Monday 29 April 2013

పచ్చని తెలంగాణ నా కల..

- ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అన్నిరంగాలకు పెద్దపీట
- రూ. లక్ష లోపు రైతు రుణాలు మాఫీ
- నిరుపేద దళితులకు మూడెకరాల భూమి
- అందరికీ సొంతిల్లు.. రూ. రెండు లక్షలతో డబుల్ బెడ్‌రూం
- 10 జిల్లాల తెలంగాణ.. 24 జిల్లాలుగా ఏర్పాటు
- తండాలు గ్రామ పంచాయతీలుగా గుర్తింపు
- గిరిజనులు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు
- వక్ఫ్ భూముల రక్షణకు ప్రత్యేక చట్టం
- కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య
- వృద్ధులకు రూ. వేయి, వికలాంగులకు రూ. 1500 పింఛన్లు
                                      
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని పుష్కరకాలంగా అవిశ్రాంతంగా ముందుకు తీసుకెళ్తున్న టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తాము ఏం చేస్తామో ప్రకటించారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. పచ్చని తెలంగాణ తన కల అని, అది నెరవేర్చేందుకు వ్యవసాయంతో పాటు అన్నిరంగాలకు పెద్దపీట వేస్తామన్నారు. ప్రజలను అభివృద్ధిబాటలో నడిపిస్తామని శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన టీఆర్‌ఎస్ 12వ ఆవిర్భావ సభలో స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, బ్రాహ్మణులు, స్వర్ణకారులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, విద్యార్థులు... ఇలా ప్రతి వర్గానికి మేలు చేసేందుకు పథకాలను ఆయన ప్రకటించారు. స్వీయ రాజకీయ శక్తిగా అవతరించి, శాసించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామన్నారు.
కేసీఆర్ ప్రకటించిన వరాలు...
                 ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతమున్న తెలంగాణ పది జిల్లాల స్థానంలో 24 జిల్లాల ఏర్పాటు (ప్రతి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లా చొప్పున) చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకువస్తామని, నిరంతరాయంగా 8 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను రెండు విడతలు అందజేస్తామన్నారు. ఐదు వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి మిగులు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కూరగాయల సాగుకు పెద్ద పీట వేస్తామని, అందుకు గ్రీన్‌హౌస్ కల్టివేషన్ పద్ధతి అమలు చేస్తామని, ఈ పద్ధతి ద్వారా కూరగాయల ఉత్పత్తి నాలుగింతలు సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పచ్చని తెలంగాణ తన కల అని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలోని 21 లక్షల మంది రైతులకు ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామని, రైతులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు అవసరమైన పథకాలన్నీ అమలు చేస్తామని, మార్కెటింగ్, గిట్టుబాటు ధర, రుణ సౌకర్యాలు, వివిధ పంటల పరిశోధన కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిరుపేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి ఇస్తామని, ఎక్కడబడితే అక్కడ ఉన్న భూములను ఒకే చోట ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని, దీనికి కమతాల ఏకీకరణ కార్యక్రమం ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా భూముల బదిలీ చేపడతామని ప్రకటించారు. భూముల యజమానులతో సంప్రదించి, వారిని ఒప్పించి భూములు ఒకే చోట ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడులను ఒకసారి ప్రభుత్వ భరించడం, పెట్టుబడులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా రైతులకు అవకాశం కల్పించడం, వ్యవసాయానికి అవసరమైన నీళ్లు ఉచితంగా అందించడం వంటి చర్యలు కూడా తీసుకుంటామన్నారు. 
గ్రామపంచాయతీలుగా తండాలు
               కనీస అవసరాలు లేకుండా బాహ్యప్రపంచానికి ఆమడ దూరంగా ఉన్న లంబాడ తండాలకు గ్రామ పంచాయతీలుగా గుర్తింపు కల్పిస్తామని కేసీఆర్ ప్రకటించారు. గ్రామ పంచాయతీలుగా మారిన తండాల్లో ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, ముస్లిం మైనారిటీలకు కూడా 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. వక్ఫ్ భూములను కాపాడేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని వెల్లడించారు. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూములను ముస్లింలకే దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. వెనుకబడిన తరగతుల వారికి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, జనాభాలో యాభై శాతానికి మించి ఉన్న బీసీలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని, ప్రభుత్వ పరంగానే విద్యార్థులకు యునిఫాంలు, పుస్తకాలు, బూట్లు పంపిణీ చేస్తామన్నారు. అన్ని కులాలవారిని కలిపి ఒకే చోట స్టేట్ రెసిడెన్సియల్ హాస్టల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక్కడ కులాల ప్రస్తావన అనేది ఉండదని, సీబీఎస్‌ఈ సిలబస్ విద్య అందజేస్తామని, స్టేట్ రెసిడెన్సియల్ హాస్టల్ నుంచి ఒక్క బ్యాచ్ బయటికి వెళితే చాలు ప్రపంచ స్థాయి పోటీలను తట్టుకునే విధంగా ఉంటారని, ఇది తన జీవిత కల అని కేసీఆర్ వెల్లడించారు. 
వృద్ధులకు, వికలాంగులకు భరోసా
            వృద్ధులకు రూ. వేయి, వికలాంగులకు రూ. 1500 పింఛన్లు అందజేస్తామని కేసీఆర్ వెల్లడించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాల భూమికి సాగు నీరు అందిస్తామని, సింగరేణిలో కొత్త గనులను ప్రారంభిస్తామని, ప్రస్తుతమున్న విధానం వల్ల సింగరేణి కార్మికులకు నష్టం జరుగుతున్నందున నూతన గనులను ప్రారంభించే పథకంపై కసరత్తు చేపడతామని, దానికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ఖరారు చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో ఉన్న 81 లక్షల కుటుంబాల స్థితిగతులపై సర్వే జరిపించి, ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? వారికున్న వసతులేంటీ?, వారి జీవనం ఎలా సాగుతోంది?, వారికి అవసరమైన సౌకర్యాలేమిటీ? వంటి అన్ని అంశాలపై సర్వే ద్వారా తెలుసుకొని, ఈ సర్వే ఆధారంగా ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ సొంతిల్లు ఉండేలా చూస్తామని, రెండు లక్షల రూపాయల ఖర్చుతో డబుల్ బెడ్‌రూం నిర్మింపజేస్తామని చెప్పారు. ఇంకా.. ‘మంచినీటి సౌకర్యాలు పకడ్బందీగా అమలు. ప్రతి ఇంటికి తాగునీరు అందే విధంగా చర్యలు. ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గంలో అమలు చేస్తున్న విధంగా తాగునీటి పథకం తెలంగాణవ్యాప్తంగా అమలు’ చేపడతామని కేసీఆర్ వెల్లడించారు. కల్లు గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని, చేనేత, బీడీ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
           హైదరాబాద్‌లో కల్లు నిషేధాన్ని ఎత్తివేస్తామని, గీత కార్మికులను అన్నిరకాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని,అదేవిధంగా దేవాలయాల్లో ప్రభుత్వ, రాజకీయ జోక్యం లేకుండా చేస్తామని, ఇందులో రాజకీయ కమిటీలు ఉండవని, దేవాదాయ శాఖను రద్దు చేస్తామని, వేద పండితులతో కూడిన ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఉన్న లక్షలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేస్తామని, తెలంగాణలో కాంట్రాక్ట్ విధానం ఉండదని, అంతా పర్మినెంట్ ఉద్యోగాలేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ జీతభత్యాలు అందజేస్తామని, ప్రతి ఉద్యోగికి మెరుగైన జీతభత్యాలు అందిస్తామని,సర్వీసు రూల్స్ కూడా సరళీకృతం చేస్తామని, ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
-(టీ మీడియా)

Thursday 25 April 2013

టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవం..


హైదరాబాద్: ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి గడువు ముగిసే సమయానికి అధ్యక్షుడిగా కేసీఆర్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల కమిటీ ప్రకటించింది. అయితే, ఈనెల 27న ఆర్మూరు ప్రతినిధుల సభలో అధికారికంగా ప్రకటించేందుకు పార్టీ వర్గాలు నిర్ణయించాయి.

ఖనిజ సంపద ఉందని బయ్యారంలో ప్లాంట్ పెట్టాలా?


- నాలుగేళ్లలో ఖనిజం అయిపోతే ఎట్లా?
- రక్షణ స్టీల్స్‌కు బయ్యారం గనుల కేటాయింపు 
- రాష్ట్ర కేబినెట్ దృష్టికి రాకుండానే జరిగింది
- జీవోను వ్యతిరేకించినవారిలో నేను
  ఒకడిని:పీసీసీ చీఫ్ బొత్స
- నాలుగేళ్లలో ఖనిజం అయిపోతే.. తర్వాత
  పరిస్థితేంటీ?
- తెలంగాణకు ఉక్కు కర్మాగారం రావాల్సిందే
- అయితే విశాఖకు ఉక్కు తరలింపును
  అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నా: బొత్స

                     తెలంగాణలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. అందుకు కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం వ్యతిరేకం కాదని, ఎవన్ని చెప్పుకున్నా, ఇది మా పార్టీ అభివూపాయమని స్పష్టం చేశారు. అయితే బయ్యారం ఖనిజ సంపదను తరలించవద్దనడం, అక్కడ ఖనిజ సంపద ఉంది కనుక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనడంలో అర్థం లేదని అన్నారు. ‘‘స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి బయ్యారం ఏమైనా సెంట్రల్ ప్లేసా?. వరంగల్, కరీంనగర్‌లో.. తెలంగాణలో ఎక్కడైనా ప్రముఖ పట్టణంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసుకుని ఇనుమును అక్కడికి తరలించుకోవచ్చు కదా..’’ అని బొత్స పేర్కొన్నారు. తెలంగాణలో స్టీల్ ప్లాంట్ కావాలని ఇంత కాలం ఎందుకు అడగలేదు? అని ప్రశ్నించారు. కాగా, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదంటూ రెండు రోజుల క్రితం బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. 
                         టీ కాంగ్రెస్ నేతలు సహా విపక్షాలు బొత్స వ్యాఖ్యలను తప్పుబట్టాయి. దీనిపై బుధవారం గాంధీభవన్‌లో బొత్స స్పందిస్తూ.. ‘‘మన రాష్ట్ర తీరంలో లభిస్తున్న గ్యాస్‌ను గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లకు తరలించుకుపోవడం లేదా? దానికి ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. అదే బయ్యారం ఉక్కును విశాఖ స్టీల్‌కు తరలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇంత రాద్దాంతం ఎందుకు?’’ అని రాజకీయ పార్టీల నేతల తీరుపై ధ్వజమెత్తారు. విశాఖలో ఉక్కు పరిక్షిశమ ఉన్నప్పటికీ చుట్టుపక్కల రెండు వందల కిలోమీటర్ల వరకు ఎక్కడ ఒక టన్ను ఇనుప ఖనిజం లభించదని.. ఏళ్లుగా పరిక్షిశమ విజయవంతంగా నడవడం లేదా? అని ప్రశ్నించారు. బయ్యారం ఖనిజ సంపదను తరలించవద్దనడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.
                 ఖనిజ సంపద ఉందని బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని డిమాండ్ చేస్తే ఏలా? అక్కడి ఖనిజ సంపద నాలుగేళ్లలో అయిపోతే, ఆ తర్వాత పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ గతంలోనే తీర్మానం చేసిందని అన్నారు. పరిక్షిశమ వేరు, ఫీజిబులిటీ వేరని, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఫీజిబులిటీ ఉందా? లేదా? అనేది సాంకేతికంగా తీసుకునే నిర్ణయమని అన్నారు. ఖనిజ సంపద ఉన్న బయ్యారంలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకరించని ప్రభుత్వం.. తెలంగాణలో మరో చోట ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అంగీకరిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడటం లేదా? ఎవరు కాదన్నా తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారా? లేదా?. తెలంగాణ సమస్యకు ఏదో ఒక రోజు పరిష్కారం వస్తుంది.. అదే తరహాలో స్టీల్ ప్లాంట్‌కు కూడా మో క్షం లభించవచ్చు’’ అని పేర్కొన్నారు. 
‘రక్షణ’.. కేబినెట్ దృష్టికి రాలేదు 
                     బయ్యారం గనులను రక్షణ స్టీల్స్ సంస్థకు కేటాయిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి రాకుండానే జరిగిపోయాయని బొత్స అన్నారు. జీవో వచ్చి న తర్వాత నాతో సహా కొందరు వ్యతిరేకించామని తెలిపారు. ఓబుళాపురం గనుల కేటాయింపు కూడా మంత్రివర్గం దృష్టికి రాలేన్నారు. కాగా, తాము తప్పులు చేస్తే సరిదిద్దుకున్నామని బొత్స పేర్కొంటూ.. గతంలో రక్షణ స్టీల్‌కు బయ్యారం గనులను కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశామంటూ చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తాజాగా చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. ‘‘ఇప్పుడు కొందరు వచ్చి బయ్యారం గనులకు, బ్రదర్ అనిల్‌కు సంబంధం లేదని, ఒక వేళ రుజువు చేస్తే రాజకీయంగా సన్యాసం తీసుకుంటామని పేర్కొనడం.. ముఖ్యంగా ఆ అమ్మ (విజయమ్మ) చెప్పడం సరికాదు’’ అని బొత్స అన్నారు.
-టీ మీడియా

Monday 22 April 2013

ఉక్కు మా హక్కే...

