Tuesday 28 July 2015

ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయో పరిమితి 44 ఏండ్లు!

* ఏడాదిపాటు అన్ని నియామకాలకు వర్తింపు* 15,522 ఖాళీలకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 
* స్థానికత, జోన్, జిల్లా నియమాలు వర్తింపు
* రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రాష్ట్రపతి ఉత్తర్వులు యథాతథం
  తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే అన్ని ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని 44 ఏండ్లకు పెంచుతూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఏడాదిపాటు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. టీఎస్‌పీఎస్‌సీ, ఇతర సెలక్షన్ కమిటీలు చేపట్టే ఉద్యోగాల నియామకాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. అయితే యూనిఫారం సర్వీసులకు మాత్రం ఇది వర్తించదు. రాష్ట్రంలో భారీ ఉద్యోగ నియామకాల ప్రక్రియ తొలిదశలో భాగంగా 15వేల ఉద్యోగాల భర్తీ ఫైలుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం సంతకం చేసిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పదేండ్ల వయోపరిమితి పెంపు ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ నుంచి అంటే 27.07.2015 నుంచి ఏడాది పాటు అంటే 26.07.2016 వరకు ఈ సడలింపు వర్తిస్తుంది. 
ఇవీ ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని అత్యంత ప్రాధాన్య అంశంగా భావిస్తున్నది. ఈ క్రమంలో డైరెక్టు రిక్రూట్‌మెంట్ విధానంలో అర్హులైన విద్యావంతులను ఎంపిక చేసేందుకు టీఎస్‌పీఎస్‌సీతో పాటు ఇతర సెలక్షన్ కమిటీలకు ఖాళీలను అందజేసింది. ఇదే సమయంలో నిరుద్యోగులు, ప్రజాప్రతినిధుల నుంచి వయోపరిమితి సడలించాలనే ప్రతిపాదనలు అందాయి. ఈ విషయంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ తన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించింది. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం పదేండ్ల వయోపరిమితి పెంపునకు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 34 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు ఈ పెంపు వర్తిస్తుంది. ఈ పెంపు స్టేట్, సబార్డినేట్ సర్వీస్‌రూల్స్‌కి వర్తిస్తుంది. 
     ఈ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వ గెజిట్‌లో కూడా ప్రచురితం అవుతుంది అంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు అదే జీవోలో నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేశారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 309 కింద కల్పించిన అధికారం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ క్రింది అడ్‌హాక్ రూల్ వెలువరిస్తున్నది. స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్‌రూల్స్ ప్రకారం వయోపరిమితిని పదేండ్లు అంటే...34 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు పెంచుతూ నిర్ణయం జరిగింది. జీవో విడుదల అయిన తేదీ నుంచి ఏడాది పాటు రాష్ట్రంలో జరిగే అన్ని నియామకాలకు ఇది వర్తిస్తుంది. స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్‌రూల్స్‌లోని రూల్ 12కి కూడా ఈ మార్పు వర్తిస్తుంది. యూనిఫాం సర్వీసులైన పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ తదితర ఉద్యోగాలలోని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు ఇది వర్తించదు అని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
ఆర్థిక శాఖ ఆదేశాలు...
ఉద్యోగాల భర్తీలో భాగంగా గుర్తించిన 15,522 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో భర్తీ చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎన్ శివశంకర్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి, ఇతర నియామక సంస్థల బాధ్యులు తగు చర్యలు తీసుకోవాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి స్థానికత, జోన్, జిల్లా, రోస్టర్‌పాయింట్లు, ఇతర అర్హతలు తదితర విషయాలు పరిగణనలోకి తీసుకోవాలని వివరించారు. 
         సంబంధిత శాఖలు, విభాగాల బాధ్యులు నియామక ప్రక్రియకోసం తగు వివరాలు అందించాలని ఆదేశించారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా కాకుండా ఎంపిక ప్రక్రియను నిర్వహించే జిల్లా ఎంపిక కమిటీలు, కార్పొరేషన్లు, విభాగాలు నోటిఫికేషన్ విడుదల చేసి రాతపరీక్ష ద్వారా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో నిష్పక్షపాత విధానంలో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రాష్ట్రపతి ఉత్తర్వులు పాటించాలని నిర్దేశించారు. ఎంపిక ప్రక్రియ కోసం తగు విధమైన చర్యలను వెంటనే ఆయా విభాగాలు చేపట్టాలని స్పష్టం చేశారు. 
                                                                             
 (-నమస్తే తెలంగాణ)

Saturday 25 July 2015

తెలంగాణలో కొలువుల జాతర!

* 15 వేల ఉద్యోగ నియామకాలకు పచ్చజెండా
* వయో పరిమితి పదేళ్ల పెంపు
* ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు
తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 15 శాఖల్లో ఖాళీగా ఉన్న 15 వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఉద్యోగాల భర్తీపై సీఎం జులై 25న సంతకం చేశారు. గరిష్ఠ వయోపరిమితిని మరో పదేళ్లు పెంచారు. ప్రస్తుతం 34 ఏళ్లు పరిమితి ఉండగా దానిని 44 ఏళ్లకు పెంచాలని ఆయన ఆదేశించారు. తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని నిరుద్యోగులకు మేలు కలిగించే రీతిలో పదేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. నలభై రోజుల వ్యవధిలో ఈ పోస్టుల భర్తీని పూర్తిచేయాలని ఆదేశించారు. ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే సీఎం హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జాబితాను రూపొందించి సీఎంకు సమర్పించారు. దానిని పరిశీలించిన సీఎం 25వ తేదీన తక్షణమే భర్తీ కావాల్సిన 15 వేల పోస్టులకు ఆమోదం తెలిపారు. నియామకాల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. కానిస్టేబుల్, ఎస్ఐ సహా పోలీసు, అగ్నిమాపక శాఖల్లో 8,000 ఖాళీలను, విద్యుత్ శాఖలో 2,681 ఖాళీలను భర్తీ చేయనుండగా... వ్యవసాయం, ఉద్యానవనాలు, వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, రోడ్లు భవనాలు, రవాణా, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోనివి 4,300 కొలువులను భర్తీ చేయనున్నారు. దాదాపు పదేళ్లుగా ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులకు పండగనే చెప్పాలి.
రెండు జోన్లలో...
జోనల్ వ్యవస్థ యథాతథంగా కొనసాగనుంది. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి, స్థానిక, స్థానికేతర కేటగిరీని అమలు చేస్తారు. తెలంగాణలో ప్రస్తుతం రెండు జోన్లు ఉన్నాయి. దీనికి అనుగుణంగా ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. జోనల్ విధానంతో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇతర నిబంధనల మేరకు నియామకాలు జరపాలని సూచించారు.
ఏ శాఖలో ఎన్ని...
* పోలీసు, అగ్నిమాపక శాఖ: 8,000
* విద్యుత్ శాఖ: 2,681
* ఇతర శాఖలు: 4,300
వేటి ద్వారా భర్తీ?
* పోలీసు ఉద్యోగాలు రాష్ట్రస్థాయి పోలీసు నియామక సంస్థ ద్వారా జరుగుతాయి.
* విద్యుత్‌శాఖ ఉద్యోగాలను జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు భర్తీ చేస్తాయి.
* మిగిలిన ఖాళీల భర్తీ టీఎస్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా జరుగుతుంది. పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా పరీక్షల నిర్వహణ ఇతర అంశాలకు సీఎం సూత్రప్రాయ ఆమోదం తెలిపారు.
త్వరలో మరి కొన్నింటికి ఆమోదం..
మొదటిదశ ఆమోదించినవి కాకుండా వారం రోజుల్లో మరో 10,000 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలపనున్నారు. దీనికి సంబంధించిన జాబితా సిద్ధమవుతోంది. అది అందగానే సీఎం ఆమోదం తెలపనున్నారు.

Thursday 23 July 2015

తెలంగాణలో పెట్టుబడుల వెల్లువ!

* టీఎస్‌ఐపాస్ రెండో దశలో 19 కంపెనీలకు అనుమతిపత్రాలు
* స్వయంగా అందజేసిన సీఎం కేసీఆర్
* రాష్ర్టానికి 1087.37 కోట్ల పెట్టుబడులు
*  కొత్త కంపెనీలతో 5,321 మందికి ఉపాధి
* కంపెనీ ఏర్పాటుకు ముందుకువచ్చిన
* ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా సంస్థ కెమో 
* మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు
* పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. పారిశ్రామిక అనుమతుల్లో ఎలాంటి ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి కార్యాలయంలోని చేజింగ్‌సెల్ ఇన్‌చార్జి, ముఖ్యమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శి శాంతకుమారిని సంప్రదిస్తే పరిష్కరిస్తారని పేర్కొన్నారు. 
     తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌ను అమలులోకి తెచ్చిన తర్వాత రెండో దఫాగా మరో 19 కంపెనీల సీఎండీలు, సీఈవోలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వయంగా అనుమతి పత్రాలు అందజేశారు. కొత్తగా ఏర్పాటుచేయనున్న ఈ పరిశ్రమలతో రాష్ట్రానికి రూ.1087.37 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటిద్వారా 5,321 మందికి ఉపాధి కల్పించనున్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఈ కంపెనీలను నెలకొల్పనున్నారు. 
కొత్తగా నెలకొల్పనున్న కంపెనీల్లో హెలికాప్టర్ క్యాబిన్ కిట్ , సెల్‌ఫోన్, పాదరక్షల తయారీతోపాటు ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్ కంపెనీలు ఉన్నాయి. బుధవారం అనుమతి పత్రాలు పొందిన కంపెనీల్లో స్పెయిన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీ కెమో సైతం ఉండడం విశేషం. ఈ కార్యక్రమంలో పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, సీఎం అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చేజింగ్ సెల్ ఇన్‌చార్జి శాంతకుమారి, పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, పరిశ్రమలశాఖ కమిషనర్ మాణిక్‌రాజ్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డితోపాటు ఎస్‌ఆర్ బ్రహ్మాస్ అగ్రోప్రొడక్ట్స్ చైర్మన్ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డిసహా పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. టీఎస్‌ఐపాస్‌ను అమలులోకి తెచ్చిన తర్వాత తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. పారిశ్రామికవేత్తలకు అనుమతుల మంజూరులో ఎటువంటి జాప్యం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్ ప్రకటించిన రోజు పేర్కొన్న ప్రకారం దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో రికార్డు స్థాయిలో తొలిదశలో జూన్ 23న మొదటి దఫా కంపెనీలకు అనుమతిపత్రాలు మంజూరు చేశారు. అదేజోరును కొనసాగిస్తూ సరిగ్గా నెలతిరగకముందే మరో 19 కంపెనీలకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతిపత్రాలు అందజేయడం పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. (- నమస్తే తెలంగాణ)

