Tuesday 28 July 2015

ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయో పరిమితి 44 ఏండ్లు!

* ఏడాదిపాటు అన్ని నియామకాలకు వర్తింపు* 15,522 ఖాళీలకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 
* స్థానికత, జోన్, జిల్లా నియమాలు వర్తింపు
* రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రాష్ట్రపతి ఉత్తర్వులు యథాతథం
  తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే అన్ని ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని 44 ఏండ్లకు పెంచుతూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఏడాదిపాటు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. టీఎస్‌పీఎస్‌సీ, ఇతర సెలక్షన్ కమిటీలు చేపట్టే ఉద్యోగాల నియామకాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. అయితే యూనిఫారం సర్వీసులకు మాత్రం ఇది వర్తించదు. రాష్ట్రంలో భారీ ఉద్యోగ నియామకాల ప్రక్రియ తొలిదశలో భాగంగా 15వేల ఉద్యోగాల భర్తీ ఫైలుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం సంతకం చేసిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పదేండ్ల వయోపరిమితి పెంపు ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ నుంచి అంటే 27.07.2015 నుంచి ఏడాది పాటు అంటే 26.07.2016 వరకు ఈ సడలింపు వర్తిస్తుంది. 
ఇవీ ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని అత్యంత ప్రాధాన్య అంశంగా భావిస్తున్నది. ఈ క్రమంలో డైరెక్టు రిక్రూట్‌మెంట్ విధానంలో అర్హులైన విద్యావంతులను ఎంపిక చేసేందుకు టీఎస్‌పీఎస్‌సీతో పాటు ఇతర సెలక్షన్ కమిటీలకు ఖాళీలను అందజేసింది. ఇదే సమయంలో నిరుద్యోగులు, ప్రజాప్రతినిధుల నుంచి వయోపరిమితి సడలించాలనే ప్రతిపాదనలు అందాయి. ఈ విషయంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ తన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించింది. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం పదేండ్ల వయోపరిమితి పెంపునకు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 34 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు ఈ పెంపు వర్తిస్తుంది. ఈ పెంపు స్టేట్, సబార్డినేట్ సర్వీస్‌రూల్స్‌కి వర్తిస్తుంది. 
     ఈ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వ గెజిట్‌లో కూడా ప్రచురితం అవుతుంది అంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు అదే జీవోలో నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేశారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 309 కింద కల్పించిన అధికారం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ క్రింది అడ్‌హాక్ రూల్ వెలువరిస్తున్నది. స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్‌రూల్స్ ప్రకారం వయోపరిమితిని పదేండ్లు అంటే...34 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు పెంచుతూ నిర్ణయం జరిగింది. జీవో విడుదల అయిన తేదీ నుంచి ఏడాది పాటు రాష్ట్రంలో జరిగే అన్ని నియామకాలకు ఇది వర్తిస్తుంది. స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్‌రూల్స్‌లోని రూల్ 12కి కూడా ఈ మార్పు వర్తిస్తుంది. యూనిఫాం సర్వీసులైన పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ తదితర ఉద్యోగాలలోని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు ఇది వర్తించదు అని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
ఆర్థిక శాఖ ఆదేశాలు...
ఉద్యోగాల భర్తీలో భాగంగా గుర్తించిన 15,522 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో భర్తీ చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎన్ శివశంకర్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి, ఇతర నియామక సంస్థల బాధ్యులు తగు చర్యలు తీసుకోవాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి స్థానికత, జోన్, జిల్లా, రోస్టర్‌పాయింట్లు, ఇతర అర్హతలు తదితర విషయాలు పరిగణనలోకి తీసుకోవాలని వివరించారు. 
         సంబంధిత శాఖలు, విభాగాల బాధ్యులు నియామక ప్రక్రియకోసం తగు వివరాలు అందించాలని ఆదేశించారు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా కాకుండా ఎంపిక ప్రక్రియను నిర్వహించే జిల్లా ఎంపిక కమిటీలు, కార్పొరేషన్లు, విభాగాలు నోటిఫికేషన్ విడుదల చేసి రాతపరీక్ష ద్వారా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో నిష్పక్షపాత విధానంలో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రాష్ట్రపతి ఉత్తర్వులు పాటించాలని నిర్దేశించారు. ఎంపిక ప్రక్రియ కోసం తగు విధమైన చర్యలను వెంటనే ఆయా విభాగాలు చేపట్టాలని స్పష్టం చేశారు. 
                                                                             
 (-నమస్తే తెలంగాణ)

Saturday 25 July 2015

తెలంగాణలో కొలువుల జాతర!