* బయ్యారంలోనే స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి..
* ప్రధానికి లేఖ రాస్తా 
* ఇంటికో సంతకంతో కోటి సంతకాలను సేకరిస్తాం..
* కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం
* తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనన్న సీఎం, కాంగ్రెస్‌లకు ఒక్క ఓటూ
   పడనీయం
* వచ్చిన తెలంగాణను అడ్డుకున్న టీడీపీకి ఒక్క సీటూ రానీయంఇక
   తెలంగాణ నినాదం ఇదే
* టీడీపీ, కాంగ్రెస్‌లను నామరూపాల్లేకుండా చేస్తాం
* టీడీపీని వంద శాతం నాశనం చేస్తాం.
* టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మండిపాటు

హైదరాబాద్, ఏప్రిల్ 21: 'ఖమ్మం జిల్లా బయ్యారంలోనే స్టీల్ ఫ్యాక్టరీని పెట్టాలి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అపారమైన ఖనిజ నిక్షేపాలున్నాయి. కొత్త స్టీల్ ఫ్యాక్టరీ కోసం ప్రధానమంవూతికి లేఖ రాస్తా. ప్రతినిధి బృందంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుస్తాం. ఇంటికో సంతకంతో కోటి సంతకాలను సేకరించి, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాలోకాని, వరంగల్ జిల్లాలోకాని స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే విషయంలో ముఖ్యమంత్రి భేషజాలకు పోవద్దు అని ఆయన సూచించారు. తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు అవసరమైన అన్ని రకాల ముడిసరుకులు అందుబాటులో ఉన్నాయన్నారు. డోలమైట్, క్వార్ట్, గోదావరి నీళ్లు, రైల్వే లైన్, బొగ్గు, విద్యుత్, ఇతర వనరులన్నీ ఉన్నాయని ఆయన చెప్పారు. గనులను కేటాయించినపుడు కేంద్రానికి డిమాండ్, పరిమితులు పెట్టే విశేష అధికారాలు రాష్ట్రానికి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దులో కొత్త స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. ఒత్తిడి తీసుకురాలేకపోతే, క్యాబినేట్ నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ ఫ్యాక్టరీని సాధించేదాక టీఆర్‌ఎస్ ఉద్యమిస్తుందని వెల్లడించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘బాబు సొల్లు పురాణాన్ని వల్లిస్తున్నారు. టీడీపీ కూలిపోయి, కుంటుతోంది. అధికారంలోకి వచ్చే ఆశల్లేవు. నిరాశ, నిస్పృహలతో బాబు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. టీఆర్‌ఎస్‌ను ఫాంహౌజ్ పార్టీ అంటావా?.. అవును మాది ఫాం-హౌజ్ పార్టీయే. అక్కడ వ్యవసాయం చేస్తున్నా. ప్రభుత్వాన్ని ఫాం చేసేది మేమే. బాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో, ఏబీఎన్ ఛానల్‌లో దిక్కుమాలిన కథనాలు వేస్తున్నారు. ఇవి బాబు అజ్ఞానానికి, రాధాకృష్ణా పిచ్చి అక్కసుకు నిదర్శనం’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘రక్షణ స్టీల్స్‌పై ముందుగా స్పందించిందే టీఆర్‌ఎస్. బయ్యారంలో క్షేత్ర స్థాయిని టీఆర్‌ఎస్ బృందం సందర్శించింది. టీడీపీకి సొల్లు, సోయి లేని సమయంలోనే టీఆర్‌ఎస్ స్పందించింది. ప్రజలను సమీకరించి ఆందోళనలు చేశాం, బైక్ ర్యాలీలను నిర్వహించాం.
                 ఖమ్మం జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు.టీఆర్‌ఎస్‌ను సూట్‌కేసుల పార్టీ అంటావా? సూట్‌కేసులు మోసే దిక్కుమాలిన అలవాటు బాబుకే ఉంది. అవిశ్వాసం సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి బట్టలు విప్పి నగ్నంగా, నిస్సిగ్గుగా మద్దతునిచ్చిందే బాబు. అప్పుడు ఎన్ని సూట్‌కేసులు మోశారో బాబు జవాబు చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీని రెండు రకాల పార్టీగా చెప్పొచ్చు అని, దాన్ని బాబే నిర్ణయించుకోవాలన్నారు. టీడీపీని పిల్లి గడ్డం, బొల్లి పార్టీ అనాలా?, పాలు, కూరగాయలు అమ్మె హెరి పార్టీ అనాలా? అన్నది చంద్రబాబే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. బాబూ! ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు, మాటలు జాగ్రత్త అని హెచ్చరించారు. అవాస్తవాలు మాట్లాడుతున్న బాబు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, అబిడ్స్‌లో ముక్కు నేలకు రాయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తప్పుడు కథనాలను ప్రచురిస్తూ రాధాకృష్ణ తెలంగాణపై, టీఆర్‌ఎస్‌పై విష ప్రచారాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటే ప్రాంతీయ వాదమవుతుందా? దీనిపై అడ్డగోలు రాతలేంటీ?.. రాధాకృష్ణా పిచ్చి ఎవరిది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని ఉద్యమాలు చేస్తే తప్పు అనిపించదు, అదే తెలంగాణలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలంటే తప్పు అవుతుందా? అని ప్రశ్నించారు. ఆనాడు లేని ప్రాంతీయ కోణం ఇప్పుడెందుకో? అని రాధాకృష్ణను నిలదీశారు. మెదక్ జిల్లా దుబ్బాకలో హైస్కూల్‌లో చదువుకుంటున్న రోజుల్లో విశాఖ ఉక్కు ఆందోళన సందర్భంగా తాను లాఠీ దెబ్బలు తిన్న విషయం ఇంకా గుర్తు ఉందన్నారు. విశాఖ స్టీల్స్‌లో 35వేల మందికి ఉద్యోగాలు ఉంటే అందులో తెలంగాణ వాళ్లు ఎంతమంది ఉన్నారు? మూడు, నాలుగు వందల మంది కూడా ఉండరని కేసీఆర్ చెప్పారు. లెక్క ప్రకారం 42శాతం ఉద్యోగాలు తెలంగాణ వాళ్లకు ఉండాలన్నారు. దీనికి రాధాకృష్ణ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. టీడీపీకి, రాధాకృష్ణకు రాష్ట్రవాదం లేదు, జాతీయ వాదమూ లేదన్నారు. విశాఖ ఉక్కు ద్వారా ఆంధ్రవాళ్లకు 10-15వేల మందికి ఉద్యోగాలు లభించాయి, తెలంగాణలో ఉక్కు ఫ్యాక్టరీ పెడితే ఇక్కడి వాళ్లకూ 10-15వేల ఉద్యోగాలు దొరుకుతాయి, ఉద్యోగాలు అడగటం తప్పా? ఇది సంకుచితమా? అని ఆయన రాధాకృష్ణను ప్రశ్నించారు. పోరాడితేనే రాష్ట్రానికి గ్యాస్ వచ్చింది, ఎన్‌టీపీసీ వేయి మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం పోరాడితే సంహావూదిలో పెట్టారు. పోరాడితేనే రామగుండం ఎన్‌టీపీసీలో తెలంగాణకు 31.9శాతం ఉద్యోగాలు వచ్చాయి. 
              ఈ విషయాల్లో రాధాకృష్ణకు పరిజ్ఞానం  ఉందా?  అని ఆయన ప్రశ్నించారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే అప్పుడు చంద్రబాబు స్పందించి తమిళనాడుకు చెందిన చిదంబరం, కేరళకు చెందిన ఆంటోని, కర్ణాటకకు చెందిన మొయిలీ ఎవరు.. తెలంగాణ ప్రకటించడానికి? అంటూ వ్యాఖ్యలు చేశారని, తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తే సంకుచితం అవుతుందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ బలపడుతుంటే రాధాకృష్ణ కూసాలు కదిలిపోతున్నాయని కేసీఆర్ విమర్శించారు. టీడీపీని కాపాడటమే రాధాకృష్ణ ఎజెండాగా మారిందని, టీఆర్‌ఎస్‌ను బేకార్ పార్టీగా చిత్రీకరించేందుకు నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో ఆయా పార్టీల నాయకులు చేరితే రాధాకృష్ణ ఆశాడభూతి అంటూ ప్రచారం చేస్తారని ఆయన అన్నారు. టీడీపీ తునాతునకలవుతుందని కేసీఆర్ ఖరాఖండిగా చెప్పారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో ప్రారంభమైందని, ఇంకా వలసలు ఉంటాయన్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి పేపర్ అంతా ఫుల్‌గా రాతలు రాసుకున్నా పేజీలు సరిపోవని కేసీఆర్ ఎద్దేవా చేశారు. గంగుల చేరికతో టీడీపీ నేతలు, రాధాకృష్ణ గంగ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కే కేశవరావును కించపరుస్తూ రాతలు రాయడమేంటి అని పశ్నించారు. ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్న ఇంగితం లేకుండా వ్యంగ్యంగా కథనాలు రాస్తారా? ఇదేనా సంస్కారం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీలు మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్, వివేక్‌లపై ఆ రాతలేంటి? తెలంగాణ కోసం కలిసొస్తే పనికిరాని వాళ్లుగా చిత్రీకరిస్తావా? ఇదేం పద్ధతి అంటూ రాధాకృష్ణపై ధ్వజమెత్తారు. టీడీపీని నాశనం చేస్తాం, తప్పకుండా వంద శాతం చేస్తాం అని సవాల్ చేశారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనన్న ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేయనీయం, తెలంగాణను అడ్డుకున్న టీడీపీకి ఒక్క సీటు రానీయం అని కేసీఆర్ శపథం చేశారు. రేపటి నుంచి తెలంగాణలో ఇవే నినాదాలతో పని చేస్తామన్నారు. కాంగ్రెస్‌ను, టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తాం అని ఆయన అన్నారు. తెలివైన చాకలి రవిక, చీరను ఒకేసారి కలగలిపి బండకేసి కొడతారని ఉదహరించారు. రాజకీయ నాయకులు తమ భవిష్యత్తును వెదుక్కొవద్దా?, ఆ తాపత్రయం చేసుకోవద్దా? తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌లో చేరవద్దా? అని ప్రశ్నించారు. రాధాకృష్ణా ! పిచ్చి రాతలు మానుకో, లేదంటే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి దరిక్షిదపుగొట్టు పత్రిక అని ఆయన ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌లో చేరే వారికి డెడ్‌లైన్ ఏమీ లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరే వాళ్లు తెలంగాణ కోసమా? టికెట్స్, సీట్ల కోసమా? తేల్చుకోవాలని మాత్రమే చెప్పాం అన్నారు. మే నెల 15 తరువాత అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గొప్ప నిబద్ధత ఉన్న ఉద్యమకారుడు, అతను అడగక ముందే ఎమ్మెల్సీగా చేశానన్నారు. ఎవరి సర్వేలను నమ్మేది లేదని, తామే సొంతంగా సర్వేలు నిర్వహించుకుంటామన్నారు.
టీఆర్‌ఎస్‌లోకి మాజీ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి
- పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమించిన కేసీఆర్
                మాజీ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి ఏప్రిల్ 21న టీఆర్‌ఎస్‌లోకి చేరారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆయనను పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమించారు. గొప్ప నిబద్ధత ఉన్న నిఖార్సయిన తెలంగాణవాది రమణాచారి అని ఆయన కొనియాడారు. 1969లో తెలంగాణ కోసం ఉద్యమించి నెలన్నరపాటు సంగాడ్డి జైలు జీవితాన్ని గడిపారని కేసీఆర్ చెప్పారు. ఎందరో ముఖ్యమంవూతుల దగ్గర రమణాచారి నిజాయితీగా విధులను నిర్వహించారన్నారు. రిటైర్డ్ అయ్యాక వచ్చిన పెన్షన్ బెనిఫిట్‌తో ఫ్లాట్ కొనుక్కున్న వ్యక్తి రమణాచారి అని ఆయన కొనియాడారు. చారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. రమణాచారి చేరికతో వేయి ఏనుగుల బలం వచ్చిందన్నారు.
సంచలనం ముందు పుట్టి.. కేసీఆర్ తరువాత పుట్టారు...
సంచలనం ముందు పుట్టి, కేసీఆర్ తరువాత పుట్టారు అని టీఆర్‌ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశానికి నిర్ణీత సమయానికి నాలుగు నిమిషాలు ముందుగానే కేసీఆర్ వచ్చారు. ఇంకొంత సమయం ఉంది కదా అని విలేకరులు హాల్‌కు బయటే వేచి ఉన్నారు. కేసీఆర్ హాల్‌లోకి చేరుకున్న విషయం తెలిసి వెంటనే వారు కూడా వచ్చి కూర్చున్నారు. ఈ సందర్భంలో, ఏదేమైనా సర్‌ప్రైజ్ చేయడంలో మీరే మేటి సార్ అని ఒక విలేకరి అన్నప్పుడు... కొన్ని సెకన్లు ఆలోచించి ఎస్.. సంచలనం ముందు పుట్టి, కేసీఆర్ తరువాత పుట్టారు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 
                    టీడీపీని ఏమని పిలవాలి.. పిల్లి గడ్డం, బొల్లి పార్టీ అనాలా?, పాలు, కూరగాయలు అమ్మే హెరిటేజ్ పార్టీ అనాలా?.. అన్నది చంద్రబాబే నిర్ణయించుకోవాలి. బాబూ! ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. పిచ్చి ప్రేలాపనలు మానుకో. నిస్సిగ్గుగా ప్రభుత్వాన్ని సమర్థించి ఎన్ని సూటుకేసులు మోశావు.. టీఆర్‌ఎస్‌ను ఫాంహౌజ్ పార్టీ అంటావా?.. అవును, మాది ఫాం-హౌస్ పార్టీయే.. ప్రభుత్వాన్ని ఫాం చేసేది మేమే.. టీడీపీని కాపాడాలని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేస్తున్న ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవ్. టీడీపీకి, రాధాకృష్ణకు రాష్ట్రవాదం లేదు, జాతీయవాదమూ లేదు. ఆంధ్రజ్యోతి దరిద్రపుగొట్టు పత్రిక..రాధాకృష్ణా! పిచ్చి రాతలు మానుకో.. తెలంగాణపై విషాన్ని చిమ్మితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
 రాజకీయ దుమారం
ఇక్కడే ఉక్కు ఫ్యాక్టరీనినెలకొల్పాలి
      బయ్యారం ఉక్కు గనులు తెలంగాణ ప్రాంతపు హక్కు. తెలంగాణలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి. సీమాంవూధులు సంఖ్యాబలం చూపి తెలంగాణలోని ఉద్యోగాలు, నీరు, నిధులు, భూములు దోచుకుపోయారు. - నాగం జనార్దన్‌డ్డి, నగారా సమితి నేత
ఖనిజ సంపద ఎక్కడికీ తరలిపోదు
      వరంగల్, ఖమ్మం జిల్లా సరిహద్దుల్లోనే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.5వేల కోట్లు కేటాయించింది. ఖనిజ సంపద ఎక్కడికీ తరలిపోదు. కొందరు అవగాహన లేక స్వలాభం కోసం అసత్య ప్రచారాలకు పూనుకుంటున్నారు.- గండ్ర వెంకటరమణారెడ్డి, చీఫ్ విప్ 
విశాఖ ఉక్కుకు తరలిస్తే ఉద్యమమే
        బయ్యారం గనులను విశాఖ ఉక్కుకు తరలిస్తే ఎట్టిపరిస్థితిల్లోనూ ఊరుకునేది లేదు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అధికారంలో ఉన్నపుడు వైఎస్ రాజశేఖర్‌డ్డి ఓబులాపురం గనులను గాలి జనార్దన్‌డ్డికి ధారాదత్తం చేశారు. బయ్యారం గనులను అల్లుడు అనిల్‌కు కట్టబె ప్రయత్నం చేశారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ వనరులను దోచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వనరుల తరలింపు ఆపకుంటే తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. - కేటీఆర్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
-టీ మీడియా

Saturday 20 April 2013

బయ్యారం @ 700 లక్షల కోట్లు..