Tuesday 21 July 2015

ఆధార్‌లేని ఓటు ఔట్

* నగరంలో 15 లక్షల బోగస్ ఓట్లు..
* ఏరివేతలో ఎన్నికల సంఘానికి సహకరిస్తాం
* రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌తో సమావేశం 
*  ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానిస్తాం
* అనుసంధానం లేకుంటే ఓటు హక్కు ఉండదు
* హైదరాబాద్‌లో ముందుగా అమలు.. 
* 15-20 రోజుల్లో పూర్తి చేస్తాం: సీఎం కేసీఆర్
     రాజధాని హైదరాబాద్‌లో ఆధార్ నంబరుతో అనుసంధానం కాని ఓటర్లకు ఓటు హక్కు ఉండదని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఓటరుకార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ముందుగా హైదరాబాద్‌లో అ కార్యక్రమం చేపట్టి 15 నుంచి 20 రోజుల్లో అనుసంధానం చేపడతామన్నారు.
ఒకటికి రెండుసార్లు అవకాశమిచ్చి ఆ తర్వాత అనుసంధానం చేయని ఓట్లు తొలగిస్తామని ఆయన చెప్పారు. 
       హైదరాబాద్ నగరంలో దాదాపు 15 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆయన వివరించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆధార్‌తో ఓటరు కార్డుల అనుసంధానంపై చర్చ జరిగింది. ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి అని భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రంలో పూర్తిగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బోగస్ ఓటర్లను ఏరివేయడానికి ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలకు సహకరిస్తామన్నారు. ముందు హైదరాబాద్‌లో, తరువాత రాష్ట్రమంతా ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్‌ను అనుసంధానం చేస్తామన్నారు. నగరంలో ఈ కార్యక్రమాన్ని 15 నుంచి20 రోజుల్లోనే వందశాతం పూర్తిచేస్తామని చెబుతూ.. హైదరాబాద్‌లో ఆధార్ నంబరుతో అనుసంధానం కాని ఓటర్లకు ఓటు హక్కు ఉండదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోనే అత్యధికంగా బోగస్ ఓటర్లు..
హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది బోగస్ ఓటర్లుండే అవకాశం ఉన్నందున, మొదట ఇక్కడే పని ప్రారంభించాలని సీఎం కోరారు. ఇక్కడే దాదాపు 15 లక్షల మందికి బోగస్ ఓటర్లున్నట్టు అంచనా ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం ప్రకారం జనాభాలో 66% ఓటర్లుండాల్సి ఉండగా.. హైదరాబాద్‌లో ఆ శాతం చాలా ఎక్కువగా ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజన జరగాల్సి ఉన్నందున, అంతకన్నా ముందే ఓటర్ల జాబితా రూపొందించాలని కోరారు. 
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలుండగా 24 హైదరాబాద్‌లోనే ఉన్నాయని, ఈ బోగస్ ఓట్లు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని అన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు. రాజకీయ పార్టీలుకూడా సహకరించాలని అభ్యర్థించారు. ఆధార్‌తో అనుసంధానంకాని వారికి ఒకటికి రెండుసార్లు విజ్ఞప్తి చేయాలని, అయినా అనుసంధానం చేసుకోకుంటే.. జాబితా నుంచి పేర్లు తొలగించాలని అన్నారు. సాధారణ ఎన్నికలకు, స్థానిక ఎన్నికలకు ఒకే ఓటరు జాబితా ఉండాలని సీఎం చెప్పారు. సమావేశంలో సీఎస్ రాజీవ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతికుమారిలు పాల్గొన్నారు. (-నమస్తే తెలంగాణ)


Monday 20 July 2015

గోల్కొండ బోనాలు ప్రారంభం

* రాష్ట్ర మంత్రులు నాయిని, పద్మారావు ప్రత్యేక పూజలు
తెలంగాణలో ఆషాఢమాస బోనాలు హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని గోల్కొండ కోటలో జులై 19న మొదలయ్యాయి. రాష్ట్రంలో జరిగే బోనాల ఉత్సవాల్లో గొల్కొండ బోనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడ బోనాలు ప్రారంభమైన తర్వాతే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, పాతబస్తీ.. ఆ తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో బోనాల పండుగను రాష్ట్రప్రభుత్వ పండుగగా ప్రకటించేందుకు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. కానీ గత ఏడాది తెలంగాణ ఏర్పాటైన వెంటనే కొలువుదీరిన కొత్త ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా ప్రకటించింది. బోనాల పండుగ అంటే కుటుంబ సుఖ సంతోషాలకు సంబంధించిన ఉత్సవం. బాగా వర్షాలు కురిసి సాగు, తాగునీరు లభించాలని.. తద్వారా పంటలు పండి ఐష్టెశ్వర్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతూ ప్రజలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. 
  గోల్కొండ కోటలోని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టీ పద్మారావుతో కలిసి తొలి బోనాల మొదటి పూజ నిర్వహించారు. మంత్రి పద్మారావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ఘనంగా బోనాల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సీఎం కే చంద్రశేఖర్‌రావు బోనాల నిర్వహణకు అవసరమైన నిధుల విడుదలకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టీ పద్మారావు మాట్లాడుతూ వర్షాలు పడి ప్రజలకు తాగు, సాగునీరు లభించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. 
    ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ అశోక్‌గౌడ్, బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ కోయల్‌కార్ గోవిందరాజ్, సభ్యులు ఎన్ చంద్రకాంత్, ఎన్ పల్లవి, జీ చంద్రశేఖర్, మాజీ చైర్మన్లు సత్యంరెడ్డి, విజయ్‌కుమార్, బాల ప్రసాద్ తివారీ, టీఆర్‌ఎస్ కార్వాన్ ఇన్‌చార్జి జీవన్‌సింగ్, నేతలు కావూరి వెంకటేశ్, చంద్రశేఖర్‌రెడ్డి, మైత్రి - శాంతి కమిటీల నాయకులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. (-నమస్తే తెలంగాణ)

Thursday 9 July 2015

మనసుకు ఇంధనం ఆత్మ విశ్వాసం

   ఒక చిన్న మెచ్చుకోలు ఎంతో నమ్మకాన్ని పెంచుతుంది..ఒక చిన్న ప్రోత్సాహపు మాట కొండంత ధైర్యాన్నిస్తుంది..ఈ నమ్మకం, ధైర్యాలే జీవితాన్ని మలుపు తిప్పే ఆత్మ విశ్వాసానికి కారణం కావచ్చు. ఆ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని అరచేతికి అందించనూవచ్చు.
      ఆత్మవిశ్వాసం లేదా ఆత్మాభిమానం అంటే మనం ఇతరుల పట్ల చూపించే ప్రేమ, అభిమానం, శ్రద్ధ, విలువ వంటివన్నీ కూడా మనకి మనం చేసుకోవడం. మన గురించిన మన అభిప్రాయం సమయానుసారం మారుతుంటుంది. ఆత్మవిశ్వాసం అనేది జీవితకాలమంతా ఒకే విధంగా ఉండదు. పరిస్థితులను అనుసరించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిచుకోవచ్చు. 
     మనలో ఆత్మ విశ్వాసం పెరగడానికి దోహదం చేసే అంశాలు ఎన్నో ఉంటాయి. కానీ రెండు విషయాలు ముఖ్యమైనవి. మనలను ఇతరు అంచనా వేసే విధానం, మనలను మనం అంచనా వేసుకునే విధానం తల్లిదండ్రులు, టీచర్లు, ఇతర పెద్దవారి ప్రవర్తన మనలోని ఆత్మ విశ్వాసం పెంపొందించుకోవడానికి దోహదం చేస్తుంది. 
     ఇది చిన్న పిల్లలుగా ఉన్నపుడు మరింత ఎక్కువ ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రులు పిల్లల పనులను మెచ్చుకోవడం కంటే విమర్షించడమే ఎక్కువగా ఉన్నపుడు వారు ఆత్మవిశ్వాసంతో పెరగడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే టీనేజ్‌లోనే జీవితం పట్ల సొంత అభిప్రాయాలు, విలువలు ఏర్పరుచుకొవడం మొదలవుతుంది. పిల్లలు పెద్దలు చెప్పిన దాన్ని వారి ప్రవర్తనను గమనించే వారి అభిప్రాయాలను విలువలను ఏర్పరుచుకుంటారు. ఎక్కువగా ఊహించడం లేదా కలల్లో బతకడం కూడా కొంత మందిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడానికి కారణమవుతుంది. తమ సామర్థ్యం ఎంత(లేదా తాము భవిష్యత్తులో ఏం కావాలి) అనే దాని గురించి ప్రతి ఒక్కరికి ఒక అంచనా ఉంటుంది. ప్రతి ఒక్కరు తమకు ఆదర్శంగా ఎవరో ఒకరిని తీసుకుంటారు. ఉదాహరణకు కొంత మందికి క్రీఢాకారులు స్ఫూర్తినిస్తే కొంత మందికి అకడమిక్‌గా మెరుగ్గా ఉన్నవారిని చూసి స్ఫూర్తిని పొందుతారు. 
    సాధారణంగా తమలో ఏ సామర్థ్యం ఉందని భావిస్తారో అలాంటి సామర్థ్యాలున్న వారినే తమకు ఆదర్శంగా తీసుకుంటారు. ఉదాహరణకు చాలా త్వరగా స్నేహితులతో కలిసిపోవడం అనేది ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి దోహదం చేస్తుంది. వారిలో లేని సామర్థ్యాలు కలిగిన వారిని ఆరాధించే వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంటుంది. అయితే దురదృష్ట వశాత్తు ఆత్మ న్యూనత తో బాధపడే వారందరిలోనూ సామర్థ్యానికి ఎలాంటి లోటు ఉండదు. కానీ అది వారిని వారు సరిగ్గా అంచనా వేసుకోలేక పోవడం వల్ల వస్తుంది సమస్యంతా.
ఆత్మ విశ్వాసం పెంపొందించుకునే మార్గాలు
* వ్యతిరేక భావనలను గుర్తించాలి - మీలో ఆత్మ విశ్వాసం సన్నగిల్లేందుకు కారణమైన విషయాలను, సందర్భాలను, భావనలను గుర్తించాలి. అందువల్ల మీలో ఉన్న వ్యతిరేక భావనలను మీరే గుర్తించగలుగుతారు. ఉదాహరణకు మీరు ఒక పరీక్ష రాయలేకపోయారు (వ్యతిరేక ప్రవర్తన)అందుకు కారణం మీరు పరీక్ష కొరకు సరిగ్గా సిద్ధం కాలేదు (వ్యతిరేక నమ్మకం) అందువల్ల మీరు పరీక్ష తప్పే అవకాశం ఉంటుంది (వ్యతిరేక భావన) దీనంతటికి అంతరాలలో మీలో అంత సామర్థ్య లేదన్న (వ్యతిరేక)నమ్మకం. లేదా ఏదో పార్టీలో ఎక్కువగా తాగుతారు (వ్యతిరేక ప్రవర్తన) అది మీరు అందంగా లేకపోవడం వల్ల మీతో ఎవరు మాట్లడరేమో అనే ఆందోళనను దూరం చేసుకోవడానికి (భావన) 
* మీలోని వ్యతిరేక భావనలను సవాలు చెయ్యాలి - మనలను మనం ఉన్నదున్నట్టుగా అంగీకరిస్తామని అనుకుంటాము కానీ మనం అది నిజం కాదు. మీరు మీలోని వ్యతిరేక భావనలను గుర్తించి వాటిని లాజికల్‌గా విశ్లేషించుకొని అది నిజమేనా అని ఒకసారి ఆలోచించాలి. దానికి వ్యతిరేకంగా గట్టి ఆధారాలను వెతకాలి. ఉదాహారణకు మీరు మీకు తెలివైన వారిగా అనిపించడం లేదు, కానీ మీరు మీ పరీక్షలన్నీ కూడా పాసైపోయారు, క్లాస్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మీరు తెలివైన వారుగా మీకు అనిపించిన అన్ని సందర్భాలను గుర్తు చేసుకోవాలి. 
మీతో మీరు అనుకూలంగా మాట్లాడుకోవాలి - మీతో మీరు వ్యతిరేకంగా మాట్లాడుకోవడం వల్ల ఆత్మ విశ్వాసానికి చాలా నష్టం వాటిల్లుతుంది. మిమ్మల్ని మీరు విమర్శించుకోవాల్సి వచ్చినపుడు ఎవరైనా స్నేహితుడు తప్పుచేసినపుడు ఎలా విమర్శిస్తామో అలా మాట్లాడుకోవాలి. మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి, మీ పట్ల మీరు కరుణతో అనుకూల ధోరణితో వ్యవహరించాలి. ఎదుటి వారు మెచ్చుకునే మెచ్చుకోళ్లను ఆనందంగా స్వీకరించాలి. మీలో ఉన్న మంచి లక్షణాలను గర్తించి వాటిని తలచుకొని గర్వించాలి.
* ఇతరులతో పోల్చుకోవద్దు - ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లడమే కాదు జీవితంలో సంతోషం కూడా మిగలదు. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం కాకుండా ఇతరులను నిశితంగా గమనిస్తుండాలి. మీలోని ఉన్న మంచి లక్షణాల మీద దృష్టి నిలపాలి. మీలో లేని వాటి గురించి పెద్దగా పట్టించుకోకూడదు. గతంలో మిమ్మల్ని ప్రస్తుతపు మీతో పోల్చుకొని ఎంత మెరుగ్గా ఆలోచించగలుగుతున్నారు, పనులు ఎంత సమర్థవంతంగా పూర్తి చెయ్యగలుగుతున్నారు అన్న దాని మీద దృష్టి నిలపాలి. ఇది మీలో ఆత్మవిశ్వాసం నింపుకోవడానికి దోహదం చేస్తుంది.
* పూర్తి చెయ్యడం మీద దృష్టి నిలపాలి - పనులన్నీ పర్‌ఫెక్ట్‌గా చెయ్యడం గురించి కాకుండా పూర్తి చెయ్యడం మీద దృష్టి నిలపాలి. పర్‌ఫెక్ట్‌గా చెయ్యాలన్న ఆలోచనతో అసలు పనులు ప్రారంభించనే ప్రారంభించరు కొందరు. ఉదాహారణకు 10 కిలోల బరువు తగ్గితే తప్ప నేను ఆడలేను అనుకంటారు. అలా కాకుండా వీలైనంత వరకు ఆడుతుండాలి. 
అపజయాలన్ని విజయానికి సోపానాలు - తప్పులు చెయ్యడం, అపజయాలు ఎదురవడం అనేది సాధారణ విషయం అని అనుకోవాలి. అపజయాలు, తప్పులు నేర్చుకోవడంలో భాగం. చేసిన తప్పులు మరోసారి జరగకుండా చూసుకోవడం ముఖ్యం. తప్పులు చెయ్యడం మీ సామర్థ్యానికి ప్రతీకగా భావించకూడదు. నేను వెయ్యిసార్లు అపజయం పాలైనట్టుగా అనిపించలేదు నాకు కానీ అపజయాలకు వెయ్యి మార్గాలున్నాయని తెలుసుకున్నాను. అనే ఎడిసన్ మాటను ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు. మీరు ఆపని చెయ్యడానికి ఎంత అంకితభావంతో కృషి చేశారనే దాన్ని గుర్తుపెట్టుకోండి. 
* కొత్త పనులు ప్రయత్నించండి - రకరకాల కొత్త పనులు చెయ్యడానికి ప్రయత్నించండి. అందువల్ల మీలో దాగి ఉన్న సామర్థ్యాలు బయటపడుతాయి. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. 
* మీలో మార్చుకోవాల్సిన వాటిని గుర్తించండి - మీలో మీరు మార్చుకోగలిగి మార్చుకోవాల్సిన అంశాలను గుర్తించి మార్చుకునేందుకు ప్రయత్నిస్తే మంచిది. మార్పును ఆహ్వానించడం ఈరోజే మొదలు పెట్టండి. మీలో మార్చుకోలేని విషయాల (ఎత్తు, అందం వంటివి) గురించి పెద్దగా పట్టించుకోకూడదు. 
* లక్ష్యాలను నిర్ణయించుకోవడం - మీరు సాధించాల్సిన లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. స్పష్టంగా కనిపించే, సాధించగలిగే లక్ష్యాలను నిర్దేషించుకోవాలి. మీరు ఎంత వరకు మీ లక్ష్యానికి చేరువగా వచ్చారు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించి చూసుకోవడం ద్వారా జరుగుతున్న ప్రగతి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. 
* మీ అభిప్రాయాలను అవసరమున్న చోట తెలియజేయడానికి వెనుకాడకూడదు. 
* మీ వంతు సాయం అందించండి - మీ కష్టంలో ఉన్న మీ తోటి వారికి సాయం చెయ్యండి. ఒక మంచి కారణం కోసం పరుగెడుతున్న వారితో కలిసి పాలుపంచుకోండి, ఏదైనా సామాజిక సేవా కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనండి. 
వ్యాయామం- వ్యాయామం చెయ్యడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం కూడా పెంపొందుతుంది. నేను ఇంకా కొంచెం సన్నగా ఉండి ఉంటే నాకు ఎక్కువ మంది స్నేహితులుండి ఉండేవారు వంటి ఆలోచన ఎప్పుడూ చెయ్యకూడదు. మీకు నచ్చిన వారితో సమయం గడపండి, మీకు నచ్చిన పనులు చేస్తూ ఆనందించండి మీరు చేసే ప్రతి పనిలోనూ మీ ఆత్మవిశ్వాసం తన వంతు పాత్ర పోషిస్తుంది. ఆత్మవిశ్వాసంతో మసలే వారు స్కూల్‌లోనూ, పనిచేసే చోట చాలా సమర్థవంతంగా ఉంటారు. అంతేకాదు చాలా త్వరగా మనుషులతో కలిసిపోతారు, కొత్త స్నేహితులను చేసుకోగలుగుతారు. వారి మానవసంబంధాలు కూడా సమర్థవంతంగా ఉంటాయి. చాలా త్వరగా తప్పులను తెలుసుకోగలుగుతారు, అసంతృప్తులను, అపజయాలను అధిగమించగలుగుతారు. వారు విజయం సాధించే వరకు ఏ పనిని వదిలిపెట్టరు. 
   ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవడం కొద్దిగా కష్టం కావచ్చు. కానీ ఒక్కసారి దాన్ని సాధిస్తే జీవితాన్ని ఆనందంగా గడపడం సాధ్యపడుతుంది. కొన్ని సార్లు చాలా లోతుగా మనసు గాయపడినపుడు ఆత్మవిశ్వాసం కోల్పోవడం సాధారణమే. అలాంటి సందర్భాలలో నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది.

