Saturday 20 April 2013

బయ్యారం @ 700 లక్షల కోట్లు..

* విలువైన ఖనిజంపై సీమాంధ్ర సర్కార్ కన్ను.. 
* దోచుకునేందుకు గండికొట్టిన ఉత్తర్వులు..
* 5342 హెక్టార్లు విశాఖ ఉక్కుకు ధారాదత్తం
* ఉపయోగం లేని బెనిఫికేషన్ ప్లాంట్‌కు అనుమతి .. 
* దీనితో బయ్యారం ప్రజలకు మిగిలేది దుమ్మే.. 
* నాడు ఏపీ స్టీల్స్ పట్ల కూడా పాలకులది ఇదే వివక్ష
* అడ్డుకొని తీరుతామంటున్న తెలంగాణవాదులు
       
         లక్షా 41 వేల ఎకరాల్లో.. అక్షరాలా ఏడు వందల లక్షల కోట్ల రూపాయల విలువైన సహజ వనరులు! కళ్లు చెదిరేస్థాయిలో 12 వేల కోట్ల టన్నుల ఇనుప ఖనిజం! ప్లాంటు కడితే.. మరో 50 ఏళ్ల దాకా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని నిక్షేపాలు! ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఇనుప ఖనిజం గనుల్లో కేవలం ఖమ్మం జిల్లాలో ఉన్న వనరుల లెక్కే ఇది! స్థానికంగా స్టీల్ ప్లాంట్ నెలకొల్పడానికి పరిమితిని మించిన అర్హత! కానీ.. ఇంత విలువైన ఖనిజంపై కన్నేసిన సీమాంధ్ర పాలకులు.. ఈ అపారనిల్వలకు గండికొట్టారు! సీమాంధ్ర పాలకులు తెరలేపిన తాజా దోపిడీ అంకంలో తెలంగాణ అటు అభివృద్ధిపరంగా.. ఇటు ఉపాధి అవకాశాలరీత్యా గణనీయంగా నష్టపోనుంది! అపారమైన వనరులున్న ప్రాంతంలో స్టీల్‌ప్లాంటు నిర్మాణానికి అంతే స్థాయిలో అవకాశాలు ఉన్నా.. అందుకోసం పెద్ద ఎత్తున డిమాండ్లు ఉన్నా.. పట్టించుకోని సీమాంధ్ర పాలకులు.. ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమాల నేపథ్యంలోనూ తెలంగాణపై తమ వివక్షను బాహాటంగా వెల్లడించుకోవడమే విశేషం! అయితే.. ప్లాంటు కట్టడానికి సిద్ధపడని సర్కారు.. ఖనిజ శుద్ధి కర్మాగారానికి అనుమతి ఇవ్వడం ద్వారా అది మిగిల్చే వ్యర్థాలను తెలంగాణపై కుప్పలు పోయడానికి సిద్ధమవుతున్నది! ఈ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ.. బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు అంటూ నినదిస్తున్న ఉద్యమకారులు.. ఎట్టిపరిస్థితుల్లోనూ బయ్యారాన్ని భావి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడేందుకు పోరాడుతామని తెగేసి చెబుతున్నారు! 
                     ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలో అపారమైన ఇనుప ఖనిజం విస్తరించి ఉంది. ఒక్క ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లోనే 1,41,691 ఎకరాల (56,690హెక్టార్లు) భూమిలో ఇనుప ఖనిజం ఉంది. ఇక్కడ తవ్వితే 12వేల కోట్ల టన్నుల ముడి ఇనుము లభిస్తుందని సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీని విలువ రూ.700 లక్షల కోట్లు పైమా అంచనా వేసింది. దేశంలో లభ్యమవుతున్న ఇనుప ఖనిజంలో 12శాతం మేర ఖమ్మం జిల్లా బయ్యారం, గార్ల, నేలకొండపల్లి, వరంగల్ జిల్లాలోని గూడురు మండలాల్లోనే ఉన్నాయని చెప్పింది. ఇంతటి ఘనమైన సంపదపై కన్నేసిన సీమాంధ్ర పెట్టుబడిదారులు.. 2004 నుంచి తమ దోపిడీ యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. బినామీల పేరుతో మైనింగ్ లీజులు తీసుకుని కోట్లు పోగేసుకుంటున్నారు. దీనికి కొనసాగింపుగానా అన్నట్లు బయ్యారంలోని 2500 హెక్టార్లు, వరంగల్ జిల్లా గూడూరు పరిధిలోని 2500 హెక్టార్లు, కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లిలోని 342 హెక్టార్లు.. మొత్తం 5342 హెక్టార్లలో (13,200 ఎకరాలు) ఇనుప ఖనిజం గనులను విశాఖ ఉక్కుకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
వైఎస్ కాలంలోనే మోసానికి పునాది
           వైఎస్ రాజశేఖర్‌డ్డి ముఖ్యమంవూతిగా ఉన్నప్పుడు తన అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్‌కు బయ్యారం ఇనుప ఖనిజాన్ని అప్పగించేందుకు శతవిధాలుగా ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీఎండీసీ(ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)ను రంగంలోకి దించిన వైఎస్ ప్రభుత్వం.. బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లోని 56,690హెక్టార్లలో ఇనుప ఖనిజాన్ని తవ్వేందుకు 2009 ఫిబ్రవరి 24న ఎడాపెడా అనుమతులు ఇచ్చేసింది. ఈ సంస్థ వెలికి తీసిన ఇనుపరాయిని బ్రదర్ అనిల్‌కు చెందినదిగా చెప్పే రక్షణ స్టీల్స్‌కు తరలించాలన్నదే తెర వెనుక కుట్ర. దీనిపై వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఇస్పాత్ ఇండస్ట్రీతో కలిసి రూ.500 కోట్లతో బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ నెలకొల్పుతామని, తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మభ్యపెట్టారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. తరువాత కాలంలో వైఎస్ మృతి చెందడంతో పగ్గాలు చేపట్టిన రోశయ్య 2010జూలై 24న అనుమతులను రద్దు చేశారు. లీజు రద్దు చేసిన సర్కార్.. ఈ గనులను విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించేందుకు గురువారం నిర్ణయం తీసుకుంది. 1/70గిరిజన చట్టాన్ని సైతం తుంగలోకి తొక్కి ఈ వివాదాస్పద నిర్ణయాన్ని వెల్లడించింది. 
ప్లాంట్ ఏర్పాటుకు వనరులు పుష్కలం 
               బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయి. తలాపునే మున్నేరు దండిగా ప్రవహిస్తుంటుంది. సమీపంలోనే ఇల్లెందులో పుష్కలమైన బొగ్గు నిక్షేపాలు, పక్కనే ఇనుము శుద్ధిచేసే డోలమైట్ కర్మాగారం ఉంది. ఇక్కడ స్టీల్‌ప్లాంట్ నిర్మిస్తే మరో 50 ఏళ్ల దాకా ఎలాంటి వనరుల కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. ఇన్ని సౌకర్యాలు ఉన్నా ప్రభుత్వం ఇక్కడ ఫ్యాక్టరీ నెలకొల్పకుండా విశాఖకు తరలించేందుకు నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణను అభివృద్ధి పర్చాలనే భావన సర్కార్‌కు వీసమంత కూడా లేదు. ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అంతా అనుకూలంగా ఉందని మైనింగ్ అధికారులు కూడా నివేదికలు పంపారు. అయినా ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. 
ఆంధ్రకు ఒక నీతి.. తెలంగాణకు మరొక నీతి!
            విశాఖలో ఎటువంటి ఐరన్‌ఓర్ నిక్షేపాలు లేవు. అయినప్పటికీ అక్కడ ఫ్యాక్టరీ నిర్మించారు. కేవలం నీటి వనరు ఆధారంగానే అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బైలడిల్లా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి ఖనిజ సంపదను కొనుగోలు చేసి విశాఖకు తరలిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో ఉన్న ఇనుప ఖనిజ సంపదలో ఒక్క ఖమ్మం జిల్లా బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాలతో పాటు.. వరంగల్ జిల్లా గూడూరు మండలంలో 12శాతం మేర ఉంది. ఇక్కడ ఫ్యాక్టరీని నిర్మిస్తే 50సంవత్సరాల పాటు అంతరాయం లేకుండా నడపవచ్చు. కానీ ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతానికి ఒక నీతిని.. తెలంగాణ ప్రాంతానికి మరొక నీతిని ప్రదర్శిస్తున్నదని బయ్యారం రక్షణ కోసం ఉద్యమిస్తున్న వారు మండిపడుతున్నారు. తక్కువ క్వాలిటీ, క్వాంటిటీ లేదని, సరిపడా భూమి లేదని చెప్పి ఖనిజాన్ని తరలించేందుకు కుట్రపన్నిందని అంటున్నారు. వ్యతిరేకత రాకుండా ఉండేందుకే బెనిఫికేషన్ ప్లాంట్ అంటూ ఊరడిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
దుమ్ము కొట్టే బెనిఫికేషన్ ప్లాంట్
స్టీల్‌ప్లాంట్ కోసం ఇక్కడి నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తే.. ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం ఉపయోగం లేని బెనిఫికేషన్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మాత్రం అంగీకరించింది. నిజానికి ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల ఇక్కడ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించవు. ఈ ఫ్యాక్టరీ కేవలం ముడి ఖనిజాన్ని శుద్ధి చేసే కర్మాగారం మాత్రమే. ముడిఖనిజంలో సిలికా అనే వ్యర్థపదార్థం మిళితమై ఉంటుంది. ఉదాహరణకు 50లారీలు ముడిఖనిజంలో సిలికాను తొలగిస్తే 20లారీల అసలు ఖనిజం లభిస్తుంది. మిగతా 30లారీల లోడు నుంచి సిలికా రూపంలో వ్యర్థపదార్థం బయటపడుతుంది. ఇది ఎందుకూ పనికిరానిది. అంటే.. పప్పు దోచుకుపోతున్న పాలకులు.. ఇక్కడ పొట్టును వెదజల్లుతూ.. అదేదో గొప్ప పని అన్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. పైపెచ్చు.. ఈ వ్యర్థ పదార్థంతో రేగే కాలుష్యం, దుమ్ము, ధూళి వల్ల స్థానిక ప్రజలకు బోనస్‌గా దక్కేది అనారోగ్యం మాత్రమే. పంటలపైనా ఈ దుమ్ము, ధూళి తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా ఈ ప్లాంటు పేరుతో జనం నోట్లో దుమ్ము కొట్టేందుకు సర్కారు సిద్ధమవుతున్నదన్నమాట!
కుట్రలో భాగంగానే అధికారులు ఐరన్‌ఓర్ పరిశీలన 
         ప్రభుత్వ కుట్రలోభాగంగానే ఏడు శాఖల అధికారులు ఐరన్‌ఓర్‌ను సందర్శించారని పలువురు ఉద్యమకారులు చెబుతున్నారు. పరిక్షిశమలు, గనులు, అటవీ, నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్, కాలుష్యనివారణ.. ఈ ఏడు శాఖల అధికారులు గత సంవత్సరం బయ్యారం గనులను పరిశీలించారు. వారిని తెలంణవాదులు అడ్డుకుంటే.. తాము పరిక్షిశమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరిపేందుకు వచ్చామని ఆయా శాఖల అధికారులు నమ్మబలికారు. స్థానికంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటే పదివేల ఎకరాలు అవసరం ఉంటుందని చెప్పడం ద్వారా అప్పట్లోనే ఈ ఉక్కు పరాధీనం కానుందన్న సంకేతాలను అధికారులు ఇచ్చి వెళ్లారు. తాజా పరిణామాలతో ఆ కుట్ర విస్పష్టంగా అర్థమవుతోంది.
ఉద్దేశపూర్వకంగానే విశాఖకు తరలింపు..