* విలువైన ఖనిజంపై సీమాంధ్ర సర్కార్ కన్ను.. 
* దోచుకునేందుకు గండికొట్టిన ఉత్తర్వులు..
* 5342 హెక్టార్లు విశాఖ ఉక్కుకు ధారాదత్తం
* ఉపయోగం లేని బెనిఫికేషన్ ప్లాంట్‌కు అనుమతి .. 
* దీనితో బయ్యారం ప్రజలకు మిగిలేది దుమ్మే.. 
* నాడు ఏపీ స్టీల్స్ పట్ల కూడా పాలకులది ఇదే వివక్ష
* అడ్డుకొని తీరుతామంటున్న తెలంగాణవాదులు
       
         లక్షా 41 వేల ఎకరాల్లో.. అక్షరాలా ఏడు వందల లక్షల కోట్ల రూపాయల విలువైన సహజ వనరులు! కళ్లు చెదిరేస్థాయిలో 12 వేల కోట్ల టన్నుల ఇనుప ఖనిజం! ప్లాంటు కడితే.. మరో 50 ఏళ్ల దాకా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని నిక్షేపాలు! ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఇనుప ఖనిజం గనుల్లో కేవలం ఖమ్మం జిల్లాలో ఉన్న వనరుల లెక్కే ఇది! స్థానికంగా స్టీల్ ప్లాంట్ నెలకొల్పడానికి పరిమితిని మించిన అర్హత! కానీ.. ఇంత విలువైన ఖనిజంపై కన్నేసిన సీమాంధ్ర పాలకులు.. ఈ అపారనిల్వలకు గండికొట్టారు! సీమాంధ్ర పాలకులు తెరలేపిన తాజా దోపిడీ అంకంలో తెలంగాణ అటు అభివృద్ధిపరంగా.. ఇటు ఉపాధి అవకాశాలరీత్యా గణనీయంగా నష్టపోనుంది! అపారమైన వనరులున్న ప్రాంతంలో స్టీల్‌ప్లాంటు నిర్మాణానికి అంతే స్థాయిలో అవకాశాలు ఉన్నా.. అందుకోసం పెద్ద ఎత్తున డిమాండ్లు ఉన్నా.. పట్టించుకోని సీమాంధ్ర పాలకులు.. ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమాల నేపథ్యంలోనూ తెలంగాణపై తమ వివక్షను బాహాటంగా వెల్లడించుకోవడమే విశేషం! అయితే.. ప్లాంటు కట్టడానికి సిద్ధపడని సర్కారు.. ఖనిజ శుద్ధి కర్మాగారానికి అనుమతి ఇవ్వడం ద్వారా అది మిగిల్చే వ్యర్థాలను తెలంగాణపై కుప్పలు పోయడానికి సిద్ధమవుతున్నది! ఈ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ.. బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు అంటూ నినదిస్తున్న ఉద్యమకారులు.. ఎట్టిపరిస్థితుల్లోనూ బయ్యారాన్ని భావి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడేందుకు పోరాడుతామని తెగేసి చెబుతున్నారు! 
                     ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలో అపారమైన ఇనుప ఖనిజం విస్తరించి ఉంది. ఒక్క ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లోనే 1,41,691 ఎకరాల (56,690హెక్టార్లు) భూమిలో ఇనుప ఖనిజం ఉంది. ఇక్కడ తవ్వితే 12వేల కోట్ల టన్నుల ముడి ఇనుము లభిస్తుందని సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీని విలువ రూ.700 లక్షల కోట్లు పైమా అంచనా వేసింది. దేశంలో లభ్యమవుతున్న ఇనుప ఖనిజంలో 12శాతం మేర ఖమ్మం జిల్లా బయ్యారం, గార్ల, నేలకొండపల్లి, వరంగల్ జిల్లాలోని గూడురు మండలాల్లోనే ఉన్నాయని చెప్పింది. ఇంతటి ఘనమైన సంపదపై కన్నేసిన సీమాంధ్ర పెట్టుబడిదారులు.. 2004 నుంచి తమ దోపిడీ యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. బినామీల పేరుతో మైనింగ్ లీజులు తీసుకుని కోట్లు పోగేసుకుంటున్నారు. దీనికి కొనసాగింపుగానా అన్నట్లు బయ్యారంలోని 2500 హెక్టార్లు, వరంగల్ జిల్లా గూడూరు పరిధిలోని 2500 హెక్టార్లు, కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లిలోని 342 హెక్టార్లు.. మొత్తం 5342 హెక్టార్లలో (13,200 ఎకరాలు) ఇనుప ఖనిజం గనులను విశాఖ ఉక్కుకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
వైఎస్ కాలంలోనే మోసానికి పునాది
           వైఎస్ రాజశేఖర్‌డ్డి ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు తన అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్‌కు బయ్యారం ఇనుప ఖనిజాన్ని అప్పగించేందుకు శతవిధాలుగా ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీఎండీసీ(ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)ను రంగంలోకి దించిన వైఎస్ ప్రభుత్వం.. బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లోని 56,690హెక్టార్లలో ఇనుప ఖనిజాన్ని తవ్వేందుకు 2009 ఫిబ్రవరి 24న ఎడాపెడా అనుమతులు ఇచ్చేసింది. ఈ సంస్థ వెలికి తీసిన ఇనుపరాయిని బ్రదర్ అనిల్‌కు చెందినదిగా చెప్పే రక్షణ స్టీల్స్‌కు తరలించాలన్నదే తెర వెనుక కుట్ర. దీనిపై వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఇస్పాత్ ఇండస్ట్రీతో కలిసి రూ.500 కోట్లతో బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ నెలకొల్పుతామని, తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మభ్యపెట్టారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. తరువాత కాలంలో వైఎస్ మృతి చెందడంతో పగ్గాలు చేపట్టిన రోశయ్య 2010జూలై 24న అనుమతులను రద్దు చేశారు. లీజు రద్దు చేసిన సర్కార్.. ఈ గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించేందుకు గురువారం నిర్ణయం తీసుకుంది. 1/70గిరిజన చట్టాన్ని సైతం తుంగలోకి తొక్కి ఈ వివాదాస్పద నిర్ణయాన్ని వెల్లడించింది. 
ప్లాంట్ ఏర్పాటుకు వనరులు పుష్కలం 
               బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయి. తలాపునే మున్నేరు దండిగా ప్రవహిస్తుంటుంది. సమీపంలోనే ఇల్లెందులో పుష్కలమైన బొగ్గు నిక్షేపాలు, పక్కనే ఇనుము శుద్ధిచేసే డోలమైట్ కర్మాగారం ఉంది. ఇక్కడ స్టీల్‌ప్లాంట్ నిర్మిస్తే మరో 50 ఏళ్ల దాకా ఎలాంటి వనరుల కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. ఇన్ని సౌకర్యాలు ఉన్నా ప్రభుత్వం ఇక్కడ ఫ్యాక్టరీ నెలకొల్పకుండా విశాఖకు తరలించేందుకు నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణను అభివృద్ధి పర్చాలనే భావన సర్కార్‌కు వీసమంత కూడా లేదు. ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అంతా అనుకూలంగా ఉందని మైనింగ్ అధికారులు కూడా నివేదికలు పంపారు. అయినా ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. 
ఆంధ్రకు ఒక నీతి.. తెలంగాణకు మరొక నీతి!
            విశాఖలో ఎటువంటి ఐరన్‌ఓర్ నిక్షేపాలు లేవు. అయినప్పటికీ అక్కడ ఫ్యాక్టరీ నిర్మించారు. కేవలం నీటి వనరు ఆధారంగానే అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బైలడిల్లా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి ఖనిజ సంపదను కొనుగోలు చేసి విశాఖకు తరలిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో ఉన్న ఇనుప ఖనిజ సంపదలో ఒక్క ఖమ్మం జిల్లా బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాలతో పాటు.. వరంగల్ జిల్లా గూడూరు మండలంలో 12శాతం మేర ఉంది. ఇక్కడ ఫ్యాక్టరీని నిర్మిస్తే 50సంవత్సరాల పాటు అంతరాయం లేకుండా నడపవచ్చు. కానీ ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతానికి ఒక నీతిని.. తెలంగాణ ప్రాంతానికి మరొక నీతిని ప్రదర్శిస్తున్నదని బయ్యారం రక్షణ కోసం ఉద్యమిస్తున్న వారు మండిపడుతున్నారు. తక్కువ క్వాలిటీ, క్వాంటిటీ లేదని, సరిపడా భూమి లేదని చెప్పి ఖనిజాన్ని తరలించేందుకు కుట్రపన్నిందని అంటున్నారు. వ్యతిరేకత రాకుండా ఉండేందుకే బెనిఫికేషన్ ప్లాంట్ అంటూ ఊరడిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
దుమ్ము కొట్టే బెనిఫికేషన్ ప్లాంట్
స్టీల్‌ప్లాంట్ కోసం ఇక్కడి నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తే.. ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం ఉపయోగం లేని బెనిఫికేషన్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మాత్రం అంగీకరించింది. నిజానికి ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల ఇక్కడ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించవు. ఈ ఫ్యాక్టరీ కేవలం ముడి ఖనిజాన్ని శుద్ధి చేసే కర్మాగారం మాత్రమే. ముడిఖనిజంలో సిలికా అనే వ్యర్థపదార్థం మిళితమై ఉంటుంది. ఉదాహరణకు 50లారీలు ముడిఖనిజంలో సిలికాను తొలగిస్తే 20లారీల అసలు ఖనిజం లభిస్తుంది. మిగతా 30లారీల లోడు నుంచి సిలికా రూపంలో వ్యర్థపదార్థం బయటపడుతుంది. ఇది ఎందుకూ పనికిరానిది. అంటే.. పప్పు దోచుకుపోతున్న పాలకులు.. ఇక్కడ పొట్టును వెదజల్లుతూ.. అదేదో గొప్ప పని అన్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. పైపెచ్చు.. ఈ వ్యర్థ పదార్థంతో రేగే కాలుష్యం, దుమ్ము, ధూళి వల్ల స్థానిక ప్రజలకు బోనస్‌గా దక్కేది అనారోగ్యం మాత్రమే. పంటలపైనా ఈ దుమ్ము, ధూళి తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఈ ప్లాంటు పేరుతో జనం నోట్లో దుమ్ము కొట్టేందుకు సర్కారు సిద్ధమవుతున్నదన్నమాట!
కుట్రలో భాగంగానే అధికారులు ఐరన్‌ఓర్ పరిశీలన 
         ప్రభుత్వ కుట్రలోభాగంగానే ఏడు శాఖల అధికారులు ఐరన్‌ఓర్‌ను సందర్శించారని పలువురు ఉద్యమకారులు చెబుతున్నారు. పరిక్షిశమలు, గనులు, అటవీ, నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్, కాలుష్యనివారణ.. ఈ ఏడు శాఖల అధికారులు గత సంవత్సరం బయ్యారం గనులను పరిశీలించారు. వారిని తెలంణవాదులు అడ్డుకుంటే.. తాము పరిక్షిశమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరిపేందుకు వచ్చామని ఆయా శాఖల అధికారులు నమ్మబలికారు. స్థానికంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటే పదివేల ఎకరాలు అవసరం ఉంటుందని చెప్పడం ద్వారా అప్పట్లోనే ఈ ఉక్కు పరాధీనం కానుందన్న సంకేతాలను అధికారులు ఇచ్చి వెళ్లారు. తాజా పరిణామాలతో ఆ కుట్ర విస్పష్టంగా అర్థమవుతోంది.
ఉద్దేశపూర్వకంగానే విశాఖకు తరలింపు..
             రాష్ట్రంలో 23 ఇనుప ఖనిజం గనులు ఉంటే ఇన్నాళ్లూ ఏ ఒక్క గనిని కూడా విశాఖ ఉక్కుకు అనుబంధం చేయని సర్కారు.. బయ్యారం గనులను ఎందుకు ఎంచుకుంది? దీని వెనుక కూడా పెద్ద కుట్ర కనిపిస్తుంటుంది. నవరత్నాలుగా అభివర్ణించే దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్ ఒకటి. ఇప్పటి వరకు విశాఖ అనుబంధంగా ఒక్క ఇనుప ఖనిజం గని కూడా లేదు. రాష్ట్రంలో 23 ఇనుప గనులున్నాయి. వీటిలో ఏ ఒక్కటీ విశాఖకు అనుబంధం లేదు. పైగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వాదనలున్నాయి. విశాఖ ప్లాంట్ ఆస్తులు లక్షకోట్లుగా ఉంటాయని అంచనా. దానిని ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు   ప్రభుత్వం ద్వారాలు తెరువనుంది. అయితే విశాఖ ఉక్కుకు అనుబంధ గనులు లేవు కనుక ప్రైవేటు పెట్టుబడిదారులు వెనుకడుగు వేసే అవకాశం ఉందని భావిస్తున్న సర్కారు.. వారిని సంతృప్తి పర్చేందుకే బయ్యారాన్ని ఎంచుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.లక్షకోట్లు ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆస్తులు కేవలం 25కోట్లకే ధారాదత్తం చేసేందుకు సిద్ధమవుతోందంటూ విశాఖ ప్లాంట్ కార్మిక సంఘాలు ఇటీవల ఆందోళనలు కూడా చేశాయి. బయ్యారం గనులను వైఎస్ తన అల్లుడుకు కట్టబెట్టినట్లే, పాలకులు తమకు కావల్సిన వారికి విశాఖ ఉక్కును కట్టబె పావులు కదుపుతూ.. ఆ క్రమంలోనే బయ్యారాన్ని బలిపశువును చేసినట్లు తెలుస్తోంది. 
నాడు ఏపీ స్టీల్స్‌పై ఇదే కుట్ర..
         తెలంగాణలో ఏకైక ఉక్కు కర్మాగారం ఏపీ స్టీల్స్ లిమిటెడ్‌కు ఖమ్మం జిల్లా పాల్వంచలో 1974లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు శంకుస్థాపన చేశారు. రెండేళ్ల తరువాత 1976లో ఉత్పత్తి ప్రారంభమైంది. రెండుసార్లు ఉత్తమ అవార్డులు కూడా సాధించింది. బొగ్గు, నీరు, ముడి ఖనిజం అందుబాటులో ఉండటం, రైలు మార్గం కూడా చేరువలో ఉండటం ఏపీస్టీల్స్‌కు అన్ని విధాలుగా కలిసి వచ్చింది. బయ్యారం ఇనుప ఖనిజం ఆధారంగానే ఈ స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. కానీ.. ఆంధ్రా పెట్టుబడుదారులు పాలకులతో కుమ్మక్కయి.. ఏపీ స్టీల్ డీలా పడేలా చేశారు. ముడి ఖనిజం ప్రధాన కొరతగా చూపి చేతులెత్తేశారు. నష్టాల ఊబిలో ఉన్న ఏపీ స్టీల్‌ను 1994లో లాకౌట్ ప్రకటించారు. అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించినప్పటికీ ఫలితం లేకపోయింది. పునరుద్ధరించాలన్న పోరాటాలను సైతం ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్‌ఎండీసీ చైర్మన్ సోనురాణా 2010లో ఏపీస్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. 12వందల కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దానికీ సర్కార్ అడ్డుపుల్ల వేసింది. తెలంగాణను అన్ని విధాలుగా దోచుకెళ్లాలని కుట్ర పన్నింది. 
              బయ్యారం ప్రాంతం ఇప్పటికే వెనుకబడి ఉంది. ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకపోతే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ దశలో ఆంధ్రప్రాంతానికి ఇక్కడి ఖనిజాన్ని తరలించడాన్ని ప్రజలు సహించరు. ప్రభుత్వం పునరాలోచించకపోతే ప్రజల కోపాగ్నికి గురికాక తప్పదు. ప్రభుత్వానికి ఈ ప్రాంతంపై సవతి తల్లి ప్రేమ ఉందనే విషయం బయ్యారం తరలింపుతో స్పష్టమవుతున్నది. ఎంతో మంది నిరుద్యోగ యువత ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. -రవి (బయ్యారం, గిరిజనుడు)

