాఖ
1932: ఆకాశవాణి, హైద్రాబాద్
1945: కార్మిక శాఖ
1864: రెవెన్యూ శాఖ
1866: కస్టమ్స్ శాఖ (కరోడ్‌గిరి) 
1866: జిల్లాల నిర్మాణం
1866: వైద్యశాఖ
1866: మొదటి రైల్వేలైను ముంబై - రాయచూర్
1867: ప్రింటింగ్, స్టేషనరీ
1867: ఎండోమెంట్ శాఖ
1867: అటవీ శాఖ (జంగ్లాత్)
1869: మున్సిపల్ శాఖ
1869: పబ్లిక్ వర్స్ డిపార్ట్‌మెంట్
1870: విద్యాశాఖ
1870: హైకోర్టు ఏర్పాటు

Saturday 24 August 2013

నాలుకలా.. తాటిమట్టలా!



- ఊసరవెల్లులను మరిపిస్తున్న పార్టీలు
- తెలంగాణ రాకముందు ఒక తీరు
- సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత మరోతీరు
- దశాబ్దాల ఆకాంక్షపై స్వార్థంతో నిప్పులు
- మండిపడుతున్న తెలంగాణవాదులు

హైదరాబాద్ (టీ మీడియా): రాష్ట్రంలోని రాజకీయ పార్టీల తీరు చూస్తే.. ఊసరవెల్లుల స్థాయిని నేతలు ఎప్పుడో దాటేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని మరింపించేలా రంగులు మార్చుతున్న రాజకీయ నాయకులు.. 
                తెలంగాణ విషయంలో తమవి నాలుకలు కావని.. తాటిమట్టలని చెప్పకనే చెబుతున్నారన్న విమర్శలు వెల్లు ఇప్పటికే సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు, టీడీపీ, వైఎస్సార్సీపీలు గతంలో చెప్పిన మాటలను మార్చి.. తెలంగాణ వ్యతిరేకతను చాటుకుంటున్న తరుణంలో బీజేపీ తాను సైతం తక్కువ కాదని నిరూపించుకుంటోందని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఈ పార్టీలన్నీ తెలంగాణకు గతంలో మద్దతు పలికినవే. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు సైతం అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. టీడీపీ తాను ఎప్పుడో ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చేశానని ప్రకటించుకుంది.

ఇచ్చే శక్తి.. ఆపే శక్తి లేదంటూనే.. తెలంగాణ ప్రజల మనోభీష్ఠాన్ని గౌరవిస్తామని వైఎస్సార్సీపీ ప్రగల్భాలు పలికింది! బీజేపీ అయితే.. మీరు ఇస్తే ఇవ్వండి.. లేదంటే మేం వచ్చాక ఇవ్వడం ఖాయం అంటూ ఊదరగొట్టింది! కానీ.. రెండు పదుల రోజులు గడిచేలోపే వారి అసలు స్వరూపాలు విస్పష్టంగా బయటపడిపోయాయని తెలంగాణవాదులు అంటున్నారు. ఈ నాలుగు పార్టీల నాయకులు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఏం చెప్పారు? తెలంగాణ ఉద్యమం విజయం సాధించాక మాట ఎలా మార్చారు? గమనిస్తే ఎంతటి రాజకీయ పండితులకైనా దిమ్మతిరగక తప్పదు. ఒక పార్టీ.. ప్రజల ఓట్లు.. అభిమానాలు సంపాదించుకోవాల్సిన రాజకీయ సంస్థ.. ఒక ప్రాంత ప్రజాభీష్ఠంపై ఇంతలా మాట ఎలా మార్చేస్తారన్న సందేహం.. తలను వేయి వక్కలు చేయక తప్పదు! కానీ.. అందరికీ వారి వారి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకే తెలంగాణ విషయంలో అన్ని పార్టీలూ యూటర్న్ తీసుకున్నాయని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. 

సీమాంధ్ర నేతల ధిక్కార స్వరాలు
సీమాంధ్ర నాయకులు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారు. ఢిల్లీకి వెళ్లి మరీ అధిష్ఠానాన్ని ఒత్తిడి చేశారు. అదే సమయంలో పార్టీ అధ్యక్షురాలిదే తుది నిర్ణయమని, దానికి కట్టుబడి ఉంటామంటూ గొప్ప క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా ఫోజులు కొట్టారు! నిర్ణయం తీసుకునే ముందు కూడా పార్టీ పెద్దలు చెప్పినదాన్ని పాటిస్తామన్నారు. తీరా స్వయంగా అధినేత్రి తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకునేసరికి.. వారికి గొంతులో వెలక్కాయపడింది. స్వరం మారిపోయింది! రాజీనామాలు వరుసబెట్టాయి.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి రాష్ట్రం విభజించవద్దన్న స్వరంలోనే మాట్లాడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. పైగా సీమాంధ్రలో జరుగుతున్న కృత్రిమ సమైక్య ఉద్యమానికి ప్రభుత్వ తరఫున పరోక్ష సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చింది మొదట కాంగ్రెస్ నేతలు. 1999లో సీఎల్పీ నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ 42 మంది తెలంగాణ ఎమ్మెల్యేల చేత ఆనాడు హైదరాబాద్‌లో జరిగిన ఎన్‌ఎస్‌యూఐ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన సోనియాగాంధీకి రిప్రజెంటేషన్ ఇప్పించారు. అప్పటి నుంచి తాము తెలంగాణకు అనుకూలమనే వాదననే ఆ పార్టీ నేతలు వినిపిస్తూ వచ్చారు. డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తర్వాత మాట మార్చేశారు. వచ్చిన తెలంగాణను అడ్డుకున్నారు. అందుకు తగిన ప్రతిఫలాన్ని తెలంగాణ ప్రాంత ఉప ఎన్నికల్లో అనుభవించిన తర్వాత అసలు సంగతి అధిష్ఠానానికి అర్థమైంది.

పార్టీని బతికించుకోవడానికి సమాయత్తమై.. జూలై 30న తెలంగాణకు అనుకూల ప్రకటన చేసింది. దానికి ముందే సీఎం, పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం పార్టీ కోర్‌కమిటీకి రోడ్‌మ్యాప్‌లు సమర్పించారు. అప్పుడు కూడా సీమాంధ్ర నేతలైన కిరణ్, బొత్స తెలంగాణకు వ్యతిరేకంగా వాదించారు. ఒక్క తెలంగాణ నేత, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మాత్రం తెలంగాణ ఇవ్వాల్సిన అవసరాన్ని విస్పష్టంగా చెప్పారు. తాము వ్యతిరేకంగా ఉన్నా.. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని కిరణ్, బొత్స బహిరంగంగా ప్రకటించారు. కానీ.. నిర్ణయం వెలువడిన దగ్గర నుంచి ధిక్కార స్వరాన్నే కిరణ్, బిత్స వినిపిస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. సీమాంధ్రలో సమైక్య వాదం పేరిట జరుగుతున్న ఉద్యమాలకు వీరే ఆజ్యం పోస్తున్నారనే విమర్శలు సైతం ఎదుర్కొంటున్నారు. 

మాట మార్చుడే టీడీపీ వైఖరి!
టీడీపీ అధినేత చంద్రబాబు ఒకసారి తెలంగాణకు ‘సై’ అన్నారు. డిసెంబర్ 9 ప్రకటన రాగానే ‘నై’ అన్నారు. మళ్లీ ఎన్నికల అవసరాలు గుర్తొచ్చేసరికి తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. జూలై 30న సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడగానే ఆయన సైతం కంగుతిన్నారు. ఇక్కడే టీడీపీలో వింతనాటకానికి తెర లేచింది. అధినేత తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతారు.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ను చీల్చే హక్కు కాంగ్రెస్‌కు ఎవరిచ్చారని అదే పార్టీ నేతలు సీమాంధ్ర ఆందోళనల్లో గొంతు చించుకుంటారు! సీమాంవూధలో ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆందోళనలు.. నిరాహార దీక్షలు, పార్లమెంటులో రగడ.. అన్నీ చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది. 

చంద్రబాబు కూడా తెలుగుజాతికి ఆత్మగౌరం పోయిందని, టీడీపీని దెబ్బతీయడానికే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకున్నదని విమర్శిస్తున్నారు. టీడీపీ టీ ఫోరం నేతల నుంచి తీవ్ర ప్రతిఘటనతో చంద్రబాబు తన ఆత్మగౌరవ యాత్ర నుంచి వెనక్కుతగ్గారేకానీ.. రెండు రోజులు గడిస్తే.. ఆయన అసలు స్వరూపం నిలు దర్శనమిచ్చేదని అంటున్నారు. టీడీపీ తెలంగాణ విషయంలో అనుసరిస్తూ వచ్చిన వైఖరి గమనిస్తే.. దాని భవిష్యత్ వ్యూహం అర్థమవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా టీడీపీ పొలిట్‌బ్యూరో 2008 అక్టోబర్ 9న నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని కేంద్రానికి తెలియజేస్తూ 2008 అక్టోబర్ 18న ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి చంద్రబాబు లేఖ రాశారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న టీఆర్‌ఎస్‌తో 2009 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. అనేక కారణాలు చంద్రబాబును ప్రతిపక్షంలోనే కూర్చుండబెట్టాయి.

కేసీఆర్ దీక్షతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు 2009 డిసెంబర్ 9న ప్రకటించింది. దీనికి ముందు నాటి సీఎం రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ నేతలు తెలంగాణకు మద్దతు పలికారు. దానికి ముందు అసెంబ్లీలో కూడా సానుకూలత వ్యక్తం చేసిన చంద్రబాబు.. తెలంగాణపై తీర్మానం మీరు ప్రవేశ పెడతారా? లేక నన్నే ప్రవేశ పెట్టమంటారా? అని తెలంగాణపై ప్రేమ ఒకలబోశారని తెలంగాణవాదులు గుర్తు చేస్తున్నారు. కానీ.. డిసెంబర్ 9 ప్రకటన మరుసటి రోజే ఆ పార్టీ యూటర్న్ తీసుకుంది. వచ్చిన తెలంగాణను కాంగ్రెస్‌తో కలిసి ఆడిన రాజీనామా డ్రామాతో అడ్డుకుంది. 2009 డిసెంబర్10న అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తెలంగాణ ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. తెలంగాణ ప్రకటనను వెనక్కు తీసుకునే వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌నుంచే కృత్రిమంగా సమైక్య ఉద్యమాన్ని చేయించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో పార్టీ దారుణ స్థితికి చేరుకుంటున్న పరిస్థితుల్లో.. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదనే నినాదాన్ని ఎత్తుకున్నారు. 

ప్రధానికి 2012 సెప్టెంబర్ 26న ఒక లేఖ రాస్తూ.. తెలంగాణ సమస్యను పరిష్కరించాలని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తమ అభివూపాయం చెపుతామని పేర్కొన్నారు. ఆ మేరకు 2012 డిసెంబర్ 28న కేంద్ర హోమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తరపున పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి, యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. గతంలో తాము రెండు లేఖలు ఇచ్చామని, వాటిని అమలు చేయాలని కోరుతూ మూడో లేఖ అందజేశారు. అనంతర పరిణామాల్లో చివరకు జూలై 30న తెలంగాణ ఇవ్వాలని సీడబ్ల్యూసీ, యుపీఏ భాగస్వామ్య పక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో టీడీపీ సీమాంధ్ర నాయకులు మరోసారి సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్నారు. హరికృష్ణ ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆమోదించుకున్నారు. చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రకు సిద్ధపడ్డారు. ఇవన్నీ గమనిస్తే మొత్తంగా టీడీపీ వ్యవహారం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగానే ఉందని తెలంగాణవాదులు తేల్చి చెబుతున్నారు. 

తెలంగాణను వదిలేసుకున్న వైఎస్సార్సీపీ
తెలంగాణ విషయంలో ఎలాంటి శషభిషలు లేకుండా తొట్టతొలి వ్యతిరేకతను చాటుకుంది వైఎస్సార్సీపీ. తనకు తెలంగాణలో పార్టీ అవసరం లేదని నిర్భయంగా ప్రకటించేసింది. నిర్ణయం రాకముందే పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దాన్ని తెలంగాణలోని పార్టీ నేతలు వ్యతిరేకిస్తే.. సీమాంధ్ర ప్రయోజనాలకే రాజీనామా చేశారు తప్పించి తెలంగాణ వ్యతిరేకతతో కాదని నమ్మబలికే యత్నాలు చేశారు. ఆ తర్వాత ఆ ముసుగూ తొలగించేసి.. తెలంగాణ ఇస్తే సీమాంధ్ర ఏడారేనంటూ ఏకవాక్య సిద్ధాంతం పట్టుకుని తెలంగాణకు వ్యతిరేకంగా సమరదీక్షలు చేస్తున్నారు. మధ్యలో తెలంగాణవాదం ఎత్తుకున్నా.. మొదటి నుంచి వైఎస్.. ఆయన పేరుతో పార్టీ పెట్టుకున్న కొడుకు జగన్ తెలంగాణ వ్యతిరేకులేనని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. 