Monday 29 June 2015

'తెలంగాణ' హరిత మణిహారం!

పొగలు కమ్మేస్తున్న పరిసరాలు.. దుమ్మురేపుతున్న రోడ్లు.. హరితవనాల్లాంటి ఊర్లు కాంక్రీట్ జంగల్స్‌గా.. బూడిద దూళితో సహవాసం చేస్తున్నాయి.. దీన్నిలా వదిలేస్తే.. వానలు వెనకడుగువేస్తాయి. పంటలు కంటనీరు పెడతాయి! రండి.. తెలంగాణ మణిహారం.. హరితహారంలో భాగస్వాములమవుదాం.. గొప్ప సంకల్పానికి సహకారమందించి హరిత తెలంగాణ ను నిర్మించుకుందాం. మొక్కలు నాటడాన్ని రెస్పాన్సిబుల్.. ప్యాషన్.. ట్రెండ్‌గా మార్చుకొని తెలంగాణను గ్రీన్ కవర్‌గా మార్చేద్దాం! 
తెలంగాణకు నిలిచి.. కురిసే వానలు వాపస్ రావాలె. ఊర్లల్ల ఉంటున్న కోతులు అడవికి వాపస్ పోవాలె నినాదంతో హరితహారాన్ని సాకారం చేసేందుకు నడుంబిగించారు సీఎం కేసీఆర్. పచ్చదనమే పుడమికి అందం.. చెట్లతోనే జీవకోటి మనుగడ సాధ్యం అనేది ఈ ప్రాజెక్ట్ ఫార్ములా. మూడేళ్లలో రాష్ట్రమంతటా 230 కోట్ల మొక్కలు నాటి తెలంగాణకు హరితహారాన్ని అలంకరిస్తారు. జులై 3వ తేదీన యాదాద్రి నుంచి 10వ తేదీ వరకు హరితహారం వారోత్సవాలు పేరిట అన్ని జిల్లాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ బాధ్యతను మనపై వేసుకుని కేసీఆర్ మానస పుత్రిక హరితహారాన్ని సక్సెస్ చేయాల్సింది మనమే! అందుకే ఇప్పుడెక్కడ చూసినా.. విద్యార్థులు.. అధికారులు.. ప్రజాప్రతినిధులు ఈ తెలంగాణకు హారాన్ని అలంకరించే పనిలో బిజీగా ఉన్నారు. 
సంస్కృతిగా..
పర్యావరణ పరిరక్షణ ఓ సంస్కృతిగా మారాలి. తెలంగాణ మొత్తం హరితహారం కావాలి. పారిశ్రామిక అనివార్యమైన పరిస్థితుల్లో ప్రకృతిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. వర్షాభావ పరిస్థితులకు.. కరువు కాటకాలకు అడవి లేకపోవడమే కారణం కాబట్టి.. ఈ స్పృహ, అవగాహన ప్రజల్లో రావాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వ.. ప్రైవేటు సంస్థల్లో హరితహారం ప్రోగ్రామ్సే ఎక్కువగా జరుగుతున్నాయి. స్కూల్స్.. కాలేజెస్‌లో ఇప్పటివరకు విద్యా సంవత్సరం ప్రారంభంలో వెల్‌కమ్ పార్టీస్.. ఫ్రెషర్స్ పార్టీస్ మాత్రమే చూశాం. కానీ గత వారం రోజులుగా ఏ కాలేజ్‌లో.. స్కూళ్లో చూసినా గ్రీన్ కవర్ ప్రోగ్రామ్స్ గ్రాండ్‌గా జరుగుతున్నాయి. హరితహారాన్ని ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ కల్చర్‌గా తీసుకెళ్లాలనే ప్రభుత్వ ఆలోచనలో మేముసైతం అంటూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాం అని చెప్పారు జాగృతి ఇంజినీరింగ్ కాలేజ్ సెక్రెటరీ ఎస్.వెంకటేశ్వర్లు. మొక్కల ఆవశ్యకత గురించి చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం. నర్సరీ స్టేజ్‌లో తెలియాల్సింది ఎంబీఏ చదివే స్టేజ్‌లో తెలిసింది. అయినా చెట్లే మానవ మనుగడకు మూలం అని తెలుసుకుని కాలేజ్‌లో.. ఇంటివద్దా ఈ యాక్టివిటీస్‌లో ముందుంటున్నాం అని పేర్కొన్నారు శ్రీఇందు ఇంజినీరింగ్ కాలేజ్ ఎంబీఏ స్టూడెంట్ రాఘవేంద్ర సాయి. 
పూలబాటగా..
బంగారు తెలంగాణకు హరితహారం పూలబాట. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌హౌజ్ గ్యాసెస్ తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. అనేక దేశాల్లో ఈ కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు పెడుతున్నాయి. భూగోళంపై ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో గ్రీన్ కవర్ కార్యక్రమాలు చేపడుతున్నారు. హరితహారం కూడా అలాంటిదే. ఇకపై మనం హరితం.. శివం.. సుందరం అని స్మరించుకోవాలి అనేది ప్రభుత్వ ఆశయం. పోయిన అడవులకు పూర్వ వైభవం తీసుకురావడమే ఈ పథకం ఉద్దేశం. ఉపాధిహామీతో అనుసంధానం చేసి తో ఈ పథకం నడుస్తుంది. ఈ ఏడాది ప్రతీ నియోజకవర్గానికి 20లక్షలు.. ప్రతి గ్రామానికి 40వేల మొక్కలు నాటి బంగారు తెలంగాణకు పూలబాట వేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది అని చెప్పారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనిత. చైనా ప్రజలు గోబీ ఎడారి విస్తరించకుండా వందల కోట్ల మొక్కలు నాటారు. గోబీ ఎడారిని స్ఫూర్తిగానే మన ముఖ్యమంత్రి హరితహారానికి అంకురార్పణ చేశారు. చెట్లు పెంచితే వర్షాలు పడుతాయి. చెరువులు నిండుతాయి. పంటలు పండుతాయి అని పర్యావరణవేత్త పుట్టపాక రామారావు వివరించారు. 
సైనికుల్లాగా..
సైనికుల్లా పనిచేసే సామాజిక కార్యకర్తలు, విద్యార్థులే రితహారం విజయవంతం కావడంలో క్రియాశీలక పాత్ర పోషించాలి. పిల్లల భవిష్యత్ కోసం హరితహారం సైనికులు కవాతుల్లా తరలిరావాలని కోరుకుందాం. 
    బడుల్లో మాకు.. గుడుల్లో పూజారులు.. మసీదులో ముల్లాలు.. చర్చీల్లో పాస్టర్‌లకు కూడా ఈ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ఉద్యమం కూడా పిడికెడు మందితోనే స్టార్ట్ అయి కోట్లాది ప్రజల భాగస్వాములై ఉవ్వెత్తున్న తీసుకెళ్లాం. తెలంగాణకు హరితహారం కూడా ఓ ఉద్యమంలాంటిదే. ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మానవ సంబంధ కార్యక్రమం అని అన్నారు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌గౌడ్. ఇన్ని కోట్ల మొక్కలు నాటడం దేశంలో ఇదే మొదటిసారి. ప్రపంచ భూభాగంలో 33శాతం గ్రీనరీ ఉంటేనే ప్రజలు సురిక్షితంగా ఉంటారని ప్రపంచ దేశాల సదస్సుల్లో చాలాసార్లు ప్రముఖులు ప్రసంగించిన దాఖలాలున్నాయి. కాబట్టి అటువంటి ప్రతిష్టాత్మకమైన బాధ్యతను మనపై వేసుకున్నందకు ఆరోగ్యంగా.. ప్రశాంతంగా.. సుభిక్షంగా ఉంటామని చెప్పవచ్చు అని వివరించారు రెవెన్యూ అధికారి లింగం.
ఆకుపచ్చగా
తెలంగాణను ఆకుపచ్చగా మార్చేందుకే హరితహారం. దీనిలో భాగంగా రాష్ట్రంలోని 4213 నర్సరీల్లో 40కోట్ల మొక్కలు ఈ సంవత్సరం నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొక్కలు నాటడంతో సరిపెట్టుకోకుండా అవి పెరగడానికి అవసరమైన సంరక్షణ చర్యలు కూడా తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీలా కాకుండా రెస్పాన్సిబుల్‌గా తీసుకున్నాం అని వివరించారు రంగారెడ్డిజిల్లా సోషల్ ఫారెస్ట్ ఇబ్రహీంపట్నం రేంజ్ ప్రతినిధి వెంకట్రామమ్మ. ప్రభుత్వ దిశా నిర్దేశాల మేరకు నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు జులై 3వ తేదీ నుంచి మొక్కల్ని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. హరితవనాల రోజులొస్త్తాయి అన్నారు నర్సరీ పర్యవేక్షకుడు బి.శ్రీనివాస్‌రెడ్డి. 