Friday 19 April 2013

బయ్యారం ఉక్కు..తెలంగాణ హక్కు..

* నినదిస్తున్న ఉద్యమ శ్రేణులు
* బయ్యారం గనులు విశాఖ ఉక్కుకు 
* అప్పగింతపై ఆగ్రహం
* జీవో ఉపసంహరణకు డిమాండ్
*  సీమాంధ్రకు తరలిపోతున్న తెలంగాణ ఖనిజ సంపద 
* నాడు ముద్దనూర్‌కు సింగరేణి బొగ్గు.... నేడు బయ్యారం వంతు
 * నినదిస్తున్న ఉద్యమ శ్రేణులు
* విశాఖ ఉక్కుకు అప్పగింతపై ఆగ్రహం


          బయ్యారం గనులను విశాఖ ఉక్కుకు అప్పగించడంపై తెలంగాణ భగ్గుమన్నది. ఒకవైపు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై జనం చైతన్యవంతమవుతున్న తరుణంలో.. దశాబ్దాల అన్యాయానికి వ్యతరేకంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతున్న సమయాన.. వాటన్నింటినీ బేఖాతరు చేసిన సీమాంధ్ర పాలకులు.. బయ్యారం గనులను దర్జాగా తరలించుకుపోయేందుకు బహిరంగ కుట్రకు పాల్పడ్డాయని పలువురు తెలంగాణ ఉద్యమనాయకులు మండిపడ్డారు. తెలంగాణ వనరులపై సీమాంధ్ర పాలకులు మళ్లీ కన్నేశారన్న టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్.. ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని చెప్పారు. బయ్యారం గనులు తెలంగాణ హక్కని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత హరీశ్‌రావు స్పష్టం చేశారు. విస్తారంగా ముడి ఇనుము లభ్యమవుతున్న బయ్యారంలోనే స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ సంపదను సీమాంవూధకు తరలిస్తే చూస్తూ ఊరుకునేది లేదని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో వస్తున్న ప్రజా వ్యతిరేకతను సీఎం దృష్టికి తీసుకు మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.
     తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలోని 5342 హెక్టార్లలోని ఇసుప ఖనిజ గనులను (ఐరన్‌ఓర్) విశాఖ ఉక్కుకు తరలించేందుకు ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌డ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది మరో కుట్రేనన్న వాదనలు వెల్లు ఖమ్మం జిల్లా బయ్యారంలో 2500 హెక్టార్లు, వరంగల్ జిల్లా గూడూరు పరిధిలో 2500 హెక్టార్లు, కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లిలో 342 హెక్టార్లు విశాఖ ఉక్కుకు సీమాంధ్ర సర్కార్ కేటాయించింది. ఈ ప్రాంతాల్లో ఉన్న ఇనుప ఖనిజాన్ని విశాఖ కార్మాగారానికి తరలించి సీమాంధ్ర ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకునేందుకు పన్నాగం పన్నారని ఉద్యమక్షిశేణులు విమర్శిస్తున్నాయి. బయ్యారం ఇసుప ఖనిజాలను అప్పగించేందుకు కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం విశాఖకు తరలించేందుకు కుట్ర చేసిందని అంటున్నారు. అంతేకాకుండా ఎలాంటి అంగీకార ఒప్పంద పత్రం కూడా తీసుకోకుండానే విశాఖ ఉక్కుకు సీమాంధ్ర ప్రభుత్వం దోచుకునేందుకు సిద్ధమైందని చెబుతున్నారు.
          బయ్యారం ఇనుప ఖనిజాలను 2009 ఎన్నికల ముందు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరడ్డి తన అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్ బినామీ సంస్థగా భావిస్తున్న రక్షణ స్టీల్స్‌కు అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీని కోసం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా రక్షణ స్టీల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడం, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల ఒత్తిడితో 2010 డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎండీసీకి రిజర్వ్వు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడం తెలిసిందే. బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల పరిధిలోని గ్రామాలు, నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఏ విధంగానైన దోచుకుందామని సీమాంధ్ర సర్కారు కుయుక్తులు పన్నిందని అంటున్నారు.
          ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలంగాణ ప్రాంత ఉపాధి, ఆర్థిక వనరులపై ప్రభావం పడనుంది. బయ్యారం ప్రాంతంలో బెనిఫికేషన్ ప్లాంట్‌ను కూడా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తామని సర్కార్ గొప్పలు చెబుతోంది. కానీ దీనివల్ల తెలంగాణ ప్రాంతానికి పెద్దగా ఒరిగేది ఉండదని అంటున్నారు. ఈ ప్లాంటులో కేవలం ఐరన్‌ఓర్‌ను శుద్ధి చేసి విశాఖ ఉక్కు కార్మాగారానికి తరలిస్తారు. దీనివల్ల ఈ ప్రాంతంలో కాలుష్యం తప్ప మిగతా ఎలాంటి ప్రయోజనం ఉండదు. తెలంగాణ ప్రాంతంలోని ఐరన్‌ఓర్‌ను సీమాంవూధకు తరలించడమేమిటని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రాంతంపై సర్కార్ ప్రేమ ఉంటే బయ్యారంలోనే ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఎన్టీయార్ సీఎంగా ఉన్నప్పుడు సింగరేణి నుంచి ముద్దనూర్ థర్మల్ పవర్‌కు బొగ్గు తరలించారని, ప్రస్తుతం ఖనిజ వనరులను తరలించేందుకు కుట్ర జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని పెట్టడం వల్ల తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలతో పాటు ప్రాంతం ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. దీన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా బయ్యారం ఇనుప ఖనిజ సంపదను విశాఖ ఉక్కు వాడడం సరైంది కాదని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. గతంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఉద్యమం చేసిన సీమాంధ్రులు... తెలంగాణ ప్రాంత ఇనుప ఖనిజాన్ని విశాఖకు ఏవిధంగా తీసుకెళ్తారని ప్రశ్నిస్తున్నారు. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్షికమాలు చేపడుతామని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు.
(టీ మీడియా)

Wednesday 17 April 2013

సీతారాముల కళ్యాణ వైభోగం..


       ‘సీతారాముల కళ్యాణం’ ఈ మాట వినగానే ప్రతి మానవుడి ఎద పులకరిస్తుంది. ఒక భక్తిభావన మనస్సులో మెదుల్తుంది. ఆదర్శ దంపతుల అన్యోన్యత మన కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. పల్లె పల్లెలో, వాడవాడలా, పట్టణాల్లోనూ పండుగ వాతావరణమే. ‘నవమి’ రోజున ఎక్కడ చూసినా సీతారామ కళ్యాణ వైభోగం. ఏమి విన్నా రామచరితమే. ఏది తిన్నా రామ ప్రసాదమే. ఏవి స్వీకరించినా అవి మంగళాక్షతలే. ఏ నోట విన్నా రామాయణ కావ్యగానమే. ఆ రోజు అందరం లవకుశులమే. అందరం భక్త ఆంజనేయులమే. అంత ప్రాధాన్యం, అంత ప్రాచీనతా, అంత పవిత్రత సంతరించుకున్న విశేష పర్వదినం ‘శ్రీరామనవమి’. 
          రామాయణ, భారత, భాగవతాలు మూడు మన భారతీయ సంస్కృతికి బలమైన మూలస్తంభాలు. ఎన్నో శాస్త్రాలు, పురాణాలు, కథలు, గాథలూ వ్యాప్తిలో ఉన్నా ఈ మూడింటికీ ఉన్న బహుళ ప్రచారం, ఆదరణ మరే ఇతర గ్రంథాలకు లేదని మనం ఒప్పుకోక తప్పదు. ఈ గ్రంథాల్లోని కథలు, పాత్రలు, సన్నివేశాలు ప్రజల మనస్సులలో పదిలంగా ఉండటానికి కారణం ఆ కావ్యాల సార్వజనీనత, సార్వకాలీనత. అనుదిన సంభాషణలల్లో, భావనల్లో, భక్తిలో, సంబంధాలలో, అనుబంధాలలో వీటిలోని పాత్రలు, సన్నివేశాలు విడదీయలేనంతగా పెనవేసుకుపోయాయి.
         ఉదాహరణకి రామాయణంలోని భరద్వాజ విందు, సుగ్రీవాజ్ఞ, చుప్పనాతి శూర్పనఖ, లక్ష్మణరేఖ, ఇంటిగుట్టు లంకకు చేటు, చూచి రమ్మంటే కాల్చి రావడం- మొదలైన మాటలు ప్రజల నాలుకల్లో నానుడులై నడయాడుతున్నాయి. అదీ రామాయణంలోని గొప్పతనం.
‘రామాయణం' ఆదికావ్యం, భారతం ఇతిహాసం, భాగవతం భక్తిరసభరితమైన పురాణం’. ఇది స్థూలంగా పండితుల అభిప్రాయం. అయితే, ప్రతి గ్రంథంలోనూ మిగిలిన రెండు లక్షణాలు కనిపిస్తాయి. రామాయణంలో ఇతిహాస పురాణ లక్షణాలున్నాయి. వాటితో పాటు మిగిలిన రెండింటిలోను లేని కొన్ని విశిష్ట లక్షణాలూ రామాయణంలో ఉన్నాయి. వాటిలో ఒకటి కవితా రమణీయం. ఎందుకంటే అది పూర్తి స్థాయి కావ్యం కాబట్టి. రెండవది వస్యైక్యం. అందుకే, రామాయణం సమాజానికి నిత్య ప్రతిబింబమైంది.
         ఇది ప్రముఖంగా ధర్మ ప్రతిపాదితా కావ్యంగా ప్రసిద్ధికెక్కింది. రామాయణంలోని ఇంపైన పాత్రల చిత్రీకరణ, వాటిలోని ఉద్విగ్నతలు, నాటకీయతలు అన్నీ పండిత పామరులకు అందరికీ సర్వదా చర్చనీయాంశాలే. అటువంటి విశేష లక్షణాపూన్నో గల రామాయణాన్ని పెద్దలు అనేక కోణాల నుంచి దర్శించి తరించారు. 

                    శ్లో॥ వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే
                   వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షావూదామాయణాత్మనా॥

       రామాయణం వేదానికి ప్రతిరూపమనీ, మంత్ర పూరితమనీ అంటారు. అంతేకాదు, అత్యంత విలువైన గాయత్రీ మంత్రానికి కథా రూపమనీ, వేదాంత తత్త ప్రతిపాదకమనీ పండితులెందరో విశ్లేషించారు. ఇదొక రమ్యమైన కావ్యం. అసాధారణ ప్రతీకాత్మక రచన. అనేకులు ఎన్నో రకాలుగా ఆ ఆదికావ్యాన్ని అభివర్ణించారు. అందులో తరచిన కొద్దీ అనేక విశేషాలు మనకు దృగ్గోచరమౌతాయి. ఇలా రామాయణాన్ని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. 
         రామాయణ కావ్య కథానాయకుడే దశరథ మహారాజు తనయుడు. అందుకే, ఆయన ‘దాశరథీ కరుణాపయోనిధి’ అయ్యాడు. మనందరికీ ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు. సత్య వాక్పరిపాలనకు నిలు విశ్వరూపం. ‘రామో విగ్రహవాన్ ధర్శః’ అన్నది పండిత వాక్కు. ఇది చాలా ప్రాచుర్యం పొందిన రాముని మహనీయతను ప్రతిపాదింపజేసిన సంస్కృత వాక్యం. దీని ప్రకారం ధర్మమే రాముని స్వరూపం. అలాగే, సీతా మహాసాధ్వి. ఆమె ఆయనకు అనుకూలమైన ధర్మపత్ని. సుఖాల్లోనే కాదు, కష్టాల్లోనూ పాలు పంచుకున్న ఉత్తమోత్తమ ఇల్లాలు. యావత్ లోకానికే మహదాదర్శంగా నిల్చిన సాధ్వీమణి. 
           శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. ఆయన మహావిష్ణువు అవతారం. ఆయన జన్మతిథి రోజునే మనం శ్రీరామనవమి పండుగను ఆచరిస్తున్నాం. అలాగే, సీతారామ కళ్యాణ మహోత్సవం కూడా అదే రోజు జరుపుకుంటాం. రాముడు ఎంత సత్యవంతుడో అంత ధర్మపరాయణుడు. ఎంత దయామయుడో అంత పరాక్రమశాలి. ఎట్టకేలకు రావణాసురున్ని వధించి, దిగ్విజయంగా అయోధ్యా నగరానికి తిరిగి వచ్చాడు. చిత్రంగా ఆ రోజు కూడా తిథి నవమే. ఆ మరునాడు అంటే దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం మహా వైభవోపేతంగా జరిగింది. 
            హైందవుడైన ప్రతి భారతీయుడు మరువరాని మంగళకరమైన రోజు శ్రీరామనవమి. వింధ్యకు ఉత్తరాన ఉన్న ప్రాంతాలలో (ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలలో) రామజన్మ దినోత్సవాన్ని మాత్రమే నవమి నాడు ఆచరిస్తారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఫాల్గుణ పౌర్ణమి రోజున కళ్యాణాలు చేస్తున్నట్టు వినబడుతోంది. మన ప్రాంతంలో (దక్షిణ దేశంలో) మాత్రం సీతారాముల కళ్యాణోత్సవం చైత్రశుద్ధ నవమి నాడే జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే కళ్యాణంలో స్వయంగా, ప్రత్యక్షంగా పాల్గొనాలని ఉబలాట పడని వారుండరు. ఆనాడు ఆబాల గోపాలమూ భక్తిపారవశ్యంలో మునిగిపోయి ఆ ఆదర్శదంపతుల కళ్యాణ వైభోగాన్ని వేయికళ్లతో తిలకిస్తారు, తనివితీరా సేవిస్తారు. 
         ‘వసంత నవరాత్రోత్సవాలు’ చైత్ర శు॥ ప్రతిపద మొదలు నవమి వరకు జరుపుతాం. దశమి రోజున సామ్రాజ్య పట్టాభిషేకం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంలోనే రామస్వామికి పూజాదులు గావించి, రామాయణ, సుందరకాండ పారాయణాలు జరుపుతారు. ఇదంతా లోక క్షేమాన్ని ఆకాంక్షిస్తూ, అనూచానంగా వస్తున్న సంప్రదాయం. 
       ‘ఉగాది’ తర్వాత వచ్చే మొట్టమొదటి పండుగ శ్రీరామనవమి. కాబట్టి, ఆనాడు లోకకళ్యాణం కోసం సీతారాముల కళ్యాణం జరపడం విధిగా వస్తోంది. ఆ తర్వాతే మానవుల నిజ కళ్యాణాలు మొదలవుతాయి. ఇందుకు తగిన రీతిలోనే ముహూర్తాలు పెట్టడం మన జ్యోతిష శాస్త్రవేత్తలు అనాది సంప్రదాయంగా పాటిస్తున్నారు. అయితే, ఆ రోజున స్వామి కళ్యాణంలో పాల్గొన్న వారందరికీ వడపప్పు, బెల్లం పానకం ప్రసాదంగా ఇస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది ఎండాకాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్యాభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద శాస్త్రజ్ఞుల అభిప్రాయం. నాటి వివాహ మంగళాక్షతలు అతి పవిత్రం. వాటిని మన ఇంట్లో బియ్యంలో కలుపుకోవాలి. అలా అవి ఆ సంవత్సరమంతా మనింటనే ఉం టాయి. తత్ ఫలితంగా కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది వేదపండితుల భావన. 
         శ్రీరామనవమి రోజు మిథిలా నగరంలో విశ్వామిత్ర, వశిష్ఠ, నారదాది మునీంద్రుల ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణ మహోత్సవానికి విశేష ప్రాధాన్యం ఉంది. అదే విధంగా ఇప్పటికీ మన దేవాలయాలలో ఆగమ సంప్రదాయ విధానంగానే కళ్యాణాన్ని జరుపుకోవడం మనం చూస్తున్నాం. ఆనాటి ఋషి ప్రోక్తమైన మంత్రాలు, వాల్మీకి విరచిత శ్లోకాలు అన్నింటినీ మంగళాష్టకాలుగా పఠించడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయంగానూ కొనసాగుతోంది. ‘జానక్యాః కమలామలాంజలి పుటే... ’అనే శ్లోకాన్ని వివాహాల్లో పఠించడం, లగ్నపత్రికలపైన రాయడం తద్వార శుభాలు కలుగుతాయనే నమ్మకం మనందరం చూస్తున్నదే. ఋషులు అందించిన సంస్కృతి ‘ఆర్ష పద్ధతి’తో చేసే మన ప్రతి పనికీ ఒక అర్థం ఉంది. దానిని తెలుసుకోవడమే పరమార్థం. వాటిని తెలుసుకో గలిగిప్పుడే మనందరి జీవితం చరితార్థమవుతుంది. 
             ఇంతటి పటుత్వం ఉంది కాబట్టే, యుగాలు వెళ్లినా, తరాలు మారినా మన భారతీయ సంస్కృతి చెక్కుచెదరడం లేదన్నది సుస్పష్టం. ఒకవైపు అనాచారాలుంటున్నా ఆచారాలకు, పవిత్ర దైవకార్యాలకు ఉండే విలువ అంతకంతకూ ఇనుమడిస్తోంది. జగత్తు ఉన్నంత కాలం, మానవాళి మనుగడ సాగించినన్నాళ్లు రామాయణం అనితర కావ్యసుగంధంగా పరిఢవిల్లుతుంది. సమస్త మానవాళికి దారిచూపే ‘ధార్మిక దిక్సూచి’గా వెలుగొందుతుంది. సీతారాముల గాథ ప్రతి ఒక్కరికీ పారాయణమవుతుంది.
    మన ప్రాంతంలో (దక్షణ దేశంలో) మాత్రం సీతారాముల కళ్యాణోత్సవం చైత్రశుద్ధ నవమి నాడే జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే కళ్యాణంలో స్వయంగా, ప్రత్యక్షంగా పాల్గొనాలని ఉబలాట పడని వారుండరు. ధర్మబద్ధమైన జీవితానికి నిలు ప్రతిరూపం రాముల వారైతే రామాయణం ధర్మ ప్రతిపాదితా కావ్యం. 

శ్రీరామనవమి రోజు మనం జరుపుకునే ‘సీతారాముల కళ్యాణం’ లోకరక్షణకు ఒక ఘనమైన సంకేతం.
                                                               - ముత్యంపేట గౌరీశంకరశర్మ


Tuesday 16 April 2013

రామప్పగుడికి 800 వసంతాలు ( పాలంపేట - శ్రీ రుద్రేశ్వరాలయం)



         
           ఏడాదిపాటు కాకతీయ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న ఈ సందర్భంలోనే భారత ప్రభుత్వం మన ఓరుగల్లు మహానగరాన్ని చారిత్రా  త్మక  వారసత్వ నగరంగా గుర్తించింది. సరిగ్గా ఇదే సమయానికే, ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పాలంపేట శ్రీ రుద్రేశ్వరాలయానికి (రామప్పగుడి) 800 సంవత్సరాలు పూర్తయ్యాయి. నిజానికి ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం మార్చి 31కి సరిగ్గా దీన్ని నిర్మించి 800 సంవత్సరాలు పూర్తవుతాయి. తెలుగు తిథుల ప్రకారం చైత్ర శుక్ల అష్టమి అంటే ఏప్రిల్ 18 అవుతుంది. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఆ ఆలయ కళా విశేషాలను, కాకతీయుల శిల్పరీతిని వివరించే ప్రత్యేక వ్యాసం...
ఆచార్య హరి శివకుమార్
        ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాకతీయుల పాలనా కాలం ఒక సువర్ణ అధ్యాయం. నేటి ఆంధ్రదేశాన్నే కాక, యావత్ దక్షిణ భారతదేశాన్నీ పరిపాలించిన కాకతీయులకు ‘ఓరుగల్లు’ రాజధాని. అదే నేటి వరంగల్లు. సుమారు 1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఓరుగల్లు చరిత్ర శాసనాలలోను, అలనాటి సాహిత్యంలోను మరుగున పడే ఉన్నది. కానీ, సమర్థవంతమైన కాకతీయ రాజుల పాలనలో ఓరుగల్లు ఒక వెలుగు వెలిగిందనే చెప్పాలి. వారసత్వానికి ప్రధాన నిదర్శనాలైన సాహిత్యం, శిల్పం, నాట్యం, చిత్రకళ వంటి అన్ని రంగాలలోను వారు తమదైన ప్రత్యేకతను చాటుకొంటూ, సుస్థిరమైన పరిపాలనతో పాటు, గొప్ప సంస్కృతిని భావి తరాలకు అందించి, చరిత్ర పుటలలో శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలను సంపాదించుకొన్నారు. వారు సృష్టించిన సాహిత్య సంపద, శిల్పరీతి, లలితకళలు అన్నీ నేటికీ నిదర్శనాలుగా నిలిచి ఉన్నాయి. అయితే అవి కాలాంతరంలో తమ ప్రాచీన వైభవాన్ని కోల్పోయాయి. చివరకు వాటి పేర్లు కూడా మారిపోయాయి. 
         ఓరుగల్లు నగరం పేరే మారిపోయి వరంగల్ అయింది. అనుమకొండ - హనుమకొండ అయింది. అట్లాగే వారు నిర్మించిన శిల్పకళాశోభితమైన ఆలయాల పేర్లు కూడా మారిపోయాయి. అనుమకొండలోని శ్రీ రుద్రేశ్వరాలయము - వెయ్యిస్తంభాల గుడిగానే నేడు పిలువబడుతోంది. అట్లాగే కాకతీయ శిల్పకళారీతికి, నైపుణ్యానికి నిలు సాక్ష్యంగా నిలిచిన పాలంపేట శ్రీ రుద్రేశ్వరాలయం - రామప్పగుడిగా పిలువబడుతోంది. వాస్తవానికి రేచర్ల రుద్రసేనాని తన పేర కట్టించిన ఆ దేవాలయం అసలు పేరు శ్రీ రుద్రేశ్వరాలయమే. నిజానికి, కాకతీయ దేవాలయాలలో మకుటాయమానమై, వారి శిల్పరీతికి నిలు సాక్ష్యంగా నిలిచి ఉన్న ఆ దేవాలయాన్నిరుద్రేశ్వరాలయం’ అంటే ఈనాడు చదువుకొన్నవారికి కూడా తెలియదు. 
            రామప్పగుడి అంటేనే తెలుస్తుంది! దీని అసలు నామం గురించి ఆలయ ప్రాంగణంలోని రుద్రసేనాని శాసనం స్పష్టం చేస్తునే ఉన్నది. అట్లాగే నేటి పాలంపేట ప్రాంతాన్ని ఆ రోజులలో ‘నాతుకూరు’ (వరంగల్ జిల్లా శాసనాలు - పు.149) అనేవారని ఆ శాసనంలోనే కన్పిస్తుంది. అంతేకాక, ఓరుగల్లుకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతం కూడా ఓరుగల్లులోని ఒక భాగమే అని అదే శాసనంలోని - ‘ఓరుగల్లు పురంలో రుద్రసేనాని కట్టించిన ఆలయం’ అన్న పదబంధాన్ని బట్టి స్పష్టమవుతుంది. అలనాటి ఓరుగల్లు విస్తీర్ణం 96 యోజనములు (155 కి.మీ.) అని 16వ శతాబ్దంలో వెలువడిన ఏకామ్ర నాథుని ‘ప్రతాపచరిత్ర’ (పు.128)లో స్పష్టంగా కన్పిస్తున్నది.
      
      భారతదేశంలో విలసిల్లిన శిల్పరీతులలో ‘కాకతీయ శిల్పరీతి’ ఒక విశిష్టతను సంతరించుకొంది. కాకతీయ దేవాలయాలలోని స్తంభాల నిర్మాణరీతి, వాటిని నిలబెట్టిన విధానం, గర్భాలయ ముఖద్వారాలు వంటి అనేక లక్షణాలను బట్టి అవి కాకతీయ దేవాలయాలో కాదో తేలికగా నిర్ణయించవచ్చు. అదే కాకతీయ శిల్పరీతి! అయితే, కాకతీయ శిల్పరీతికి మార్గదర్శకమైంది కర్ణాటకలో విలసిల్లిన హోయసల శిల్పరీతి. కాకతీయ దేవాలయ నిర్మాణానికి దాదాపు 200 సంవత్సరాలకు పూర్వమే హోయసలులు బేలూరు, హళేబీడు, సోమనాథపురాలలో అద్భుతమైన దేవాలయాలు నిర్మించారు. ఆ దేవాలయాల మీద కన్పించే గజపట్టికలు, పద్మ పట్టికలు, లతలు వంటివి కాకతీయ దేవాలయాలలో కూడా కన్పిస్తాయి. అయితే, హోయసల శిల్పరీతికి కాకతీయ శిల్పరీతికి కొన్ని భేదాలు కన్పిస్తాయి. హోయసల శిల్పులు ఆలయాల బయటివైపుననే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కానీ, కాకతీయులు బయటనే కాక లోపలి భాగంలో కూడా అద్భుతమైన శిల్పాలను చెక్కారు.
      హోయసల శిల్పాలు అందమైన రూపురేఖలతోను, ఆభరణాలతోను కన్పిస్తాయి. కాని, కాకతీయ శిల్పులు ఆభరణాలతోపాటు హావభావాలకు కూడా ప్రాధాన్యమిచ్చారు. హోయసల ఆలయాలపై కన్పించేవి దేవతామూర్తులు కాగా, కాకతీయ ఆలయాలపై కన్పించేవి నాటి సామాన్య స్త్రీ పురుషలవి. ఆ విధంగా అలనాటి సామాన్య మానవుల వేషభాషలతో పాటు వారి హావభావాలను కూడా ప్రదర్శించిన ఘనత కాకతీయులదే! అది కాకతీయుల సామాజిక స్పృహకు నిదర్శనం! ఇలాంటి ఎన్నో విశేషాలతో ‘కాకతీయ శిల్పరీతి’ని ఆవిష్కరిస్తూ అలరారుతున్నవి కాకతీయ దేవాలయాలు! అలాంటి అద్భుతమైన శిల్పసంపదతో కూడిన శ్రీ రుద్రేశ్వరాలయ చరిత్రను, విశేషాలను ప్రతి ఒక్కరూ చూసి తీరవలసిందే!         శ్రీ రుద్రేశ్వరాలయ ప్రాంగణంలో ఉన్న రేచర్ల రుద్రుని శాసనంలో శక సంవత్సరం 1135 - శ్రీముఖ సంవత్సర చైత్ర శుక్ల అష్టమీ ఆదివారం కీ.శ.30-3-1213) పుష్కార్యయోగంలో ఈ దేవాలయాన్ని తాను కట్టించి శ్రీగౌరీసహిత రుద్రేశ్వరుని ప్రతిష్ఠించినట్లు రుద్రసేనాని చెప్పుకొన్నాడు. దానినిబట్టి 31-3-2013 నాటికి దీన్ని నిర్మించి 800 సంవత్సరాలు పూర్తవుతాయి. తెలుగు తిథుల ప్రకారం చైత్ర శుక్ల అష్టమి 18-4-2013 అవుతుంది. అంతేకాక, ఆ ఆలయ నిర్వహణకు ఉప్పరపల్లి, బొర్లపల్లి అనే గ్రామాలను దానం చేసినట్లు ఆ శాసనం పేర్కొంటున్నది. ఆ ఆలయానికి దక్షిణభాగంలో తన తండ్రి కాటేనాని పేర శ్రీ కాటేశ్వరాలయాన్ని, ఉత్తరభాగంలో తన తల్లిపేర శ్రీ కామేశ్వరాలయాన్ని నిర్మించి, వాటి అంగరంగ భోగాలకు ‘నడ్కుటె’ అనే గ్రామాన్ని కూడా దానం చేసాడు.
ఆలయ విశేషాలు       

     శ్రీ రుద్రేశ్వరాలయంలోకి ప్రవేశించగానే ఈశాన్యభాగంలో రుద్రసేనాని వేయించిన శాసనం కన్పిస్తుంది. అందులో - రుద్రసేనాని వంశాభివర్ణనం, ఆతని పూర్వీకులు కాకతీయ రాజులకు అందించిన సేవలు, రుద్రసేనాని ప్రభుభక్తి- పరాక్రమాలు, అలనాటి ఓరుగల్లుపుర వైభవం వర్ణింపబడ్డాయి. శ్రీ రుద్రేశ్వరాలయానికి ఉత్తరం, తూర్పు, దక్షిణ దిశలలో 3 ద్వారాలు ఉన్నాయి. ఆ మూడు ప్రవేశద్వారాలు రకరకాల శిల్పాలతో పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నట్లు కన్పిస్తాయి. ప్రధానాలయానికి ఎదురుగా నంది విగ్రహం ఉంది. ఇదొక అద్భుత కళా ఖండం. కాకతీయ శివాలయాలు అన్నింటిలోనూ నంది విక్షిగహాలు కన్పిస్తాయి. కానీ, ఇంత అందమైన, శిల్పశోభితమైన నంది మరెక్కడా కన్పించదు. దేశంలో ఎన్నో ఆలయాలలో నంది విగ్రహాలు కన్పిస్తాయి. వాటి ప్రత్యేకతలు వాటికి ఉండవచ్చు. లేపాక్షి బసవన్న, యాగంటి బసవయ్య వంటివి వాటి వాటి ప్రత్యేకతలకు నిదర్శనం! కానీ, ‘కాకతీయ నంది’ అనగానే మనకు స్ఫురించేది అనుమకొండ వెయ్యిస్తంభాల గుడిలోని నంది విగ్రహం. కానీ, అది కూడా పాలంపేట రుద్రేశ్వరాలయ నంది ముందు వెల ఇక్కడి నంది ప్రత్యేకత - దానిని ఎటువైపు నుంచి చూసినా, అద్భుతమైన శిల్పకళతో అలరారుతూ ఉంటుంది. ఆ విధంగా అన్నివైపుల నుంచి మనోహరంగాను, హుందాగాను కన్పించే ఈ నంది ముందు, దేశంలోని అన్ని నందులూ దిగదుడుపే! ఈ నంది మీద చెక్కిన రకరకాల ఆభరణాలు దాని శోభను ద్విగుణీకృతం చేస్తున్నాయి.
మదనిక శిల్పాలు (Braket Figures):
         శ్రీ రుద్రేశ్వరాలయం బయటివైపున స్తంభాల పైభాగాన్నీ, పైకప్పునూ కలుపుతూ ఏటవాలుగా నిలబెట్టిన మనోహర శిల్పాలు మదనికలు! అవి ఆనాటి సామాన్య స్త్రీలవి. దేవాలయాలమీద సామాన్యుల శిల్పాలను చెక్కించి, వారిని కూడా దేవతలలాగా మాన్యులను చేసిన ఘనత కాకతీయులదే! ఆ మదనిక శిల్పాలను వస్త్రాలకంటే ఆభరణాలతోనే నింపివేసారు కాకతీయ శిల్పులు. ఆ ఆభరణాలలో నాటి స్త్రీలు ధరించే రకరకాల హారాలు, శిరోభూషణాలు ఉన్నాయి. అవి ఆనాటి ఆభరణ విశేషాలను ప్రదర్శిస్తాయి. వాటిలో ఒక్కొక్క శిల్పంలో ఒక్కొక్క విశేషం కన్పిస్తుంది.
            ఒక మదనిక పలుచని ఉల్లిపొర వంటి వస్త్రం ధరించి ఉన్నది. ఆమె చెవికి ఉన్న దుద్దులు ఆనాటి కర్ణాభరణాలకు ఒక మచ్చుతునక. ఇంకొక మదనిక తన పది చేతివేళ్ళకూ ఉంగరాలు ధరించి తన్మయత్వంతో నాట్యం చేస్తున్నది. మరొక మదనిక (నాగిని) చేతులలో ఒక పామును ధరించి నాట్యం చేస్తున్నది. ఇంకొక మదనిక తాను ధరించిన కంఠాభరణానికి ఉన్న మణులు పొదిగిన లాకెట్‌ను ఎత్తిచూపుతున్నది. ఆమె శరీరానికి తగలకుండా ఎత్తుగా కన్పించేటట్లు ఆ లాకెట్‌ను చెక్కిన శిల్పి నైపుణ్యం అమోఘం! మరొక మదనిక తన పాపిడి బొట్టులాగా ఒక ఆభరణాన్ని ధరించి, మృదంగం వాయిస్తున్నది. ఇంకొక మదనిక ఎత్తుమడమల పాదుకలు (High heels) ధరించి ఉన్నది. ఈ శిల్పాలన్నింటిలోను కన్పించే ఆభరణాలు, అలంకారాలు ఆనాటి జీవన సౌభాగ్యానికి నిదర్శనాలు!
        ఒక మదనిక చీరను ఒక కోతి లాగి వేస్తుంటే, ఒక చేత్తో మానసంరక్షణ చేసుకొంటూ, రెండవచేతితో ఆ కోతిని అదిలిస్తున్నట్లు ఉన్న ఆ శిల్పంలోని ముఖంలో కన్పించే హావభావాలు అద్భుతం! మరొక మదనిక పాదంలో ముల్లుగుచ్చుకోగా, ఆ పాదం మీద ఏర్పడిన వాపును కూడా ప్రదర్శించిన శిల్పి నైపుణ్యం వర్ణనాతీతం! ఇలాంటి హావభావాలను శిల్పాలలో ప్రదర్శించటంలో కాకతీయుల ప్రజ్ఞ చూసి తీరవలసిందే! ఈ మదనికల శిల్పాల నడుమ గజకేసరి శిల్పాలు ఉన్నాయి. ఓరుగల్లు కోటలోను, కాకతీయ దేవాలయాలలోను ఎక్కడ పడితే అక్కడ ఈ గజకేసరి శిల్పాలు కన్పిస్తాయి. పాలంపేట రుద్రేశ్వరాలయంలోనివి పెద్దగా ఉన్నాయి. కారణం - కాకతీయ రాజులలో మొదటి, రెండవ ప్రోలరాజులకు, రుద్రదేవ మహారాజుకు, గణపతిదేవ చక్రవర్తికి, రుద్రమదేవికి, ప్రతాపరుద్రునికి - అందరికీ గజకేసరిబిరుదులు ఉన్నాయి. బహుశః అందుకేనేమో కాకతీయ శిల్పాలలో గజకేసరి శిల్పాలు ఎక్కువగా కన్పిస్తాయి.
రంగమంటపం:
గర్భాలయానికి ముందున్న రంగమంటప శోభను వర్ణించలేము. నాలుగు స్తంభాలమీద చెక్కిన శిల్పాలు అద్భుతంగా కన్పిస్తాయి. స్తంభాల పైభాగాన్ని సంగడి పట్టినట్లు చెక్కారు శిల్పులు. ఇంత అందంగా చెక్కిన స్తంభాలు మరి ఏ కాకతీయ దేవాలయాలలోనూ కన్పించవనటం అతిశయోక్తి కాదు. స్తంభాల మధ్యలో చతురవూసాకార ఫలకాలమీద, గుండ్రంగా ఉన్న భాగాలపైన, వాటికి అనుగుణమైన శిల్పాలను చెక్కి, తమ చాకచక్యాన్ని ప్రదర్శించారు శిల్పులు. ఒక దానిమీద సముద్ర మథనం, ఒకదానిమీద ముగ్గురు స్త్రీలకు నాలుగే కాళ్ళు ఉన్న శిల్పం, ఒకదానిమీద పేరిణి నాట్యం, ఒకదానిమీద దండలాస్యం, ఒకదానిమీద కుండలాకార నృత్యం, ఒకదానిమీద స్త్రీలే మద్దెలలు వాయిస్తూ ఉండగా మరొక స్త్రీ నాట్యం చేస్తున్నట్లు చెక్కిన చిత్రం - వంటివి అద్భుతంగా చెక్కబడినాయి.
గర్భాలయ ప్రధాన ద్వారం:
        రుద్రేశ్వరాలయ గర్భాలయ ప్రధాన ద్వారం మరొక గొప్ప కళాఖండం. చెరుకుగడలు, అరటిబోదెల మధ్య బాణాలు ధరించి, రకరకాల భంగిమలలో నిలబడ్డ స్త్రీలు జీవకళతో దర్శనమిస్తారు. ఇక్కడి శిల్పాలను చేత్తో మీటితే ఆ రాయినుంచి లోహపు శబ్దం రావటం విశేషం. వాటి పైభాగాన సింహాల వరుసలు, లతలు, వాద్యకారుల చిత్రాలు అందంగా తీర్చిదిద్దబడినాయి.
శ్రీ రుద్రేశ్వర మహాలింగం:
    గర్భాలయంలో ఉన్న పెద్ద శ్రీ రుద్రేశ్వర మహాలింగం, అనుమకొండలోని వెయ్యిస్తంభాల గుడిలోని రుద్రేశ్వరునితో పోటీపడుతున్నదా అన్నట్లు కనువిందు చేస్తుంది. పానవట్టంపైన భాగంలోనే కాకుండా, కింది భాగంలో కూడా సన్నని గీతలు గీతలుగా అందంగా చెక్కిన రీతి మనోహరం! ప్రధానలింగం నల్లని కాంతులీనుతూ నిన్ననో మొన్ననో చెక్కినట్లు కన్పిస్తుంది. ఇదొక అద్భుత కళాఖండం!
దశభుజ రుద్రుడు:
      రంగమంటప మధ్యభాగంలో ఉన్న పైకప్పులో దశభుజుడైన నాట్యరువూదుడు చెక్కబడినాడు. ఇలాంటి శిల్పమే అనుమకొండలోని రుద్రేశ్వరాలయం స్తంభాలగుడి)లో కూడా ఉన్నది. పరమశి వారాధకులైన కాకతీయులు వైదికరువూదుని ఆరాధించారనటానికి - రుద్రదేవ మహారాజు, రుద్ర(మ)దేవి, ప్రతాపకుమార రుద్రదేవ మహారాజు అన్న వారి పేర్లలో కన్పించే ‘రుద్ర’ శబ్దమే నిదర్శనం. ఆ దశభుజ రుద్రునికి - కుడివైపున ఉన్న 5 చేతులలో - శూలము, వజ్రాయుధము, ఖడ్గము, పరశువు, అభయముద్ర ఉన్నాయి. అట్లాగే ఎడమవైపున ఉన్న 5 చేతులలో - నాగము, పాశము, ఘంట, అగ్ని, అంకుశము ఉన్నాయి. ప్రతాపరుద్ర చక్రవర్తికి సమకాలికుడైన పాల్కురికి సోమనాథుని ‘పండితారాధ్య చరిత్ర’ (వాద ప్రకరణం- పు.661)లో సరిగ్గా ఇదే రకమైన వర్ణన కన్పిస్తుంది. ఆ వైదికరువూదుని వర్ణనకు శిల్పరూపమే పై రంగమంటప శిల్పం. ఆ దశభుజరువూదుని పరివేష్టించి అష్ట దిక్పాలకులు భార్యాసమేతులై, తమ తమ వాహనాలమీద కొలువుతీరి ఉన్నారు.
        ఆ రంగమంటపం చుట్టూ ఉన్న 4 అడ్డదూలాలమీద సముద్ర మథనము, త్రిపురాసుర సంహారం, గజాసుర సంహారం, వరాహమూర్తి, నాట్యగణపతి, కృత్య వంటివి మనోహరంగా చెక్కబడినాయి. ముఖ్యంగా - గజాసుర సంహారం చేసిన శివుడు ఆ ఏనుగును చీల్చి బయటకు వస్తున్నట్లు చెక్కిన శిల్పం మనోహరంగా కన్పిస్తుంది.
         రంగమంటపం చుట్టూ ఉన్న పైకప్పులలో రకరకాల పద్మదళాలు, రాతి చక్రాలు చెక్కబడినాయి. ఆలయం కప్పు లోపలి వైపున కొన్ని చోట్ల ఎర్రని శిలలను చెక్కిపెట్టటంవల్ల, అవి ఈనాడు అందంగా కన్పించటానికి ఉపయోగిస్తున్న ‘టైల్స్’ లాగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రంగమంటపం ఒక అద్భుత కళాఖండం! ఆలయానికి చుట్టూ విశాలమైన ప్రదక్షిణపథం ఉంది. దానిమీద నడుస్తూ ఉంటే ఆలయం వెలుపల చెక్కిన ఎన్నో కుడ్యశిల్పాలు కన్పిస్తాయి. వాటిలో - శృంగార శిల్పాలు, క్రీడా వినోదాలు, వాద్యకారులు, మల్లయుద్ధాలు, భైరవమూర్తులు వంటి విశేషాలు కన్పిస్తాయి. అవికాక - మహిషాసుర మర్దిని, వీరభవూదుడు, సప్తమాతృకలు వంటి శిల్పాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. రుద్రేశ్వరాలయం పైభాగంలో పెద్ద గోపురం కన్పిస్తుంది. అది ‘వేసర’ శిల్ప విధానంలో నిర్మింపబడింది. ఆలయ శిఖరానికి ఉపయోగించిన ఇటుకలు నీళ్ళలో తేలుతాయి. ప్రస్తుతం అవి లభించటం లేదు. కానీ, అవి కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం!
         ఇట్లా అనేక శిల్ప విశేషాలతో అలరారుతూ, కాకతీయ శిల్పరీతికి శిఖరాయ మానంగానూ, నిలు నిదర్శనంగానూ నిలిచి ఉన్న ఈ రుద్రేశ్వరాలయం నేడు దేశంలోనే ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్నది. అష్టశతాబ్దాలు పూర్తయిన శుభ సందర్భంలో రుద్రేశ్వరాలయాన్ని మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే, అది చారివూతాత్మక వారసత్వ సంపద గలిగిన ఓరుగల్లుకు కీర్తిపతాక అవుతుంది. ఆ గొప్ప వారసత్వ సంపదను భావితరాలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే కాక, ఓరుగల్లు ప్రజలందరిదీ అని గుర్తించాలి!