* 15 వేల ఉద్యోగ నియామకాలకు పచ్చజెండా
* వయో పరిమితి పదేళ్ల పెంపు
* ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు
తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 15 శాఖల్లో ఖాళీగా ఉన్న 15 వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఉద్యోగాల భర్తీపై సీఎం జులై 25న సంతకం చేశారు. గరిష్ఠ వయోపరిమితిని మరో పదేళ్లు పెంచారు. ప్రస్తుతం 34 ఏళ్లు పరిమితి ఉండగా దానిని 44 ఏళ్లకు పెంచాలని ఆయన ఆదేశించారు. తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని నిరుద్యోగులకు మేలు కలిగించే రీతిలో పదేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. నలభై రోజుల వ్యవధిలో ఈ పోస్టుల భర్తీని పూర్తిచేయాలని ఆదేశించారు. ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే సీఎం హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జాబితాను రూపొందించి సీఎంకు సమర్పించారు. దానిని పరిశీలించిన సీఎం 25వ తేదీన తక్షణమే భర్తీ కావాల్సిన 15 వేల పోస్టులకు ఆమోదం తెలిపారు. నియామకాల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. కానిస్టేబుల్, ఎస్ఐ సహా పోలీసు, అగ్నిమాపక శాఖల్లో 8,000 ఖాళీలను, విద్యుత్ శాఖలో 2,681 ఖాళీలను భర్తీ చేయనుండగా... వ్యవసాయం, ఉద్యానవనాలు, వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, రోడ్లు భవనాలు, రవాణా, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోనివి 4,300 కొలువులను భర్తీ చేయనున్నారు. దాదాపు పదేళ్లుగా ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులకు పండగనే చెప్పాలి.
రెండు జోన్లలో...
జోనల్ వ్యవస్థ యథాతథంగా కొనసాగనుంది. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి, స్థానిక, స్థానికేతర కేటగిరీని అమలు చేస్తారు. తెలంగాణలో ప్రస్తుతం రెండు జోన్లు ఉన్నాయి. దీనికి అనుగుణంగా ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. జోనల్ విధానంతో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇతర నిబంధనల మేరకు నియామకాలు జరపాలని సూచించారు.
ఏ శాఖలో ఎన్ని...
* పోలీసు, అగ్నిమాపక శాఖ: 8,000
* విద్యుత్ శాఖ: 2,681
* ఇతర శాఖలు: 4,300
వేటి ద్వారా భర్తీ?
* పోలీసు ఉద్యోగాలు రాష్ట్రస్థాయి పోలీసు నియామక సంస్థ ద్వారా జరుగుతాయి.
* విద్యుత్‌శాఖ ఉద్యోగాలను జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు భర్తీ చేస్తాయి.
* మిగిలిన ఖాళీల భర్తీ టీఎస్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా జరుగుతుంది. పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా పరీక్షల నిర్వహణ ఇతర అంశాలకు సీఎం సూత్రప్రాయ ఆమోదం తెలిపారు.
త్వరలో మరి కొన్నింటికి ఆమోదం..
మొదటిదశ ఆమోదించినవి కాకుండా వారం రోజుల్లో మరో 10,000 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలపనున్నారు. దీనికి సంబంధించిన జాబితా సిద్ధమవుతోంది. అది అందగానే సీఎం ఆమోదం తెలపనున్నారు.

Thursday 23 July 2015

తెలంగాణలో పెట్టుబడుల వెల్లువ!