హైదరాబాద్ పోవాలంటే వీసా కావాలని వైఎస్ అంటే.. జగన్ పార్లమెంటులో సమైక్య ప్లకార్డు పట్టుకుని తన బాట ఏంటో ఆనాడే చెప్పారని మండిపడుతున్నారు. తన తండ్రి మరణానంతరం సొంత పార్టీ పెట్టుకున్న జగన్.. 2011 జూలై 9న ఇడుపుల పాయలో జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణపై కేంద్ర నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించబోమని ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ చెప్పారు. 2012 డిసెంబర్ 28న జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. తీరా తెలంగాణపై జూలై 30న కాంగ్రెస్ నిర్ణయం తీసుకోగానే యూటర్న్ తీసుకున్నారని, పచ్చి తెలంగాణ వ్యతిరేకతను చాటుకుంటున్నారని ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మారుతున్న బీజేపీ స్వరం
తెలంగాణకు తమ అంతటి గొప్ప మద్దతుదారుల్లేరని అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ బీజేపీ నేతలు ప్రగల్భాలు పలికారు. ఈ క్షణాన బిల్లు పెట్టినా.. ఆమోదింప చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ఇవ్వకుంటే ఎన్డీయే రాగానే తెలంగాణ గ్యారెంటీ అన్నారు. కానీ.. వారికి కూడా రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా కనిపిస్తున్నాయని పలువురు తెలంగాణ ఉద్యమనేతలు చెబుతున్నారు. తెలంగాణపై బీజేపీ స్వరం మారుతున్నదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. సమైక్యాంధ్ర డిమాండ్‌తో సభను అడ్డుకుంటున్న సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ వ్యవహారం సందర్భంగా బీజేపీ అనుసరించిన తీరు ఈ అనుమానాలకు ఆస్కారం కలిగిస్తోందని పేర్కొంటున్నారు. గతంలో టీ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం లోక్‌సభలో పట్టుపట్టారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. చరివూతలో ఎన్నడూ లేని రీతిలో సొంత పార్టీ ఎంపీలనే కాంగ్రెస్ పెద్దలు సస్పెండ్ చేయించారు. ఆ సమయంలో ఒక్క మాట కూడా మాట్లాడని బీజేపీ నేతలు.. వారి సస్పెన్షన్‌ను సమర్థించారు.

అదే బీజేపీ నేతలు.. ఇప్పుడు సీమాంధ్ర ఎంపీలు సభను అడ్డుకున్నందుకు స్పీకర్ సస్పెండ్ చేస్తానంటే మాత్రం ఒంటికాలిపై లేచి.. సభ వాయిదాకు కారకులయ్యారు. తెలంగాణపై సీడబ్లూసీ నిర్ణయాన్ని తప్పుపట్టే రీతిలో కూడా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతుండటం విశేషం. ఈ నెల 12న రాజ్యసభలో జరిగిన తెలంగాణపై చర్చలో పాల్గొన్న ఆ పార్టీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు.. కాంగ్రెస్ నిర్ణయంతో రాష్ట్రం తగులబడుతోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణపై నిర్ణయం తీసుకున్నదని విమర్శించారు. సీఎం, పీసీసీ చీఫ్, సీమాంధ్రకు చెందిన తొమ్మిది మంది మంత్రులతో చర్చించకుండా రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని ఎలా చీలుస్తారంటూ రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారు. కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ తీర్మానం చేసిన బీజేపీ.. ఆనాడు టీడీపీతో పొత్తు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా అటకెక్కించిందని, ఇప్పుడు తెలంగాణపై కసరత్తును వేగవంతం చేయాలని డిమాండ్ చేయాల్సిన బీజేపీ దీనికి విరుద్ధంగా సీమాంధ్ర ఎంపీలను పార్లమెంటులో సస్పెండ్ చేయాలని చూస్తే దానిని అడ్డుకోవడం సందేహాలకు దారి తీస్తున్నదని తెలంగాణవాదులు అంటున్నారు.

Friday 23 August 2013

ఆయన దారి అడ్డదారి



- దొంగపత్రాలతో హైదరాబాద్‌లో పోస్టింగ్
- అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే అధ్యక్షుడి అవతారం
- అక్రమ బదిలీ నిర్దారించిన విజిలెన్స్
- ఎన్నికలే జరగని ఏపీఎన్జీఓ సంఘానికి గుర్తింపు లేని అధ్యక్షుడు
- హౌజింగ్ సొసైటీలో సభ్యత్వమూ అక్రమమే
        నాయకుడు నలుగురికి దారిచూపే వాడై ఉండాలి, అందులోనూ బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగులకు నాయకత్వం వహించేవాడే ఆక్రమణదారుడైతే ఉద్యమం దారితప్పుతుందని చరిత్ర ఎన్నోసార్లు రుజువు చేసింది. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌కుమార్ వ్యవహా రం కూడా అచ్చం ఇలాగే ఉంది. అశోక్‌బాబు ఉద్యోగ వ్యవహారం అనైతికమని, ఆయన సృష్టించిన దొంగ విద్యార్హత పత్రాలతో పొందిన బదిలీ అక్రమమనీ...
       హైదరాబాద్‌కు ఆయన బదిలీ నిబంధనలకు విరుద్దమనేందుకు కొన్ని పత్రాలు ‘టీ మీడియా’ చేతికి అందాయి. అశోక్‌బాబుతోపాటు ఏపీఎన్జీవో హైదరాబాద్ అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ కూడా ఇలాగా ఉద్యోగం సంపాదించాడనే ఆరోపణలున్నాయి. ప్రస్తుత ఎపీఎన్జీవో అధ్యక్షుడి హోదాలో ఉన్నట్లుగా చెలామణి అవుతున్న పరుచూరి అశోక్‌కుమార్ కృష్ణా జిల్లా విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖ డిప్యుటీ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించేవారు. తదుపరి పోస్టింగ్ అయిన అసిస్టెంట్ కమిర్షియల్ టాక్స్ అధికారి(ఏసీటీఓ) హోదా కోసం తప్పుడు విధానాన్ని అనుసరించి హైదరాబాద్‌కు వచ్చినట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. వాస్తవానికి ఏసీటీవో హోదా కోసం ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత లేదా శాఖాపరంగా బుక్ కీపింగ్ అర్హత కలిగి ఉండాలి. కానీ ఈ రెండింటిలో అశోక్‌బాబుకు ఏ ఒక్క అర్హత లేకపోవడం గమనార్హం. ఇక ఆయన బదిలీకి ఎంచుకున్న వక్రమార్గంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో పర్చూరి అశోక్‌బాబు దొంగ సర్టిఫికెట్లు సమర్పించినట్లుగా...సర్వీస్ రికార్డులో మార్పులు చేర్పులు చేసినట్లుగా స్పష్టంగా రుజువైంది. విజిపూన్స్ విచారణలో ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని...ఆయన అక్రమాలు ఒకటి రెండూ కావని విజిపూన్స్ విచారణ నివేదికను ప్రభుత్వానికి అందించింది. 

వీటిపై విచారణ చేసిన రెవెన్యూ విజిలెన్స్ శాఖ తేదీ 30, జనవరి 2013న ప్రభుత్వానికి నివేదిక(మెమో నెం.1716/విజిపూన్స్-1(2)2013-1లో అందజేసింది. అశోక్‌బాబుపై వచ్చిన ఆరోపనలన్నీ వాస్తవాలేనని...ఆయన అక్రమాలకు పాల్పడి ప్రభుత్వాన్ని మోసం చేశారని ఈ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయం ఆయనపై వచ్చిన ఆరోపణలు వాస్తవం అని తేలుస్తూ మొమోను జారీ చేసింది. ఇందులో సర్వీసు రిజిస్టర్‌లో పేజి నెంబర్ 6లో ఇంటర్మడియట్ చిదివినట్లు ఉందని వాణిజ్య పన్నుల శాఖ తేల్చింది. అయితే ఆయన ఇందుకు భిన్నంగా డిగ్రీ చదివినట్లగా ఎలా డిక్లరేషన్ ఇచ్చారని ప్రశ్నించింది. ఇందుకు 15 రోజుల్లో సమాధానం చెప్పాలని మెమోలోపేర్కొంది. అయితే ఆయన డిగ్రీ చదివినట్లు తప్పుడు దృవీకరణ ఇచ్చి 2008 ఫిబ్రవరి 11 న ప్రభుత్వం నిర్వహించిన సాంకేతిక పరీక్ష ఎందుకు రాశారని, డిగ్రీ చదివిన వారికి ఈ పరీక్ష అవసరం లేదని కమిషన్ చురుకలు వేసింది. ఈయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయినా ప్రభుత్వం ఎందుకో మిన్నకుండి పోతోంది. ఇక్కడ ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే ఏపీఎన్జీఓ హౌజింగ్ సొసైటీలో సభ్యత్వానికి వాస్తవానికి అశోక్‌బాబు అనర్హుడు. 

2012 ఆగష్టులో టెన్యూర్ విధానంద్వారా హైదరాబాద్‌కు బదిలీపై వచ్చిన ఆయన 22 జనవరి 2010న ఏపీఎన్జీఓ హౌజింగ్ సొసైటీలో సభ్యత్వం పొందినట్లుగా రికార్డులు సృష్టించడం విమర్శలకు తావిస్తోంది. ఇది ఎలా సాధ్యమని సొంత ఉద్యోగ సంఘాల నేతలే ఆరోపణలు చేసున్నా ఆయన నోరుమెదపడం లేదు. దీనిపై కోర్టులో కేసు విచారణలో ఉంది. వాస్తవానికి నిబంధనల ప్రకారమయితే ఇందులో సభ్యత్వానికి సొసైటీ ఏర్పాటయ్యేనాటికి హైదరాబాద్‌లో 5ఏళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. కానీ ఇవేవీ ఆయనకు వర్తించలేదు. తెలంగాణ విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యంగా కలిసుందామని ఉద్యమిస్తున్న అశోక్‌బాబు తెలంగాణ పోస్టును కొల్లగొట్టి...అక్రమంగా ఉద్యోగాన్ని అనుభవిస్తున్నాడు. విజిపూన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగంలో 22 పోస్టులు ఉండగా విజయవాడ డివిజన్లో ఈయన విధులు నిర్వహించాల్సి ఉండగా ఈ కోటాలో కాకుండా తెలంగాణ కోటాలో ఆయన నియామకం కావడం విశేషం. ప్రస్థుతం ఈయన సికింవూదాబాద్ డివిజన్లో పనిచేస్తున్నారు. 

డిగ్రీ చదవకున్నా చదివినట్లు దొంగ సర్టిఫికేట్...
ఏపీఎన్జీఓ అప్రకటిత అధ్యక్షునిగా కొనసాగుతూ... అసలు ఎన్నికలే జరగని సంఘానికి అధ్యక్షునిగా చెప్పుకుంటున్న అశోక్‌బాబు ప్రభుత్వాన్ని మోసం చేసిన ఆరోపణలును ఎదుర్కొంటున్నారు. అనుభవం ప్రాతిపధికగా జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులకు శాఖాధిపతుల కార్యాలయాలకు డెప్యు పంపేందుకు 12.5 శాతం కోటాను ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇందుకు ఆయా ఉద్యోగులకు గ్రాడ్యుయేషన్(డిగ్రీ) తప్పనిసరి. ఇదే అంశంలో అర్హతలతో కూడిన విద్యార్హతల జాబితాలతో కూడిన అభ్యర్ధుల వివరాలను తమకు పంపాలని అన్ని శాఖల కమిషనర్లకు 1995 నవంబర్ 10న ప్రభుత్వం ఆదేశించింది. 

సరిగ్గా ఇదే అంశాన్ని వాడుకొని హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ కావాలని పథకం పన్నిన అశోక్‌బాబు తనకు లేని అర్హతలను సృష్టించుకున్నారు. డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానంలో 1991లోవిజయవాడలోని ఎన్‌ఐఐటీ నుంచి డిప్లొమా ఇన్ సిస్టం మేనేజ్‌మెంట్ కోర్సును పూర్తి చేసినట్లుగా ప్రభుత్వానికి తప్పుడు డిక్లరేషన్‌ను సమర్పించాడు..అయితే సర్వీస్ రికార్డుల్లో మాత్రం ఆయన ఇంటర్‌మీడియెట్ మాత్రమే చదివినట్లుగా ఉండటంతో అనుమానం వచ్చిన అధికారులు దీనికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు, సర్వీస్ రిజిస్టర్‌ను పంపాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టెలిక్షిగాంద్వారా ఆదేశించారు. దీంతో బెంబేపూత్తిన అశోక్‌బాబు తన గుట్టు బయటపడుతోందని...ఇక దొరికిపోవడం ఖాయమని భావించి యూ-టర్న్ తీసుకుని..‘నాకున్న కుటుంభపరమైన కారణాలవల్ల నేను హైదరాబాద్(హెచ్‌ఓడీ)లో పనిచేసేందుకు సుముఖంగా లేను...నా ధరఖాస్తును ఉపసంహరించుకుంటున్నాను’ అని ప్రభుత్వానికి పంపిన అభ్యర్ధనలో పేర్కొన్నారు. ఇక అక్కడే ఆయన మరో మోసానికి తెగబడ్డారు. 