             రాష్ట్రంలో 23 ఇనుప ఖనిజం గనులు ఉంటే ఇన్నాళ్లూ ఏ ఒక్క గనిని కూడా విశాఖ ఉక్కుకు అనుబంధం చేయని సర్కారు.. బయ్యారం గనులను ఎందుకు ఎంచుకుంది? దీని వెనుక కూడా పెద్ద కుట్ర కనిపిస్తుంటుంది. నవరత్నాలుగా అభివర్ణించే దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్ ఒకటి. ఇప్పటి వరకు విశాఖ అనుబంధంగా ఒక్క ఇనుప ఖనిజం గని కూడా లేదు. రాష్ట్రంలో 23 ఇనుప గనులున్నాయి. వీటిలో ఏ ఒక్కటీ విశాఖకు అనుబంధం లేదు. పైగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వాదనలున్నాయి. విశాఖ ప్లాంట్ ఆస్తులు లక్షకోట్లుగా ఉంటాయని అంచనా. దానిని ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు   ప్రభుత్వం ద్వారాలు తెరువనుంది. అయితే విశాఖ ఉక్కుకు అనుబంధ గనులు లేవు కనుక ప్రైవేటు పెట్టుబడిదారులు వెనుకడుగు వేసే అవకాశం ఉందని భావిస్తున్న సర్కారు.. వారిని సంతృప్తి పర్చేందుకే బయ్యారాన్ని ఎంచుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.లక్షకోట్లు ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆస్తులు కేవలం 25కోట్లకే ధారాదత్తం చేసేందుకు సిద్ధమవుతోందంటూ విశాఖ ప్లాంట్ కార్మిక సంఘాలు ఇటీవల ఆందోళనలు కూడా చేశాయి. బయ్యారం గనులను వైఎస్ తన అల్లుడుకు కట్టబెట్టినట్లే, పాలకులు తమకు కావల్సిన వారికి విశాఖ ఉక్కును కట్టబె పావులు కదుపుతూ.. ఆ క్రమంలోనే బయ్యారాన్ని బలిపశువును చేసినట్లు తెలుస్తోంది. 
నాడు ఏపీ స్టీల్స్‌పై ఇదే కుట్ర..
         తెలంగాణలో ఏకైక ఉక్కు కర్మాగారం ఏపీ స్టీల్స్ లిమిటెడ్‌కు ఖమ్మం జిల్లా పాల్వంచలో 1974లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు శంకుస్థాపన చేశారు. రెండేళ్ల తరువాత 1976లో ఉత్పత్తి ప్రారంభమైంది. రెండుసార్లు ఉత్తమ అవార్డులు కూడా సాధించింది. బొగ్గు, నీరు, ముడి ఖనిజం అందుబాటులో ఉండటం, రైలు మార్గం కూడా చేరువలో ఉండటం ఏపీస్టీల్స్‌కు అన్ని విధాలుగా కలిసి వచ్చింది. బయ్యారం ఇనుప ఖనిజం ఆధారంగానే ఈ స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. కానీ.. ఆంధ్రా పెట్టుబడుదారులు పాలకులతో కుమ్మక్కయి.. ఏపీ స్టీల్ డీలా పడేలా చేశారు. ముడి ఖనిజం ప్రధాన కొరతగా చూపి చేతులెత్తేశారు. నష్టాల ఊబిలో ఉన్న ఏపీ స్టీల్‌ను 1994లో లాకౌట్ ప్రకటించారు. అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించినప్పటికీ ఫలితం లేకపోయింది. పునరుద్ధరించాలన్న పోరాటాలను సైతం ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్‌ఎండీసీ చైర్మన్ సోనురాణా 2010లో ఏపీస్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. 12వందల కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దానికీ సర్కార్ అడ్డుపుల్ల వేసింది. తెలంగాణను అన్ని విధాలుగా దోచుకెళ్లాలని కుట్ర పన్నింది. 
              బయ్యారం ప్రాంతం ఇప్పటికే వెనుకబడి ఉంది. ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకపోతే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ దశలో ఆంధ్రప్రాంతానికి ఇక్కడి ఖనిజాన్ని తరలించడాన్ని ప్రజలు సహించరు. ప్రభుత్వం పునరాలోచించకపోతే ప్రజల కోపాగ్నికి గురికాక తప్పదు. ప్రభుత్వానికి ఈ ప్రాంతంపై సవతి తల్లి ప్రేమ ఉందనే విషయం బయ్యారం తరలింపుతో స్పష్టమవుతున్నది. ఎంతో మంది నిరుద్యోగ యువత ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. -రవి (బయ్యారం, గిరిజనుడు)

No comments:

Post a Comment