Saturday 20 June 2015

మన నీళ్లపై మనకు స్వేచ్ఛ..

*  కృష్ణాజలాల్లో మన వాటా 299 టీఎంసీలు
* ఎక్కడైనా ఉపయోగించుకునే హక్కు.. 
* ఇప్పటికి బచావత్ కేటాయింపులే!
* ఏడాది కాలానికి కుదిరిన ఒప్పందం
*  రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేక కమిటీ
* కృష్ణా బోర్డు సమావేశంలో నిర్ణయాలు
* ఇది చారిత్రక విజయం: విద్యాసాగర్‌రావు
కృష్ణా నదీ జలాల్లో మన రాష్ర్టానికి కేటాయించిన నీటిని ఏ విధంగా వినియోగించుకోవాలన్నదానిపై మనకు పూర్తి స్వేచ్ఛ లభించింది. కృష్ణా నది బేసిన్‌లో మనకు లభించిన వాటా మేరకు మనం నీటిని ఏ ప్రాజెక్టు నుంచైనా పొందడానికి, వినియోగించుకోడానికి పూర్తి అధికారం లభించింది. గత సంవత్సరం పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పెట్టిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం అలాంటి ఇబ్బంది తలెత్తకూడదని ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన బోర్డు సమావేశంలో మనం పెట్టిన ప్రతిపాదన చివరకు నిర్ణయంగా మారింది. ఈ ప్రకారం నీటి లభ్యత ఉన్నట్లయితే ఎక్కడి నుంచైనా మనం మనకు దక్కిన నీటిని వినియోగించుకునే అవకాశం లభించింది.
దీంతో ఇప్పటికి బచావత్ కేటాయింపులే అమల్లో ఉంటాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని, మినిట్స్‌ను బోర్డు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు అందజేస్తుంది. అక్కడినుంచి ప్రత్యేకమైన నోట్‌తో పాటు ఈ ఒప్పందం రెండు రాష్ర్టాలకూ చేరుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం తర్వాత కేంద్రం నుంచి వచ్చే ఆదేశం మేరకు బోర్డు వీటిని రెండు రాష్ర్టాలకు మళ్ళీ పంపుతుంది. అప్పటినుంచి ఇది అమలులోకి వస్తుంది.
చారిత్రక విజయం
రెండు రాష్ర్టాలకు చేసిన కేటాయింపు మేరకు ఆ నీటిని వాటి ఇష్టప్రకారం వినియోగించుకునే స్వేచ్ఛ లభించడం ఈ సమావేశం సాధించిన చారిత్రక విజయం. గతంలో ఉన్న విధానం ప్రకారం ఆయా రాష్ర్టాలకు ప్రాజెక్టులవారీగా చేసిన కేటాయింపులను మాత్రమే వినియోగించుకోవాలని, ఇష్టప్రకారం తరలించడం, ఇతర ప్రాజెక్టుల పరిధిలో వినియోగించడం సాధ్యం కానందువల్ల తెలంగాణ చాలా నష్టపోతున్నది. ముఖ్యంగా చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు లభించిన నీటి కేటాయింపులను ఇష్టప్రకారం, అవసరాలకు అనుగుణంగా ఎక్కడైనా వాడుకునే స్వేచ్ఛ లభించడం చాలా పెద్ద విజయమని నీటిపారుదల నిపుణులు హర్షం ప్రకటిస్తున్నారు.
కీలక అంశాల్లో ఏకాభిప్రాయం
కృష్ణా నది నిర్వహణ బోర్డు అదనపు కార్యదర్శి అమర్జీత్ సింగ్ అధ్యక్షతన ఇరు రాష్ర్టాల సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శులు, ఇంజినీర్లు, తెలంగాణ రాష్ట్ర సాగునీటి సలహాదారు విద్యాసాగర్‌రావు హాజరైన ఈ సమావేశం రెండు రోజుల పాటు జరిగింది. అనేక అంశాలపై చర్చలు జరిగిన అనంతరం రెండు రాష్ర్టాల మధ్య కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం వచ్చింది. ఈ మేరకు ఒక అవగాహనా ఒప్పందం కూడా కుదిరింది. దీని ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగా మొత్తం 811 టీఎంసీల కృష్ణా నికర జలాల్లో మనకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీల నీటి వాటా కేటాయించి ఉండగా.. మనకు కేటాయించబడిన నీటిని ఏ విధంగానైనా మనం వాడుకునే అవకాశం లభించింది. రానున్న ఏడాదికి మాత్రమే ఈ ఒప్పందం వర్తిస్తుంది. ఈ ప్రకారం నీటి లభ్యత ఉన్నట్లయితే ఎక్కడి నుంచైనా ఈ నీటిని పొందవచ్చు. అదే సమయంలో ఇతర రాష్ర్టాల హక్కులకు కూడా భంగం కలగని రీతిలో వ్యవహరించాల్సి ఉంటుంది.
* ఉదాహరణకు మనకు నెట్టెంపాటు, బీమా ప్రాజెక్టులకు గతంలో నీటి కేటాయింపులు ఉన్నాయి. కానీ ఈ ప్రాజెక్టులు ఇంకా పూర్తికానందువల్ల ఈ నీటిని మరో ప్రాంతానికి తరలించి వినియోగించుకునే అవకాశం ఇన్నాళ్ళూ లేదు. కానీ ఇప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ రెండు ప్రాజెక్టుల కింద లభ్యమయ్యే 30 టీఎంసీల నీటిని మన రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా తరలించుకుని వినియోగించుకునే వీలు కలిగింది. 
మరికొన్ని ముఖ్య నిర్ణయాలు
- విద్యుత్ ఉత్పత్తికోసం శ్రీశైలం డ్యామ్‌ను మనం వినియోగించుకుంటున్నాం కాబట్టి ఇక్కడి నుంచి చెన్నై నగరానికి తాగునీటి అవసరాల నిమిత్తం సరఫరా చేస్తున్న 5 టీఎంసీలు, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ (ఎస్సార్బీసీ)కి సరఫరా చేస్తున్న 19 టీఎంసీల నీటికి ఇబ్బంది కలగకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చు. 
- రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కింద తుంగభద్ర జలాలు మనకు దీర్ఘకాలంనుంచి రావడంలేదు కాబట్టి కేసీ కెనాల్ దగ్గర గేట్లు బద్దలు కొట్టే లాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కృష్ణా బోర్డు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. ఒకవేళ నికర జలాల్లో హెచ్చు తగ్గులు ఏర్పడినట్లయితే ప్రస్తుతం అమలవుతున్న నిష్పత్తి (512:299) లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వినియోగించుకోవాల్సి ఉంటుంది.
- రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడంకోసం ఇరు రాష్ర్టాల తరఫున ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు, బోర్డునుంచి చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారి ఒకరు సభ్యులుగా ఉండే వర్కింగ్ మేనేజ్‌మెంట్ కమిటీ పర్యవేక్షణ, సమీక్ష జరుపుతుంది. ప్రతి వారం లేదా పదిహేను రోజులకు ఒకసారి రెండు రాష్ర్టాల నుంచి నీటి అవసరాలకు సంబంధించి ఇండెంట్‌ను తీసుకుని నీటిని కేటాయించడం, విడుదల చేయడం తదితరాలను పర్యవేక్షిస్తుంది. ఏ రాష్ట్రం ఎంత మేర నీటిని వినియోగించుకున్నదనే వివరాలను బోర్డు నిర్వహిస్తుంది. 
- ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలేవీ కూడా ట్రిబ్యునల్ వెలువరించిన ఉత్తర్వులకు, వివిధ సందర్భాల్లో న్యాయస్థానాలు వెలువరించిన అభిప్రాయాలకు విరుద్ధంగా లేనందువల్ల ఏడాదికోసం కుదిరిన ఈ ఒప్పందాన్ని రెండు రాష్ర్టాలూ ఆరోగ్యకరమైన తీరులో అమలు చేయాలని, ఘర్షణకు తావులేని విధంగా వ్యవహరించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం జరిగింది. గత సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టులో మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేయడం మాత్రమే కాకుండా ఇబ్బంది పెట్టినందున ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఆంక్షలూ ఉండరాదని నిర్ణయం జరిగింది. అయితే చెన్నై, ఎస్సార్బీసీలకు చేసిన కేటాయింపులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కూడా ఏకాభిప్రాయం కుదిరింది. 
తెలంగాణకు మేలు చేసే నిర్ణయం: విద్యాసాగర్‌రావు
రెండు రాష్ర్టాల మధ్య ఘర్షణలను నివారించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు కృష్ణా నదీ నిర్వహణ బోర్డు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, రెండు రోజుల చర్చల అనంతరం చాలా మంచి నిర్ణయం జరిగిందని, ఇది తెలంగాణకు చాలా మేలు చేస్తుందని సాగునీటిపారుదల సలహాదారు విద్యాసాగర్‌రావు నమస్తే తెలంగాణతో అన్నారు. కొన్ని అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ చివరకు ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు.
            గత సంవత్సరం విద్యుత్ ఉత్పత్తితో పాటు నీటి వినియోగంలో రెండు రాష్ర్టాల మధ్య సమస్యలు ఏర్పడి వివాదంగా మారినప్పుడు గవర్నర్ ద్వారా పరిష్కారం కుదిరిందని, ఈసారి అలాంటి పరిస్థితులు చోటుచేసుకోకముందే బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నిర్ణయం చేసిందని గుర్తు చేశారు. రెండు రాష్ర్టాలూ నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ఇతర రాష్ర్టాల హక్కులకు భంగం కలగని రీతిలో నీటి వినియోగంకోసం చర్చించి ఏకాభిప్రాయానికి రావడం ఒక సంవత్సరం పాటు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండే పరిస్థితికి శ్రీకారం చుట్టినట్లయిందని అన్నారు. 
       ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫున విద్యాసాగర్‌రావుతో పాటు ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, నీటిపారుదల లీగల్ వ్యవహారాల నిపుణులు విద్యాసాగర్, చీఫ్ ఇంజినీర్ నాగేంద్ర పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఇంజినీర్-ఇన్-చీఫ్ వెంకటేశ్వర్లు, బోర్డు సభ్యుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పాల్గొన్నారు.
- నమస్తే తెలంగాణ.