Monday 15 April 2013

పుడమి తల్లి పరిరక్షణకు ఎర్త్ అవర్...

     

           ఈ విశ్వంలో ప్రాణికోటికి ఆవాసంగా ఉన్నది భూమి ఒక్కటే. ఆ ఒక్క భూమిపై కూడా వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అనేక జీవరాశులు అంతరించిపోతున్నాయి. భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత విషమిస్తే మానవ మనుగడకు కూడా ప్రమాదమే. ఈ పరిస్థితిని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో కర్భన వాయువుల కాలుష్యం, వాతావరణ మార్పులపై అవగాహన ఏర్పరచడానికి చేపట్టిన కార్యక్రమమే ‘ఎర్త్ అవర్’
- ఎర్త్ అవర్ కార్యక్రమం మొదటిసారిగా 2007లో ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది. ఈ ఎర్త్ అవర్ కార్య క్రమాన్ని ప్రతి సంవత్సరం మార్చి నెలలో నిర్వహిస్తారు.
- 2013 మార్చి 23 రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు ఎర్త్ అవర్‌ను ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు పాటించాయి.
- ఈ ఎర్త్ అవర్ కార్యక్రమంలో గంటసేపు విద్యుత్ వినియోగాన్ని నిలిపివేయడం ద్వారా ప్రజలు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు తోడ్పాటు అందించినట్లయింది. భారతదేశంలో ఎర్త్‌అవర్ కార్య్రక్రమాన్ని మొదటిసారిగా 2009లో పాటించారు.
- డబ్ల్యూ.డబ్ల్యూ.ఎఫ్ సీఈఓ ఆండీ రిడ్లే ప్రపంచ ప్రజలలో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంచడంలో విజయం సాధించారు. దీనికి ఎర్త్ అవర్ కార్యక్రమంలో పాల్గొంటున్న దేశాలు, పెరుగుతున్న ప్రజల మద్దతే నిదర్శనం.
- హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరులాంటి మెట్రోనగరాలతోపాటు చిన్న, మధ్యతరహా పట్టణాలను కూడా ఎర్త్ అవర్‌లో భాగస్వామ్యం పంచుకునేలా చేయగలిగారు.
-2011లో ఎర్త్‌అవర్‌లో 120 కోట్ల మంది పాల్గొనగా, 2012లో 180 కోట్ల మంది పాల్గొన్నారు. కాగా 2013లో ధరిత్రి పరి రక్షణకు సంఘీభావం ప్రకటించిన వారి సంఖ్య 200 కోట్లకు చేరుకుందని భావిస్తున్నారు.
-2013, మార్చి 23 ఎర్త్‌అవర్‌లో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనే ఆదా అయిన విద్యుత్ కొన్ని లక్షల యూనిట్లు ఉంటుందని అంచనా.
- ఈ సారి ఎర్త్‌అవర్‌లో పాలస్తీనా, ట్యునీసియా, సూరినాం, ఫ్రెంచ్ గయానా, సెయింట్ హలెనా, రువాండా దేశాలు తొలిసారిగా పాల్గొనడం విశేషం.
- అంతర్జాతీయంగా ఈ కార్యక్రమంలో కొన్ని కీలక ప్రదేశాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. అవి గేట్ వే ఆఫ్ ఇండియా, సిడ్నీ ఒపెరా హౌస్, సిడ్నీ హర్డార్ బ్రిడ్జ్, కౌలాలంపూర్‌లోని పెట్రోనాస్ టవర్స్, ద టోక్యో టవర్, తైపీ 101, బీజింగ్‌లోని ప్రధాన ఒలింపిక్ స్టేడియం ద బర్డ్స్ నెస్ట్, బుర్జ్ ఖలీఫా, ఈఫిల్ టవర్, బకింగ్‌హామ్ ప్యాలెస్, అమెరికాలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, నయాగారా జలపాతం.
- ఇలా ప్రపంచవ్యాప్తంగా గంటపాటు విద్యుత్ వినియోగాన్ని నిలిపివేయడం ద్వారా పెరుగుతున్న ఉష్ణ్రోగతలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యల ప్రాధాన్యతను చాటుతారు. 2013, మార్చి 23న జరిగిన ఎర్త్ అవర్‌లో 150కిపైగా దేశాల్లో ఆరువేల నగరాల్లో పర్యావరణ ప్రేమికులు దీనిని పాటించారు.
- ఢిల్లీలోని ఇండియా గేట్, హుమాయూన్ టూంబ్, ఎర్రకోట, సెంట్రల్‌పార్క్‌వంటి ప్రముఖ ప్రాంతాలు ఎర్త్ అవర్‌ను పాటించాయి.
- వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఆధ్వర్యంలో సిడ్నీలో 2009లో 20 లక్షలమంది ప్రజలతో తొలిసారిగా మొదలయిన ఎర్త్ అవర్ కార్యక్రమం 2013 మార్చి 23 నాటికి 150 దేశాలకు పైగా విస్తరించింది.
వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్
-‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’ పర్యావరణ సంరక్షణ, పరిశోధనకు సంబంధించిన ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ.
- దీని పూర్వపు పేరు ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్’.
- ప్రపంచంలో దాదాపు 100కు పైగా దేశాలలో పనిచేస్తూ, 50 లక్షలకు పైగా మద్ధతుదారులతో 1,300 పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టులకు మద్దతుగా నిలిచింది.
- ఈ సంస్థ ప్రధాన లక్ష్యం పర్యావరణ వినాశనాన్ని ఆపి సంరక్షణ చేపట్టడం.
- ప్రస్తుతం ఈ సంస్థ జీవవైవిధ్యం అధికంగా ఉన్న అడవులు, మంచినీటి, మహాసముద్రాలు, తీర ప్రాంతాలలో జీవసంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అంతరించిపోతున్న జీవజాతులు, కాలుష్యం, వాతావరణ మార్పులు వంటి ఇతర అంశాలపై కూడా ఈ సంస్థ పనిచేస్తోంది.
- ఈ సంస్థను 1961 ఏప్రిల్ 29న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం స్లిట్జర్లాండ్‌లో ఉంది.
- ఈ సంస్థ మోటో ‘ఫర్ ఎ లివింగ్ ప్లానెట్’. 1986లో ఈ సంస్థ ‘వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్’ నుంచి ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’గా పేరు మార్చుకుంది.
- ఈ సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు యోలండ కోకబడ్సె. ఈ సంస్థ మస్కట్ ‘ఛిఛి’ అనే ఒక పండా.

Friday 12 April 2013

‘1955- విశాలాంధ్ర తీర్మానం’ వెనుక..



-
జరిగింది చర్చ మాత్రమే..

- ఆమోదమూ లేదు.. ఓటింగూ జరగలేదు
- వాయిదాతో మంగళం పాడేశారు
- మద్దతు ప్రకటించిన వారిలో సింహభాగం తెలంగాణేతరులే
- గట్టిగా వ్యతిరేకించిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- హైదరాబాద్ శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టి.. ఫలితం తేలని..
   ఆమోదం పొందని ఏకైక తీర్మానం ఇదే
         
  
      1955నాటి విశాలాంధ్ర తీర్మానాన్ని మెజారిటీ ఓట్లతో హైదరాబాద్ అసెంబ్లీ ఆమోదించిందని ఆంధ్ర మేధావులు చెప్పే కథ.. శుద్ధ అబద్ధం. హైదరాబాద్ అసెంబ్లీ విశాలాంధ్ర అంశాన్ని చర్చించడం నిజం.. కానీ ఆ తీర్మానం ఆమోదం పొందలేదు.. ఓటింగు అంతకన్నా జరగలేదు. ఆ మాటకొస్తే ఆ చర్చ పూర్తికావడం కాదు కదా.. సభ కూడా అర్ధాంతరంగా వాయిదా పడింది. తర్వాత సమావేశాల్లో చర్చిద్దామని ప్రకటించినా.. ఆ తర్వాత అనేకసార్లు అసెంబ్లీ సమావేశమైనా.. ఆ తీర్మానం మాత్రం ఎటూ తేలని ఏకైక అనామక తీర్మానంగా చరిత్రలో నిలిచిపోయింది. కారణం ఏమిటి? అసలేం జరిగింది?
         దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు, ఆందోళనల నేపథ్యంలో 1953లో కేంద్రం ఫజల్ అలీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ(రాష్ట్రాల పునర్నిర్మాణ కమిషన్.. మొదటి ఎస్సార్సీ)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశమంతా పర్యటించి వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించి 1955లో కేంద్రానికి నివేదిక సమర్పించింది. దేశం మొత్తాన్ని పునర్నిర్మించే అంశమైనందున అభిప్రాయ సేకరణ కోసం అన్ని రాష్ట్రాలకు నాటి కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను పంపించింది. దీనిపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల్లో శాసనసభలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాయి. కమిషన్ సిఫార్సులను కొన్ని రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాయి.. కొన్ని వ్యతిరేకించాయి. మరికొన్ని తటస్తంగా ఉండిపోయాయి. ఇక మన రాష్ట్రానికి సంబంధించి ఈ నివేదికపై చర్చకోసం అటు ఆంధ్ర, ఇటు హైదరాబాద్ రెండు శాసనసభలు ఒకేరోజు అంటే 1955 నవంబర్ 25న సమావేశమయ్యాయి.
కర్నూలులో తహతహ
           కర్నూలులో సమావేశమైన ఆంధ్ర అసెంబ్లీ కమిషన్ సిఫార్సులు సమర్థిస్తూనే ఫజల్ అలీ చెప్పినట్టుగా 1961వరకు ఆగకుండా తక్షణం విశాలాంధ్ర ఏర్పాటుచేయాలని తీర్మానించడమే కాకుండా తెలంగాణలో భిన్నాభిప్రాయాలు, భయాందోళనలు ఉన్నందున ఆ ప్రాంతానికి విశాలాంధ్రలో ప్రత్యేక రక్షణలు కల్పిస్తామని, తెలంగాణ అభివృద్ధిని ప్రత్యేక బాధ్యతగా తీసుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆంధ్ర ప్రాంతంలో విశాలాంధ్ర ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు లేకపోవడం, హైదరాబాద్‌లో కలిసిపోవాలనే తహ తహ ఉండడంతో కర్నూలు అసెంబ్లీలో చర్చ రెండు రోజుల్లో ముగిసింది. ఇందులో గమనార్హమైన విషయం ఏంటంటే ఇంత ముఖ్యమైన తీర్మానంపై చర్చ జరుగుతున్నా.. అసెంబ్లీలో సభ్యుల హాజరుసంఖ్య పలుచగా ఉంది. ఈ విషయాన్ని సభ్యుడొకరు స్పీకర్ దృష్టికి తెస్తూ ఆవేదన వ్యక్తం చేశారు కూడా. కానీ హైదరాబాద్ కథ భిన్నమైంది. ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది. అప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం విశాలాంధ్ర ఏర్పాటుకు దాదాపు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాంగ్రెస్ కార్యవర్గం ‘విళాలాంధ్ర ఏర్పాటు జరుగుతుందని’ ప్రకటన చేస్తూనే, ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకతను దృష్టి ఉంచుకొని ‘అశ్వద్థామ హతః కుజరః’ అన్నచందంగా ‘ప్రజలు కోరుకుంటే...’ అనే పదాలు ఉపయోగించింది. ఫజల్ కమిటీ నివేదికపై చర్చకు శాసనసభ సమావేశమయ్యేనాటికే తెలంగాణ ఉద్రిక్తంగా మారింది. 
                 వరంగల్‌లో జరిగిన విశాలాంధ్ర సమావేశం రచ్చరచ్చయింది. రాళ్లదాడులు వీధిపోరాటాలకు వేదికైంది. వందల మంది విద్యార్థులను అరెస్టు చేశారు. చర్చకు ముందురోజే రాష్ట్రమంతా తెలంగాణ దినోత్సవం చేసి హర్తాళ్లు జరిపారు. హైదరాబాద్‌లో పాన్‌షాపుల నుంచి మొదలుకొని అన్ని వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. విద్యార్థులు చురుగ్గా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. దీనితో శాసనసభ సమావేశాలు జరుగుతున్నంతకాలం రాజధానిలో కర్ఫ్యూ విధించి ప్రదర్శనలు, ఆందోళనలు నిషేధించారు. విశాలాంవూధను గట్టిగా సమర్థించే పీడీఎఫ్ సభ్యుల ఇళ్లకు పోలీసులు రక్షణ కల్పించారు. ఈ పరిస్థితుల్లో శాసనసభ సమావేశమైంది. శాసనసభలో పూర్తిస్థాయిలో హాజరు ఉండడంతోపాటు ప్రేక్షకుల గ్యాలరీ కిక్కిరిసిపోయింది. తొలిరోజు సభలో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ‘ఫజల్ కమిషన్ సిఫార్సులను పరిశీలించాలని’ కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. చర్చ ప్రారంభమైంది. మరాఠ, కన్నడ ప్రాంతాలు మహారాష్ట్ర, మైసూరు రాష్ట్రాల్లో చేరడానికి దాదాపు ఏకాభివూపాయం వ్యక్తం చేయగా తెలంగాణను ఆంధ్రలో విలీనం చేయాలన్న విషయంపై కొందరు సభ్యులు అనుకూలంగా, మరి కొందరు వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు.
                  మూడురోజులపాటు కొనసాగిన చర్చల్లో తీవ్రాతితీవ్రమైన విభేదాలు పొడసూపాయి. అసెంబ్లీలో విశాలాంధ్రపై ఏకాభిప్రాయం వ్యక్తమయ్యే అవకాశం కనిపించలేదు. దీంతో విశాలాంధ్ర ఏర్పాటుకు కృతనిశ్చయంతో ఉన్న అధిష్ఠానం ఒక ఎత్తుగడగా బూర్గులతో విశాలాంధ్ర ఏర్పాటుచేయాలని కోరుతూ తీర్మానం పెట్టించింది. వాస్తవానికి రాష్ట్ర భవితవ్యం నిర్ణయించే అంశం కావడం వల్ల కమిటీ నివేదికపై మాట్లాడుతున్నప్పుడు సభ్యులకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం మధ్యవర్తి పాత్ర వహించాల్సి ఉంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. ప్రభుత్వమే ఓ వైఖరి తీసుకుని విశాలాంవూధకు మద్దతుగా రంగంలోకి దిగింది. సహజంగానే ప్రభుత్వాన్నేలే పార్టీ ప్రవేశపెట్టే ఏ తీర్మానానికైనా శాసనసభలో మెజార్టీ లభిస్తుందనేది అందరికీ తెలిసిన విషయం. అందుకే మొదటి మూడు రోజులు విశాలాంధ్ర అనుకూల వ్యతిరేక వాదనలు పోటాపోటీగా వినిపించగా అక్కడి నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. మొదట్లో స్వేచ్ఛగా అభివూపాయాలు చెప్పే అవకాశం ఉండగా హఠాత్తుగా సీఎం విశాలాంవూధకు అనుకూల తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. దీంతో సీఎం వర్గం గొంతు మారింది. 
                         ఇదిలా ఉంటే ఈ తీర్మానం రూపకల్పన కోసం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాల్లో గందరగోళం చెలరేగింది. ఈ విషయమై సీఎల్పీలో రెండు రోజుల్లో దాదాపు 12గంటలపాటు వాదోపవాదాలు జరిగాయి. విశాలాంధ్ర తీర్మానానికి అధిష్ఠానం ఆమోదం ఉందా అని కేవీ రంగాడ్డి, చెన్నాడ్డి, బూర్గులను నిలదీశారు. ఏకపక్షంగా విశాలాంధ్ర కోరుతూ తీర్మానం పెట్టడమేమిటని ప్రశ్నించారు. అయితే బూర్గుల మాత్రం అంతకు ముందు కాంగ్రెస్ కార్యవర్గం చేసిన ప్రకటన మేరకే ఈ తీర్మానం పెడుతున్నామని, అధిష్ఠానం ఆదేశం కూడా ఉందని చెప్పుకున్నారు. పంజాబ్, పెప్సూ రాష్ట్రాల్లో తీర్మానాలేవీ లేకుండా చర్చలు జరుగుతున్నాయని, మధ్యవూపదేశ్‌లో కాంగ్రెస్ కార్యవర్గ తీర్మానం యథాతథంగా ప్రవేశపెట్టారని గుర్తుచేస్తూ.. అదే దారిలో అధిష్ఠానం ప్రకటన మేరకు ‘ప్రజలు కోరుకుంటే’ అనే పదాలను కూడా ఈ తీర్మానంలో చేర్చాలని చెన్నాడ్డి పట్టుబట్టారు. అయితే ఈ విషయం అధిష్ఠానంతో చెప్పిస్తేనే ఆ పదాలు చేర్చుతామని బూర్గుల భీష్మించారు. ఈ విషయమై చర్చించేందుకు కేవీ రంగాడ్డి, నిజామాబాద్ ఎంపీ హరిశ్చంద్ర హెడా ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ చర్చల ఫలితం కూడా తేలకముందే మరుసటి రోజు బూర్గుల తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. నిజానికి అప్పటికి తెలంగాణలోని సగానికిపైగా కాంగ్రెస్ సభ్యులు తెలంగాణ కావాలని కోరుతున్నారు. విశాలాంధ్ర తీర్మానం మీద కేవలం తెలంగాణ సభ్యుల అభిప్రాయాలు మాత్రమే తీసుకోవాలని, మరాఠ, కన్నడ ప్రాంతాల అభివూపాయం వద్దని పట్టుబడుతున్నారు. అప్పటికే అధిష్ఠానం కనుసన్నల్లో పనిచేస్తున్న బూర్గుల తన పంతం నెగ్గించుకునే క్రమంలో సభలో పెద్ద సంఖ్యలో ఉన్న కమ్యూనిస్టుల మద్దతుకుతోడు మరాఠ, కన్నడ సభ్యుల సహాయంతో తీర్మానం నెగ్గించుకునే ఎత్తుగడను అమలుచేశాడు. దాంతో సభలో విశాలాంధ్ర వాదనకు మద్దతు పెరుగుతూ వచ్చింది.
                   ఇదే సమయంలో ఢిల్లీలో కేవీ అధిష్ఠానాన్ని కలిశారు. బలవంతపు విశాలాంధ్ర తీర్మానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి తిరిగి వచ్చేశారు. అధిష్ఠానం ఆదేశాలు పాటిస్తానని ప్రకటిస్తూనే మరోవైపు తెలంగాణ సమావేశాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. ఈ సమయంలో కేవీ తెలంగాణ కోసం ఉద్యమం లేవదీయనున్నారనే వదంతులు దావానలంలా వ్యాపించాయి. ఎత్తుగడలు ఎదురుతిరగడంతో పరిస్థితి చేజారుతుందని భావించిన అధిష్ఠానం పరిస్థితిని సమీక్షించి ‘తీర్మానం మీద ఎట్టి పరిస్థితిలోనూ ఓటింగు జరపరాదు’ అని బూర్గులకు సందేశం పంపిందనే వార్తలు గుప్పుమన్నాయి. దానికి తగ్గట్టుగానే ఎనిమిదో రోజు సభలో చర్చ అసంపూర్ణంగా ముగియగానే ‘రాష్ట్రంలో సౌదీ రాజు పర్యటన, నాగార్జునసాగర్ శంకుస్థాపన కోసం ప్రధాని నెహ్రూ పర్యటనలు ఉన్నందువల్ల’ చర్చను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు డిసెంబర్ 3న స్పీకర్ ప్రకటించారు. నిజానికి ఈ రెండు పర్యటనలుంటాయని సర్కారుకు ముందే తెలుసు. అయినా సభలు సమావేశపరిచి చర్చను అర్ధాంతరంగా వాయిదా వేశారు. అయితే ఈ లోపల విశాలాంధ్ర వాదులు సభలో జరిగిన చర్చలో సభ్యుల వాదనలను బట్టి విశాలాంధ్ర ఇంతమంది మద్దతు.. తెలంగాణకు ఇంతమంది అంటూ లెక్కలుగట్టి ప్రకటించుకున్నారు.
తీర్మానం కథ కంచికే..
       ఇక వాయిదా పడ్డ శాసనసభ మరుసటి సంవత్సరం ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. అయితే విశాలాంధ్ర తీర్మానం జోలికిపోలేదు. తొలిరోజు సమావేశంలోనే విశాలాంధ్ర చర్చను అనివార్య కారణాల వల్ల మార్చి 12కు వాయిదా వేస్తున్నట్లు ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్య ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఆ 12వ తేదీకి ముందే నెహ్రూ నిజామాబాద్ పర్యటనకు రావడం, అక్కడే విశాలాంధ్ర ఏర్పాటు ప్రకటన చేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత మార్చి 12న జరిగిన శాసనసభ సమావేశంలోనూ ఈ తీర్మానం చర్చకు నోచుకోలేదు. కేంద్రం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును రూపొందిస్తున్నదని, ఏప్రిల్ నెలలో ఆ బిల్లుతోపాటు విశాలాంవూధపై కూడా చర్చిద్దామంటూ తీర్మానంపై చర్చను ఏప్రిల్ నెలకు వాయిదా వేశారు. ఏప్రిల్‌నాటికి ఆంధ్రవూపదేశ్ ఏర్పాటే ఖాయం కావడం వల్ల ఇక ఈ తీర్మానం మీద చర్చ జరగలేదు.. ఓటింగు అంతకన్నా జరగలేదు.. అదీ విశాలాంధ్ర తీర్మానం సంగతి!! 
- సవాల్‌డ్డి

Tuesday 9 April 2013

ఆ మూడు పార్టీలను ఓడిస్తేనే తెలంగాణ..


- రాష్ట్రం రాకుంటే కట్టుబానిసలుగా బతకాల్సిందే 
- తెలంగాణ నేతలకు ఎన్నాళ్లీ డిప్యూటీ బతుకులు?
- జనగామలో నెల్లుట్ల రవీందర్‌రావు పదవీ విరమణ సభలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 

జనగామ: టీఆర్‌ఎస్‌కు 17 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే అసెంబ్లీని గడగడలాడించాం, వంద మంది ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీలో ఆంధ్రోళ్లను అడుగుపెట్టనిస్తామా? 2009 డిసెంబర్ 7న తెలంగాణకు అనుకూలమని ప్రకటించిన టీడీపీ, 9న అనుకూల ప్రకటన రాగానే 10న మాట తప్పింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ వద్దంటూ పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్నడు, కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల నుంచి మోసం చేస్తూ ప్రజలను గోసపెడుతోంది. ఈ మూడు పార్టీలను ఓడిస్తేనే తెలంగాణ వస్తుంది’ అని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం వరంగల్ జిల్లా జనగామలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు నెల్లుట్ల రవీందర్‌రావు పదవీ విరమణ సభకు ముఖ్యఅతిథిగా కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గత రెండు ఎన్నికల్లో తెలంగాణ ఓడిపోయింది. పుష్కర కాలంగా ఉద్యమం చేస్తున్నాం. ఈసారి ఓడితే తెలంగాణ ఎప్పటికీ రాకపోగా ఆంధ్రోళ్ల పెత్తనంలో కట్టుబానిసలుగా బతకాల్సివస్తది. తెగతెంపుల సంకీర్ణాలు నడుస్తున్నాయి. ఉద్యమంతోపాటు ప్రబల రాజకీయ శక్తిగా ఎదిగి శాసించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి. ఆంధ్ర పార్టీల్లో తెలంగాణవాళ్లు ఎప్పటికీ పార్టీ అధ్యక్షులు కారు, ముఖ్యమంత్రులు, శాసనసభ పక్షనాయకులు, కనీసం అసెంబ్లీ స్పీకర్లుగా కూడా కారు. ఎన్నాళ్లు డిప్యూటీలుగా బతకాలి. కొంత మంది సన్నాసులు, వెన్నెముకలేనోళ్లు ఆంధ్రోళ్ల తొత్తులుగా ఉన్నరు. పొన్నాల ఇంటి వెనకాల పొలం ఎండిపోతున్నా, ఆయన మాత్రం అంతా బాగా ఉందని హైదరాబాద్‌లో ప్రకటనలు చేస్తూ ఆంధ్రోళ్లకు తొత్తుగా మారాడు. ఇలాంటి వాళ్లను తిగిరి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారా? 
            విద్యావ్యవస్థ గురించి తెలియని ఐఏఎస్‌లు ఏసీ గదుల్లో కూర్చొని దిక్కుమాలిన పాలసీలతో విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు. ఈ విధానాల ఫలితంగా 1200 పాఠశాలలు మాయమైనయి. తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటది. కులాలవారీగా హస్టళ్లు ఉండవు. హాస్టల్స్ స్థానంలో రెసిడెన్సియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి కుల,మత,జాతులనే తేడాలేకుండా ఒకే డ్రెస్ కోడ్, సీబీఎస్‌ఈ సిలబస్ ప్రవేశపెడ్తం. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యావేత్తలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తాం. కేజీ నుంచి పీజీ వరకు అన్ని వర్గాలకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తాం. ఉపాధ్యాయులు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. అవసరమైతే నెల్లుట్ల రవీందర్‌రావు వంటివారిని ఎమ్మెల్సీగా బరిలోకి దింపుతాం. గ్రామస్థాయిలో ప్రజలను చైతన్యవంతులను చేయడంలో ఉపాధ్యాయులు కృషి చేయాలి’అని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నెల్లుట్ల రవీందర్‌రావు దంపతులను కేసీఆర్ సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, మొలుగూరి భిక్షపతి, పొలిట్‌బ్యూరో సభ్యులు కెప్టెన్ లక్షీకాంతరావు, రామగళ్ల పరమేశ్వర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎన్ సుధాకర్‌రావు, రాష్ట్ర కార్యదర్శులు బక్క నాగరాజు, టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి పాల్గొన్నారు.

Saturday 6 April 2013

తెలంగాణ డిమాండ్ న్యాయమైంది కాదు..

* ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ

హైదరాబాద్: తెలంగాణ డిమాండ్ న్యాయమైంది కాదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు. అది సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాను వ్యతిరేకమని స్పష్టంచేశారు. దక్షిణాది మీడియా సంబంధిత కేసుల విచారణ కోసం హైదరాబాద్ వచ్చిన జస్టిస్ కట్జూ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ న్యాయమైన డిమాండ్ కాదని, కొందరు నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ డిమాండ్‌ని ముందుకు తెస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని, ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ప్రతి జిల్లా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటుందని అన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి డిమాండ్లే వినిపిస్తాయని, ఇలాంటి పరిస్థితులు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. తెలంగాణలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని కట్జూ అభిప్రాయపడ్డారు. ఆర్థిక అసమానతలు తగ్గాయని చెప్పారు. తాను ఇంతవరకు ఓటు హక్కు వినియోగించుకోలేదని తెలిపారు. పార్లమెంట్ సభ్యుల్లో మూడో వంతు మంది నేర చరితులేనని, దేశ ప్రజలు కూడా కులాలవారీగా చీలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ను భారత్‌లో కలపాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.