* టీఎస్‌ఐపాస్ రెండో దశలో 19 కంపెనీలకు అనుమతిపత్రాలు
* స్వయంగా అందజేసిన సీఎం కేసీఆర్
* రాష్ర్టానికి 1087.37 కోట్ల పెట్టుబడులు
*  కొత్త కంపెనీలతో 5,321 మందికి ఉపాధి
* కంపెనీ ఏర్పాటుకు ముందుకువచ్చిన
* ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా సంస్థ కెమో 
* మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు
* పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. పారిశ్రామిక అనుమతుల్లో ఎలాంటి ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి కార్యాలయంలోని చేజింగ్‌సెల్ ఇన్‌చార్జి, ముఖ్యమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శి శాంతకుమారిని సంప్రదిస్తే పరిష్కరిస్తారని పేర్కొన్నారు. 
     తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌ను అమలులోకి తెచ్చిన తర్వాత రెండో దఫాగా మరో 19 కంపెనీల సీఎండీలు, సీఈవోలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వయంగా అనుమతి పత్రాలు అందజేశారు. కొత్తగా ఏర్పాటుచేయనున్న ఈ పరిశ్రమలతో రాష్ట్రానికి రూ.1087.37 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటిద్వారా 5,321 మందికి ఉపాధి కల్పించనున్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఈ కంపెనీలను నెలకొల్పనున్నారు. 
కొత్తగా నెలకొల్పనున్న కంపెనీల్లో హెలికాప్టర్ క్యాబిన్ కిట్ , సెల్‌ఫోన్, పాదరక్షల తయారీతోపాటు ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్ కంపెనీలు ఉన్నాయి. బుధవారం అనుమతి పత్రాలు పొందిన కంపెనీల్లో స్పెయిన్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీ కెమో సైతం ఉండడం విశేషం. ఈ కార్యక్రమంలో పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, సీఎం అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చేజింగ్ సెల్ ఇన్‌చార్జి శాంతకుమారి, పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, పరిశ్రమలశాఖ కమిషనర్ మాణిక్‌రాజ్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డితోపాటు ఎస్‌ఆర్ బ్రహ్మాస్ అగ్రోప్రొడక్ట్స్ చైర్మన్ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డిసహా పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. టీఎస్‌ఐపాస్‌ను అమలులోకి తెచ్చిన తర్వాత తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. పారిశ్రామికవేత్తలకు అనుమతుల మంజూరులో ఎటువంటి జాప్యం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్ ప్రకటించిన రోజు పేర్కొన్న ప్రకారం దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో రికార్డు స్థాయిలో తొలిదశలో జూన్ 23న మొదటి దఫా కంపెనీలకు అనుమతిపత్రాలు మంజూరు చేశారు. అదేజోరును కొనసాగిస్తూ సరిగ్గా నెలతిరగకముందే మరో 19 కంపెనీలకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతిపత్రాలు అందజేయడం పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. (- నమస్తే తెలంగాణ)

Tuesday 21 July 2015

ఆధార్‌లేని ఓటు ఔట్

* నగరంలో 15 లక్షల బోగస్ ఓట్లు..
* ఏరివేతలో ఎన్నికల సంఘానికి సహకరిస్తాం
* రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌తో సమావేశం 
*  ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానిస్తాం
* అనుసంధానం లేకుంటే ఓటు హక్కు ఉండదు
* హైదరాబాద్‌లో ముందుగా అమలు.. 
* 15-20 రోజుల్లో పూర్తి చేస్తాం: సీఎం కేసీఆర్
     రాజధాని హైదరాబాద్‌లో ఆధార్ నంబరుతో అనుసంధానం కాని ఓటర్లకు ఓటు హక్కు ఉండదని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఓటరుకార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ముందుగా హైదరాబాద్‌లో అ కార్యక్రమం చేపట్టి 15 నుంచి 20 రోజుల్లో అనుసంధానం చేపడతామన్నారు.
ఒకటికి రెండుసార్లు అవకాశమిచ్చి ఆ తర్వాత అనుసంధానం చేయని ఓట్లు తొలగిస్తామని ఆయన చెప్పారు. 
       హైదరాబాద్ నగరంలో దాదాపు 15 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆయన వివరించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆధార్‌తో ఓటరు కార్డుల అనుసంధానంపై చర్చ జరిగింది. ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి అని భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రంలో పూర్తిగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బోగస్ ఓటర్లను ఏరివేయడానికి ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలకు సహకరిస్తామన్నారు. ముందు హైదరాబాద్‌లో, తరువాత రాష్ట్రమంతా ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్‌ను అనుసంధానం చేస్తామన్నారు. నగరంలో ఈ కార్యక్రమాన్ని 15 నుంచి20 రోజుల్లోనే వందశాతం పూర్తిచేస్తామని చెబుతూ.. హైదరాబాద్‌లో ఆధార్ నంబరుతో అనుసంధానం కాని ఓటర్లకు ఓటు హక్కు ఉండదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోనే అత్యధికంగా బోగస్ ఓటర్లు..
హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది బోగస్ ఓటర్లుండే అవకాశం ఉన్నందున, మొదట ఇక్కడే పని ప్రారంభించాలని సీఎం కోరారు. ఇక్కడే దాదాపు 15 లక్షల మందికి బోగస్ ఓటర్లున్నట్టు అంచనా ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం ప్రకారం జనాభాలో 66% ఓటర్లుండాల్సి ఉండగా.. హైదరాబాద్‌లో ఆ శాతం చాలా ఎక్కువగా ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజన జరగాల్సి ఉన్నందున, అంతకన్నా ముందే ఓటర్ల జాబితా రూపొందించాలని కోరారు. 
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలుండగా 24 హైదరాబాద్‌లోనే ఉన్నాయని, ఈ బోగస్ ఓట్లు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని అన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు. రాజకీయ పార్టీలుకూడా సహకరించాలని అభ్యర్థించారు. ఆధార్‌తో అనుసంధానంకాని వారికి ఒకటికి రెండుసార్లు విజ్ఞప్తి చేయాలని, అయినా అనుసంధానం చేసుకోకుంటే.. జాబితా నుంచి పేర్లు తొలగించాలని అన్నారు. సాధారణ ఎన్నికలకు, స్థానిక ఎన్నికలకు ఒకే ఓటరు జాబితా ఉండాలని సీఎం చెప్పారు. సమావేశంలో సీఎస్ రాజీవ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతికుమారిలు పాల్గొన్నారు. (-నమస్తే తెలంగాణ)