ఆయన చేసిన మోసాన్ని ఆయనే బట్టబయలు చేసుకుని సాంకేతికంగా మరోసారి దొరికిపోయారు. వాస్తవానికి ఇన్‌సర్వీస్ కేడర్‌లో వాణిజ్య పన్నుల సహాయ కార్యదర్శిగా నియామకానికి ప్రభుత్వం నియమించే ఇన్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి...అయితే ఇందుకు డిగ్రీ చదవని వారు మాత్రమే పరీక్ష రాయాలి...డిగ్రీ చదివినవారు దీనిని రాయాల్సిన అవసరం లేదు. అయితే గమ్మత్తుగా డిగ్రీ ఉత్తీర్ణత అయ్యానని చెప్పుకున్న అశోక్‌బాబు ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణుడు కావడంతో ఆయన మోసాన్ని ఆయనే దృవీకరించుకున్నారు. గతంలో ఒక ఉద్యోగి ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది.‘ప్రత్యక్షంగా లబ్ది పొందకపోయినా సరే తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ప్రభుత్వాలను మోసం చేయాలని చూస్తే సదరు ఉద్యోగి ఆ ఉద్యోగంలో కొనసాగేందుకు అనర్హుడ’ని పేర్కొంది. 1996లో తప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన అశోక్‌బాబును ప్రభుత్వం ఉపేక్షించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఎన్నికలే జరగలేదు...అధ్యక్షుడెలా అయ్యాడో....
రాష్ట్రంలో 100కుపైగా గుర్తింపు ఉద్యోగ సంఘాల్లో ఒకటిగా ఉన్న ఏపీఎన్జీకు 31మే 2013 వరకు గోపాల్‌డ్డి అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే అదే తేదీన ఆయన పదవీవిరమణ చెందడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ఏలూరు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు భోగరాజు ఎన్నికల అధికారిగా మే 26న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఎన్నికలను సవాలు చేస్తూ కొందరు ఉద్యోగులు 2013 జూన్ 20న సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఇంటెరియం ఇంజక్షన్ ఉత్తర్వులను జారీ చేస్తూ అదేతేదీన అదనపు చీఫ్ జడ్జి ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అసలు ఎన్నికలే జరగని సంఘానికి అశోక్‌బాబు ఎలా అధ్యక్షుడయ్యాడో ఆయనే చెప్పాలి. 

హౌజింగ్ సొసైటీలో క్రిమినల్ చర్యలకు సిఫార్సు....
ఏపీఎన్జీఓలకు రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో కేటాయించిన 190 ఎకరాల్లో అక్రమాలు జరిగాయని, రూ. 13కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని కొందరు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన సాధారణ పరిపాలనా శాఖ(విజిపూన్స-ఎన్‌ఫోర్స్‌మెంట్)శాఖ అక్రమాలు నిజమే అని నిర్దారించింది. వీరు ఉద్దేశపూర్వకంగానే అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటూ వారిపై వాఖా పరమైన చర్యలతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. ఇందుకు హైదరాబాద్ నగర అధ్యక్షుడు పివివి సత్యనారాయణను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చుతూ సీసీఎస్ కేసు నమోదు చేసింది. ఇందుకు 2013 జూన్ 6న కేసు నెంబర్ 81ను నమోదు చేసింది. ఇందులో సెక్షన్ 406, 409, 420, 182 రెడ్‌విత్ 120 సెక్షన్‌లను నమోదు చేసింది. 

610, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి నియామకమైన పీవీవీ సత్యనారాయణ...
ఇరిగేషన్ శాఖలో టెక్నికల్ ఆపీసర్గా పనిచేస్తున్న ఏపీఎన్జీఓ హైదరాబాద్ అధ్యక్షుడి ఉద్యోగ నియామకంపై కూడా అనేక అనుమానాలున్నాయి. ఈయన స్వస్థలం తూర్పు గోదావరి కాగా విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. అయితే నిబంధనలు ఉల్లంఘించి ఈయన ఖమ్మం జిల్లాలో (జోన్-5) క్లాస్-4 క్యాడర్లో జూనియర్ టెక్నికల్ అధికారిగా ఉద్యోగం పొందారని ఆరోపణలున్నాయి. అయితే ఈయన ధవలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో విధులు నిర్వహించారు. 20శాతం ఉండే ఓపెన్ ఫర్ ఆల్ కేటగిరీలో నాన్ లోకల్‌లో ఉద్యోగం పొందినా ఆయన జోన్ -6లో పనిచేసేందుకు అర్హుడు కాదని నిబంధనలున్నాయి. 

అయితే ఇవేవీ వర్తించని రీతిలో ఆయన హైదరాబాద్ చీఫ ఇంజనీర్ కార్యాలయంలో మే 15, 1990న బదిలీపై వచ్చి చేరారు. అనంతరం ఈయన టెక్నికల్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందడం తెలంగాణ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నాన్ లోకల్ క్యాడర్లో జోన్-6కు బదిలీపై రావడం అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా5(1)కి వ్యతిరేకమని నిబంధనలు సూచిస్తున్నాయి. దీంతో యన నియామకంపై పలువురు ఫిర్యాదు చేయడంతో ఐ అండ్ సీఏడి శాఖ విచారణకు స్వీకరించింది. ఇందులో ఆయన సర్వీస్ రికార్డు గల్లంతయిందని...ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవమేనని తేల్చింది. ఈ అవకతవకలపై రాయకోటి కమిషన్‌ను ఆశ్రయించిన కొందరు ఉద్యోగులకు కమిషన్ హామీ ఇచ్చింది కానీ ఈ నివేదిక ప్రభుత్వానికి చేరకపోవడంతో ఆయన తెలంగాణ ప్రాంతంలోనే కొనసాగుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. 

అక్రమార్కులే నాయకత్వంలో ఉంటే న్యాయం జరగడం అసాధ్యం
అవినీతి పరులు, అర్హత లేని వ్యక్తులు ఉద్యోగ సంఘాల్లో నాయకత్వం వహించి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేతల నాయకత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగకపోగా మరింత అన్యాయం జరుగుతందని గుర్తించాలి. ఇప్పటికైనా ఏపీఎన్జీఓలో పనిచేస్తున్న ఉద్యోగులు వాస్తవాలను గుర్తించి వీరిపై తిరగబడాలి. ఉద్యమం ముసుగులో తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న వీరి దమననీతిని గుర్తించి పక్కకు తప్పిస్తే మంచిది. లేకపోతే సోదరుల్లా కలిసిమెలిసి పనిచేస్తున్న తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య విద్వేషాలు రేగడం ఖాయం. ఇప్పటికే తెలంగాణ విభజనకు ఉద్యోగుల్లో మానసిక విభజన జరిగిపోయింది...ఇక భౌగోళిక విభజనే జరగాల్సి ఉందనే వాస్తవాన్ని నేతలు గ్రహించి సహకరించాలి. అక్రమాలకు అడ్డాగా మారిన ఏపీఎన్జీఓ సంఘం గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అశోక్‌బాబును సర్వీసులనుంచి భర్తరఫ్ చేసి ఆయన అక్రమాలపై ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ జరిపించాలి
- గంజి వెంక టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు

Tuesday 20 August 2013

సమైక్యమా సిగ్గుపడు


* తెలంగాణవారికి వైద్యం చేసేది లేదంటూ దౌర్జన్యం
* విజయవాడలో భూమికొన్నాడని తరిమేశారు.. భంగపడ్డ వరంగల్
     వాసి 
* గుంటూరులో ఖమ్మం ఏఎన్‌ఎంలకు ఇబ్బందులు
* శ్రీశైలం వెళ్తున్న బస్సును అడ్డుకుని బీభత్సం

 మొన్న గుంటూరులో తెలంగాణ అధికారి హన్మంతునాయక్‌కు ఎదురైన పరాభవం మర్చిపోకముందే.. విశాఖపట్నంలో నిజామాబాద్‌కు చెందిన నవీన్‌పై పడిన దెబ్బలు సలుపుతుండగానే.. తిరుపతిలో తాజాగా కాంగ్రెస్ నేత వీ హన్మంతరావుపై జరిగిన దాడి కళ్లముందు కదలాడుతుండగానే.. 

ఐక్యత ముసుగు వేసుకున్న విద్వేషకారుల ఉన్మత్త చేష్టలు మరికొన్ని వెలుగు చూశాయి! ‘మీరు తెలంగాణోళ్లా? తెలంగాణ అంటేనే మా రాయలసీమవాళ్లకు పరమ అసహ్యం.. మీరే కాదు.. మీ ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా.. ఇదే పరిస్థితి తప్పదు! చస్తే చావండి.. అంతేకానీ.. ఇక్కడ మీకు వైద్యం చేసే సమస్యేలేదు!’ అంటూ రాయలసీమలోని కర్నూలు ఆస్పత్రిలో ఒక వైద్యురాలు నవమాసాలు నిండి కాన్పుకోసం వచ్చిన మహిళను గెంటేసింది! తెలంగాణేతరులు తెలంగాణ జిల్లాల్లో భూములు కొనుక్కోవచ్చు. కానీ.. ఒక తెలంగాణ పౌరుడు సీమాంధ్రలో స్థలం కొంటే? ఏం జరుగుతుందో ప్రత్యక్ష సాక్షి.. వరంగల్ జిల్లా డోర్నకల్ వాసి నాగేశ్వరరావు. తెలంగాణ నుంచి వచ్చి.. విజయవాడలో భూమి కొన్నందుకు ఆ కుటుంబాన్ని తన్ని తరిమేశారు ‘సమైక్య’వాదులు! తెల్లారేసరికి ఊరొదిలి వెళ్లకపోతే అంతు చూస్తామని బెదిరించడంతో చేసేదిలేక ఆయన తన భార్య, ఇద్దరు పిల్లలను వెంటపెట్టుకుని సొంతూరు చేరుకున్నాడు! శిక్షణ కోసం గుంటూరు వెళ్లిన ఖమ్మం జిల్లా ఏఎన్‌ఎంలను నానా ఇబ్బందులకు గురి చేశారు అక్కడి సీమాంధ్ర సిబ్బంది! ఇక దేవుడి దగ్గరకు వెళ్లాలన్నా వీసా కావాల్సిన పరిస్థితి సృష్టించారు శ్రీశైలం సమీపంలో! ఒక వైపు సమైక్యవాదం అంటూనే..

విద్వేషాగ్నిని చిమ్ముతున్న సీమాంధ్ర ఆందోళనకారుల అసలు స్వరూపాలివి.. వారి చేతిలో అవమానాలకు గురైన తెలంగాణవారి గోసలివి! 

శత్రువుకైనా.. శత్రుదేశ ఉగ్రవాదికైనా మానవత్వంతో చికిత్స చేసే పవిత్రమైన వృత్తిలో ఉన్న ఒక వైద్యాధికారిణి నోటి నుంచి విద్వేషాగ్ని వెలువడింది. తనకు గతంలో రెండు పురుళ్లు ఇక్కడే పోసిన కృతజ్ఞతాభావంతో మళ్లీ అదే ఆస్పవూతిని నమ్ముకుని వచ్చిన నిండు గర్భిణీని చీదరించుకుని పంపేశారు. ఈ ఘటన జరిగింది కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో! ఈ దారుణ వివక్షను ఎదుర్కొన్నది మహబూబ్‌నగర్ జిల్లా అయిజ మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గోవిందమ్మ! నేడో రేపో ప్రసవం అవుతుందన్న పరిస్థితుల్లో అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన ఆమెను అక్కడి మహిళా వైద్యురాలు మెడపట్టి బయటకు గెంటేసిన వైనమిది. తన ఇంటావిడ నిండు గర్భంతో ఉందని, వైద్యం చేయాలని భర్త తిరుమలేష్ మొరపెట్టుకుంటూ కాళ్లావేళ్లా పడినా.. ఆ వైద్యురాలు పట్టించుకోలేదు! నిండు చూలాలు కూడా ప్రాధేయపడినా.. పవిత్ర వృత్తికారిణి మనసు కరుగలేదు. కేవలం అయిజ నుంచి వచ్చామన్న ఒకే ఒక్క సమాధానంతో వారిది తెలంగాణ ప్రాంతమని గుర్తించిన వైద్యురాలు.. తాను ఒక మహిళనేనన్న విషయాన్ని కూడా మర్చిపోయి.. గద్దించి తరిమేసిన వైనంతో ఆ దంపతు బిక్కచచ్చిపోయారు! చేసేదేమీలేక గద్వాల ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులు ఆమెకు అవసరమైన సేవలందిస్తున్నారు.