Monday 15 June 2015

665 ఎస్టీ పోస్టుల భర్తీకి మెగా నోటిఫికేషన్

సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా 665 ఎస్టీ పోస్టుల భర్తీకి యాజమాన్యం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. గతంలో 175 పోస్టులకే పరిమితమైన పోస్టులను అధనంగా మరో 490కి పెంచి తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో కోల్‌బెల్టులోని గిరిజన నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
   పెద్ద ఎత్తున ఎస్టీ పోస్టుల భర్తీ కోసం సింగరేణిలో జారీ అయిన నోటిఫికేషన్‌లో ఇదే ప్రథమంగా చెప్పవచ్చు. 665 బదిలీ వర్కర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌లో ఈ ఏడాది జూన్ ఒకటి నాటికి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సుకలిగిన ఎస్టీ అభ్యర్థులు అర్హులు. కనీస విద్యార్హత ఎస్‌ఎస్‌సీ. తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ఏరియాలకు చెందిన ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు. జూన్ 25 లోపు తమ దరఖాస్తులను సింగరేణి వెబ్‌సైట్ www.scclmines.com వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధారిత డాక్యుమెంట్లతో ప్రింట్‌అవుట్ ధరఖాస్తులను జూన్ 30 లోపు సింగరేణి ప్రధాన కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. 
   రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 80 శాతం పోస్టులు కోల్‌బెల్టు ప్రాంతంలోని షెడ్యూల్డ్ ఏరియాలో నివసించే గిరిజనులకు రిజర్వు అవుతాయి. మిగతా 20 శాతం పోస్టులు తెలంగాణ రాష్ట్రంలోని మిగతా ఆరు జిల్లాల ఎస్టీ అభ్యర్థులకు వర్తిస్తాయి.

Saturday 13 June 2015

‘అవినీతికి తావులేకుండా పరిశ్రమలకు అనుమతులు’

రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐ-పాస్)కు శ్రీకారం చుట్టింది. ఈమేరకు ఇవాళ నగరంలోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గీతాలాపన అనంతరం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి టీఎస్ ఐపాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో సీఎం కేసీఆర్ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. అప్లికేషన్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, దాదాపు 2 వేల 5 వందల మంది పారిశ్రామిక వేత్తలు, 250 కంపెనీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. బ్రిటన్, అమెరికా, టర్కీ, మలేషియాకు చెందిన రాయబారులు హాజరయ్యారు. బీహెచ్‌ఈఎల్, మిథాని, బీడీఎల్, ఆర్థిక సంస్థల ప్రతినిధులు విచ్చేశారు. 
          టీఎస్ ఐపాస్ రూపకల్పనలో ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో ఇప్పటికే 1 లక్షా 60 వేల ఎకరాల భూమిని సిద్ధంగా ఉంచింది. నూతన పారిశ్రామిక విధానం అమలులోకి రావడంతో ఇకపై పరిశ్రమల స్థాపన కోసం పెట్టుబడి దారులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధానం ప్రకారం ప్రభుత్వం రెండు వారాల్లోగా పరిశ్రమలకు అనుమతి ఇవ్వనుంది. ప్లగ్ అండ్ ప్లే పద్ధతిన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయనున్నారు. 
సీఎం ప్రసంగంలోని ప్రధానాంశాలు:
- పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం లక్షా 60 వేల ఎకరాల భూమిని సిద్ధంగా ఉంచింది
- కోరుకున్న చోట పరిశ్రమలకు కావాల్సినంత భూమి ఇస్తాం
- ఆన్‌లైన్‌లో పరిశ్రమల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
- దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోగా అనుమతులు మంజూరు
- జాప్యం చేస్తే సంబంధిత అధికారికి రూ.1000 జరిమానా వేస్తాం
- సీఎం కార్యాలయంలో చేజింగ్ సెల్ ఏర్పాటు
- పరిశ్రమల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
- అన్ని పరిశ్రమల ఏర్పాటుకు 24 గంటలపాటు విద్యుత్ సరఫరా
- వాటర్‌గ్రిడ్ పైపులైన్ల ద్వారా పరిశ్రమలకు చాలినంత మంచినీటి సరఫరా
- వంద శాతం అవినీతి రహితంగా (కరప్షన్ ఫ్రీ) అనుమతులు మంజూరు
- సెల్ఫ్ సర్టిఫికెట్‌కు ప్రాధాన్యం
- పరిశ్రమల అనుమతులకు పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తాం
- రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల పెట్టుబడులకు ఐటీసీ ముందుకు వచ్చింది
- పరిశ్రమలకు తగిన రక్షణ కల్పిస్తాం
- హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూల ప్రాంతం
- హైదరాబాద్‌లో భద్రతను పెంచాం
- లక్షా 50 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం
- మహిళల కోసం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశాం

Friday 12 June 2015

మొబైల్స్.. మేడిన్ తెలంగాణ

* పరిశ్రమల స్థాపనకు పలు సంస్థల ఆసక్తి
* సీఎంను కలిసిన తైవాన్ సంస్థ
* పరిశ్రమ స్థాపనపై పరిశీలిస్తామన్న ఫాక్స్‌కాన్ 
* 500 కోట్లతో సెల్‌కాన్ ఉత్పత్తి కేంద్రం
* 200 కోట్లతో మైక్రోమ్యాక్స్ ప్రాజెక్టుపై నేడు ప్రకటన?
* మొబైల్ క్లస్టర్‌లో 2 లక్షల ఉద్యోగాలు: సీఎం
  హైదరాబాద్ నగరం మొబైల్ ఫోన్లకు ప్రధాన కేంద్రంగా మారనున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న మొబైల్ క్లస్టర్ పట్ల సెల్‌ఫోన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రముఖ మొబైల్ ఫోన్లు, విడిభాగాల తయారీ సంస్థలు హైదరాబాద్‌లో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఫార్మా, ఐటీ హబ్‌గా వెలుగొందుతున్న రాష్ట్రం ఇక మొబైల్ ఉత్పత్తి కేంద్రంగా మారనున్నది. హైదరాబాద్‌లో ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించనున్నామని వీడియోకాన్ సంస్థ ఇదివరకే ప్రకటించగా, తాజాగా మైక్రోమ్యాక్స్, సెల్‌కాన్ సంస్థలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చాయి. 
* మరోవైపు ఆపిల్ వంటి ప్రముఖ మొబైల్ కంపెనీలకు విడిభాగాలు సరఫరా చేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను క్యాంప్ కార్యాలయంలో కలుసుకొని పరిశ్రమ స్థాపనపై చర్చించింది. సంస్థ ప్రెసిడెంట్ కాల్విన్ ఛిన్, ఎఫ్‌ఐహెచ్ మొబైల్ లిమిటెడ్ చైర్మన్ విన్సెంట్ టాంగ్‌లు రాష్ట్ర మంత్రి కే తారకరామారావుతో కలిసి సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ ప్రతినిధులు మాట్లాడుతూ, తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్ర భుత్వం తీసుకువస్తున్న టీఎస్‌ఐపాస్ ఎంతో ఉదాత్తంగా ఉందని అభిప్రాయపడ్డారు. 
*  ఐఫోన్‌లాంటి అత్యాధునిక ఫోన్లను తయారుచేసే తమ కంపెనీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే నగరంలో యూనిట్లు స్థాపించడానికి పలు సెల్‌ఫోన్ తయారీ సంస్థలు ముందుకు వచ్చాయని సీఎం ఈ సందర్భంగా వారికి వివరించారు. హబ్‌కోసం అనువైన స్థలం కేటాయించడంతోపాటు, అన్ని విధాల పారిశ్రామిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. నిర్దిష్ట ప్రతిపాదనలతో ముందుకు రావాలని ఆహ్వానించారు. మొబైల్ హబ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రెండు లక్షల మందికి ఉపాధి లభించగలదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా తాము రూపొందించిన పారిశ్రామిక విధానం వల్ల ఇక్కడి యువతకు ఉపాధిని కల్పించడంతోపాటు రాష్ర్టాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
* ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ సంస్థ ప్రెసిడెంట్ విన్సెంట్ టాంగ్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఈ నెల 6న తైవాన్ పర్యటన సందర్భంగా కలుసుకున్నారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని వివరించి, పరిశ్రమల స్థాపన వల్ల పెట్టుబడిదారులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను స్థాపించాలని ఆహ్వానించారు. ఇందుకు అంగీకరించిన సీఈఓ టాంగ్ వారం తిరగకుండానే హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రిని కలుసుకోవడం విశేషం. హైదరాబాద్‌లో తమ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను స్థాపించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని టాంగ్ పేర్కొన్నారు. 
      ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న మొబైల్ క్లస్టర్‌లో రూ.400-500 కోట్ల పెట్టుబడితో అతిపెద్ద ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సెల్‌కాన్ సీఎండీ వై గురు గురువారం తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా ఐదు నుంచి పది వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్‌లో నెలకు 20 లక్షల మొబైళ్లు ఉత్పత్తి అవుతాయని గురు చెప్పారు. ఈ ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో నెలకొల్పేందుకు మరో ఏడాది కాలం పట్టవచ్చని అన్నారు. అందువల్ల ప్రస్తుతానికి హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో మేడ్చల్ వద్ద అసెంబ్లింగ్ యూనిట్‌ను ప్రారంభించబోతున్నామని చెప్పారు. వచ్చే వారం ఈ యూనిట్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించనున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రంలో నెలకు మూడు లక్షల మొబైల్ ఫోన్లను అసెంబ్లింగ్ చేయవచ్చని చెప్పారు. తైవాన్, చైనా దేశాలనుంచి విడిభాగాలను దిగుమతి చేసుకొని ఈ యూనిట్‌లో మొబైల్ ఫోన్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. డిమాండ్‌ను బట్టి ఈ యూనిట్ సామర్థ్యాన్ని వచ్చే రెండు నెలల్లో 6 లక్షల మొబైళ్లకు పెంచనున్నట్లు గురు పేర్కొన్నారు. ఈ యూనిట్ ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా పథకం స్పూర్తితో ఇక్కడే ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై సబ్సిడీ, పన్నుల్లో రాయితీలు లభించడం తమకు ఆసక్తి కలిగించాయని ఆయన పేర్కొన్నారు. (-నమస్తే తెలంగాణ)

Saturday 30 May 2015

పండుగలా వేడుకలు ...


* పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ
* ఐడీహెచ్ కాలనీ ప్రారంభోత్సవం
* 10వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసే అవకాశం
హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు కనివిని ఎరుగనిరీతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు నిజమైన పండుగలా ఉత్సవాలు జరుగనున్నాయి. ఇప్పటివరకు పేదలు ఎక్కడైనా గుడిసెలు వేసుకుంటే కూల్చిన సందర్భాలే తప్ప వారికి అండగా నిలిచిన ప్రభుత్వాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మన రాష్ట్రంలో మన పాలన ఎలా ఉంటుందో ప్రజలు ఆస్వాదిస్తున్నారు.
             125 గజాలలోపు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇండ్లు కట్టుకుంటే ఆ భూములను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నాయకత్వాన ఏర్పడిన తెలంగాణ తొలి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో 58 విడుదల చేసింది. 3 లక్షల మందికిపైగా పేదలకు తమ భూమిని క్రమబద్దీకరించుకునే అవకాశాన్ని కల్పించింది. మొదటి విడతగా హైదరాబాద్‌లోనే లక్ష భూ క్రమబద్దీకరణ పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం లక్ష మందికి పట్టాలు సిద్ధం చేసింది.
* ఈ పట్టాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా పేదలకు అందజేయనున్నారు. ఐడీహెచ్ మోడల్ కాలనీ ఇండ్లను ప్రారంభించి, అక్కడి పేదలకు గృహ ప్రవేశం కల్పిస్తారు. ఇప్పటికే ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన ఇండ్లు గృహనిర్మాణ పథకానికి మోడల్ కాలనీగా మారాయి. నిరుద్యోగులకు కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి రాష్ట్ర ఆవిర్భావ ఫలాలు అందనున్నాయి. జూన్ 2వ తేదీన 10 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

Thursday 23 April 2015

మీకు వసతులు కల్పిస్తాం.. మా బిడ్డలకు ఉద్యోగాలివ్వండి

* పారిశ్రామికవేత్తలకు సీఎం కేసీఆర్ పిలుపు
* మేకిన్ తెలంగాణకు ఆహ్వానం
* నాతో చిట్‌చాట్ చేసినంత సమయంలో కొత్త పరిశ్రమలకు క్లియరెన్స్‌లు
* పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా
* గత పాలకుల అభివృద్ధి పునాదిరాళ్లకే పరిమితం
* ఆ పునాదిరాళ్లతో ఓ ప్రాజెక్టే కట్టొచ్చు
* మహీంద్రా కొత్త ప్లాంటు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ 
* హైదరాబాద్‌లో 100 మిలియన్ డాలర్లతో 
* పరిశ్రమ ఏర్పాటుకు శామ్‌సంగ్ ముందుకొచ్చిందని వెల్లడి       
  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేవారికి అన్ని రకాల వసతులు కల్పిస్తామని, అందుకు ప్రతిగా ఆయా యూనిట్లలో తమ బిడ్డలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పారిశ్రామికవేత్తలను కోరారు. పారిశ్రామికాభివృద్ధికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా అంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మేకిన్ తెలంగాణ అని పారిశ్రామికవేత్తలను పెట్టుబడులతో ఆహ్వానిస్తున్నది. పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు సర్కారు రాజమార్గం కల్పిస్తుంది అని సీఎం చెప్పారు. మెదక్‌జిల్లా జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోమోటివ్ ప్లాంట్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. రూ.250 కోట్లతో తెలంగాణలో మొదటి ఆటోమోటివ్ ప్లాంట్ ఏర్పాటు చేసిన సంస్థ యాజమాన్యాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల వసతులు మేం కల్పిస్తాం. సీమాంధ్ర ప్రభుత్వాల హయాంలో దగాపడ్డ మా తెలంగాణ నిరుద్యోగ బిడ్డలకు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. తెలంగాణ దగాపడ్డ ప్రాంతం. నెత్తురు ధారపోసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. మీ పరిశ్రమలకు అవసరమైన భూమి, నీరు, కరెంట్, ఇతర కేటాయింపులు, వసతులు కల్పిస్తాం. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత పారిశ్రామికవేత్తలు తీసుకోవాలి అని చెప్పారు. ఈ విషయంలో మహీంద్రా అండ్ మహీంద్రా ముందుండాలని ఆ సంస్థ ప్రతినిధులకు కేసీఆర్ సూచించారు.
రెండువారాల్లోనే అనుమతులు
పరిశ్రమ స్థాపనకు ముందుకొచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోనే అన్ని అనుమతులు ఇస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. మధ్యవర్తులెవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే ప్రభుత్వ ప్రొటోకాల్ అధికారి మీ వద్దకు వస్తారు. నేరుగా నా వద్దకు తీసుకువస్తారు. రెండు వారాల్లో అన్ని అనుమతులు ఇప్పిస్తాం అని చెప్పారు. పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు రెడ్‌కార్పెట్ వేస్తామని స్పష్టంచేశారు. సింగిల్ విండో పద్ధతిలో అనుమతులందిస్తామన్నారు. పూర్తిగా అవినీతిరహితంగా అనుమతులు, కేటాయింపులుంటాయని చెప్పారు. త్వరలోనే నూతన పారిశ్రామిక విధానం..తెలంగాణ ఐ పాస్‌ను ప్రకటిస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఫార్మా, ఐటీ ఏ రంగంలోనైనా పూర్తి పారదర్శకంగా దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులిస్తామని, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. గతంలో మధ్యవర్తుల ప్రోత్సాహం ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికిందని చెప్పారు. స్వయంగా తనను కలిసి కంపెనీ గురించి మాట్లాడుకున్నంత సమయం (చిట్‌చాట్)లోనే అనుమతులిస్తామని చెప్పారు.
పెట్టుబడులకు పోటీ పడుతున్న పరిశ్రమలు
ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలతో ప్రపంచ స్థాయిలో పేరుపొందిన పారిశ్రామిక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి పోటీ పడుతున్నాయని కేసీఆర్‌చెప్పారు. ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శామ్‌సంగ్ హైదరాబాద్‌లో 100 మిలియన్ అమెరికన్ డాలర్లతో యూనిట్ నెలకొల్పడానికి ముందు కొచ్చిందని వెల్లడించారు. మెదక్ జిల్లా సదాశివపేటలోని ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమ ప్రతినిధులు ఇటీవల తనను కలిసి రూ.980 కోట్లతో పరిశ్రమను విస్తరించి, వెయ్యిమందికి అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడాన్ని సీఎం సంతోషంగా గుర్తుచేశారు. కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పుతున్న మహీంద్రాసంస్థకు 5% పన్ను రాయితీ కల్పిస్తున్నట్లు సీఎం సభలో ప్రకటించగానే సంస్థ యాజమాన్యం, కార్మికులు హర్షధ్వానాలు చేశారు.
పరిశ్రమలకు నిరంతరాయ కరెంట్
గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలకు కరెంట్ కోతలుండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సీఎం చెప్పారు. పరిశ్రమలకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఈ విషయంలో పారిశ్రామికవేత్తలు స్వయంగా ఫోన్లు చేసి సంతోషం వ్యక్తంచేస్తున్నారని అన్నారు. పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతోనే ఈ చర్య తీసుకున్నామని వెల్లడించారు. 
జహీరాబాద్‌కు వరాలు
పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జహీరాబాద్ ప్రాంతంలో ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల, స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఈ సంస్థల ఏర్పాటుతో స్థానిక నిరుద్యోగులకు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి, ఇక్కడి సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించవచ్చునని తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి జహీరాబాద్ సమీపంలో 220 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాన్నారు. 
గత పాలకుల అభివృద్ధి పునాదిరాళ్లకే పరిమితం
సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాల అభివృద్ధి కేవలం పునాదిరాళ్లకే పరిమితమైందని కేసీఆర్ ఎద్దేవాచేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జహీరాబాద్‌ప్రాంతంలో నారింజ ప్రాజెక్టు ఆధునీకరణ, 220 కేవీ సబ్‌స్టేషన్లతోపాటు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగినా పనులు మొదలు కాలేదని మాజీ మంత్రి, జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి సీఎం దృష్టికి తీసుకురావడంతో కేసీఆర్ పైవిధంగా స్పందించారు. ఒక్క మెదక్ జిల్లాలోనే కాదు మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్ ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ పది జిల్లాలో సమైక్యరాష్ట్రంలో సీమాంధ్ర సీఎంలు ఎన్నో అభివృద్ధి పనులకు పునాదిరాళ్లు వేశారు. ఇప్పటికీ అవి అలానే ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధి మొత్తం పునాదిరాళ్లకే పరిమితం చేశారు. తెలంగాణ బతుకును అంధకారంచేశారు. ఎన్నికల సమయంలో స్కీముల పేరుతో ఇక్కడి ప్రజలతో ఆడుకున్నరు. ఎంతో మోసం చేశారు. గత పాలకులు వేసిన పునాదిరాళ్లతో ఓ ప్రాజెక్టే నిర్మించుకోవచ్చు అని ముఖ్యమంత్రి అన్నారు. 
మాట ఇస్తే తలతెగిపడినా వెనక్కితగ్గం
గత పాలకులు పోయారు. ప్రభుత్వాలు పోయాయి. అప్పటి ముఖ్యమంత్రుల్లా ఏదిపడితే అది చెప్పం. మాట ఇస్తే తలతెగిపడినా వెనక్కితగ్గబోం అని కేసీఆర్ పునరుద్ఘాటించారు. వాటర్‌గ్రిడ్‌ద్వారా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరందిస్తామని చెప్పారు. జహీరాబాద్‌కు సింగూరు ప్రాజెక్టు దగ్గరగా ఉన్నదని, ఏడాదినుంచి 15నెలల్లోనే ఈ ప్రాంతంలోని అన్ని గ్రామాల ప్రజలకు ఇంటింటికీ నీరందిస్తామని చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో అభివృద్ధికోసం తాను, మాజీ ఎంపీ బాగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాగన్నలు కొంత కృషిచేశామని గుర్తుచేశారు. సంగారెడ్డి సమీపంలోని మల్కాపూర్ చెరువు, ఝరాసంఘంలోని ఏడాకులపల్లి, బెడంపేట చెరువుల అభివృద్ధికోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. త్వరలోనే జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతంలో రెండు రోజులు పర్యటిస్తానని, ఇక్కడి ఎన్‌ఎస్‌ఎఫ్ పరిశ్రమలో రాత్రి బసచేసి, సమస్యలపై అధ్యయనం చేసి, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మెదక్ మట్టిలో పుట్టిన. ఎంత చెప్పినా జిల్లాపై మమకారం ఉంటది అన్న సీఎం.. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
250 కోట్లతో ప్లాంట్ విస్తరణ: పవన్ గోయెంకా
రూ.1100 కోట్ల పెట్టుబడులతో 3500 మందికి ఉద్యోగాలు కల్పించామని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోయెంకా, ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ షా చెప్పారు. ఇప్పటికే ఉన్న ఆటోమోటివ్ ప్లాంట్‌లో ఏడాదికి 75 వేల వాహనాలు తయారవుతున్నాయన్నారు. మూడు చక్రాల వాహనాలతోపాటు అదనంగా 4 చక్రాల వాహనాలను ఈ ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లుతెలిపారు. ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సాహం అందిస్తున్నదని, ఇక్కడ పెట్టుబడులు పెట్టడంద్వారా దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణను ఉన్నత స్థానంలో నిలుపుతామని చెప్పారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న సీఎం విజ్ఞప్తికి గోయెంకా స్పందించారు. తమ సంస్థలో పనిచేయడానికి గల అర్హతలున్న స్థానికులకు తప్పకుండా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొత్తగా తయారు చేసిన మహీంద్రా 4 చక్రాల ఆటోను ముఖ్యమంత్రి నడిపి ప్రారంభించారు. కంపెనీ ప్రతినిధులతో కలిసి ప్లాంట్లను సందర్శించారు. 
- నమస్తే తెలంగాణ

Friday 3 April 2015

పాము విషంతో ఎయిడ్స్, ఎబోలాకు చెక్!

* జేఎస్‌పీఎస్ కాలేజీ-ఐఐసీటీ ఆధ్వర్యంలో పరిశోధన
 ఎయిడ్స్.. ఎబోలా.. హెపటైటిస్-బి వంటి కీలక వ్యాధుల నుంచి పాము విషం ఉపశమనం కలిగిస్తుందా? హైదరాబాద్‌కు చెందిన జేఎస్‌పీఎస్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల వైద్యులు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న పరిశోధన ఇది నిజమేనంటోంది. పాము విషం నుంచి తయారు చేసిన క్రొటలస్ హారిడస్‌ను హెచ్‌ఐవీపై ప్రయోగించినపుడు అనుకూల ఫలితాలు వచ్చినట్లు గ్లోబల్ హోమియోపతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. రెండు సంవత్సరాలుగా చేస్తున్న ఈ అధ్యయనంలో ముంబైకి చెందిన హోమియోపతి వైద్యుడు డాక్టర్ రాజేశ్ షాహ్ ఎయిడ్స్‌కు కొత్త మందును కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఈ మందు హెచ్‌ఐవీ, హెపటైటిస్-బిపై సమర్ధవంతంగా పనిచేస్తుందని జేఎస్‌పీఎస్ కాలేజీ ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అయితే తమ అధ్యయనం కచ్చితంగా అడ్వాన్స్‌డ్ పరిశోధనలు, క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టిందని, ఉప్పెనలా పరిశోధనలు జరిగే అవకాశముందని చెప్పారు. కాగా ఈ అధ్యయనానికి సంబంధించిన సైంటిఫిక్ పేపర్ ఇటీవల ఇండియన్ జర్నల్ ఆఫ్ రిసెర్చ్ ఇన్ హోమియోపతి (ఐజేఆర్‌హెచ్), సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (సీసీఆర్‌హెచ్) ఆన్‌లైన్ ఎడిషన్‌లోనూ ప్రచురితమైనట్లు తెలిపారు. 
- నమస్తే తెలంగాణ

Monday 30 March 2015

గోదావరిని ఒడిసిపట్టాలె!

* తెలంగాణ ఆత్మతో.. తెలంగాణ దృష్టితో ప్రాజెక్టులను కట్టుకుందాం
* ప్రతి నీటిబొట్టూ వాడుకుందాం
పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయండి
* దేవాదులను గుణపాఠంగా తీసుకోండి
ప్రాజెక్టులపై ఆమూలాగ్రం పరిశీలన జరపండి
* అవసరమైతే 15 రోజుల్లో మళ్లీ సర్వే
* పక్క రాష్ర్టాలతో పంచాయతీలు వద్దు
* ఒక్క ఎకరం ముంపునకు అవకాశమివ్వొద్దు
* నిర్వాసితుల సమస్య తీరాకే ప్రాజెక్టులు
అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్
* గోదావరిపై సీఎం బృందం ఏరియల్ సర్వే 
* కంతానపల్లి, దేవాదుల, ఇచ్చంపల్లి, కాళేశ్వరం పరిశీలన 
* కంతానపల్లి బాధితులను ఆదుకుంటామని భరోసా 
దేవాదులలో ఉన్నతస్థాయి సమీక్ష
  గోదావరి నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టునూ తెలంగాణ ఆత్మతో ఆలోచించి, తెలంగాణ దృష్టికోణంలో కట్టుకోవాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆ నదిలో ప్రవహించే నీరు వృథాగా సముద్రంపాలు కాకుండా ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులు, సాగునీటి నిపుణులను ఆదేశించారు. ఆదివారం గోదావరి నదిపై ఏరియల్ సర్వే జరిపిన కేసీఆర్ అనంతరం దేవాదుల అతిథిగృహంలో మంత్రు లు, అధికారులు, సాగునీటి నిపుణులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్నదైనా, నూతనంగా చేపట్టేదైనా ప్రాజెక్టులన్నీ తెలంగాణను సస్యశ్యామలం చేసి భవిష్యత్తు తరాలకు కూడా శాశ్వత ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండాలని ఉద్బోధించారు.
      ఈ దృష్టితో ఆయా ప్రాజెక్టులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో లోపాలు సవరించి రీ డిజైన్ చేయాలని సూచించారు. ఇష్టారాజ్యపు ప్రాజెక్టుల వల్ల కలిగే నష్టాలకు దేవాదుల ప్రాజెక్టును ఉదాహరణగా తీసుకోవాలని, వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు కూడా నీరందని దుస్థితినుంచి గుణపాఠం నేర్చుకోవాలని కేసీఆర్ అన్నారు. లోపాలన్నీ సమర్థంగా సవరించుకున్నప్పుడే తెలంగాణ హరిత తెలంగాణగా, బంగారు తెలంగాణగా మారుతుందని అన్నారు. గోదావరి నదిపై కాళేశ్వరం, ప్రాణహిత-చేవెళ్ల, కంతానపల్లి, దుమ్ముగూడెం తదితర ప్రాజెక్టుల డిజైన్లను, నీటి స్థిరీకరణ, ఆయకట్టు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ వంటి అంశాలను అన్నింటికీ మొత్తానికి మొత్తం సమీక్షించి అన్నీ సరిచూసుకోవాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టుల నిర్మాణంలో ఇతర రాష్ర్టాలతో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని నిర్దేశించారు. గోదావరి నదిపై ఇప్పటికిప్పుడు ఇక్కడికిక్కడ అన్ని విషయాలు తేల్చలేక పోవచ్చు.. మరో 15 రోజులు సమయం తీసుకొని పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి సంపూర్ణ నీటి వినియోగ ప్రణాళికలు రూపొందించండి అని సీఎం అధికారులను ఆదేశించారు. అవసరమైతే మరోసారి గోదావరి నదిపై ఇంజినీరింగ్ నిపుణులతో పూర్తిస్థాయి ఏరియల్ సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. 
ప్రతి చుక్కా వాడుకోవాల్సిందే..!
గోదావరి నదికి సంబంధించిన ఒక్క చుక్క నీరు కూడావదలకుండా ఒడిసి పట్టుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారని తెలిసింది. సీమాంధ్రుల పాలనలో ఇప్పటిదాకా కొన్ని వందల టీఎంసీల నీరు సముద్రం పాలైంది. తెలంగాణ వచ్చాక కూడా అందుకు అవకాశం ఇవ్వరాదని ఆయన భావిస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో పక్కరాష్ర్టాలకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నది కేసీఆర్ స్థిర నిశ్చయంగా ఉంది. ఆదివారం గోదావరి ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన సీఎం కేసీఆర్ అనేక విషయాలను గమనించారు. దుమ్ముగూడెం టెయిల్ పాండ్ రాష్ర్టానికి ఉపయోగపడదని నిర్ధారించారు. దేవాదుల, కంతానపల్లి ప్రాజెక్టులను రీ సర్వే చేయాలని నిర్ణయించారు. కంతానపల్లి దగ్గర మరో ప్రాజ్టెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది.
దేవాదుల, ఇచ్ఛంపల్లి, మెట్టగడ్డ ప్రాంతాల్లో కొత్త బ్యారేజీలు నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రజలకు నష్టం కలుగకుండా, ఒక్క ఎకరం ముంపునకు గురికాకుండా చూడాలని సీఎం మనోగతంగా ఉంది. సీమాంధ్రుల పాలనలో ప్రాజెక్టులు ఇష్టానుసారం రూపొందించారని, వాటికి జీవం కల్పించాలంటే మళ్లీ సర్వే చేయాల్సిన అవసరం ఉందని భావించారు. 
ఏరియల్ సర్వే చేసిన సీఎం..
గోదావరి నదిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. నదిపై నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాలను ఆయన విహంగ వీక్షణం చేశారు. హన్మకొండ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి ఏటూరునాగారం మండలం కంతానపల్లి, దేవాదుల, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని ఇచ్ఛంపల్లి ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. 

ఒక హెలిక్యాప్టర్‌లో సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, సీఎం అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్, మరో హెలిక్యాప్టర్‌లో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగరరావు, నీటిపారుదల ఉన్నతాధికారులు మురళీధరరావు, శ్యాంప్రసాద్‌రెడ్డి తదితరులు ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. ముందుగా కంతానపల్లిలో దిగిన ముఖ్యమంత్రి ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. నీటిపారుదల అధికారులు గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ మ్యాపులు, స్పిల్‌వే, బ్యారేజ్ నమూనాలు తదితర విషయాలను ఇంజనీరింగ్ నిపుణులు సీఎంకు వివరించారు.
ముంపు గ్రామాలపై సీఎం ఆరా..
ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే గ్రామాలు, ప్రజల ఆర్థిక స్థితిగతులను సీఎం ఈ సందర్భంగా ఆరా తీశారు. ఏటూరునాగారం మండలం కంతానపల్లి, సింగారం, ఏటూరు గ్రామాలు పూర్తిగా, మరో ఐదు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతున్నాయని అధికారులు సీఎంకు చెప్పారు. సీఎం మధ్యలో కలుగజేసుకొని ఈ గ్రామాల్లో మొత్తం ఎన్ని ఇండ్లుంటాయి? అని ఆరా తీశారు. జిల్లా యంత్రాంగంతోపాటు నీటిపారుదల అధికారులు ఇటీవల నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం అన్ని గ్రామాల్లో కలిపి మొత్తం 890 ఇండ్లు ఉంటాయని అధికారులు బదులిచ్చారు.
             ఆ ఇండ్ల స్వభావం ఎటువంటిది? అని కూడా సీఎం అడిగారు. మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ మనకు అందిన సమాచారం ప్రకారం అన్ని ఇండ్లు కూడా సెమీపర్మనెంట్, కొన్ని పర్మినెంట్ ఇండ్లుంటాయని చెప్పారు. కంతానపల్లి మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 10,500 కోట్లని, అందులో స్పిల్‌వే, బ్యారేజ్ నిర్మాణం తదితర అంశాల వారీగా అంచనాలను సీఎంకు వివరించారు. ఈ ప్రాజెక్టు వద్ద దాదాపు అర గంటసేపు గడిపిన కేసీఆర్ గోదావరి నదిని పరిశీలించారు. గోదావరి ఆవల ఖమ్మం జిల్లా వాజేడు మండలానికి చెందిన ఆర్లగూడెం, గెర్రగూడెం, పెరూర్, చంద్రుపట్ల, గంగారం, టేకులగూడెం గ్రామాలున్నాయని అందులో అందులో దాదాపు మూడు గ్రామాల దాకా కంతానపల్లి పరిధిలోకి వస్తాయని అయితే అవి పూర్తిస్థాయిలో ముంపునకు గురవుతాయా? లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంటుందని బదులిచ్చారు. అనంతరం అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో గోదావరిపై సర్వేకు బయలుదేరారు. దేవాదుల, కాళేశ్వరం, ఇచ్ఛంపల్లి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు స్థలాలన్నీ ఏరియల్ సర్వే నిర్వహించి తిరిగి మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో దేవాదులకు చేరుకున్నారు. అక్కడ ఇంటెక్‌వెల్‌ను సందర్శించారు. దేవాదుల అతిథిగృహంలో మధ్యాహ్న భోజన విరామం ముందూ అనంతరం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, కలెక్టర్ వాకాటి కరుణ, హైదరాబాద్ నుంచి వచ్చిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, దేవాదుల, కంతానపల్లి ఎస్‌ఈ, ఈఈలతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 
పరిహారం చెల్లించాకే....
కంతానపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా మానవతా దృక్పథంతో వ్యహరిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వారికి సంతృప్తి కరమైన నష్టపరిహారం చెల్లించాకే ప్రాజెక్టు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. కంతానపల్లి, దేవాదులలో తనను కలిసిన కంతానపల్లి నిర్వాసితులతో సీఎం మాట్లాడారు. మీరు బాగుంటేనే ప్రాజెక్టు బాగుంటుంది. మీరు సంతోషంగా ప్రభుత్వానికి సహకరించండి. మిమ్మల్ని ఎల్లకాలం సంతోషంగా ఉంచే బాధ్యత నాది అంటూ ముఖ్యమంత్రి కంతానపల్లి నిర్వాసితులతో అన్నారు. 
                   నష్టపరిహారం విషయంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదుంది.. ఈ విష యం లో భూ నిర్వాసిత చట్టాలకన్నా ఎక్కువగా మానవతా దృక్పథంతో వ్యవహరించండి అని సీఎం అధికారులకు హితవు పలికారు. ఈ విషయంలో భూ నిర్వాసితులకు ఏం చేస్తే న్యాయం జరుగుంది? వారి జీవితాలు శాశ్వత ప్రాతిపదికన బాగుండాలంటే ఏం చేయాలో ఆలో చించి ఒక నివేదికను అందజేయాలని కలెక్టర్ వాకాటి కరుణ, ఇతర శాఖల అధికారులు ఆదేశించారు. ఆదివాసీ సంఘాలతోనూ సీఎం మాట్లాడారు. సీఎం పర్యటనలో ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ బొడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, శంకర్ నాయక్, టీఆర్‌ఎస్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ తదితరులు పాల్గొన్నారు.- (నమస్తే తెలంగాణ)

Thursday 26 March 2015

ప్రకృతి ఒడిలో ప్రయాణం..ఫరహాబాద్ ఫారెస్ట్‌

    రుకుల పరుగుల రోజువారీ జీవితంలో కాస్త విరామం కావాలనుకుంటే సరదాగా విహారానికి వెళ్లాలనిపిస్తుంది. కాంక్రీట్ జంగల్ నుంచి పారిపోవాలనిపిస్తుంది. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా పీల్చుకోవాలనిపిస్తుంది. కానీ ఎక్కడని వెతక్కోగలం? ఎంతోదూరం కాదు.. ఎంతో సమయం కాదు.. వంద మైళ్లు.. గంట ప్రయాణం చేస్తే చాలు.. పచ్చని ప్రకృతి ఒడిలో వాలిపోతారు. కాలాన్ని మర్చిపోయి కలల తీరంలో నిలిచిపోతారు. అవును... ఫరహాబాద్ ఫారెస్ట్‌లో అడుగుపెడితే అలాంటి అనుభూతే సొంతమవుతుంది. తెలంగాణలో అతిపెద్ద టైగర్ జోన్ ఫారెస్ట్‌లో సఫారీ జర్నీ వెరీ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఫరహాబాద్ వ్యూ పాయింట్ కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది.
అతి పెద్ద టైగర్‌జోన్..
తెలంగాణలో అతి పెద్ద టైగర్ జోన్ ఫారెస్ట్ ఫరహాబాద్. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేదారిలో.. సరిగ్గా నగరం నుంచి 140 కిలో మీటర్ల దూరంలో ఫరహాబాద్ ఫారెస్ట్ తారసపడుతుంది. దట్టమైన అటవీ ప్రాంతం. అమ్రాబాద్ అటవిలో మరో భాగమే ఫరహాబాద్. ప్రకృతి అందాలకు నెలవు. రంగు రంగుల పక్షులు, రకరకాల జంతువులు. మైమరిపించే నెమలి నాట్యాలు. లేడి పిల్లల గంతులు, కోయిల కిలకిలా రావాలు.. వీటన్నింటినీ చూడ్డానికి మనసు తహతహలాడుతుంది. కానీ అడవిలో ప్రయాణం మరింత సాహసోపేతంగా సాగాలంటే సొంత వాహనాల్లో కాదు.. జీపుల్లో జర్నీ చేయాల్సిందే. పచ్చని అడవిలో జీపులో ప్రయాణం.. కెమెరా కంటికి నిండైన పండుగ. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫరహాబాద్ ఫారెస్ట్ విజిట్ కోసం ప్రత్యేకంగా సఫారి జర్నీ ఆఫర్ చేస్తోంది. రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో జీపులో దాదాపు 8మంది వరకు ప్రయణించవచ్చు. రోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సఫారీ జర్నీకి అవకాశం ఉంటుంది. 
ఫరహాబాద్ వ్యూ పాయింట్..
  45 నిమిషాల ప్రయాణం. తొమ్మిది కిలోమీటర్లు ప్రయణిస్తే చాలు... అందమైన వ్యూ పాయింట్ కళ్లను కట్టిపడేస్తుంది. మార్గమధ్యంలో జింకలు, కోతుల గుంపులు, నెమలి నాట్యాలు, ఎన్నెన్నో అటవీ జంతువులు, పక్షులు (కొన్నిసార్లు పులులు కూడా) కనిపిస్తాయి. నీటి తావుల చుట్టూ కనిపించే లేడి పిల్లలు, పక్షుల గుంపులను చూడడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇక దారి మధ్యలో ఏడోనిజాం విడిది గృహాన్ని చూడవచ్చు.
      నిజాం వేటకు వచ్చి ఇక్కడే విడిది చేసేవారని చెబుతుంటారు. చారిత్రక విశేషం కలిగిన ఈ అతిథి గృహం శిథిలావస్థలో ఉండడం విషాదం. చివరగా ఫరహాబాద్ వ్యూ పాయింట్ అన్నింటికంటే హైలెట్‌గా చెప్పవచ్చు. వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాల్ని చూడ్డం మర్చిపోలేని అనుభూతి. ఎత్తైన కొండమీది చూపు సారించిన దూరం పచ్చని అడవి కనిపిస్తుంది. అటవి మధ్యలో.. బ్రిటీష్ కాలంలో డాక్టర్ రస్సెల్స్ అనే అధికారి తవ్వించిన పెద్ద మానవ నిర్మిత సరస్సు కనిపిస్తుంది. 
 ఈ సరస్సు నాలుగు హెక్టార్లకుపైగా విస్తరించి ఉండడం గమనార్హం. ఇక్కడ క్యాంటి లివర్ బ్రిడ్జి... టూరిజం ప్లాజా ఉండేవి( ప్రస్తుతం లేవు). ఇన్ని అందాల నడుమ సాగే ప్రయాణాన్ని ముగించాలంటే కూడా మనసంగీకరించదు. అలాంటి అనుభూతుల్ని మీరూ సొంతం చేసుకోవాలనుకుంటే.. మీరూ ఫరహాబాద్‌ని విజిట్ చేయండి మరి. తెలంగాణ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. (- నమస్తే తెలంగాణ)

Thursday 19 March 2015

సీఎం కేసీఆర్‌కు 'పాపులర్ ఛాయిస్' అవార్డ్

* సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌ ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులో భాగంగా కేసీఆర్ కు పాపులర్‌ చాయిస్‌ పురస్కారం
* కేసీఆర్ తరపున అవార్డు అందుకున్న రాజ్యసభ సభ్యుడు కేకే 

 తె
లంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్ ప్రతిష్ట జాతీయస్థాయిలో మరింత ఇనుమడించింది. ప్రముఖ న్యూస్ ఛానల్ ''సీఎన్ఎన్-ఐబీఎన్ పాపులర్ ఛాయిస్ ఆఫ్ ది ఇయర్- 2014'' అవార్డును సీఎం కేసీఆర్ సొంతం చేసుకున్నారు. సీఎం కేసీఆర్ తరపున ఈ అవార్డును రాజ్యసభ సభ్యుడు కేకే అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ప్రజలతో పాటు అమరవీరులకు ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు కేకే చెప్పారు.
          పాపులర్ ఛాయిస్ టైటిల్ పోరుకు దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఉద్దండులు పోటీపడ్డారు. ఆరంభం నుంచే టఫ్ కాంపిటిషన్ నడిచింది. కానీ తెలంగాణ సీఎం మాత్రం స్టార్టింగ్ నుంచే పోల్ లో దూసుకుపోయారు. పోలింగ్ ముందుకు సాగుతున్న కొద్దీ తెలంగాణ సీఎంకు అపూర్వమైన స్పందన లభించింది. కేసీఆర్ కు ఇతరులకు తేడా స్పష్టంగా కనిపించింది. కేసీఆర్ పాపులారిటీ ముందు పలురంగాలకు చెందిన ప్రముఖులు వెనుకబడిపోయారు. పాపులర్ ఛాయిస్ రేసులో కాంపిటీటర్స్ మామూలోళ్లు కాదు.. అరుణ్ జైట్లీ, అమిత్ షా, మమతా బెనర్జీ లాంటి హేమాహేమీలు ఉన్నారు. అనితర సాధ్యమైన పాపులారిటీతో వాళ్లందరినీ వెనక్కు నెట్టి అవార్డును సొంతం చేసుకున్నారు సీఎం కేసీఆర్.
      సీఎన్ఎన్-ఐబీఎన్ పాపులర్ ఛాయిస్ అవార్డును నెటిజన్ల ఓటింగ్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఇంత టఫ్ కాంపిటిషన్ లోనూ సీఎం కేసీఆర్ ఈ అవార్డును సొంతం చేసుకోవడం మాటలు కాదు. అందుకే యావత్ తెలంగాణ సీఎంకు లభించిన గౌరవం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. బంగారు తెలంగాణ సాధన కోసం అహరహం పనిచేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జనమంతా కోరుకుంటున్నారు.
అవార్డులు పొందింది వారు:
అవార్డులు పొందింది వారు ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌: నరేంద్ర మోడీ 
అవుట్‌స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌: అజీం ప్రమేజీ, కైలాశ్‌ సత్యార్థి 
పాపులర్‌ చాయిస్‌: కె. చంద్రశేఖర్‌రావు, పి. విజయన్‌ 
రాజకీయం: అరుణ్‌జైట్లీ ( కేంద్ర ఆర్థిక మంత్రి) 
గ్లోబల్‌ ఇండియన్‌: సత్య నాదెళ్ల (మైక్రోసాప్ట్‌ సీఈవో)
 క్రీడలు: జితు రాయ్‌ 
బిజినెస్‌: ఎన్‌. చంద్రశేఖరన్‌ (టీసీఎస్‌) 
వినోదరంగం: చేతన్‌ భగత్‌ (రచయిత) 
ప్రజాసేవ: తంగమ్‌ రినా (జర్నలిస్టు)