Monday 20 July 2015

గోల్కొండ బోనాలు ప్రారంభం

* రాష్ట్ర మంత్రులు నాయిని, పద్మారావు ప్రత్యేక పూజలు
తెలంగాణలో ఆషాఢమాస బోనాలు హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని గోల్కొండ కోటలో జులై 19న మొదలయ్యాయి. రాష్ట్రంలో జరిగే బోనాల ఉత్సవాల్లో గొల్కొండ బోనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడ బోనాలు ప్రారంభమైన తర్వాతే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, పాతబస్తీ.. ఆ తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో బోనాల పండుగను రాష్ట్రప్రభుత్వ పండుగగా ప్రకటించేందుకు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. కానీ గత ఏడాది తెలంగాణ ఏర్పాటైన వెంటనే కొలువుదీరిన కొత్త ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా ప్రకటించింది. బోనాల పండుగ అంటే కుటుంబ సుఖ సంతోషాలకు సంబంధించిన ఉత్సవం. బాగా వర్షాలు కురిసి సాగు, తాగునీరు లభించాలని.. తద్వారా పంటలు పండి ఐష్టెశ్వర్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతూ ప్రజలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. 
  గోల్కొండ కోటలోని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టీ పద్మారావుతో కలిసి తొలి బోనాల మొదటి పూజ నిర్వహించారు. మంత్రి పద్మారావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ఘనంగా బోనాల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సీఎం కే చంద్రశేఖర్‌రావు బోనాల నిర్వహణకు అవసరమైన నిధుల విడుదలకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టీ పద్మారావు మాట్లాడుతూ వర్షాలు పడి ప్రజలకు తాగు, సాగునీరు లభించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. 
    ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ అశోక్‌గౌడ్, బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ కోయల్‌కార్ గోవిందరాజ్, సభ్యులు ఎన్ చంద్రకాంత్, ఎన్ పల్లవి, జీ చంద్రశేఖర్, మాజీ చైర్మన్లు సత్యంరెడ్డి, విజయ్‌కుమార్, బాల ప్రసాద్ తివారీ, టీఆర్‌ఎస్ కార్వాన్ ఇన్‌చార్జి జీవన్‌సింగ్, నేతలు కావూరి వెంకటేశ్, చంద్రశేఖర్‌రెడ్డి, మైత్రి - శాంతి కమిటీల నాయకులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. (-నమస్తే తెలంగాణ)