కాళ్లావేళ్లాపడినా కనికరించలేదు: గర్భిణి గోవిందమ్మ
‘ఇంతకు ముందు అదే ఆస్పత్రిలో నాకు రెండు కాన్పులయ్యాయి. మూడో కాన్పు కూడా అక్కడే చేసుకోవాలనుకున్నాను. అందులో పరిస్థితి కాస్త బేజారుగా ఉంది. అందుకని ఆ ఆస్పత్రినే నమ్ముకున్నా. కానీ అప్పటిలా డాక్టర్లు లేరు. కాన్పు కోసం వెళ్తే.. కనీసం మెట్లు కూడా ఎక్కనివ్వకుండా ఆ ఆడ డాక్టర్ మెడబెట్టి గెంటేసింది. కాళ్లావేళ్లాపడినా.. ‘తెలంగాణ అంటే అసహ్యం. మీకు మేం వైద్యం ఎందుకు అందించాలి?’ అంటూ దారుణంగా మాట్లాడి పంపేసింది. చాలా బాధ కలిగింది. ఇలాంటి పరిస్థితి ఇలాగే సాగితే చాలా కష్టం’.

వాళ్లది సీమ అహంకారం: గర్భిణీ భర్త తిరుమలేష్
‘నా భార్య గోవిందమ్మను కాన్పు కోసం కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యం అందించాల్సిన అక్కడి వైద్యురాలు రాయలసీమ అహంకారంతో చాలా దురుసుగా ప్రవర్తించారు. మీ రాయలసీమకు చెందిన ఎంతో మంది రోగులకు మా తెలంగాణలోని హైదరాబాద్‌లో చికిత్స చేస్తుంటే.. మీరు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని గట్టిగా అడిగితే ఇంకా దురుసుగా మాట్లాడింది. చేసేదేమీ లేక నా భర్యను గద్వాల ఆస్పత్రికి తీసుకొచ్చాను. ఇలాంటి పరిస్థితి రాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి’.

ఖమ్మం ఏఎన్‌ఎంలపై సీమాంద్రుల దాష్టీకం
వాళ్లు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏఎన్‌ఎంలు. ఇన్‌సర్వీసులో భాగంగా 42 రోజులపాటు ఎల్‌హెచ్‌వీ శిక్షణ కోసం గుంటూరు వెళ్లారు! ఆగస్టు 5న వెళ్లినవారు.. వచ్చే నెల 14 వరకూ అక్కడే ఉండాల్సి ఉంది! కానీ.. ఈలోపే ఈ నెల 12 నుంచి ఏపీ ఎన్జీవోలు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం సమ్మె మొదలు పెట్టారు. అప్పటి నుంచి వారికి కష్టాలు మొదలయ్యాయి. ఖమ్మం నుంచి వచ్చారన్న పేరుతో వారిని నానా ఇబ్బందులకు గురి చేయడం మొదలైంది. శిక్షణ ఇచ్చే సిబ్బంది.. ఇతర ఏపీ ఎన్జీవోలు దాష్టీకాలకు పాల్పడ్డారు. ఎప్పుడుపడితే అప్పుడు తమ గదులకు కరెంటు సరఫరా నిలిపివేవారని పలువురు ఏఎన్‌ఎంలు వాపోయారు. నీటి సరఫరా కూడా ఆపేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖమ్మం జిల్లా టీజేఏసీ కన్వీనర్ కూరపాటి రంగరాజు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్రులు అసహనంతో తెలంగాణ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

భూమి కొన్నాడని తరిమేశారు
తెలంగాణేతరులు తెలంగాణ జిల్లాల్లో భూములు కొనుక్కోవచ్చు. కానీ.. ఒక తెలంగాణ పౌరుడు సీమాంవూధలో స్థలం కొంటే? ఏం జరుగుతుందో ప్రత్యక్ష సాక్షి.. వరంగల్ జిల్లా డోర్నకల్ వాసి నాగేశ్వరావు. తెలంగాణ నుంచి వచ్చి.. విజయవాడలో భూమి కొన్నందుకు ఆ కుటుంబాన్ని తన్ని తరిమేశారు ‘సమైక్య’వాదులు. తెల్లారేసరికి ఊరొదిలి వెళ్లకపోతే అంతు చూస్తామని బెదిరించడంతో చేసేది లేక ఆయన తన భార్య, ఇద్దరు పిల్లను కుటుంబాన్ని వెంటపెట్టుకుని సొంతూరు చేరుకున్నాడు. జరిగిన ఘటనపై ఆయనను ఆరా తీస్తే.. సమైక్యాంధ్రుల అరాచకాన్ని ఆయన ఇలా వివరించారు.. ‘నా పేరు లక్కాకుల నాగేశ్వరరావు, మాది డోర్నకల్. పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నేను, నా కుటుంబం విజయవాడకు వెళ్లాం. అక్కడ ఓ రెస్టాంట్‌లో పనిచేసేవాడిని. మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి (సంధ్య) ఎనిమిదో తరగతి చదువుతోంది. అబ్బాయి కృష్ణసాయి ఏడో తరగతి చదువుతున్నారు. కూలీనాలి చేసుకొనైనా చదివిస్తామనుకున్నాం. వాళ్లను మంచిగా చదివించుకుంటున్నం. సంపాదించిన దాంట్లో కొంత పొదుపుచేసుకొని ఇబ్రహీంపట్నం రింగ్‌రోడ్ (గాజులపేట) దగ్గర నేను, మోహన్‌దాస్ అనే మరో వ్యక్తి కలిసి చాలా రోజుల క్రితమే సెంటుంబావు భూమిని కొనుకున్నాం. అక్కడి దాకా బాగానే ఉంది. మొన్నీ మధ్య తెలంగాణ ఇస్తున్నారని తెలిసినప్పటి నుంచి వాడు (మోహన్‌దాస్) నాపై గొడవలకు దిగుడు మొదలుపెట్టిండు.

తెలంగాణ ఇస్తున్నామని చెప్పినప్పటి నుంచి వారి అరాచకం ఎక్కువైంది. చెప్పరాని బూతులు తిడుతూ ‘అరె తెలంగాణోడా నీకు ఇక్కడ భూమి ఎక్కడిదిరా? ఇక్కడి నుంచి తెల్లారేసరికి పోవాల్సిందే. లేదంటే నీ అంతు చూస్తా. నిన్ను చంపిపారేస్త. ఎవడు అడ్డొస్తడో చూస్తా’ అని నానా బూతులు తిట్టాడు. అంతటితో ఆగకుండా ఓ రోజురాత్రి నేను పనిచేసే బార్‌లోకి వచ్చి నాపై పెట్రోల్ పోసి చంపుతానని బెదించాడు. బార్ యజమాని జంపాల సీతారామయ్య ‘బయటికి వెళ్లి తన్నుకోండి’ అంటూ నెట్టేశాడు. బయటికి వచ్చి చెప్పుకునే నాథుడు లేక ఏంచేయాలో తోచక నా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేశాను. అంతకుముందు భూతగాదా ఉందని పోలీసుల్ని ఆశ్రయిస్తే వాళ్లూ పట్టించుకోలేదు. పైపెచ్చు మా కుటుంబం గురించి అన్యాయంగా మాట్లాడారు. పెద్దమనుషుల దగ్గరికి పోతే వాళ్లూ న్యాయం చేయలేదు. వాడు ‘నిన్నూ, నీ పిల్లల్ని ఎన్నటికైనా చంపుతాను’ అని బెదిరించడంతో ఉన్నపళంగా అక్కడి నుంచి డోర్నకల్ వచ్చాను. మా తమ్ముడిపెళ్లుంది. అయిపోయాక ఇక్కడి నుంచి కొంతమందిని తీస్కపోయి న్యాయం కోసం పోరాడుతా’ 

బస్సును తగలబెడతామన్నారు
ఆంధ్రా బస్సులు తెలంగాణలో యథేచ్ఛగా తిరగొచ్చు.. కానీ.. తెలంగాణ బస్సులు ఆంధ్రా ప్రాంతానికి వెళితే? తగలబెడతామంటారు. దిగితే చంపుతామని బెదిరిస్తారు. అందుకు నిదర్శనం.. మెదక్ నుంచి శ్రీశైలం వెళుతున్న బస్సును సమైక్యాంధ్ర ఉద్యమకారులు శ్రీశైలానికి 8 కిలోమీటర్ల ముందు సున్నిపెంట వద్ద ఆపి.. హంగామా సృష్టించిన తీరు! వెనక్కు వెళ్లిపోవాలని ఆందోళనకారులు బెదిరించడంతో భయపడిన బస్సు డ్రైవరు, కండక్టరు..

బెంబేలెత్తిన ప్రయాణికులు బతుకుజీవుడా అంటూ తిరిగొచ్చేశారు. తాము ఎదుర్కొన్న అనుభవాన్ని టీ మీడియాకు ఫోన్‌లో వివరించారు. సున్నిపెంట వద్ద ఆందోళన చేస్తున్న వారు సికింద్రాబాద్ డిపోకు చెందిన ఒక బస్సును ఆపి ఉంచారని, దాంతో తాను తన బస్సును కొంచెం దూరంగా నిలిపానని సంగారెడ్డికి చెందిన బస్సు డ్రైవర్ కిష్టయ్య తెలిపారు. కొత్త బస్సు కావడంతో ఆందోళనకారులు బస్సును ధ్వంసం చేస్తారని భయపడిపోయానని చెప్పారు. ‘నన్ను, కండక్టర్‌ను బయటకు లాగి.. ‘సిగ్గు, శరం లేదా? పెళ్ళాం, పిల్లలు లేరా?’ అంటూ చెప్పడానికి వీలులేని బూతులు తిట్టారు. ఇటువైపు రావద్దని ఎన్నిసార్లు చెప్పినా మీకు భయం లేదురా? అంటు కొట్టే ప్రయత్నం చేశారు. మొదటి సారి వచ్చాం. మమ్మల్ని కొట్టొద్దని కాళ్ళావేళ్ళా పడ్డా వినిపించుకోలేదు. బస్సు లోపల.. బయట కేసీఆర్‌ను తిడుతూ పిచ్చిరాతలు రాశారు. ‘బస్సును తగలబెడతాం. మిమ్మల్ని ఇక్కడే పాతిపెడతాం’ అని బెదిరించడంతో వణికిపోయాం. గంటసేపటికి మమ్మల్ని తిరిగి పంపించేశారు’ అని ఆయన చెప్పారు. తనను, బస్సును తగులబెడతామని బెదిరించారని కండక్టర్ వెంకటేశ్వర్లు చెప్పారు. ‘ఎస్‌ఆర్ బుక్కు లాక్కుని జై సమైక్యంధ్ర అని రాశారు. డ్రైవర్ వద్ద ఉన్న లాగ్‌షీట్ లాక్కుని దానిపైకూడా సమైక్యాంధ్ర అని రాశారు. ఇప్పటికైతే బతికిపోతున్నారు. మళ్ళీవస్తే ప్రాణాలతో వెళ్ళరు’ అంటూ కొట్టేప్రయత్నం చేశారు. ఎంత ఉద్యమం చేసినా ప్రాణాలు తీస్తామంటూ బెదిరించడం ఎంత వరకు న్యాయం? ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి’ అని వెంక అన్నారు. 

ప్రయాణికులని కూడా చూడలేదు
‘బస్సు తగలబెడతామంటూ సమైక్యవాదులు ఆందోళన చేయడంతో మా పిల్లలు భయంతో వణికిపోయారు. నేను కిందకి దిగి పిల్లలు భయపడిపోతున్నారని చెప్పినప్పటికీ నువ్వెవ్వడిరా చెప్పడానికి అంటూ బెదిరించారు’ అని సంగారెడ్డికి చెందిన ప్రయాణికుడు పీఎంఎం రావు చెప్పారు. ‘మీ ఊరేదిరా? ఇక్కడకు ఎందుకు వస్తున్నారురా? అంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టారు. కండక్టర్ల మీదకు వెళుతుంటే అడ్డుకోబోయాం. దానికి ‘వాడిని తన్నండిరా’ అంటూ తిట్టారు. సమైక్యాంధ్రవాదులు చేస్తున్న ఇటువంటి ఆందోళనలను ప్రతి ఒక్కరూ ఖండించాలి’ అని ఆయన అన్నారు. బస్సు ఆపేయడంతో ఆటోలో శ్రీశైలం వెళ్లామని ఈ బస్సులో ప్రయాణించిన వాణిశ్రీ తెలిపారు. తన భర్త కిందికి దిగి.. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా.. ఆయనను కొట్టాలని చూశారని తెలిపారు. తాము తెలంగాణ యాస మాట్లాడుతుండటంతో ప్రైవేటు వాహనాల వాళ్లు కూడా తమను ఎక్కించుకోలేదని, ఇంత దారుణం ఎక్కడా చూడలేదని వాపోయారు.


సీమాంధ్ర ఉద్యమానికి తెలంగాణ కార్మికుల జీతాలు
- వ్యతిరేకించిన కార్మికులు.. బెదిరించిన యాజమాన్యం
బొల్లారం, ఆగస్టు 19 (టీ మీడియా): సీమాంధ్ర ఉద్యమానికి తెలంగాణ కార్మికుల అనుమతి లేకుండానే వారి జీతాన్ని విరాళంగా ఓ ప్రైవేటు కంపెనీ ఇచ్చింది. మా జీతాలు ఎందుకు ఇచ్చారని తెలంగాణ ఉద్యోగులు అడిగితే.. ఈ నెల జీతాలు రావు.. ఏం చేసుకుంటారో చేసుకొండి అంటూ యాజమాన్యం బెదిరింపులకు దిగుతున్నది. శామీర్‌పేట్ మండలం అలియాబాద్ గ్రామంలోని హెచ్‌బీఎల్(హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్) ప్రైవేట్ కంపెనీలో యాజమాన్యం.. ఆది నుంచి తెలంగాణ ఉద్యోగులపై చులకన భావనతోనే వ్యవహరిస్తోంది. తమ కష్టార్జితాన్ని దోచుకోవడమేనా? సమైక్య ఉద్యమస్ఫూర్తి అని ఆ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Monday 19 August 2013

ఇడుపు కాయితాలప్పుడు ఇదేం లొల్లి.. వన్‌సైడ్ లవ్!

* సీమాంధ్ర సమైక్యం ఒక్క చేతి చప్పట్లే..
- నన్నే పెళ్లాడాలంటూ విద్యార్థినిని నరికి చంపిన మనోహర్
- ప్రేమించనందుకు యువతిపై యాసిడ్ పోసిన శ్రీనివాసరావు
- ఏ మాత్రం తీసిపోమంటున్న సమైక్యాంధ్ర నేతలు
- కలిసుండాలంటూ తెలంగాణ ప్రజలపై దాడులు
- మాకు దక్కకపోతే.. ఎవరికీ దక్కరాదు!
- హైదరాబాద్‌పై వితండవాదంతో ఉన్మత్త చేష్టలు
- డబ్బు, ఆస్తుల సంపాదనకే నాయకగణం ప్రాధాన్యం
- వన్‌సైడ్ లవ్ కోసం ప్రజల్ని ఉసిగొల్పే యత్నాలు

ఆంధ్రతో తెలంగాణ విలీనం సందర్భంగా నాటి ప్రధాని నెహ్రూ.. తెలంగాణను అమాయక పడుచుగా.. ఆంధ్రను తుంటరి అబ్బాయిగా అభివర్ణించారు! కాపురం పొసగకపోతే ఇద్దరూ విడిపోవచ్చని ఒక కుటుంబ పెద్దగా ఇడుపుకాగితాల సంప్రదాయాన్ని వివరించారు! 
కాలం గడిచింది! సంసారం సాగలేదు! తొలినాళ్లలోనే ఆ సంగతి అర్థమైంది! రమారమి ఆరు దశాబ్దాల కాలం అలానే నెట్టుకొచ్చింది ఆ అమాయక పడుచు! ఇక భరించలేనంటూ పన్నెండేళ్లుగా గోసపడింది! విడిపోయే సమయం వచ్చింది! 

ఇక్కడే నవీన కాలపు క్రూర ప్రేమ రీతులు జూలు విదిల్చాయి! తననే ప్రేమించాలనిపట్టుపట్టి.. బెదిరించి.. శ్రీలక్ష్మి అనే విద్యార్థినిపై మనోహర్ అనే ఉన్మత్తుడు కత్తితో నరికి చంపినట్లు..!! తనకు దక్కని యువతి.. మరెవరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో స్వప్నిక అనే విద్యార్థినిపై శ్రీనివాసరావు అనే మరో దుర్మార్గుడు యాసిడ్ పోసి ప్రాణం తీసినట్లు!! ఇప్పుడు సీమాంధ్ర నాయకుల తీరు సరిగ్గా అలానే ఉంది! దశాబ్దాలుగా అనేక రంగాల్లో అన్యాయం జరిగింది.. ఇక భరించలేం.. విడిపోతాం మొర్రో.. అని ఒక ప్రాంతం మొత్తుకుంటుంటే.. ‘లేదు లేదు.. మేం ఎంత అన్యాయం చేసినా.. మీరు మాతో కలిసే ఉండాలి.. మీరూ మేమూ ఒకే చోట బతకాలి’.. అంటూ వితండవాదాలు చేస్తున్నది సమైక్యాంధ్ర ఉద్యమం! తమ ఏకపక్ష ప్రేమను అంగీకరించాల్సిందేనని భీష్మించుకుని కూర్చుంటున్నది సీమాంధ్ర పెట్టుబడిదారీ వర్గం! హైదరాబాద్ తమకు దక్కకుండా పోతున్నదన్న దుగ్ధతో.. దాన్ని తెలంగాణకు కూడా కాకుండా చేయాలని తమ వికృత స్వభావాన్ని చాటుకుంటున్నది ‘ఐక్యత’ ముసుగులోని ఆందోళన! రాష్ట్రంలో 23 జిల్లాలు ఉంటే.. పది జిల్లాల ప్రజలను వదిలేసి.. కేవలం పదమూడు జిల్లాలే సమైక్యవాదం వినిపిస్తున్న వైచిత్రి! తెలంగాణవారి భాగస్వామ్యంలేకుండానే.. వారు సమైక్య తీర్మానం చేస్తున్న విడ్డూరం! తెలంగాణ ప్రజలకు సంబంధం లేకుండానే సమైక్య ఉద్యమాన్ని నడిపిస్తున్నవారి ఐక్యతా ప్రవచనం! భళి భళి! ..గిదేం లొల్లిరా భయ్!

హైదరాబాద్: రెండుచేతులు కలిస్తేనే చప్పట్లు! ఒక ఇంట్లో కలిసుందామని చెప్పాల్సింది ఇద్దరు వ్యక్తులు! ఒక సమాజంలో కలిసి బతకాలని తీర్మానించడానికి రెండు పక్షాల ఆమోదం అవసరం! ఇది ప్రాథమిక అవగాహన! ఒకరికి ఇష్టంలేకపోయినా కలిసేఉండాలని బలవంతం చేస్తే? అది ఉన్మాదమే! సరిగ్గా తెలంగాణ ఏర్పాటు డిమాండ్ పట్ల సమైక్యాంధ్ర ఆందోళనకారులు చేస్తున్న వితండవాదం అదే! చెప్పేది సమైక్యత గురించి. అందుకు ఆందోళన చేసేది మాత్రం ఒకవైపు ఉన్న 13 జిల్లాల్లో మాత్రమే! విడిపోతామని తెలంగాణలోని పది జిల్లాలు ఆందోళన చేశాయి. రాజీలేని ఉద్యమాలు నడిపాయి. ఆత్మ బలిదానాలు చేశాయి! లాఠీ దెబ్బలుతిని.. జైళ్లకు వెళ్లాయి! ఎన్ని వంచనలకుగురైనా.. రాజ్యాంగబద్ధమైన తమ ఆకాంక్ష నెరవేరుతుందనే లక్ష్యంతోనే ముందుకు కదిలాయి.. అనుకున్నది సాధించాయి! మరి సీమాంవూధలో జరుగుతున్న ఉద్యమానికి ప్రాతిపదిక ఏమిటి? ఏ లెక్కన వారు కలిసి ఉండాలంటున్నారు? ఏ లెక్కన తెలంగాణ విడిపోకూడదని చెబుతున్నారు? ఏ లెక్కన హైదరాబాద్‌పై హక్కులు కోరుతున్నారు? దేన్ని చూపించి హైదరాబాద్ తెలంగాణకు దక్కకూడదని కుట్ర చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తరచి చూస్తే.. మనోహర్, శ్రీనివాసరావు లాంటి ఉన్మత్త ప్రేమోన్మాదుల చేష్టలే గుర్తుకు వస్తున్నాయి! వద్దన్నా వాళ్లతోనే ఉండాలి. వాళ్లకు దక్కనిదేదీ.. ఇతరులకు దక్కకూడదు! ఇదే వారి సిద్ధాంతమా? అందుకేనా ఈ దాడులు? అందుకేనా ఈ ఉదయంపూట మాత్రమే కొనసాగే గొప్ప ఆందోళనలు?

గత నెలాఖరులో సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం ఒక ప్రజాస్వామిక ఆకాంక్షకు దక్కిన గౌరవం! వెయ్యి మంది తెలంగాణ యువత బలిదానాలకు ప్రతిఫలం. అన్నింటికి మించి.. అన్యాయానికి గురైన ప్రజలు సాధించుకున్న రాజ్యాంగబద్ధమైన హక్కు! నిజానికి ఈ పోరాటం 1956లో తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసిన కొద్దికాలానికే మొదలైంది. ఐక్యత ముసుగులో మాయమైన తన అస్తిత్వం కోసం ఇప్పటికీ దేవులాడుకుంటూనే ఉన్నది. ఈ క్రమంలోనే సీడబ్ల్యూసీ నిర్ణయానికి ముందువరకూ ప్రపంచం ఎన్నడూ చూడని మహోన్నతమైన ప్రజాస్వామిక ఉద్యమానికి తెలంగాణ గడ్డ సాక్ష్యంగా నిలిచింది! అప్పటి దేశ వాతావరణం దృష్ట్యా రాష్ట్రాన్ని విడగొట్టలేని పరిస్థితులను నాటి ప్రధాని ఇందిరాగాంధీ చూస్తే... నేడు తప్పక విడగొట్టాల్సిన బాధ్యతను ఆమె కోడలు సోనియాగాంధీ సమర్థవంతంగా నిర్వహించారు. కానీ.. చివరి అంకంలోనూ సీమాంధ్ర పెట్టుబడిదారులు కుట్ర సిద్ధాంతాలు రచిస్తున్నారు. శాడిస్టు వన్‌సైడ్‌లవ్‌కు నిదర్శనంగా నిలుస్తూ.. విడిపోతామంటున్న సమాజాన్ని కలిసుండాలంటూ బెదిరిస్తున్నారు!

తెలంగాణవారిపై దాడులేనా సమైక్యవాదం?
సమైక్య నినాదాలు చేస్తున్న సదరు ఆందోళనకారులే.. ఈ మధ్య బరితెగిస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కలిసుండటానికి ఇష్టపడటం లేదన్న ఆక్కసుతో భౌతిక దాడులకు దిగుతున్నారు. కులాల పేరుతో దూషణభాషణలకు వెరవడం లేదు! ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా టార్గెట్! వితంతువైన సోనియా పట్ల సమైక్యాంధ్ర ఆందోళనకారులు వ్యవహరించిన తీరు.. పత్రికల్లో కూడా ప్రస్తావనార్హం కాని వికృత చేష్ట! తెలంగాణ నేతలపైనా అదే తీరు! గుంటూరులో గ్రూప్ 1 ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న హనుమంత్ నాయక్‌ను కేవలం తన కింద పనిచేసే ఒక హాస్టల్ వార్డెన్ వచ్చి బెదిరించేందు సాహసించడం వెనుక ఎంతటి సమైక్యభావన ఉంది? రాష్ట్రం ఇంకా విడిపోలేదు కాబట్టి నేను ఆంధ్రవూపదేశ్ వ్యక్తినేనని, తన చదువు వల్ల వచ్చిన ఉద్యగం చేయడానికి వైజాగ్ వెళ్లిన నిజామాబాద్ యువకుడు నవీన్‌ను దారుణంగా కొట్టి.. నిలువుదోపిడీ చేసిన తీరు ఎలా అర్థం చేసుకోవాలి? సొంత ప్రాంతం అధికారిణిని సైతం ఓర్వలేని తనం ఎక్కడి నుంచి వచ్చింది? తాజాగా వీహెచ్‌పై భౌతికదాడి! గులాబీ పూలు ఇచ్చి గాంధీగిరీ చేస్తామంటూనే.. చెప్పులు విసిరి గూండాగిరీ! కానీ.. తెలంగాణ ఉద్యమం మాత్రం దశాబ్దాలుగా అత్యంత సహనంతో సాగింది! తనను తాను కాల్చుకునేందుకు సిద్ధపడిందే తప్ప.. తెలంగాణలోని సీమాంవూధుడిపై ఏనాడూ చేయి పడిందిలేదు. ఎందుకంటే? సీమాంవూధులైనా.. ఇక్కడ పొట్టపోసుకోవడానికి వచ్చిన సోదర తెలుగువారనే భావనే! ఇదీ.. నిజమైన సమైక్యభావన. విడిపోయినా కలిసిఉండాలనే ఆకాంక్ష! కానీ.. ఎప్పుడైతే సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిందో.. లగడపాటి వంటిరాజకీయ పెట్టుబడిదారీ వ్యాపారవేత్తలు విభజనను అడ్డుకుని తీరుతామని ప్రకటించారో.. తెలుగుతల్లి మెడపై కత్తి వేలాడుతోందని భావోద్వేగాలు రెచ్చగొట్టారో.. అప్పటినుంచి సీమాంవూధలో దాడుల పర్వం మొదలైంది! అక్కడి ప్రజాస్వామ్యవాదుల గొంతునూ నొక్కేస్తున్న విచిత్ర వైఖరికి సమైక్యాంధ్ర ఆందోళనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సీమాంవూధలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగ సంఘాలేవీ ఆందోళనల్లో పాల్గొనడం లేదు. కానీ.. ఈ విషయం ఎందుకు వెలుగులోకి రావడం లేదు? 

హైదరాబాద్‌పై వన్‌సైడ్ లవ్
ప్రస్తుతం సీమాంధ్ర నేతలు, ఉద్యమాలు చేస్తున్న ఇతర సంస్థలు చేస్తున్న వాదన కేవలం హైదరాబాద్. ‘హైదరాబాద్‌లో మావాళ్లంతా ఇక్కడే ఉన్నారు... ఇక్కడి నుంచి వెళ్లలేం.’ ‘హైదరాబాద్ మాదనుకుని పెట్టుబడులు పెట్టాం... ఇప్పుడు వెళ్లిపోమ్మంటే ఎక్కడికి పోతాం’ ఈ వాదనలే ఆధారంగా సీమాంవూధలో సమైక్య ఉద్యమం సాగుతోంది. ఎవరు ఏమన్నా.. విభజన ప్రక్రియ మొత్తం రాజ్యాగబద్ధంగా జరుగుతుంది. ఒక పౌరుడి లేదా ఒక ఉద్యోగి న్యాయబద్ధమైన హక్కును రాజ్యాంగం నిరాకరించదు.. పైగా మద్దతిచ్చి.. వెన్నుతట్టి భరోసానిస్తుంది! కానీ.. ఈ వాస్తవం సీమాంధ్ర ప్రాంతంలో ఎందుకు ప్రస్తావనకు రావడం లేదు? ఎన్నో ఏళ్లుగా బెంగాలీలు, మరాఠీలు, కన్నడిగులు, తమిళులు ఎలాంటి భేదభావాలు లేకుండా ఇక్కడ జీవనం సాగిస్తున్నారు.

తెలంగాణ సంస్కృతిలో కలిసిపోతున్నారు. కానీ 1956లో ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన నాటినుంచి సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజలతో మమేకం అవ్వడానికి ఏమాత్రం సిద్ధపడలేదన్నది యథార్థం. ఏకపక్షంగా కేవలం సీమాంధ్ర ప్రాంతానికే న్యాయం చేయడానికే తామున్నామన్నట్లుగా చెప్పుకున్న అనేక ఒప్పందాలను తెలంగాణ సమాజం చూసింది. తెలంగాణకు జరిగిన అనేక అన్యాయాలపై నివేదికలను సీమాంధ్ర పాలకులు తొక్కిపట్టిన వైనాన్ని సహించలేక నిలదీసింది. సినిమాల్లో దుష్టపావూతలకే మాత్రమే తెలంగాణ ప్రాంతాన్ని కేటాయిస్తూ.. హీరోయిజాలకు అనకాపల్లి.. అమలాపురాలను ఎంచుకుంటుంటే భరించలేక తిరగబడింది. అది కూడా ఉన్నతమైన ప్రజాస్వామిక విలువలకు లోబడే! ఈ పరిణామాలన్నీ సీమాంధ్ర నాయకుల పట్ల తెలంగాణ ప్రజల్లో ఏహ్యభావాన్ని పెంపొందించాయి. అయినా సరే వారి ధోరణి వారిదేనన్నట్లు పాలకులు ముందుకుపోయారు తప్పించి.. తెలంగాణ మనసు తెలుసుకుని.. వారికిదగ్గరయ్యే ప్రయత్నమే చేయలేదన్నది ఉద్యమకారుల విమర్శ. 

పైగా తమ, తమ ప్రాంత ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పారు. ఈ పరిణామాలు సీమాంధ్ర నాయకులపై పూర్తిస్థాయి అసంతృప్తికి కారణం అయ్యాయి. ఈ అసంతృప్తి జ్వాలలే తమకు ప్రత్యేక రాష్ట్రం వస్తేనే న్యాయం జరుగుతుందనే భావనకు తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యమించిన ప్రజలు ఎన్నో కష్టనష్టాలకొర్చి రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను సాధించుకున్నారు. ఈ సమయంలోనే మళ్లీ సీమాంధ్ర నేతలు సమైక్య కుట్రలు బయటపెట్టుకున్నారు. విడిపోబోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగానైనా... నియంతృత్వంతోనైనా.... హేతుబద్ధత లేని ఆందోళనలతోనైనా అడ్డుకోవాలనే ప్రయత్నాలను మొదలు పెట్టారు. ఇందుకోసం కొత్త మెలిక వేస్తూ.. హైదరాబాద్‌ను వివాదం చేసేందుకు తెగ తాపవూతయపడుతున్నారు. హైదరాబాద్ మాతోనే ఉండాలి... లేకుంటే తెలంగాణకు కూడా ఉండొద్దు అన్న రీతిలోనే సీమాంధ్ర నేతల ఆందోళనలు సాగుతున్నాయి. ఇదంతా చూస్తే.. ప్రేమిస్తే నన్నే ప్రేమించాలి.. లేదా యాసిడ్ పోస్తానన్నట్లు.. నరికి చంపుతానన్నట్లు సీమాంవూధనేతల తీరు మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌పై ప్రేమ కానేకాదు
ఇది దేవదాసు ప్రేమకాలం కాదు. యాసిడ్ ప్రేమకాలం. సమైక్యత అనేది ఇద్దరు మనుషుల మధ్య ఉండే సంబంధం. ఇద్దరికీ సమానమైన హక్కులు, బాధ్యతలుంటాయి. ఎవరికి ఇష్టం లేకపోయినా.. సంపూర్ణంగా విడిపోవచ్చు. సమైక్యవాదానికి నైతిక పునాది, తాత్విక పునాది లేదు. అదొక్క నినాదం మాత్రమే. సమైక్యతలో అంతర్లీనంగా హైదరాబాద్‌పై ప్రేమ మాత్రమే. ఇక్కడున్న సీమాంధ్ర ప్రజలపై కానేకాదు. నాకు దక్కకపోతే నీకూ దక్కొద్దు అన్నట్లుగా దాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలంటున్నారు. సమైక్య నినాదంలో పెట్టుబడిదారుల ప్రయోజనాలు మాత్రమే దాగి ఉన్నాయి. 
                                                                           - ప్రొఫెసర్ హరగోపాల్

Tuesday 13 August 2013

తెలంగాణ గుండెచప్పుడు

తెలంగాణా గుండె హైదరాబాద్ మహా నగరం, దక్షిణ భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు రాజధానిగా నిలిచి, అనేక సంస్కృతులను ఆకళింపు చేసుకున్న నగరం, చారిత్రక వారసత్వ నగరంగా కీర్తినందుకున్న నగరంపై నేడు వివాదం ఎందుకు ..? హైదరాబాద్ రాజధానిగా పరిపాలన సాగిన గత 500 ఏళ్ళ కాలంలో మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్ ఘడ్, ఆంద్ర ఇలా దక్షిణ భారతాన ఉన్న అనేక ప్రాంతాలు ఈ రాజ్యంలోకి వచ్చాయి వెళ్ళాయి, కాని ఏ రోజైతే ఈ నగరం పురుడు పోసుకుందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్న ఈ 9 తెలంగాణా జిల్లాలకు మాత్రం హైదరాబాదే రాజధాని . ఎందుకంటే హైదరాబాద్ నిర్మాణం జరిగిందే ఈ ప్రాంత రాజధాని అవసరాలు తీర్చడానికి, కావున దీనిపై పూర్తి హక్కు ఈ ప్రాంతంవారికే దక్కుతుంది.
                  సీమాన్ధ్రులు వచ్చాకే హైదరాబాద్కు పెట్టుబడులు వచ్చాయని, వాల్లే ఇక్కడ సంపదను పెంచి పోషించారని అవేశపడుతూ మాట్లదేవాళ్ళను అడగవలసింది ఒక్కటే, నువ్వు ఎన్ని కోట్ల పెట్టుబడులు ఇక్కడ పెట్టావు అని, 5 కోట్లమంది ఆంద్ర వాళ్ళలో ఎంతమంది హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు అనేది అడిగితే మేం పెట్టుబడులు పెట్టి పోషించాం అనే వాదన వెనక ఉన్న డొల్లతనం తెలిసిపోతుంది, సముద్రంలో వలలు వేసుకుంటూ జీవనం సాగించుకునే జాలరికి, ఎక్కడో నెల్లూరులో ఆటో నడుపుకునే ఆటో డ్రైవర్ కి, శ్రీ కాకుళం లో వ్యవసాయం చేసుకునే ఒక రైతు కులికి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళతో ఎం సంబంధం..? వాళ్ళ లాభాల్లో వీళ్ళకు వాటాలేం రావు కదా ..? 
              ఒక ఊరిలో వెయ్యి జనాభా ఉంది 9 కిరాణా షాపులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇంకో కిరాణ షాప్ పెట్టాలనుకోవడం అర్థం లేని ఆలోచన, ఆ ఊర్లో లేని ఏ వస్తువు కోసం జనం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారో గమనించి, ఆ షాప్ పెట్టడం అనేది తెలివైన ఆలోచన.. వ్యాపారం చేసుకునేవాడు లాభం కోసమే వ్యాపారం చేస్తాడు. కిరాణా షాప్ సరిగా నడవనన్ని రోజులు ఆ యజమాని, అతని భార్య, వారి కుటుంబమే నడిపించుకుంటుంది, కాని ఒక్కసారిగా షాప్ అభివృద్ధి చెంది బాగా గిరాకి అయినప్పుడు, వస్తున్న జనాన్ని బట్టి ఒకరో ఇద్దరో పనివాళ్ళను పెట్టుకుంటారు, ఇక్కడ పనివాళ్ళను ఎందుకు పెట్టుకున్నారు, వాళ్ళకు ఎ ఉద్యోగం లేదు కాబట్టి దయతలచి కాదు కదా తనకు అవసరం ఉంది కాబట్టే, ఇందులో ఎ సమాజ సేవా లేదు. ఆ షాప్ బాగా అభివృద్ధి చెందితే ఆ షాప్ లో  వస్తువులు కొన్నవాడికి, గతం లో వాడికి భూమిని అమ్మినవాడికి, ఆ ఊరికి వచ్చే లాభం ఏమిటి ..? అక్కడ ఆ వ్యాపారానికి మార్కెట్ లేకపోతే అంటే ఆ వ్యాపారి అక్కడ పెట్టుబడి పెట్టే వాడు కాదు. తనకు కావాల్సింది కేవలం లాభాలు అంతే కాని ఆ ఊరి అభివృద్ధి కాదు కదా..? అతను తన వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నాడు అంతే తప్ప అతను సమాజానికి చేసిన గొప్ప మేలు ఏమిలేదు.. మరి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టినవాడు నగరాన్ని అభివృద్ధి చేద్దామనో, సామాన్యులకు ఉపాది కల్పిద్దామనొ పెట్టారా..? ఇక్కడ అన్ని అనుకూలతలు ఉన్నయి, వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి అని మాత్రమె కదా పెట్టుబడులు పెట్టింది , ఇక్కడ పెట్టుబడులు పెడితే లాస్ వస్తుంది అని తెలిస్తే పెట్టుబడులు పెట్టడు కదా.  హైదరాబాద్ లో వచ్చిన ప్రవేట్ పరిశ్రమల ద్వార వారి వ్యక్తిగత ఆస్తులు పెరిగాయి అంతే దాని వాళ్ళ హైదరాబాద్ లో ఉన్న సామాన్య జనానికి ఒరిగింది ఏమి లేదు, పాతనగరం లో తోపుడు బల్లపై పండ్లమ్ముకునే వాడి జీవితం, బస్తిల్లో బతికే సామన్యుని జీవితం హై టెక్ సిటీ రావడం వాల్ల మారాయా..? 
               అభివృద్ధి అంటే ఏమిటి..? ఒక ప్రాంతం లో అభివృద్ధి జరిగింది అంటే అక్కడి ప్రజల కొనుగోలు సామర్ధ్యం పెరగాలి. ఉదాహరణకు రోజుకు 20 సంపాదించే వారు 200 రూపాయలు సంపాదించే పరిస్థితి వచ్చిందంటే అతని జీవన ప్రమాణం మారుతుంది, అతను విలువైన వస్తువులు కొనగాలుగు తారు, అక్కడికి కొత్త వ్యాపార సంస్థలు వస్తాయి, ఫలితం గా మార్కెట్ సదుపాయాలు పెరుగుతాయి, రావాణా సదుపాయాలు మెరుగవుతాయి, ఇలా ఆ ప్రాంతం నుండి ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది. మరి హైదరాబాద్ లో ఇది జరిగిందా ..? పాతనగరంలో,బస్తిల్లో దశాబ్దాలుగా జీవిస్తున్న వారి పరిస్థితులలో ఐటి, ఫార్మ పరిశ్రమల రాకతో మార్పు జరిగిన్దా..? వాళ్ళ జీవన ప్రమాణం మారిన్దా..? మరి హైదరాబాద్ అభివృద్దికి సీమంధ్రులు కారణం ఎలా అవుతారు..?
            ఒక ప్రాంతం లో పుష్కలం గా తాగునీరు లభిస్తే, నీటి సమస్య లేకపోతే ఆ ప్రాంతం నిజంగా అభివృద్ధి చెందిన ప్రాంతం, 1950 ల నాటికి స్వచ్చమైన తాగు, సాగు నీరు అందించిన మూసి నది, హుస్సేన్ సాగర్ జలాశయమ్ నేడు మురికి కుపాలుగా మారాయి, ఈ రోజు ఇక్కడి ప్రజలు తీగునీటి కోసం మరో నదిపై ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది.. సహజ వనరులను ధ్వంసం చెయ్యడమెనా... అభివృద్ధి అంటే..? 
                            హైదరాబాద్ లో ఉన్న సీమంద్రులకు తెలంగాణా ఏర్పడటం తో భద్రత కరువవుతుంది అనే ప్రచారం చేస్తున్నారు, కేవలం నగరం లోనే కాకుండా నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఇలా తెలంగాణా లోని అన్ని జిల్లాల్లో ఆంద్ర వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ లేని భద్రత సమస్య హైదరాబాద్ లో ఉండేవాళ్లకే ఎందుకు వచ్చింది..? 
                    హైదరాబాద్ ప్రజల అభిప్రాయాన్ని అడిగితే ఎక్కువ మంది తెలంగాణ తో ఉండటానికి ఇష్టపడరని మరో విష ప్రచారం చేస్తున్నారు, నిజానికి హైదరాబాద్ నగరం ఊపిరిపోసుకున్నదే తెలంగాణ ప్రాంతానికి రాజధాని సమస్య తీర్చడాని, పుష్కలమైన నీరు, ఎత్తైన ప్రాంతంలో ఉండటం వళ్ళ విపత్తుల సమస్య లేదు, వాతావరణం ఆహ్లాదకరం గా ఉండటం, అమీబా లా ఎంత వరకైనా విస్తరించగల విశాలమైన కాళీ భూములు నగరం చుట్టుపక్కల ఉండటం ఇవన్ని ఈ ప్రాంతం రాజధానిగా 4 శతాబ్దాలుగా కొనసాగడానికి అనుకూల అంశాలు, ఈ కాలంలో మహారాష్ట్ర ప్రాంతాలు, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, సీమంద్ర ఇలా అనేక ప్రాంతాలు కలిసి విడిపోయాయి, కాని 4 శతాబ్దాలుగా తెలంగాణా లోని 10 జిల్లాలకు రాజధాని హైదరాబాదే..! ఇక ముందు కుడా తెలంగాణా రాష్ట్రానికి రాజధాని హైదరాబాదే అని హైదేరాబాదిలు కోరుకుంటున్నారు, ఆ సర్వే రిపోర్ట్ మీ కోసం.... 

Saturday 10 August 2013

విశాలాంధ్ర నినాదం గురించి నెహ్రూ ఏమన్నడు?

 అక్టోబర్ 1, 1953 నాడు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రారంభించడానికి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కర్నూల్ టౌనుకు వచ్చాడు.
       ఆరోజు కొంతమంది విలేకరులు తెలంగాణను కలుపుకుని విశాలాంధ్ర (ఆంధ్ర ప్రదేశ్) ఏర్పాటు గురించి ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన జవాబు ఇది:
“విశాలాంధ్ర అనే నినాదాన్ని ప్రస్తుత పరిస్థితులలో నేను అర్థం చేసుకోలేకుండా ఉన్నాను. “విశాల” శబ్దం దురాక్రమణ చింతగల సామ్రాజ్యవాదాన్ని స్ఫురింపజేస్తుంది. ఈ విశాలాంధ్ర నినాదం వెనుక దాగిఉన్న మనస్తత్వం సామ్రాజ్యవాద తత్వంతో కూడినట్టినది”
                      
                                  3-10-1953 ఆంధ్రప్రభ దినపత్రిక

సీఎంగా కొనసాగే హక్కులేదు


-మెంటల్ స్టేటస్ లేకే... హైదరాబాద్ స్టేటస్ అంటున్నడు
-అందుకే పిచ్చి ప్రేలాపనలు 
-మేమెవరినీ ఇక్కడి నుండి వెళ్లిపోవాలని అనలేదు
-వారుంటే మాకే ఇంకా వెల్త్ టాక్స్ పెరుగుతుంది
-సీఎం.. ఇక్కడే ఉండి కర్రీపాయింటో, టిఫిన్ సెంటరో పెట్టుకో
-నువ్వు రాష్ట్రానికి సీఎంవా... ఒక ప్రాంతానికా?
- సీఎంపై నిప్పులు చెరిగిన టీఆర్‌ఎస్‌అధినేత కేసీఆర్
హైదరాబాద్ ఆగస్టు 9 (టీ మీడియా) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి సీఎంగా కొనసాగే హక్కు లేదు.. నిన్న పెట్టిన ప్రెస్‌మీట్‌లో అసత్యాలు, అసంబద్ధ విషయాలు చెప్పారు.. 
             ఆయనకు మెంటల్ స్టేటస్ సరిగా లేదు.. అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన చెప్పిన ఏ అంశంలోనూ వాస్తవాలు లేవని, అవన్నీ పిచ్చి ప్రేలాపనలేనని దుయ్యబట్టారు. సీఎం ప్రస్తావించిన హైకోర్టు, విద్యుత్, నదీజలాల పంపిణీ, ఉద్యమాలు, ఉద్యోగాలు, హైదరాబాద్ వివాదం తదితర విమర్శలను ఆయన అంశాల వారీగా సవివరంగా తిప్పికొట్టారు. తెలంగాణ నిర్ణయం జరిగిపోయిందని కేంద్ర హోంశాఖలో కసరత్తు జరుగుతోందని వివరించారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రత్యేక రాష్ట్రం ఆగదని స్పష్టం చేశారు. హైదరాబాద్ విషయంలో సీడబ్ల్యూసీ ఇప్పటికే కుండబద్దలు కొటినట్టు తెలంగాణలోనే ఉంటుందని చెప్పిందని అన్నారు. నదీ జలాల పంపిణీకి అనేక చట్టాలు సూత్రాలు ఉన్నాయని వాటి ప్రకారమే జరుగుతాయన్నారు. ఉద్యోగులు ఉద్యోగాల సంఖ్యపై రాజధానిలో ఏ హెచ్‌ఓడీకి వెళ్లినా నిజాలు తెలుస్తాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్ విఫల ప్రయోగమని ఇంకా అనవసర వివాదాలతో విషం నింపవద్దని కోరారు. 

ఎవర్నీ వెళ్లమనలేదు..మీరుంటే మాకే టాక్సులొస్తయ్..
హైదరాబాద్ విషయంలో సీఎంవి అసంబద్ద వాదనలని కేసీఆర్ అన్నారు. ‘హైదరాబాద్ స్టేటస్ పరిస్థితేంటంటాడు. ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయనకు మెంటల్ స్టేటస్ లేనట్లుంది. మెం టల్ ఖరాబైనట్లుంది. అందుకే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు’ అని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణలో భాగమని సీడబ్ల్యూసీ తీర్మానం కుండబద్దలు కొట్టినట్టు చెప్పిందని గుర్తు చేశారు. కొంత కాలం పాటు హైదరాబాద్‌నుండి పాలన సాగించుకోవడానికి పెద్ద మనస్సుతో అంగీకరించాం. మానవతా థృక్పథంతో 10సంవత్సరాల పాటు ఇక్కడ ఉండేందుకు అంగీకరించినం’ అని చెప్పారు. ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగిన వారంతా తెలంగాణ వారేనని ఇప్పటికి లక్షసార్లు చెప్పామన్నారు. అలాగే తాము ఎవరినీ వెళ్లిపోవాలని కోరుకోవడం లేదని చెప్పారు. మీరిక్కడే ఉద్యోగాలు చేసుకుని ఇక్కడే ఉండిపోండి మాకే టాక్సులు వస్తయి అన్నారు. వెల్లగొడతరు అంటూ అనవసర వివాదం చేస్తున్నాడన్నారు.తాము ఎవర్నీ వెల్లమని అనడం లేదని అంటూ సీఎం కూడా విడిపోయిన తర్వాతకూడా ఇక్కడే ఉండొచ్చునని, కర్రీ పాయింటో, టిఫిన్‌సెంటరో కూడా పెట్టుకోవచ్చని చురకలంటించారు. 

హైకోర్టు, న్యాయవాదుల సంఖ్యై చర్చకు సిద్ధమా?
హైకోర్టు, హైదరాబాద్ న్యాయవాదుల సంఖ్యపై కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పిన వివరాలు, గణాంకాలను ఆయన తప్పుపట్టారు. హైదరాబాద్‌లో 40-50 వేలమంది న్యాయవాదులున్నారనేది పచ్చి అబద్ధమని అన్నారు. హైకోర్టు రిజిస్టార్‌తో, బార్ కౌన్సిల్ నాయకులతో మాట్లాడానని, హైదరాబాద్‌లో మొత్తం 10-15వేల మంది న్యాయవాదులున్నారని, ఇందులో సీమాంవూధుల సంఖ్య 3-4 వేలుమావూతమేనన్నారు. 23జిల్లాల్లో మొత్తం రిజిస్టర్ అయిన న్యాయవాదులు 75వేల మంది మాత్రమేనని, సీమాంవూధలోని 13 జిల్లాల్లో 40వేల మంది అడ్వకేట్లు ఉంటే హైదరాబాద్‌తో కలిసి తెలంగాణలో 35వేల మంది ఉన్నారని వివరించారు. ఈ విషయమై చర్చకు సిద్ధం.. జూబ్లీ హాల్లో పెడతారా ఇంకెక్కడైనా పెడతారో చెప్పాలని సవాలు విసిరారు. గుంటూరు నుండి హైకోర్టు తెచ్చామన్నారని మరో అబద్ధం చెప్పారని హైదరాబాద్‌లో 1919 నుండేహైకోర్టు ఉందని, ఆంధ్రలో 1954లో ఏర్పడ్డదని చెప్పారు. 

నేను మాట్లాడిన వాటిల్లో ఏ తప్పున్నా.... ఏ శిక్షకైనా సిద్ధం
తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంతం మొత్తం అంధకారం అవుతుందని సీఎం చెప్ప డం హస్యాస్పదమన్నారు.‘ నేను మొన్న ఏం చెప్పిన్నంటే తెలంగాణలో ప్రస్తుతం జనరేట్ అవుతున్న విద్యుత్ 4825మెగావాట్లు. ఇందులో 2282మెగావాట్ల యూనిట్లు థర్మల్ ద్వారా, 2543మెగావాట్లు హైడల్ ద్వారా ఉత్పత్తి అవుతోందని చెప్పిన. వర్షాలు ఎలా ఉన్నా తప్పకుండా హైడల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యేది 800మెగావాట్లు. అంటే తప్పకుండా విద్యుత్ తెలంగాణలో జనరేట్ అయ్యేది 3082యూనిట్లు. ఇక తెలంగాణ వచ్చిన తరువాత కేంద్రం రాష్ట్రానికిస్తున్న విద్యుత్‌లో తెలంగాణ వాటా కింద 1260 మెగావాట్లు వస్తుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దక్కే నికర విద్యుత్ 4342మెగావాట్లు. మరోపక్క 6800మెగావాట్ల విద్యుత్ జనరేటింగ్ స్టేషన్లు త్వరలో రావాల్సి ఉన్నాయి. ఈ సెప్టెంబర్‌లో జూరాల నుండి 240 మెగావాట్లు, సింగరేణి నుండి 1200 మెగావాట్లు వచ్చే ఏడాది జూన్ నుండి వస్తుంది. '

చెన్నూరు, భూపాలపల్లి పవర్‌ప్లాంట్ల నుండి ఏప్రిల్‌లో 600 మెగావాట్లు రాబోతోంది. తెలంగాణలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను, రాష్ట్రం ఏర్పడిన తరువాత వచ్చే విద్యుత్‌ను, త్వరలో అందుబాటులోకి రానున్న విద్యుత్‌ను మొత్తం కులుపుకుంటే లోటు కేవలం 418యూనిట్లు మాత్రమే. కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం విద్యుత్‌ను వినియోగించుకుంటే కేంద్రం పరిధిలో ఉండే 10శాతం విద్యుత్ అంటే 3000యూనిట్లలో 700-800మెగావాట్లు అడిగి తెచ్చుకుంటాం.’ అని కేసీఆర్ సోదారహరణంగా వివరించారు. తాను 10వేల మిలియన్ యూనిట్లు చత్తీస్‌గడ్‌నుంచి తెస్తానన లేదని అంత విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంటామని మాత్రమే చెప్పానని అన్నారు. చత్తీస్‌ఘడ్‌లో మిగులు ఉందని,ఉదయమే చత్తీస్‌గడ్ విద్యుత్ అధికారులతో, మంత్రితో మాట్లాడానని,రిటైర్డ్ ఐఎఎస్ అధికారి గోయల్ కూడా మాట్లాడారని వారు వెయ్యి నుండి 1500 మెగావాట్లు అమ్మడానికి సిద్ధమని చెప్పారని తెలిపారు.‘నాకు గ్రిడ్ల గురించి చెబుతున్నాడు. నేనేం పిలగాన్నా. నార్త్, సౌత్ గ్రిడ్లను కనెక్టు చేయలేదు. మీటింగ్‌లు నడుస్తున్నాయి. పవర్‌కారిడార్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో కొన్ని క్షణాల్లో విద్యుత్ వస్తుంది. తెలంగాణకు కోల్ డిపాజిట్స్ ఉన్నాయి. 

