Monday 20 July 2015

గోల్కొండ బోనాలు ప్రారంభం

* రాష్ట్ర మంత్రులు నాయిని, పద్మారావు ప్రత్యేక పూజలు
తెలంగాణలో ఆషాఢమాస బోనాలు హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని గోల్కొండ కోటలో జులై 19న మొదలయ్యాయి. రాష్ట్రంలో జరిగే బోనాల ఉత్సవాల్లో గొల్కొండ బోనాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడ బోనాలు ప్రారంభమైన తర్వాతే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, పాతబస్తీ.. ఆ తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో బోనాల పండుగను రాష్ట్రప్రభుత్వ పండుగగా ప్రకటించేందుకు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. కానీ గత ఏడాది తెలంగాణ ఏర్పాటైన వెంటనే కొలువుదీరిన కొత్త ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా ప్రకటించింది. బోనాల పండుగ అంటే కుటుంబ సుఖ సంతోషాలకు సంబంధించిన ఉత్సవం. బాగా వర్షాలు కురిసి సాగు, తాగునీరు లభించాలని.. తద్వారా పంటలు పండి ఐష్టెశ్వర్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతూ ప్రజలు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. 
  గోల్కొండ కోటలోని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టీ పద్మారావుతో కలిసి తొలి బోనాల మొదటి పూజ నిర్వహించారు. మంత్రి పద్మారావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ఘనంగా బోనాల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సీఎం కే చంద్రశేఖర్‌రావు బోనాల నిర్వహణకు అవసరమైన నిధుల విడుదలకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టీ పద్మారావు మాట్లాడుతూ వర్షాలు పడి ప్రజలకు తాగు, సాగునీరు లభించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. 
    ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ అశోక్‌గౌడ్, బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ కోయల్‌కార్ గోవిందరాజ్, సభ్యులు ఎన్ చంద్రకాంత్, ఎన్ పల్లవి, జీ చంద్రశేఖర్, మాజీ చైర్మన్లు సత్యంరెడ్డి, విజయ్‌కుమార్, బాల ప్రసాద్ తివారీ, టీఆర్‌ఎస్ కార్వాన్ ఇన్‌చార్జి జీవన్‌సింగ్, నేతలు కావూరి వెంకటేశ్, చంద్రశేఖర్‌రెడ్డి, మైత్రి - శాంతి కమిటీల నాయకులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. (-నమస్తే తెలంగాణ)

No comments:

Post a Comment