Thursday 9 July 2015

మనసుకు ఇంధనం ఆత్మ విశ్వాసం

   ఒక చిన్న మెచ్చుకోలు ఎంతో నమ్మకాన్ని పెంచుతుంది..ఒక చిన్న ప్రోత్సాహపు మాట కొండంత ధైర్యాన్నిస్తుంది..ఈ నమ్మకం, ధైర్యాలే జీవితాన్ని మలుపు తిప్పే ఆత్మ విశ్వాసానికి కారణం కావచ్చు. ఆ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని అరచేతికి అందించనూవచ్చు.
      ఆత్మవిశ్వాసం లేదా ఆత్మాభిమానం అంటే మనం ఇతరుల పట్ల చూపించే ప్రేమ, అభిమానం, శ్రద్ధ, విలువ వంటివన్నీ కూడా మనకి మనం చేసుకోవడం. మన గురించిన మన అభిప్రాయం సమయానుసారం మారుతుంటుంది. ఆత్మవిశ్వాసం అనేది జీవితకాలమంతా ఒకే విధంగా ఉండదు. పరిస్థితులను అనుసరించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిచుకోవచ్చు. 
     మనలో ఆత్మ విశ్వాసం పెరగడానికి దోహదం చేసే అంశాలు ఎన్నో ఉంటాయి. కానీ రెండు విషయాలు ముఖ్యమైనవి. మనలను ఇతరు అంచనా వేసే విధానం, మనలను మనం అంచనా వేసుకునే విధానం తల్లిదండ్రులు, టీచర్లు, ఇతర పెద్దవారి ప్రవర్తన మనలోని ఆత్మ విశ్వాసం పెంపొందించుకోవడానికి దోహదం చేస్తుంది. 
     ఇది చిన్న పిల్లలుగా ఉన్నపుడు మరింత ఎక్కువ ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రులు పిల్లల పనులను మెచ్చుకోవడం కంటే విమర్షించడమే ఎక్కువగా ఉన్నపుడు వారు ఆత్మవిశ్వాసంతో పెరగడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే టీనేజ్‌లోనే జీవితం పట్ల సొంత అభిప్రాయాలు, విలువలు ఏర్పరుచుకొవడం మొదలవుతుంది. పిల్లలు పెద్దలు చెప్పిన దాన్ని వారి ప్రవర్తనను గమనించే వారి అభిప్రాయాలను విలువలను ఏర్పరుచుకుంటారు. ఎక్కువగా ఊహించడం లేదా కలల్లో బతకడం కూడా కొంత మందిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడానికి కారణమవుతుంది. తమ సామర్థ్యం ఎంత(లేదా తాము భవిష్యత్తులో ఏం కావాలి) అనే దాని గురించి ప్రతి ఒక్కరికి ఒక అంచనా ఉంటుంది. ప్రతి ఒక్కరు తమకు ఆదర్శంగా ఎవరో ఒకరిని తీసుకుంటారు. ఉదాహరణకు కొంత మందికి క్రీఢాకారులు స్ఫూర్తినిస్తే కొంత మందికి అకడమిక్‌గా మెరుగ్గా ఉన్నవారిని చూసి స్ఫూర్తిని పొందుతారు. 
    సాధారణంగా తమలో ఏ సామర్థ్యం ఉందని భావిస్తారో అలాంటి సామర్థ్యాలున్న వారినే తమకు ఆదర్శంగా తీసుకుంటారు. ఉదాహరణకు చాలా త్వరగా స్నేహితులతో కలిసిపోవడం అనేది ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి దోహదం చేస్తుంది. వారిలో లేని సామర్థ్యాలు కలిగిన వారిని ఆరాధించే వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంటుంది. అయితే దురదృష్ట వశాత్తు ఆత్మ న్యూనత తో బాధపడే వారందరిలోనూ సామర్థ్యానికి ఎలాంటి లోటు ఉండదు. కానీ అది వారిని వారు సరిగ్గా అంచనా వేసుకోలేక పోవడం వల్ల వస్తుంది సమస్యంతా.
ఆత్మ విశ్వాసం పెంపొందించుకునే మార్గాలు