రాష్ట్రం వచ్చినంక ఏందీ పరిస్థితి అని మాకు తెలియదా... రాష్ట్రం సాధించుకున్నోళ్లకు ఈ విషయాలు తెలియనివా...?’ అని మండిపడ్డారు. తెలంగాణలోని సింగరేణిలో 51శాతం బొగ్గు నిల్వలు తెలంగాణకే చెందుతాయని, కేంద్రం శ్రీరాంపూర్, రామగుండంలో రెండు గనులను తెలంగాణకు కేటాయించిందని, ఉపయోగించుకుని 1200 మెగావాట్ల విద్యుత్‌ను జనరేట్ చేస్తామని, మహారాష్ట్ర, కర్నాటకకు అమ్ముతున్న బొగ్గును విద్యుత్ ఉత్పత్తికి వాడుకుంటామని చెప్పారు. ‘ జెన్‌కో ద్వారా 6600 మెగావాట్లు, పాల్వంచనుండి 800, భూపాలపల్లి నుండి 800, సత్తుపల్లి నుండి 600, రామగుండం నుండి 1320, నేదునూరు నుండి 2100(గ్యాస్ కేటాయింపులు చేస్తే , శంకర్‌పల్లి నుండి 1000 మెగావాట్లు అందుబాటులోకి వస్తే తెలంగాణ మిగులు కరెంటు ఉన్న రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎన్టీపీసీ నుండి మరో వెయ్యి యూనిట్లు తెచ్చుకుంటామని తెలిపారు. ఆంధ్రలో మిగులు విద్యుత్ మూడువేల మెగావాట్ల వరకుందని తెలిపారు. ‘మాకు అమ్మరా.. మీ దగ్గర కొంటాం. మాతో మీకు అవసరాలు ఉండవా.. తెలుగుజాతి, తెలుగు ప్రజలు, తెలుగు ప్రేమ ఇదేనా. సీఎం మాట్లాడే మాటలేనా.’ అని అన్నారు. 

ఉద్యమాలు లేకుంటే మద్రాసులోనే ఉందువు....
కోరికలు, ఉద్యమాలతో రాష్ట్రాలు ఏర్పడవని సీఎం అంటున్నాడని, మరి ఆనాడు పొట్టి శ్రీ రాములు త్యాగం, ఉద్యమం వల్లే ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందన్న విషయాన్ని సీఎం ఎలా మరిచాడని అన్నారు. తమిళులను బొద్దింకలు, రాజాజీని నామాల నల్లకాకితో పోల్చిన విషయం సీఎంకు తెలియదా అని అన్నారు. ఇలా ఉద్యమం చేయబట్టే ఆంధ్రరాష్ట్రం తెచ్చుకున్నారని, లేకుంటే ఇప్పటికీ మద్రాసు రాష్ట్రంలోనే ఉండేవారు కాదా అని ప్రశ్నించారు. 

మీ తెలివితక్కువతనం వల్లే నీరు వృధా..
మూడువేల టీఎంసీల నీరు ఈ సంవత్సరం సమువూదంలో కలిసిందని చెప్పిన సీఎం దానికి కారకుపూవరో తెలుసుకోవాలన్నారు. ‘మీ తెలివిలేని తనం వల్లే ప్రాజెక్టులు ప్రారంభం కాలేదు. ఎస్సాస్సీ, ఇచ్చంపల్లి, దేవాదుల, కాంతనపల్లి ప్రాజెక్టులు చేపట్టకపోవడం వల్లే నీరు సమువూదంలోకి వెళ్తోంది. మీకు దూరదృష్టి లేదు. సమువూదంలోకి పోయే నీటిని మా పొలాలకు మళ్లిస్తాం. మా నీరు మేం తెచ్చుకుంటాం. మీరేం ప్రాజెక్టులు చేపట్టారు. ప్రాణహిత-చే ఈ ప్రాజెక్టు కింద 16 లక్షల ఎకరాలకు సాగునీరు. మొత్తం కట్టేవి ఎత్తిపోతల ప్రాజెక్టులు 14, మొత్తం టీఎంసీలు 14. వీటితోనే 16లక్షల ఎకరాల నీరు పారిస్తారా..? తెలంగాణ లిఫ్ట్ ప్రాజెక్టులకు కరెంటు లేదంటున్నారు. ముందు మాకందే నీళ్లను తరలించుకుంటాం.. ఆ తరువాతి నీటినే లిఫ్ట్‌ల ద్వారా తెచ్చుకుంటాం. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై అటానమస్ ట్రిబ్యూనల్స్‌ను పెట్టుకుంటాం. అన్నారు. నైలునదిని 11 దేశాలు పంచుకుంటున్నాయని, దేశంలోని 28రావూష్టాలు నీటి పంపకాల్లో అవలంభిస్తున్న విధానాలనే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు పాటిస్తాయని తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర ఏమన్నా రెండు దేశాలుగా విడిపోతున్నాయా..? అని ప్రశ్నించారు. 

వెయ్యేళ్లు బతకం...ఒకరినొకరు చూడలేని స్థితి వద్దు
మనం వెయ్యేళ్లు బతకమని, భవిష్యత్తు తరాల మధ్య విషబీజాలు నాటొద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. విభజన జరిగిపోయిందని, ఆంధ్రవూపదేశ్ అనేది విఫలవూపయోగమని, రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకరిముఖం ఒకరు చూసుకోలేని స్థితిని కల్పించొద్దని సీఎంకు సూచించారు. ఉద్యోగాలపై కిరణ్‌కుమార్‌డ్డి పచ్చి అబద్ధం చెప్పారని అన్నారు. ‘1969లో నాటి సీఎం కాసు బ్రహ్మనందడ్డి జీవో ప్రకారం వెళ్లాల్సిన వారు 24వేల మంది ఉద్యోగులు. ఎన్టీరామారావు 610జీవో ఇచ్చారు. సుందరేషన్ కమిటీ రిపోర్టు ప్రకారం 59వేలు. రిపోర్టులున్నాయి. చదవండి. అవేవీ చూడకండా కేవలం18వేలే. అందులోనూ తెలంగాణవారున్నారంటే ఎలా. రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఎలాంటి పద్ధతులు అవలంభించాలనేదానికి చట్టం, పద్ధతులున్నాయి. ఇప్పటికే మూడు రాష్ట్రాలు దాన్ని పాటించి ఏర్పడ్డాయి. ఎవరూ ఎవర్నీ వెళ్లిపొమ్మనరు వారు ఎక్కడ పనిచేయాలో వారి ప్రభుత్వం నిర్ణయిస్తుంది.’ అని వివరించారు. సీమాంధ్ర ప్రాంత నాయకులు విజ్ఞప్తులు చెప్పుకునేందుకే అంటోనీ కమిటీ వేశారని, రాష్ట్రం విడిపోయే సందర్భంలో మంచిచెడులు చెప్పుకోవడానికే ఈ కమిటీ అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాసెస్ ప్రారంభమవుతుందని అన్నారు.

హైదరాబాద్‌లోని పోలీసింగ్ గవర్నర్ కంట్రోల్‌లో పెడతామనే వ్యాఖ్యలపై స్పంది స్తూ జీహెచ్‌ఎంసీ పరిధి ఎల్‌బీ నగర్‌వరకే ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లోనూ ఆంధ్రవూపాంతం వారున్నారు కదా అని ప్రశ్నించారు. బొంబాయికి వలసపోయిన వారు మాకు అక్కడ హక్కులుంటాయంటే రాజ్‌ఠాక్రే తెల్లారే సరికి ఖాళీ చేయిస్తాడని అన్నారు. సీమాంధ్ర వారిలాగే తాము వితండవాదానికి పోతే హైదరాబాద్ కంటే స్పీడుగా గ్రోత్ ఉన్న పట్టణాలు వైజాగ్, తిరుపతి అని, వాటిని కేంద్ర పాలితవూపాంతాలు చేయాలని అడిగితే ఎం చేస్తారని ప్రశ్నించారు. మీడియా సంస్థలు విద్వేషాలు కల్గించొద్దని హితవు పలికారు. కేంద్రంలోని అన్ని శాఖలు విభజనపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయని, కేబినెట్ నోట్ ఆలస్యమేమీ కాదని కేసీఆర్ వివరించారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే.కేశవరావు, టీఆర్‌ఎస్‌ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్, పోలిట్‌బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహ్మడ్డి, జగదీష్‌డ్డి, స్వామిగౌడ్ పాల్గొన్నారు. 

బొంబాయి గురించి అంబేద్కర్ అన్నది మరిచారా?
‘రాష్ట్రం సమైక్యం కోసం సంతకం పెట్టానని ఒప్పుకుంటున్నాడు. ఏం హక్కు ఉంది సీఎంగా ఆయన కొనసాగడానికి. సీఎంకు ఒక ప్రాంతంపై పక్షపాతం ఎలా ఉంటుంది. కొందరికి ఈ మధ్య అంబేద్కర్ మీద గౌరవం బాగా పెరిగిపోయింది. ఆయన హైదరాబాద్‌ను రెండో రాజధానిని చేయాలన్నడని అంటున్నరు. మరి అదే అంబేద్కర్ బొంబాయి గురించి ఏమన్నడు? అదికూడా చెప్పండి. ఆనాడు గుజరాతోళ్లు ఇట్లనే మేం అది పెట్టినం ఇది పెట్టినం మేం పోతే కుప్పకూలుతరు అన్నరు. అపుడు అంబేద్కర్ మీరు ఎన్నటికైనా కిరాయిదారులేనన్నాడు. దీన్నెందుకు మరుస్తున్నారు.’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ తెలంగాణదే.. 
‘మీ సీడబ్ల్యూసీనే హైదరాబాద్ తెలంగాణదని చెప్పిందని, ఇంకెవరు చెప్పాలి నీకు’ అని కిరణ్‌ను కేసీఆర్ ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు ఎంత మంది ఉంటే అంత వెల్త్‌టాక్స్ తమకు వస్తుందని, హైదరాబాద్‌లో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చునని, ఆంధ్రవూపాంతం వారు బెంగుళూర్, చెన్నైలో ఉన్నారని, పుణె, ముంబై, షోలాపూర్‌లో తెలంగాణవారున్నారని తెలిపారు. హైదరాబాద్ మాదేనన్నట్లుగా మాట్లాడితే మీలాంటివారిని రానిస్తారా? అందుకే అన్నీ అలోచించే సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని కేసీఆర్ అన్నారు. కర్ణాటక, మహారాష్ట్రతో ఇబ్బందులను ఎలా పరిష్కరించుకోవాలనే అంశాలపై కలిసి చర్చించుకుందామన్నారు. హైదరాబాద్‌లో చిత్ర పరిక్షిశమ స్థిరపడిపోయిందని, అందులో 90శాతం మంది సీమాంవూధ నుంచి ఉంటే 10 శాతమే తెలంగాణ ప్రాంతం వారున్నారని, ఆ పరిక్షిశమను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని అన్నారు. వారిని ఎవరైనా పొమ్మంటే నేనే ముందుండి ఉద్యమిస్తానని కేసీఆర్ అన్నారు.

ఉద్యమాలు
‘‘ఉద్యమాలతో రాష్టాలు రావని అంటున్నవ్. అయిపొయింద? పొట్టి శ్రీరాములునే మరిచినవ? ఉద్యమాలు లేకుంటే.. ఆయన త్యాగం లేకుంటే ఇప్పడు ఏడుందువు.. మద్రాసుల గాదా. జార్ఖండ్, చత్తీస్‌గడ్ ఉద్యమాలతోని రాలేదా.’’

జలపంపిణీ:
‘తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రం. 28 రాష్ట్రాలకు నీటి పంపిణీల ఏ సూత్రాలు ఉంటయో అవే తెలంగాణకు ఉంటయ్. నైలు నదిని 11 దేశాలు పంచుకుంటున్నయ్. ఒకళ్లను ఒకళ్లు చంపుకునే పాకిస్థాన్‌తో ఐదు నదులను పంచుకుంటున్నం. బంగ్లాదేశ్, నాలుగు దేశాలతో బ్రహ్మపువూతను పంచుకుంటున్నం. ఇక్కడ సమస్య ఎందుకు వస్తది. నేషనల్ వాటర్ లాస్ ఉన్నయ్. ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ఉన్నయ్’’

విద్యుత్:
‘నాకు గ్రిడ్ల గురించి చెబుతున్నాడు. నేనేం పిలగాన్నా. నార్త్, సౌత్ గ్రిడ్లను కనెక్టు చేయలేదు. పవర్‌కారిడార్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో కొన్ని క్షణాల్లో విద్యుత్ వస్తుంది. ఇది నా సొంత కవిత్వం కాదు. రేపు విద్యుత్ అవసరం పడితె మాకు అమ్మరా? పక్కరాష్ట్రం కాబట్టి మీ దగ్గర కొంటాం? మాతో మీకు అవసరాలు ఉండవా? ఈ మాత్రం సంస్కారం మీకు లేదా? తెలుగుజాతి, తెలుగు ప్రజలు, తెలుగు ప్రేమ ఇదేనా. సీఎం మాట్లాడే మాటలేనా.’