* వ్యతిరేక భావనలను గుర్తించాలి - మీలో ఆత్మ విశ్వాసం సన్నగిల్లేందుకు కారణమైన విషయాలను, సందర్భాలను, భావనలను గుర్తించాలి. అందువల్ల మీలో ఉన్న వ్యతిరేక భావనలను మీరే గుర్తించగలుగుతారు. ఉదాహరణకు మీరు ఒక పరీక్ష రాయలేకపోయారు (వ్యతిరేక ప్రవర్తన)అందుకు కారణం మీరు పరీక్ష కొరకు సరిగ్గా సిద్ధం కాలేదు (వ్యతిరేక నమ్మకం) అందువల్ల మీరు పరీక్ష తప్పే అవకాశం ఉంటుంది (వ్యతిరేక భావన) దీనంతటికి అంతరాలలో మీలో అంత సామర్థ్య లేదన్న (వ్యతిరేక)నమ్మకం. లేదా ఏదో పార్టీలో ఎక్కువగా తాగుతారు (వ్యతిరేక ప్రవర్తన) అది మీరు అందంగా లేకపోవడం వల్ల మీతో ఎవరు మాట్లడరేమో అనే ఆందోళనను దూరం చేసుకోవడానికి (భావన) 
* మీలోని వ్యతిరేక భావనలను సవాలు చెయ్యాలి - మనలను మనం ఉన్నదున్నట్టుగా అంగీకరిస్తామని అనుకుంటాము కానీ మనం అది నిజం కాదు. మీరు మీలోని వ్యతిరేక భావనలను గుర్తించి వాటిని లాజికల్‌గా విశ్లేషించుకొని అది నిజమేనా అని ఒకసారి ఆలోచించాలి. దానికి వ్యతిరేకంగా గట్టి ఆధారాలను వెతకాలి. ఉదాహారణకు మీరు మీకు తెలివైన వారిగా అనిపించడం లేదు, కానీ మీరు మీ పరీక్షలన్నీ కూడా పాసైపోయారు, క్లాస్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మీరు తెలివైన వారుగా మీకు అనిపించిన అన్ని సందర్భాలను గుర్తు చేసుకోవాలి. 
మీతో మీరు అనుకూలంగా మాట్లాడుకోవాలి - మీతో మీరు వ్యతిరేకంగా మాట్లాడుకోవడం వల్ల ఆత్మ విశ్వాసానికి చాలా నష్టం వాటిల్లుతుంది. మిమ్మల్ని మీరు విమర్శించుకోవాల్సి వచ్చినపుడు ఎవరైనా స్నేహితుడు తప్పుచేసినపుడు ఎలా విమర్శిస్తామో అలా మాట్లాడుకోవాలి. మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి, మీ పట్ల మీరు కరుణతో అనుకూల ధోరణితో వ్యవహరించాలి. ఎదుటి వారు మెచ్చుకునే మెచ్చుకోళ్లను ఆనందంగా స్వీకరించాలి. మీలో ఉన్న మంచి లక్షణాలను గర్తించి వాటిని తలచుకొని గర్వించాలి.
* ఇతరులతో పోల్చుకోవద్దు - ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం సన్నగిల్లడమే కాదు జీవితంలో సంతోషం కూడా మిగలదు. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం కాకుండా ఇతరులను నిశితంగా గమనిస్తుండాలి. మీలోని ఉన్న మంచి లక్షణాల మీద దృష్టి నిలపాలి. మీలో లేని వాటి గురించి పెద్దగా పట్టించుకోకూడదు. గతంలో మిమ్మల్ని ప్రస్తుతపు మీతో పోల్చుకొని ఎంత మెరుగ్గా ఆలోచించగలుగుతున్నారు, పనులు ఎంత సమర్థవంతంగా పూర్తి చెయ్యగలుగుతున్నారు అన్న దాని మీద దృష్టి నిలపాలి. ఇది మీలో ఆత్మవిశ్వాసం నింపుకోవడానికి దోహదం చేస్తుంది.
* పూర్తి చెయ్యడం మీద దృష్టి నిలపాలి - పనులన్నీ పర్‌ఫెక్ట్‌గా చెయ్యడం గురించి కాకుండా పూర్తి చెయ్యడం మీద దృష్టి నిలపాలి. పర్‌ఫెక్ట్‌గా చెయ్యాలన్న ఆలోచనతో అసలు పనులు ప్రారంభించనే ప్రారంభించరు కొందరు. ఉదాహారణకు 10 కిలోల బరువు తగ్గితే తప్ప నేను ఆడలేను అనుకంటారు. అలా కాకుండా వీలైనంత వరకు ఆడుతుండాలి. 
అపజయాలన్ని విజయానికి సోపానాలు - తప్పులు చెయ్యడం, అపజయాలు ఎదురవడం అనేది సాధారణ విషయం అని అనుకోవాలి. అపజయాలు, తప్పులు నేర్చుకోవడంలో భాగం. చేసిన తప్పులు మరోసారి జరగకుండా చూసుకోవడం ముఖ్యం. తప్పులు చెయ్యడం మీ సామర్థ్యానికి ప్రతీకగా భావించకూడదు. నేను వెయ్యిసార్లు అపజయం పాలైనట్టుగా అనిపించలేదు నాకు కానీ అపజయాలకు వెయ్యి మార్గాలున్నాయని తెలుసుకున్నాను. అనే ఎడిసన్ మాటను ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు. మీరు ఆపని చెయ్యడానికి ఎంత అంకితభావంతో కృషి చేశారనే దాన్ని గుర్తుపెట్టుకోండి. 
* కొత్త పనులు ప్రయత్నించండి - రకరకాల కొత్త పనులు చెయ్యడానికి ప్రయత్నించండి. అందువల్ల మీలో దాగి ఉన్న సామర్థ్యాలు బయటపడుతాయి. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. 
* మీలో మార్చుకోవాల్సిన వాటిని గుర్తించండి - మీలో మీరు మార్చుకోగలిగి మార్చుకోవాల్సిన అంశాలను గుర్తించి మార్చుకునేందుకు ప్రయత్నిస్తే మంచిది. మార్పును ఆహ్వానించడం ఈరోజే మొదలు పెట్టండి. మీలో మార్చుకోలేని విషయాల (ఎత్తు, అందం వంటివి) గురించి పెద్దగా పట్టించుకోకూడదు. 
* లక్ష్యాలను నిర్ణయించుకోవడం - మీరు సాధించాల్సిన లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. స్పష్టంగా కనిపించే, సాధించగలిగే లక్ష్యాలను నిర్దేషించుకోవాలి. మీరు ఎంత వరకు మీ లక్ష్యానికి చేరువగా వచ్చారు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించి చూసుకోవడం ద్వారా జరుగుతున్న ప్రగతి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. 
* మీ అభిప్రాయాలను అవసరమున్న చోట తెలియజేయడానికి వెనుకాడకూడదు. 
* మీ వంతు సాయం అందించండి - మీ కష్టంలో ఉన్న మీ తోటి వారికి సాయం చెయ్యండి. ఒక మంచి కారణం కోసం పరుగెడుతున్న వారితో కలిసి పాలుపంచుకోండి, ఏదైనా సామాజిక సేవా కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనండి. 
వ్యాయామం- వ్యాయామం చెయ్యడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం కూడా పెంపొందుతుంది. నేను ఇంకా కొంచెం సన్నగా ఉండి ఉంటే నాకు ఎక్కువ మంది స్నేహితులుండి ఉండేవారు వంటి ఆలోచన ఎప్పుడూ చెయ్యకూడదు. మీకు నచ్చిన వారితో సమయం గడపండి, మీకు నచ్చిన పనులు చేస్తూ ఆనందించండి మీరు చేసే ప్రతి పనిలోనూ మీ ఆత్మవిశ్వాసం తన వంతు పాత్ర పోషిస్తుంది. ఆత్మవిశ్వాసంతో మసలే వారు స్కూల్‌లోనూ, పనిచేసే చోట చాలా సమర్థవంతంగా ఉంటారు. అంతేకాదు చాలా త్వరగా మనుషులతో కలిసిపోతారు, కొత్త స్నేహితులను చేసుకోగలుగుతారు. వారి మానవసంబంధాలు కూడా సమర్థవంతంగా ఉంటాయి. చాలా త్వరగా తప్పులను తెలుసుకోగలుగుతారు, అసంతృప్తులను, అపజయాలను అధిగమించగలుగుతారు. వారు విజయం సాధించే వరకు ఏ పనిని వదిలిపెట్టరు. 
   ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవడం కొద్దిగా కష్టం కావచ్చు. కానీ ఒక్కసారి దాన్ని సాధిస్తే జీవితాన్ని ఆనందంగా గడపడం సాధ్యపడుతుంది. కొన్ని సార్లు చాలా లోతుగా మనసు గాయపడినపుడు ఆత్మవిశ్వాసం కోల్పోవడం సాధారణమే. అలాంటి సందర్భాలలో నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది.