Friday 26 December 2014

గణతంత్రంలో మన శకటం.. ఎట్టకేలకు కేంద్రం ఆమోదముద్ర

   ఢిల్లీలో జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకల పరేడ్‌లో రాష్ట్ర శకటం సందడి చేయనుంది. మన శకటం ప్రదర్శనకు ఎట్టకేలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ డిసెంబరు 25న టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. రక్షణ శాఖనుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ విషయమై త్వరలోనే లేఖ అందనుంది. ఈసారి పరేడ్‌లో ఇప్పటిదాకా మనతో కలిపి మొత్తం పద్నాలుగు రాష్ర్టాల శకటాలకు మాత్రమే అనుమతి లభించింది. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాలు పండుగ ముఖ్యాంశంగా మన రాష్ట్ర శకటాన్ని రూపొందించారు. ప్రతిఏటా జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో భాగంగా దేశంలోని వివిధ రాష్ర్టాలు తమ తమ సంస్కృతి, అభివృద్ధి ఇతివృత్తంగా శకటాలను ప్రదర్శిస్తాయి. ఆయా రాష్ర్టాలు ప్రదర్శించబోయే థీమ్ నమూనాలను రిపబ్లిక్ డే సెరిమోనియల్ కమిటీ అక్టోబర్ నెలలోనే ఆహ్వానిస్తుంది. పరిశీలన తర్వాత మార్పుచేర్పులు, తిరస్కరణలు ఉంటాయి. మన రాష్ట్రంనుంచి బోనాలు థీమ్‌కు సంబంధించి నమూనాను పంపాలని గత అక్టోబర్ నెలలో ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల విభాగానికి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు బోనాలు డిజైన్ నమూనాను రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కమిటీకి సమర్పించారు. తర్వాత కమిటీ సూచించిన కొన్ని మార్పులు చేశారు. నవంబర్ 4వ తేదీన త్రీ-డీ నమూనాను తీసుకురావాలని వివిధ రాష్ర్టాలకు సమాచారమిచ్చిన కమిటీ, తెలంగాణ రాష్ర్టానికి ఆహ్వానం పంపలేదు. ఆ విధంగా జాబితా నుంచి తెలంగాణ రాష్ర్టాన్ని తొలగించినట్లయింది. 
రక్షణ మంత్రికి లేఖ రాసిన సీఎం..
ఈ విషయమై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అప్పటి రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాసి, తెలంగాణ రాష్ర్టానికి శకటాన్ని ప్రదర్శించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగే మొట్టమొదటి సారి జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి , సంప్రదాయాలను ప్రదర్శించే అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సెప్టెంబర్ 29వ తేదీన, అక్టోబర్ 7వ తేదీన రిపబ్లిక్ ఉత్సవ కమిటీ ముందు రాష్ట్ర ప్రభుత్వ శకటాన్ని ప్రదర్శించిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తితో పాటు ఇదే విషయంపై టీఆర్‌ఎస్ ఎంపీల బృందం పలుసార్లు రక్షణ శాఖ మంత్రిని విజ్ఞప్తి చేసింది. తర్వాత రక్షణ మంత్రి మారారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి నూతన రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను గత మంగళవారం కలిసి ఒక కొత్త రాష్ట్రంగా తమ మనోభావాలను ఆయనకు వివరించారు. సానుకూలంగా స్పందించిన పారికర్ అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గురువారం ఉదయమే స్వయంగా జితేందర్‌రెడ్డికి ఫోన్ చేసి శుభవార్త అందించారు. ఈ విషయమై జితేందర్‌రెడ్డి టీ మీడియాతో మాట్లాడుతూ, రక్షణ మంత్రి స్వయంగా ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలియచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శకటానికి సంబంధించిన థీమ్‌పై ఇప్పటికే సెర్మోనియల్ కమిటీ సభ్యులు చర్చించినందున అదే థీమ్‌ను వారు చేసిన సూచనల మేరకు వీలైనంత త్వరగా రూపొందించే పనులు ప్రారంభించాలని మంత్రి సూచించారని తెలిపారు. బోనాలు థీమ్‌తో రిపబ్లిక్ డే పెరేడ్‌లో తెలంగాణ శకట ప్రదర్శన ఉంటుందని చెప్పారు. 
బోనాలు థీమ్‌లో పోతురాజు:
అక్టోబర్ 28వ తేదీన సెర్మోనియల్ కమిటీ చేసిన సూచనల మేరకు మన శకటానికి ఆర్టిస్టు రమణారెడ్డి బోనాలు థీమ్ డిజైన్ నమూనాను తయారు చేశారు. బోనాలు పండుగలో గోల్కొండకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేయడానికి ఆ కోటను తన డిజైన్‌లో చూపించారు. పండుగలో మహిళల పాత్రను తెలియజేసే విధంగా తలపైన పూల బుట్టలు, గ్రామదేవతకు పూజలు చేయడం, ఊరేగింపు దృశ్యాలను తన డిజైన్‌లో పొందుపరిచారు. ఇక బోనాలు పండుగలో పోతురాజు పాత్రకు,ఘటంకు ఉన్న ప్రాధాన్యతకు డిజైన్‌లో ప్రముఖ స్థానం ఇచ్చారు. ఈ శకటం డిజైన్‌ను చూసిన వారికి తెలంగాణలో బోనాల పండుగ జరిగేతీరు ఇందులో మహిళల పాత్ర తదితర విషయాలు కండ్లకు కడతాయి. సెర్మోనియల్ కమిటీ సూచనలు, సలహాల మేరకు డిజైన్‌లో ఉన్న గోల్కొండ కోటకు కొన్ని మార్పులు చేసి రాళ్ళను కోటలాగా చూపించే స్వల్పమైన మార్పులు తుది డిజైన్‌లో చోటుచేసుకుంటున్నాయి. 
ఇవీ నిబంధనలు..
శకటం బరువు పది టన్నులకు మించకుండా చూడాలని కమిటీ నిబంధన విధించింది. వెడల్పు ఎనిమిది అడుగులు , ఎత్తు 4.2 అడుగులు, పొడవు 24.8 అడుగులు మించరాదని స్పష్టంగా పేర్కొన్నది. మినీ లారీ వెనకభాగంలో బేస్‌మెంట్ మొదలు 4.2 అడుగుల ఎత్తులో తెలంగాణ బోనాలు థీమ్ డిజైన్ ఉంటుంది. ఇక వాహనంతో పాటు డిజైన్ వివరాలను కూడా లెక్కలోకి తీసుకున్నట్లయితే మొత్తం పొడవు గరిష్టంగా 45 అడుగులు, వెడల్పు 14 అడుగులు, ఎత్తు 16 అడుగులు దాటరాదు. వీటిని పరిగణనలోకి తీసుకుని సంబంధిత అధికారుల సమక్షంలో తగిన భద్రతా చర్యల నడుమ ఈ శకటం తయారీ ఈ వారంలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే సెర్మోనియల్ కమిటీ 13 రాష్ర్టాలను ఎంపిక చేసి ఆయా రాష్ర్టాలకు సూచించిన డిజైన్ నమూనాలను విశ్లేషించి పనులను కూడా ప్రారంభించుకునేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆ పనులు కూడా దాదాపు సగం మేరకు పూర్తయ్యే దశలో ఉన్నాయి. కానీ తెలంగాణ విషయంలో మాత్రం నిర్ణయం ఇప్పుడే జరిగినందున తెలంగాణ సమాచార పౌర సంబంధాల విభాగం ఈ పనులను ఈ వారంలో ప్రారంభించనుంది. 

Thursday 25 December 2014

భారత 'రత్నాలు'


- బహుముఖ ప్రజ్ఞాశాలి మాలవ్యకు కూడా..
- మహోన్నత నేతలకు అత్యున్నత పౌర పురస్కారం 
- ఇద్దరిదీ నేడే జన్మదినం.. ఒకరోజు ముందు అవార్డు
 
- రాజకీయాలకతీతంగా స్వాగతించిన పార్టీలు 
టల్ బిహారీ వాజపేయి.. అతివాద పార్టీ నుంచి వచ్చినా.. మితవాద దృక్కోణంలో తన పాలనతో దేశవాసులను మెప్పించిన నేత! మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీలో ఆయన నిలువెత్తు లౌకికరూపం! మదన్ మోహన్ మాలవ్య.. బహుముఖ ప్రజ్ఞాశాలి.. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు.. హిందూ సమాజ సంఘటితానికి కృషిచేసిన సంఘ సంస్కర్త! ఒకరు స్వాతంత్య్రానంతర రాజకీయాలపై తనదైన చెరగని ముద్ర వేస్తే.. మరొకరు స్వాతంత్య్ర పోరాట కాలంలో దేశాన్ని ప్రభావితం చేశారు!!
ఈ ఇద్దరు గొప్ప నేతలకు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించింది. ఇద్దరూ హిందూత్వ భావాలు కలిగినవారు కావడం ఒక విశేషమైతే.. ఇద్దరి జన్మదినమూ ఒకే రోజు కావడం మరో ప్రత్యేకత! సంఘ్‌పరివారానికి సంబంధించిన ఒక వ్యక్తి భారతరత్న పురస్కారానికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. వాజపేయి ఆ కోవలోకి వస్తే.. మరణానంతరం ఈ పురస్కారానికి ఎంపికైనవారిలో మాలవ్య 12వ మహనీయుడు! ఈ ఇద్దరి జన్మదినాలకు ఒక రోజు ముందు వారికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ భారతరత్న అవార్డులను ప్రకటించారు...
          మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, భారత స్వాతంత్య్ర సమరయోధుడు, హిందూ మహాసభ వ్యవస్థాపకుల్లో ఒకరైన మదన్‌మోహన్ మాలవ్యను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. మహోన్నత వ్యక్తిత్వాలతో దేశానికి ఎనలేని సేవలందించి, భారతీయులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన వీరికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ డిసెంబరు 24న ప్రకటన విడుదల చేసింది. 
వాజపేయి డిసెంబరు 25న 90వ పుట్టినరోజు జరుపుకోనుండగా, అదేరోజు మాలవ్య 153వ జయంతి కావడం విశేషం. సందర్భోచితంగా ఒకరోజు ముందు వారికి అవార్డు ప్రకటించటంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు ఈ ఇద్దరు నేతలకు దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరారు. అందుకు రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలిపారు. ఈ ఇద్దరితో భారతరత్న పురస్కారం పొందినవారి సంఖ్య 45కు చేరింది. మరణానంతరం భారతరత్న పొందినవారిలో మాలవ్య 12వ వారు. గతేడాది ఈ పురస్కారాన్ని క్రికెట్ లెజెండ్ సచిన్‌టెండూల్కర్, ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావుకు ప్రకటించారు. వాజపేయి, మాలవ్యకు భారతరత్న ప్రకటించటంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ దేశం గర్వించదగ్గ గొప్పనేతలకు సముచిత గౌరవం లభించిందని వ్యాఖ్యానించారు. 
అజాత శత్రువు వాజపేయి
స్వతంత్ర భారతదేశంలో రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన నేతల్లో అటల్ బిహారీ వాజపేయి ముందువరుసలో ఉంటారు. 1998- 2004 మధ్య దేశ ప్రధానిగా మూడుసార్లు బాధ్యతలు చేపట్టిన ఆయన, అత్యధికకాలం ఆ పదవిలో ఉన్న కాంగ్రెస్సేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మహోన్నత వ్యక్తిత్వంతో దేశ రాజకీయాల్లో ఆయన అజాత శత్రువన్న పేరు సంపాదించుకున్నారు.
  రాజకీయ సభ అయినా, సమావేశమైనా వాజపేయి మాట్లాడుతున్నారంటే దేశమంతా గొప్ప హితోపదేశంలా వింటుంది. నేటితరం రాజకీయ నేతలంతా వాజపేయి అంతటి ఉపన్యాసకులు కావాలని కలలు కంటారంటే అతిశయోక్తికాదు. దేశ రాజకీయ యవనికపై బీజేపీని శక్తిమంతమైన రాజకీయపక్షంగా నిలబెట్టడంలో వాజపేయి నాయకత్వపటిమ పాత్ర ఎంత ఉందో, ఆయన వ్యక్తిత్వం పాత్ర కూడా అంతే ఉంది. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయిన ఆయన వేలెత్తిచూపలేని గొప్ప వ్యక్తిత్వంతో తన జీవితాన్ని దేశసేవకే అంకితం చేశారు. ప్రధానిగా దేశంతోపాటు అంతర్జాతీయ వ్యవహారాలపై కూడా వాజపేయి చెరగని ముద్రవేశారు.
  శాంతిసామరస్యాలపై అచంచల విశ్వాసంగల ఆయన, పొరుగుదేశం పాకిస్థాన్‌తో స్నేహసంబంధాలకోసం బస్సుయాత్ర చేపట్టి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దేశాభివృద్ధిపై స్పష్టమైన లక్ష్యాలున్న వాజపేయి, సత్వరాభివృద్ధికి రహదారులే కీలకమని నమ్మి తన పదవీకాలంలో స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయరహదారుల విస్తరణను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. వయసుతోపాటు సంక్రమించిన అనారోగ్యంతో ఆయన కొన్నేండ్లుగా ప్రజా జీవితానికి దూరంగా ఉంటున్నారు. భారతరత్న పురస్కారానికి ఎంపికైన మొట్టమొదటి బీజేపీ నాయకుడు వాజపేయే కావటం గమనార్హం.
హిందూ జాతీయోద్ధరణ దివిటీ మాలవ్య
దేశాన్ని జలగలా పీల్చిపిప్పిచేసిన శక్తిమంతమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒకానొక దశలో వణికించి, ముచ్చెమటలు పట్టించిన నిప్పుకణికలాంటి స్వాతంత్య్ర సమరయోధుడు పండిట్ మదన్‌మోహన్ మాలవ్య. విద్యావేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన ఆయన, భారతీయ సమాజాన్ని ఆధునీకరించటంకోసం ఎనలేని కృషిచేశారు. బ్రిటిష్ అరాచక, అవినీతి పాలనకు వ్యతిరేకంగా భారతీయులను పోరాటానికి సమాయత్తులను చేసి, ముందుకురికించారు.1886లో కలకత్తా (నేటి కోల్‌కతా)లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభల్లో మొదటిసారి పాల్గొన్న ఆయన ప్రసంగం విని దాదాభాయ్ నౌరోజీలాంటి మహామహులే అచ్చెరువొందారు. తన అసాధారణ నాయకత్వ పటిమతో 1909, 1918 సంవత్సరాల్లో రెండుసార్లు ఐఎన్‌సీకి అధ్యక్షుడయ్యారు. దురాచారాలతో ముక్కిమూలుగుతున్న హిందూ సమాజాన్ని సంస్కరించి, సంఘటితం చేసేందుకు 1914లో లాలా లజపతిరాయ్ తదితరులతో కలిసి అఖిల భారత హిందూమహాసభను స్థాపించారు. అదే అనంతరకాలంలో బలమైన హిందూ జాతీయవాద ఉద్యమానికి మూలమైంది. భారతీయులకు ఆధునిక విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు యూపీలో బనారస్‌లో హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి విద్యావ్యాప్తికి విశేష కృషిచేశారు. గొప్ప సంఘ సంస్కర్త అయిన మాలవ్యకు ఎప్పుడో భారతరత్న పురస్కారం ఇవ్వాల్సి ఉన్నా తగ ప్రభుత్వాలు ఆయనను నిర్లక్ష్యం చేశాయనే విమర్శ ఉంది. ఆలస్యంగానైనా ఎట్టకేలకు నరేంద్రమోదీ ప్రభుత్వం మాలవ్యను సమున్నతంగా గౌరవించింది.

Tuesday 9 December 2014

నడిగడ్డ పౌరుషం.. గద్వాల సంస్థానం..

* యుద్ధంలో పెద్దసోమభూపాలుని వీర మరణం 
* నిజాం కాలంలో స్వతంత్య్ర రాజ్యంగా అవతారం 
* మేల్కొనకుంటే చరిత్రలో కలిసిపోయే ప్రమాదం
* కాకతీయుల ఏలుబడిలో వర్ధిల్లిన దో ఆబ్ ప్రాంతం
* 18వ శతాబ్దంలో కోట నిర్మాణం
* యుద్ధంలో పెద్దసోమభూపాలుని వీర మరణం
* నిజాం కాలంలో స్వతంత్య్ర రాజ్యం
* దుండగుల చేతిలో ధ్వంసమవుతున్న చారిత్రక కట్టడం
* మేల్కొనకుంటే కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం 
      రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా.. ఆనాటి కట్టడాలు ఇప్పటికీ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.. ఒకప్పుడు స్వతంత్య్ర రాజ్యంగా ఎదిగిన గద్వాల సంస్థానంలోని మట్టి ప్రాకారాలు, ఇప్పుడు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి.. కోటలో గుప్తనిధులు ఉన్నాయని కొందరు వాటిని ధ్వంసం చేయడంతో ఇప్పుడు కళావిహీనంగా తయారయ్యాయి.. మరికొన్నాళ్లు ఇలాగే కొనసాగితే కోట మచ్చకైనా కనిపించని పరిస్థితులు నెలకొనున్నాయి..
అనగనగనగా.. ఒక సంస్థానం.. కాకతీయుల కాలంలో దో ఆబ్ ప్రాంతంగా విరాజిల్లిన మహా నగరం.. ఆ నగరాన్ని ఆనుకొని 40 అడుగుల ఎత్తు ఉన్న మట్టి ప్రకారం.. చుట్టూ శత్రువులు దరి చేరలేని విధంగా మొసళ్లతో నిండిన పెద్ద కందకం.. అబ్బుర పరిచే శిల్ప కళా సౌందర్యం.. పౌరుషానికి మారుపేరుగా నిలిచిన ఇక్కడి రాజుల వీరమరణం.. ఇదంతా విద్వద్గద్వాలగా పేరుగాంచిన గద్వాల ఖిల్లా ప్రాశస్త్యం.. నవాబుల కాలంలో స్వతంత్య్ర రాజ్యంగా బాసిల్లి, సాహితి, సకల కళలకు పుట్టినిల్లుగా నిలిచిన ఆ సంస్థానంపై ప్రత్యేక కథనం..
సంస్థానం ఆవిర్భావం
చరిత్ర ప్రకారం.. గద్వాల సంస్థానం కాకతీయ సామ్రాజ్యం నుంచి ఉంద్భవించిందట. రుద్రాంబ, ప్రతాపరుద్రుని కాలంలో రాయచూర్, దో ఆబ్ (రెండు నదులు ఉన్న ప్రాంతం) అరణ్య ప్రాంతాలుగా ఉండేవట. కాకతీయ సామంతులైన గోన వం శానికి చెందిన కామారెడ్డి, అతని కుమారుడు కాటారెడ్డి దో ఆబ్ ప్రాంతాలను నివాసయోగ్యంగా మార్చి, అభివృద్ధిలోకి తీసుకొచ్చారట. ఐజ (అయిజ) నాడేగౌడ (ఒక ప్రాంతానికి అధిపతి) బుడ్డారెడ్డి స హాయ సహకారాలు అందించాడట. 
   క్రీ.శ. 1290 లో బుడ్డారెడ్డిని కాకతీయ సామంతులు మానవపాడు, బెళుదోణ, రాయచూర్, మోసలకల్లు, అలంపు రం, ఆదోని, ఐజ అనే ఏడు సీమలకు నాడగౌరికం (ఆధిపత్యాన్ని) ఇచ్చారట. క్రీ.శ.1323లో కాకతీయ సామ్రాజ్యం పతనం కావడంతో, సామంతులంద రూ స్వాతంత్య్రం ప్రకటించుకున్నారట. అదే సమయంలోనే ఐజ నాడేగౌడలు స్వస్థలం వీడి కర్నూలు మండలం గోసునూరు, అనంతపురములకు వెళ్లి, అక్కడి పాలకులైన వడెము వంశీయులకు సామంతులయ్యారట. అదే సమయంలో విజయనగరం రాజులు కర్నూలు, నంద్యాల తదితర భూ భాగాల ను స్వాధీన పర్చుకోగా, 1344లో హరిహరుడు ఏకశిలా నగరమును ముట్టడించినప్పుడు ఆ ముట్టడి లో ఐజ నాడేగౌడలు రాజుకు సహాయపడ్డారట. అందుకు ప్రతిఫలంగా నాడేగౌడలకు కర్నూలు మం డలంలోని కొన్ని గ్రామాలకు అధిపతులుగా చేశారట. 1347లో బహమనీ సుల్తానులు కర్నూల్, దో-ఆబ్, రాయచూర్ ప్రాంతాలను జయించడంతో, గౌడాలు సుల్తానుల వశమయ్యారట. తిరిగి వారి ప్రాం తాలను సాధించుకునేందుకు, బీజాపూర్ రాజులను సామంతులుగా కావాలని కోరారట. 15వ శతాబ్దం నాటికి ఐజ ప్రాంతాన్ని తిరిగి సాధించుకున్నారట. 17వ శతాబ్దం ప్రారంభంలో పెద్దనృపతి ఐజ, కందనూలు (కర్నూల్), సీమలకు నాడేగౌడగా నియమితులయ్యారట. ఇతను పూడూరు సీమకు నాడగౌడగా ఉన్న వీరారెడ్డి కూతురు బక్కమాంబను పెండ్లి చేసుకొని, పూడూరు సీమకు అధిపతి అయ్యాడట. పెద్దనృపతి కుమారుడు పెదసోమభూపాలుడు 166 3-1712 మధ్య నాడ గౌడరికంకు వచ్చాడట. ఇతని ఆధ్వర్యంలోనే గద్వాల సంస్థానం రూపుదిద్దుకున్నదట.
మట్టి గోడలతో కోట నిర్మాణం
18వ శతాబ్దం ప్రారంభంలో గద్వాల ప్రాంతానికి వచ్చిన పెదసోమభూపాలునికి, ఈ ప్రాంతంలో వేట కుక్కలను కుందేలు తరిమిన దృశ్యం కనిపించిందట. పౌరుషానికి పేరుగాంచిన ఈ గడ్డపై కోటను నిర్మించాలని భావించి, వెంటనే ఇక్కడ నిర్మాణాన్ని చేపట్టాడట. 40 అడుగుల ఎత్తు ఉన్న మట్టి గోడలను ఏర్పాటు చేసి, కోటను నిర్మించాడట. చుట్టూ పెద్ద కందకాన్ని తవ్వించి, శత్రువులు కోటలకి రాకుండా అందులో మొసళ్లను వదిలాడట. కోట మధ్యలో రాజప్రసాదాలు, సౌద ప్రాంగణాలు, ఏడంకణాల సోఫా, ప్రాకారాలను నిర్మించాడట. పూడూరును చాళుక్యులు పాలించగా, చాళుక్యులు, పల్లవులకు జరిగిన యుద్ధంలో పెదసోమభూపాలుడు గద, వాలము అనే ఆయుధాలను ప్రయోగించాడట. అందుకుగానూ తాను చేపట్టిన కోటకు గదవాల అని పేరు పెట్టారట.
వీర మరణం పొందిన సోమభూపాలుడు
1663లో అస్తిత్వంలోకి వచ్చిన గద్వాల సంస్థానం ఆనాటి నుంచి 1712 వరకు రాజా పెదసోమభూపాలుని హయంలో స్వత్రంత్య రాజ్యంగా ఉండేదట. ఢిల్లీలో మొగల్ సింహాసనాన్ని అధిష్టించిన బహదూర్‌షా బలహీనుడుగా ఉండడంతో, దక్కన్ సుబేదార్ నిజాముల్‌ముల్క్ తనకుతానుగా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడట. బహదూర్‌షా అనుయాయులైనందున గద్వాల సంస్థానాన్ని, సంస్థానం ఆధీనంలో ఉన్న రాజ్యాలను స్వాధీనం చేసుకునేందుకు ముల్క్ తన సేనాని దిలీప్‌భానుడిని గద్వాల సంస్థానంపై దాడి చేసేందుకు పంపించాడట. పెదసోమభూపాలుడికి, దిలీప్‌భానుడికి మధ్య కర్నూల్ సమీపంలోని నిడుమార్ వద్ద యుద్ధం జరుగగా, సోమభూపాలుడు వీరమరణం పొందాడట. కాని నిజాం సంస్థానాన్ని వశం చేసుకోలేదట. పెదసోమభూపాలుని భార్య లింగమ్మ ముల్క్‌తో సంధి చేసుకొని, అతని అధికారాన్ని అంగీకరించిందట. నిజాం రాజ్యంలో గద్వాల సంస్థానం స్వతంత్య్ర రాజ్యంగా అవతరించి, 1949 వరకు నిజాం రాజ్యంలో విశేష మర్యాదలు అందుకున్నదట.
రాజులు, మహారాణుల పాలన
1663 నుంచి 1712 వరకు రాజా పెదసోమభూపాలుడు (49సంవత్సరాలు), దక్కన్ సుబేదార్ నిజాముల్‌ముల్క్‌తో సంధి ఒప్పందం కుదుకుర్చుని పెదసోమభూపాలుని భార్య లింగమ్మ 1712 నుంచి 1723 వరకు తనకు నమ్మిన బంటు అయిన కళ్ల వెంకటన్న, రమణయ్యలతో రాజ్య పాలన సాగించారు. అనంతరం అమ్మక్క 1723-24 వరకు, రాణి లింగమ్మ 1724-1737, రాజా తిరుమల్‌రావు 1739-1742, రాణి మంగమ్మ 1742-1743, రాణి లింగమ్మ, రాణి చుక్కమ్మ 1743-47, రాజారామభూపాలరావు 1748-61, రాజా సోమభూపాలుడు 1762-93, రాజా రామభూపాలుడు-2 1794-1807, రాజా సీతరామభూపాలుడు-1 1807-40, 1840-41 రాణి లింగమ్మ పాలించింది. రాజాసోమభూపాలుడు-1 (ఒక్క ఏడాది), సీతారామభూపాలుని మూడో భార్య రాణి వేంకట లక్ష్మమ్మ 1841-65, రాజారాంభూపాల్-2 1865-1901, రాజా సీతారామభూపాలుడు 1901-24, అనంతరం అతని భార్య మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ 1924-49 వరకు పాలనను కొనసాగించారు.
ప్రభుత్వ ఆధీనంలో రాజప్రసాదాలు
1949లో రాణి పాలన ముగిసిన అనంతరం కోటలోని వివిధ రాజప్రసాదములు, అద్భుత కట్టడాలలో కళాశాలను ఏర్పాటు చేశారు. అందులో మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ డిగ్రీ కళాశాలతోపాటు వివిధ విభాగాల పరిశోధన కార్యాలయాలను ఏర్పాటు చేశారు. కళాశాలకు సెక్రటరీగా దివంగత నేత పాగపుల్లారెడ్డి వ్యవహరించారు. అనంతరం డీకే సత్యారెడ్డి వ్యవహరించారు. 1965లో కళాశాలను ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. 
ఆలయాలు మంత్రాలయం పరం
కోటలోని భూలక్ష్మీ చెన్నకేశవస్వామి, లక్ష్మిదేవి, శ్రీ రాముని ఆలయాలతోపాటు ఎన్నో ప్రధానాలయాలు ఉన్నాయి. రాజుల పాలన అంతరించడంతో వాటికి ఆదరణ తగ్గింది. నానాటికి ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటుడడంతో ఆ ఆలయాలను సంరక్షించాలన్న ఉద్దేశ్యంతో మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి మంత్రాలయ పీఠాధిపతులతో సంప్రదింపులు జరిపి సంస్థానాధీశుల వారసుల అనుమతితో 2007లో మంత్రాలయ పీఠానికి అప్పచెప్పారు. అప్పటి నుంచి నేటి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు మంత్రాలయ పీఠాధిపతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ధ్వంసమవుతున్న శిల్ప సంపద
కోటలోని ప్రధాన కట్టడాలు ధ్వంసమయ్యాయి. కొందరు గుప్తనిధులు ఉన్నాయనే ఉద్దేశంతో ఇప్పటికే కోటలోని చాలా కట్టడాలను ధ్వంసం చేశారు. కోట గోపురం మీద ఉన్న ఐదు కలశాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇవే గాక కోటలోని చాలా చోట్ల తవ్వకాలు చేపట్టారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అ లసత్వం కారణంగా ప్రస్తుతం కోట శిథిలమైపోయిం ది. కోట బురుజులు ఆక్రమణకు గురయ్యాయి. చుట్టూ ఉన్న కందకాలు పరుల పాలయ్యాయి. 
ప్రభుత్వంపైనే భారం
సీమాంధ్రుల పాలనలో ఇక్కడి కట్టడాలు ఆదరణలకు నోచుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, అందున తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడి ప్రజల్లో ఆశలు రెక్కెత్తున్నాయి. అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలోని పురాతన కట్టడాలు, కోట అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అందరూ ఎదురు చూస్తున్నారు.

Thursday 4 December 2014

ఓయూ ఆర్ట్స్‌కళాశాలకి 75 వసంతాలు


దువుల ఒడిలో చైతన్యదీప్తిగా ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల అక్కడ...వంద పూలు వికసించినయ్ వేయి ఆలోచనలూ సంఘర్షించినయ్ అస్తిత్వ కాంక్షలూ రగిలినయ్ చైతన్య భావాలూ పురుడుపోసుకున్నయ్ అభ్యుదయ ప్రపంచానికి కొత్త దారులూ తెరుచుకున్నయ్ ఏ ఆయుధాలూ లేకుండానే శాంతియుత విప్లవాలూ ముస్తాబైనయ్ కాలం పురోగమిస్తున్న కొద్దీ సమాజానికి అన్నమంత అవసరమైన విప్లవాలూ జలించినయ్ సమసమాజ నిర్మాణానికి కొత్త బాటలు పరుచుకున్నయ్...            విద్య.. అధ్యయనం.. లక్ష్యసాధన.. నిరంతర శోధన.. ఇవన్నీ ఓయూ ఆర్ట్స్‌కళాశాల సొంతం. ఎంతోమందిని ఉన్నత శిఖరాలకు చేర్చడంతో పాటు పలు ఉద్యమాలకు కేంద్రంగా వర్ధిల్లింది. ఆర్ట్స్ కళాశాల లేని ఉస్మానియా యూనివర్సిటీని ఉహించలేం. నిజాంకాలం నుంచి ఎన్నో మైలురాళ్లను దాటుతూ, ఉద్యమ ప్రస్థానంలో త్యాగాలకు, గాయాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. అక్షరాలతో పాటు అలుపెరగని పోరాట పాఠాలు నేర్పిన కళాశాల నేడు 75 వసంతాలు పూర్తి చేసుకున్నా వన్నె తరగని విద్యా శిఖరంగా నిలిచింది.
   1918లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపనకు పూనుకున్నారు. ఇందులో భాగంగా ఆర్ట్స్ కళాశాలలోనే పరీక్షల కేంద్రం, వీసీ కార్యాలయం, లా, తదితర విభాగాలు ఏర్పాటయ్యాయి. కళాశాల 1919 ఆగస్టు 28న గన్‌ఫౌండ్రిలో 25మంది ఉపాధ్యాయులు, 225 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులతో ప్రారంభమైంది. కళాశాలకు సర్ రోస్ మసూద్ మొదటి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. కళాశాల నిర్మాణానికి 1934 జులై 5న ఏడో నిజాం శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం 1939 డిసెంబర్ 4న పూర్తి కావడంతో అదే రోజున ఆర్ట్స్ కళాశాలను నిజాం ప్రారంభించారు. అప్పటి నైజాం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న అక్బర్ హైదర్ వర్సిటీకి చాన్స్‌లర్‌గా, నవాబ్ మెహదీయార్ జంగ్ బహదూర్ వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. 
అకడమిక్, విద్యా విభాగాలు..
ఆర్ట్స్‌కళాశాలలో చదివిన ఎందరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. కళాశాల నుంచి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను 1973లో వేరు చేశారు. దీన్ని పూర్తిగా పీజీ కోర్సులు, డిప్లొమా కోర్సులు, పరిశోధనలకు ఉపయోగపడేలా పూర్తిస్థాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలగా మార్చారు. ప్రస్తుతం కళాశాల 25 విభాగాలతో సేవలు కొనసాగిస్తున్నది. 2207 మంది విద్యను అభ్యసిస్తున్నారు. వివిధ విభాగాలలో మొదటి సంవత్సరంలో 163 మంది, రెండవ సంవత్సరంలో 157 మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు.
అధ్యాపకులు.. సిబ్బంది
కళాశాలలో 56 మంది అధ్యాపకులు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 17 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 125 మంది నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరితోపాటుగా అకడమిక్ కన్సల్టెంట్‌లు, కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. 
33 మంది ప్రిన్సిపాల్స్..
కళాశాల ప్రారంభమైన్పటి నుంచి ఇప్పటివరకు 33 మంది ప్రిన్సిపాల్స్‌గా సేవలు అందించారు. ప్రిన్సిపాల్ రోస్ మసూద్ మొదటి వ్యక్తికాగా, ప్రస్తుతం ప్రొ.టి.క్రిష్ణారావు కొనసాగుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌లుగా పనిచేసిన సిద్ధిఖీ, తిరుపతిరావులు ఈ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేయడం విశేషం. గతంలో ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన ప్రొ.మల్లేష్ ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్‌గా వెళ్లారు. 
అపురూపం... కళాశాల ఆర్కిటెక్చర్..

7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆర్ట్స్ కళాశాల నిర్మాణం కోసం కృషి చేశారు. ఆర్ట్స్ కళాశాల ఈజిప్టు కైరోలోని సుల్తాన్ హసన్ కళాశాలను పోలి ఉందని, వాటి నమూనాగా చెప్తారు. 16 వందల ఎకరాల యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల భవనం 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. కళాశాలలో అన్ని వైపులా వెలుతురు ప్రసరించేలా నిర్మాణం చేపట్టారు. కళాశాల భవనం మధ్యలో నిర్మాణంలో ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌లున్నాయి. రెండు విమానాలు నిలిచిపోయేవిధంగా రాతి నిర్మాణాలు ఉన్నాయి. పింకిష్ రాతి కట్టడాలు అజంతా, ఎల్లోరా శిల్పాలను పోలీ ఉంటాయి. మొదటి, రెండవ అంతస్తు పూర్తిగా షాబాద్ బండలతో నిర్మించారు. సెక్యులర్ భావాలను ప్రతిబింబించేలా ఈ కట్టడాన్ని నిర్మించారు. హిందూ దేవాలయ నిర్మాణాలను పోలి ఉండే సరెసనిక్, ఉస్మాన్ షాహి, మధ్య ఇస్లాం, అరబిక్, మూరిష్‌లతో పాటు గోతిక్ శైలిలో దీని నిర్మాణం జరిగింది. ముఖద్వారానికి ఇరువైపులా ఉన్న రెండు పొడవైన స్తంభాలను చూస్తే వీక్షకులు అచ్చెరువొందాల్సిందే. వీటి మధ్య పెద్ద ఆర్చ్ ఉంటుంది. డోమ్ నిర్మాణం డబుల్ డెక్‌డ్ నిర్మాణంగా చెప్తారు. మొదటి డెక్ 16 కిటికీలు, రెండవ డెక్ మొదటి డెక్‌ను కలిపేవిధంగా మరో16 కిటికీలు ఉంటాయి. ఒకదాని నుంచి వెలుతురు మరో దానిపై ప్రతిబింబించేలా వీటిని నిర్మించారు. భవన నిర్మాణంలో అవసరమైన చోట అద్భుతమైన షాండ్లియర్‌ను వాడి అందాన్ని మరింత ఇనుమడింపజేశారు.
నిర్మాణానికి ప్రపంచదేశాల సందర్శన..
భవన నిర్మాణం కోసం ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు సయ్యద్ అలీ, రజా, నవాబ్ జయంత్ సింగ్ బహదూర్‌లను నియమించారు. అమెరికాలోని కాలిఫోర్నియా, స్టాన్‌ఫోర్డ్, హార్వర్డ్, కొలంబియా, బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి మొదలైన విశ్వవిద్యాలయాలతో పాటు యూరప్, జపాన్, ఈజిప్ట్, టర్కీ తదితర దేశాలను సందర్శించారు. బెల్జియంకు చెందిన ఇ.జస్సార్‌ను సలహాదారుగా నియమించి ఆర్ట్స్ కళాశాల, లా, ఇంజనీరింగ్ కళాశాలలు, లైబ్రెరీ, సెనేట్ హాలు వంటి భవనాలను నిర్మించారు. 
టూరిస్టు స్పాట్‌గా..
ఓయూకు వచ్చే విదేశీయులెందరో ఆర్ట్స్ కళాశాలను సందర్శిస్తుంటారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు పర్యటనకు వచ్చే కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు ఈ భవన నిర్మాణాన్ని చూడకుండా వెనుదిరగరు. నగరవాసులు కూడా వారాంతాల్లో, సాయంత్రం సమయం ప్రశాంతంగా గడిపేందుకు ఈ భవన ఆవరణనే ఎంచుకుంటారు. 
మైలురాళ్లు.. ప్రశంసలు...
యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు, యూనివర్సిటీ పొటెన్షియల్ ఎక్స్‌లెన్స్(యూపీఈ) గుర్తింపు పొందడంలోనూ ఓయూ ఆర్ట్స్‌కళాశాల పాత్ర ఎంతో ఉంది. ఓయూ ఆర్ట్స్‌అండ్ సోషల్ సైన్స్ కళాశాలను గుర్తించి భారత ప్రభుత్వం 1969 మార్చి 15న ఈ భవనంతో కూడిన పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. 1981లో రాష్ట్ర ప్రభుత్వం పురాతన కట్టడాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఆర్ట్స్ కళాశాలను హెరిటేజ్ బిల్డింగ్‌గా గుర్తించింది. 
అందరి చూపు ఆర్ట్స్‌కళాశాల వైపే...
ప్రపంచవ్యాప్తంగా ఆర్ట్స్‌కళాశాలకు గుర్తింపు ఉంది. పలువురు ప్రముఖులు ఈ కట్టడం చూసి ముగ్ధులయ్యారు. కళాశాలలో విద్య, వసతులు, సౌకర్యాలు, ఏర్పాట్లను పరిశీలించారు. మాజీ రాష్ట్రపతి ఎస్.రాధాకృష్ణన్, నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధానులు మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ, ఐకే.గుజ్రాల్, పీవీ నర్సింహారావు, పాలస్తీనా మాజీ అధ్యక్షుడు యాసర్ అరాఫత్, జోర్డాన్ రాజు హుస్సేన్, మైసూర్ మహారాజు జయ చామరాజ వడియార్, మద్రాసు గవర్నర్ హెచ్‌జీ ప్రకాశ్ తదితరులు కళాశాలను సందర్శించారు. 
ఉద్యమాలకు కేంద్రంగా....
ఎన్నో ఉద్యమాలు, సమావేశాలు, కీలక ఘట్టాలకు ఆర్ట్స్ కళాశాల వేదికగా నిలిచింది. పలు పార్టీల విద్యార్థి బహిరంగ సభలకు కళాశాలే వేదికైంది. మలిదశ ఉద్యమం ప్రారంభమైన అనంతరం జేఏసీ పేరుతో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించిన విద్యార్థుల సింహగర్జన ఆర్ట్స్ కళాశాల ఆవరణలోనే జరిగింది. కొందరు విద్యార్థులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం బలిదానం చేసుకుంది కూడా ఈ భవన పరిసరాలలోనే కావడం విషాదకరం.
ముఖ్య సమావేశాలకు వేదికగా రూం నెం. 57...

సామాజిక, చైతన్య పూరితమైన సమావేశాలు, సదస్సులకు పుట్టినిల్లుగా ఆర్ట్స్ కళాశాలలోని రూం. నెం. 57 భాసిల్లుతోంది. సామాజిక, అస్తిత్వ ఉద్యమాలకు కేంద్రంగా, చర్చలు, సమావేశాలు, సంఘాల ఆవిర్భావం, కార్యవర్గాల ఎన్నిక, సమావేశాలకు ఈ గదితోపాటు న్యూ సెమినార్ హాల్ వేదికగా నిలుస్తున్నాయి. ఎంతోమంది ప్రముఖులకు వీటితో అనుబంధం ఉంది. 
ప్రజా ప్రతినిధులకు కేంద్రబిందువు..
ఓయూ ఆర్ట్స్‌కళాశాలలో చదివినవారిలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితర ప్రముఖులు ఎందరో ఉన్నారు. మాజీ ఎంపీ జైపాల్‌రెడ్డి, ఎంపీ కే.కేశవరావు తదితరులతో పాటు ప్రస్తుత ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆర్ట్స్‌కళాశాలతో అనుబంధం ఉన్నావారే. సీవీ.ఆనంద్, ఉమేష్‌చంద్ర, పరదేశీనాయుడు, కమలాసన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితర అధికారులు ఆర్ట్స్‌కళాశాలలో చదివినవారే. 
ఎంతోమంది సేవలకు నిలయం..
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సలహాదారు సంజయ్‌బారు, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సీ.నారాయణరెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ భద్రిరాజు కృష్ణమూర్తి, ఓయూ మాజీ వీసీలు ప్రొఫెసర్ తిరుపతిరావు, ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ, కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వైకుంఠం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీలు ప్రొఫెసర్ ఎన్. గోపి, ప్రొఫెసర్ నాయిని కృష్ణకుమారి, ప్రొఫెసర్ జీవీ సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ రవ్వా శ్రీహరి, ప్రొఫెసర్ ఆవుల మంజులత, ప్రొఫెసర్ అనుమాండ్ల భూమయ్య, ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ ఎల్లూరి శివారెడ్డి, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ పి. యశోదారెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర ప్రథమ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్‌లు ప్రొఫెసర్ మల్లేషం, ప్రొఫెసర్ వెంకటాచలం, సభ్యురాలు ప్రొఫెసర్ సూర్యధనుంజయ లాంటి ఎంతోమంది ఇక్కడ పాఠాలు బోధించడమో, విద్యాభ్యాసం చేయడమో చేశారు. 
వేడుకకు హాజరుకానున్న ప్రముఖులు..
ఆర్ట్స్ కళాశాల 75వ వసంతాల ఉత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. వేడుకలకు అతిథులుగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, వర్సిటీ ఇంచార్జి వీసీ వికాస్ రాజ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇ. సురేష్‌కుమార్, మాజీ వీసీలు ప్రొఫెసర్ సులేమాన్ సిద్ధిఖీ, ప్రొఫెసర్ టి. తిరుపతిరావు, ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. మధుసూదన్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.
నిరంతర కార్యక్రమాలు...ఉత్సవాలు
కళాశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడాది మొత్తం కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పలు రకాల ఉత్సవాలు, సదస్సులు, సమావేశాలు ఇందులో భాగం కానున్నాయి. ఆర్కిటెక్చ్‌ర్, అకడమిక్ అంశాలపై కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. సింపోజియంలు నిర్వహించనున్నారు. ఆర్ట్స్‌కళాశాల ఆవశ్యకత జరిగిన అంశాలతో కూడిన సావనీర్‌ను తీసుకువస్తున్నారు. కళాశాల ఘనకీర్తిని చాటిచెప్చేలా ఉత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. 
కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తాం..
ఆర్ట్స్ కళాశాల అందరికీ ఒక రోల్‌మాడల్. ఎన్నో ఉన్నత లక్ష్యాల సాధనకు వేదికగా నిలిచింది. విద్యావ్యాప్తికి కేంద్రబిందువుగా మారింది. నేను ఆర్ట్స్‌కళాశాలలో చదువుకున్నా అని గర్వంగా చెప్పుకునేలా విద్యా బోధన చేస్తున్నాం. కళాశాల కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్నాం. కళాశాలలో అన్ని రకాల వసతులు కల్పించాం. 
-ప్రొఫెసర్ క్రిష్ణారావు, ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్
చారిత్రక ప్రాధాన్యతకు నిలయం ఆర్ట్స్ కళాశాల..
మన సంస్కృతి, సంప్రదాయాలను చాటే విధంగా ఆర్ట్స్ కళాశాల భవన కట్టడం ఉంది. 1985లో విజన్ ఆఫ్ ఉస్మానియాను ప్రారంభించి, అందులో విశ్వవిద్యాలయ చరిత్ర, కళాశాల ప్రాధాన్యత, భవన నిర్మాణ ఫొటోలు ఉంచడం విశేషం. విశ్వవిద్యాలయానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ఆర్ట్స్ కళాశాల పాత్ర ఎంతో ఉంది. కళాశాల 75 వసంతాలు పూర్తి చేసుకోవడం ఓయూకు గర్వకారణం. 
-ఫజులుద్దీన్, ఓయూ మనుస్క్రిప్ట్స్ ఇన్‌చార్జి
మేధావులను అందించిన ఘనత..
ఓయూ ఆర్ట్స్‌కళాశాల దేశంలోనే గుర్తింపు కలిగిన విశ్వవిద్యాలయాలకు తలమానికంగా నిలుస్తుంది. ఎంతోమంది ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మేధావులను అందించిన ఘనత కళాశాలది. ఇలాంటి కళాశాలలో చదవడం, పనిచేయడం అదృష్టమే. నేడు 75 వసంతాలు పూర్తి చేసుకోవడం గర్వకారణంగా ఉంది. 
- ప్రొ. ఎస్వీ.సత్యనారాయణ, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు
ప్రపంచ స్థాయి గుర్తింపు..
ఓయూ అంటేనే ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాలగా చెప్తారు. ఈ కళాశాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. ఇలాంటి కట్టడం ఓయూలో ఉండటం గర్వకారణం. కళాశాల వైభవాన్ని, ఖ్యాతిని చాటేలా విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులు కృషిచేయాలి. నేడు 75 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం సంతోషం కలిగిస్తోంది.
- ప్రొ.లిలిత్‌కుమార్, ప్రభుత్వపాలనశాస్త్ర విభాగాధిపతి, ఆర్ట్స్ కళాశాల

Tuesday 2 December 2014

తన పాలన మన ముద్ర

* ఆరు నెలల్లో దశాబ్దాల ఆశలకు దిశ
   పద్నాలుగు సంవత్సరాల పోరాటం తర్వాత సాధించిన తెలంగాణలో పగ్గాలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఆరు దశాబ్దాల్లో తెలంగాణ ప్రజలు కోల్పోయిన వైభవాన్ని పున:ప్రతిష్ట చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ప్రభుత్వ పనితీరు అంచనాకు ఆరునెలల కాలం పెద్ద సమయం కాకపోయినా.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సర్కారు పయనం వేగంగా సాగుతున్నది. 
పాలనలో అడుగడుగునా తెలంగాణ ముద్ర కనిపిస్తున్నది. పండుగైనా.. పథకమైనా అంతా మనదే. మన పీవీని..మన కాళోజీని..మన దాశరథిని.. మన బాపూజీని గౌరవించుకున్నా.. లాల్‌దర్వాజ బోనాల జాతరైనా.. ట్యాంకుబండ్ మీద బతుకమ్మ విశ్వరూపం కనిపించినా అన్నింటా స్వరాష్ట్ర సౌరభాల పరిమళాలే. లక్ష కోట్ల బడ్జెట్ అయినా.. ప్రపంచాన్ని ఆకర్షించే పారిశ్రామిక విధానమైనా.. సమగ్ర కుటుంబ సర్వే అయినా.. చెరువుల పునరుద్ధరణ పథకమైనా.. వాటర్ గ్రిడ్ పథకమైనా.. దేశమంతా ప్రశంసలు కురిపించే కార్యక్రమాలే. 
       రేపటి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే విధానాలే. పారిశ్రామిక వైభవానికి శ్రీకారం చుట్టబోతున్నాం. పదివేల కోట్లతో రహదార్లు వేసుకోబోతున్నాం. వెయ్యికోట్లతో వంతెనలు కట్టుకోబోతున్నాం. ఇంటింటికీ నల్లా నీరు పట్టుకోబోతున్నాం. చెరువులు నింపుకోబోతున్నాం. అవును అక్షరాలా బంగారు తెలంగాణను సాధించుకోబోతున్నాం. 
మూడునెలల క్రితం కశ్మీర్‌లో ప్రళయ భీకరంగా భారీ వరదలు వచ్చాయి. దేశంలో అనేక రా ష్ర్టాలు చలించిపోయి అనేక రకా ల సహాయం అందించాయి. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం అక్కడి ప్రజలకు నీటిశుద్ధి మిషన్లు పంపించింది. అక్కడి ప్రజలు ఈ సహాయాన్ని వేనోళ్ల కొనియాడారు. అక్కడి సీఎం మరిన్ని మిషన్లు పంపించమని కోరారు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఆహారం కన్నా ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య బురదనీరు. 
      ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో హుదూద్ తుఫాన్ వచ్చింది.. మళ్లీ చాలా మంది చాలా రకాల సహాయాలు చేశారు. తుఫాన్ ధాటికి అక్కడ అన్నింటికన్నా ఎక్కువగా కుప్పకూలింది విద్యుత్ రంగమే. అందుకే.. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ స్తంభాలు, పరికరాలు, సిబ్బందిని పంపించింది. అతి స్వల్పకాలంలో అనేక గ్రామాల్లో దీపాలు వెలిగాయి. ఈ రెండు ఉదాహరణలు చాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పనితీరు నిర్ధారించడానికి. 
    సమస్య ఏమిటి? పరిష్కారమేమిటి? ప్రణాళిక ఏమిటి? ఇదే కేసీఆర్ అనుసరించే పాలనా విధానం. ఎక్కడా తొట్రుపాటు ఉండదు. గందరగోళం ఉండదు. లక్ష్యానికి నేరుగా గురిపెట్టడం.. ఛేదించడం అంతే. ఈ విధానం వల్లనే ఆరునెలల తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం చెక్కుచెదరలేదు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు కంటున్న కలలు నెరవేర్చే దిశగా కేసీఆర్ వేస్తున్న అడుగులు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. భవిష్యత్తు మీద భరోసా ఇస్తున్నాయి. 
పోగొట్టుకున్నవి పొందే దిశగా..
జూన్ రెండవ తేదీన అధికార పగ్గాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటినుంచి ఇప్పటిదాకా చేస్తున్నది ఒకటే .... ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ఏం పొగొట్టుకున్నారో అవి అందించడం. మొక్కవోని దీక్షతో ఆ దిశగా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నది. విమర్శలు రావొచ్చు.. ఎదురు దాడులు జరగొచ్చు.. అయినా కేసీఆర్ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఉద్యోగుల సమస్య.. ఫీజు రీఇంబర్స్‌మెంట్ సమస్య... గురుకుల్ భూముల విముక్తి .. చెరువుల పునరుద్ధరణ..అన్నింటా అదే విధానం. రుణమాఫీలు, ఆసరా., చేనేత రుణ మాఫీలు.. వంటివి అన్నీ ప్రజలకు తక్షణ మేలు కోసమేననే విషయం కేసీఆర్‌కు తెలుసు అందుకే తెలంగాణ పునర్నిర్మాణం అనే దీర్ఘకాల ప్రణాళికను ఆయన ఎక్కడా విస్మరించలేదు. 
        పాలన కాస్త దారిన పడగానే తెలంగాణ జీవనరేఖ అయిన గొలుసుకట్టు చెరువుల అంశాన్ని తీసుకున్నారు. డజన్ల కొద్దీ సమీక్షల తర్వాత కార్యక్రమాన్ని పట్టాలు ఎక్కిస్తున్నారు. తెలంగాణ కరెంటు కష్టాలు తెలిసివాడు కావడం వల్లనే విద్యుత్ ఉత్పత్తిని భారీగా విస్తరించే దిశగా ప్రణాళికలు వేస్తున్నారు. మూడేండ్లలో రెప్పపాటు కరెంటు కూడా పోదు అని ఢంకా బజాయించడం వెనక కేసీఆర్ ఆత్మవిశ్వాసం దాగిఉంది. పాలనలోనైనా పథకాల్లోనైనా సంపూర్ణంగా తెలంగాణ ముద్ర వేశారు. గోల్కొండ కోట మీద జాతీయ జెండా ఎగురవేయడం ద్వారా తెలంగాణ చరిత్రను దేశానికి చాటారు. 
       తెలంగాణ పండుగలు బోనాలు, బతుకమ్మలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించారు. ట్యాంకుబండ్ మీద జరిగిన బతుకమ్మ పండుగలు నాలుగు కోట్ల ప్రజలను సమ్మోహితులను చేశాయి. తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది? అని వెకిలి ప్రశ్నలు వేసిన వారికి బతుకమ్మ పండగ వైభవం సమాధానం చెప్పింది. ఒక రాష్ట్రం ఆత్మ గౌరవంతో పాలన చేసుకుంటే ఎలా ఉంటుందో అద్దం పట్టింది. దశాబ్దాల తరబడి అవహేళనలకు గురైన చోట మన రాష్ట్రం మన పండుగ అనుకోవడంలోని గొప్ప భావనను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర చిహ్నాల ప్రకటనలో అదే ముద్ర స్పష్టమైంది. 
     మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జయశంకర్ సార్, ప్రజాకవి కాళోజి నారాయణరావు, సుప్రసిద్ధ కవి దాశరథి కృష్ణామాచారి , ప్రఖ్యాత ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ జయంతిని నిర్వహించింది. విప్లవ వీరుడు కొమురం భీమ్, స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇలా తెలంగాణ వైతాళికుల జయంత్యుత్సవాల నిర్వహణ ద్వారా తెలంగాణవాదుల మన్ననలు పొందారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహాస్వామి దేవస్థానం అభివృద్ధి, గోదావరి పుష్కరాలకు భారీ నిధులు, రంజాన్, బక్రీద్, క్రిస్‌మస్ పండుగలకు సెలవులు, దూరదర్శన్‌లో తెలంగాణ చానెల్‌కు యాదగిరి పేరు అన్నింటా తెలంగాణ ముద్ర వేశారు. 
మ్యానిఫెస్టో అమలు దిశగా...:
కేసీఆర్ అధికారం చేపట్టిన రెండు రోజులు తిరగకుండానే నేరుగా అధికారులతో విశ్లేషణలు ప్రారంభించారు. రాజధాని నగరంలో పరిస్థితిని వాకబు చేసి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అదే ఊపులో వివిధ శాఖల అధ్యయనం ఆదేశాలు కొనసాగాయి. తొలి మంత్రిమండలి సమావేశంలోనే 43 తీర్మానాలు ఆమోదించి రికార్డు సృష్టించారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన దాదాపు అన్ని వాగ్దానాలకు మంత్రిమండలిలో అధికారిక ముద్ర వేయించారు. చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని చాటారు. అసెంబ్లీ సమావేశంలోనూ అవే వెల్లడించారు. 
     మ్యానిఫెస్టోలోని పంటరుణాల మాఫీ అంశంపై అధికారం చేపట్టిన అనతి కాలంలోనే ప్రక్రియ ప్రారంభించారు. రిజర్వ్‌బ్యాంకు పూర్తి స్థాయి సహాయ నిరాకరణతో ఎదురైన ఇబ్బందులను దాటుకుని రూ. 4,200 కోట్లు విడుదల చేసి రుణమాఫీని విజయవంతంగా అమలు చేశారు. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్త సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం చేపట్టారు. ఎన్నో విమర్శలు.. ఎన్నో అభాండాలు.. లెక్క చేయకుండా పూర్తి చేశారు. దళితులకు భూ పంపిణీ, ఆసరా పథకం, ఆహార భద్రత పథకం, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఆటో, ట్రాక్టర్ ట్రాలీల పన్నుల రద్దు..కల్లు దుకాణాల పునరుద్ధరణ, ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంటు, ఉద్యమ కేసులు ఎత్తివేత, ఇలా ఒక్కొక్కటిగా మ్యానిఫెస్టోలోని వాగ్దానాలు నెరవేర్చే ప్రక్రియ నిరాఘాటంగా కొనసాగించారు. తాజా బడ్జెట్‌లో మైనార్టీలకు, దళితులకు మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు భారీగా నిధులు కేటాయించారు. ఓవైపు వ్యవసాయ రంగానికి భారీ కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు పారిశ్రామిక విధానం మీద భారీ కసరత్తు జరిపారు. ఇక సంక్షేమం మరొకరు అందుకోని స్థాయికి తీసుకువెళ్లారు. 
భారీ స్వప్నాలు..:
ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు మీద ఆయన కలలు, ప్రణాళికలు అన్నీ భారీవే. జనగణన ఎవరు చేసినా నెలల తరబడి జరుపుతారు. కానీ కేసీఆర్ ఒక్క రోజులో చేయాలనుకున్నారు. నాలుగు లక్షల మంది ఉద్యోగులను రంగంలోకి దించి సాధించారు. హరిజనులకు జానా బెత్తెడు భూమి ఇచ్చే చోట మూడెకరాలు అన్నారు. ఏడాది ఖర్చుకూడా అన్నారు. తాగునీటి సమస్య వస్తే సమస్యాత్మక గ్రామాలు గుర్తించి నీరివ్వడం సాధారణంగా అంతా చేస్తారు. కానీ కేసీఆర్ రాష్ట్రమంతా నీరివ్వాలని ప్రతిపాదించారు. అలాగే చెరువులు.. 45 వేల చెరువులు అన్నీ పునరుద్ధరించాలనుకున్నారు.. పనులు పట్టాలెక్కించారు. విద్యారంగ అభివృద్ధి కేజీ టు పీజీ అన్నారు..హుస్సేన్ సాగర్ ప్రక్షాళన ఇక జరిగేది కాదని అంటారంతా. కానీ కేసీఆర్ దాన్ని మంచినీటి చెరువుగా చూడాలనుకున్నారు. వినాయక నిమజ్జనాలకు ప్రత్యామ్నాయం చెప్పారు. నలాల నీరుకు దారి చూపించారు. చెరువు నీరంతా తోడిపారేయాలన్నారు. ఇవాళ ఆ తటాకం చుట్టూ ఆకాశహర్మ్యాలు కలగంటున్నారు. అదికూడా ప్రపంచంలో అన్నింటికన్నా ఎత్తుగా ఉండాలని.. అవును హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచమంతా మార్మోగాలంటే అది కావాలిసిందే. ఎంతసేపు హైదరాబాద్ అభివృద్ధి అంటే పాత బోర్నవీటా డబ్బాలాంటి హైటెక్‌సిటీ అనబడే ఓ వృత్తకార భవనమేనా? ప్రపంచమంతా మెడలు విరిగేలా తలెత్తి చూసే ఆకాశహర్మ్యం రేపు హైదరాబాద్ ఐకాన్ కాబోతున్నది. నిజాం కట్టిన ట్యాంకుబండ్‌కు రంగులేసి తామే కట్టినంత బిల్డప్ ఇచ్చిన సీమాంధ్ర ముద్రలు సమూలంగా తుడుచుకుపోనున్నాయి. ఒక్క పీవీ ఎక్స్‌ప్రెస్ వే కట్టి అహో ఓహో అన్నారు సీమాంధ్ర పాలకులు. నగరానికి నాలుగు దిక్కులా వాటిని తెస్తున్నారు. నగరంలో మల్టీలేయర్ స్కైవేలకు ప్రణాళికలు వేస్తున్నారు.యాదగిరిగుట్టను వాటికన్ తరహా అభివృద్ధి అన్నారు. తక్షణమే వందకోట్లు విడుదల చేశారు. 
రాజకీయ చాణక్యం..:
ఆరు నెలల కాలం అంటే హానీమూన్ పీరియడ్ ముగిసినట్టేననేది రాజకీయ నిర్వచనం. కానీ ఆరు నెలల కాలంలో కేసీఆర్ రాజకీయంగా విశ్వరూపం చూపించారు. 
మూడు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కొనసాగిన నేతలు కూడా ఇవాళ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. రెండేళ్ల క్రితం రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు ఓ ప్రకటన చేశారు. సోనియా తెలంగాణ ఇస్తే ... కేసీఆర్ ఇంటిముందు ఎవరూ మిగలరు అంటూ ప్రకటన చేశారు. కానీ ఇవాళ గాంధీ భవన్‌ముందు జనసంచారం తగ్గిపోయింది. అటు తెలుగుదేశం పార్టీ కూడా వెలవెలబోతున్నది.

Saturday 29 November 2014

చందుపట్లలో రాణిరుద్రమ తుదిశ్వాస

* అంబదేవుడి చేతిలో వీరమరణం పొంది నేటికి 725 ఏండ్లు
* శాసనం వేయించిన రుద్రమ సేవకుడు పువ్వుల ముమ్మడి 
* పురావస్తుశాఖ దృష్టిసారిస్తే వెలుగులోకి రానున్న చరిత్ర
    కాకతీయుల పోరు కెరటం.. ఒంటిచేత్తో రాజ్యాలను జయించిన సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి వీరగాధలు ఎన్నెన్నో. శతాబ్దాల కిందటే కత్తిపట్టి శత్రువులను తుదముట్టించి మహిళాశక్తిని నేల నలుదిశలా చాటిన పరాక్రమశాలి రుద్రమదేవి. వరంగల్ కేంద్రంగా పాలన సాగించిన రుద్రమదేవి 80 ఏండ్ల వయస్సులోనూ శత్రుసైన్యంపైకి కత్తిదూసి కదనరంగంలో కన్నుమూసింది. వీరమరణం పొందిన ప్రాంతం నేటి నల్లగొండ జిల్లాలోని చందుపట్ల అనేందుకు శిలాశాసనం ఆధారంగా నిలిచింది. ఈ శాసనం ప్రకారం 1289 నవంబర్ 27న అంబదేవుడితో జరిగిన యుద్ధంలో తుదిశ్వాస విడిచింది. ఓరుగల్లు వీరవనిత రాణిరుద్రమ మరణించి నేటికి 725 ఏండ్లు అవుతున్న సందర్భంగా మరణశాసనం వెలిసిన చందుపట్లపై ప్రత్యేక కథనం. 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన శాసనం
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని చందుపట్లలోకి ప్రవేశించగానే నాలుగు అడుగుల ఎత్తున్న గద్దెపై కొలువైన చారిత్రక శాసనం స్వాగతం పలుకుతుంది. సుమారు 700 ఏండ్ల కిందటిదైనా ఐదేండ్ల కిందటే దాని ప్రాధాన్యాన్ని గుర్తించారు. కాకతీయుల వీరవనిత, రాయగజకేసరి రాణీరుద్రమదేవి వీరమరణాన్ని ఈ శాసనం ధ్రువీకరిస్తున్నది. ఐదేండ్ల కిందటి వరకు శ్రావణమాసంలో బోనాల పండుగ సందర్భం గా దేవతా విగ్రహంగా ఈ శాసనం పూజలందుకున్నది. గ్రామంలోని కొందరు ఔత్సాహికులు శిలా శాసనమని గుర్తిం చి 2009 నవంబర్ 27న గద్దెపై ప్రతిష్టించారు. 
రుద్రమదేవి శివసాయిజ్యం ఇక్కడే
తండ్రికి తగ్గ తనయగా, గణపతి దేవుడి బిడ్డగా పేరు గడించి కాకతీయ సామ్రాజ్యాన్ని దిగ్విజయంగా పాలించిన రుద్రమదేవి.. అంబదేవుడి చేతిలో హతమైనట్లు త్రిపురాంతక శాస నం సూచిస్తున్నది. కాయస్థ వంశ మహారాజైన అంబదేవుడు అన్నిరాజ్యాలనూ జయించిన రాజుగా ఆ శాసనంలో కీర్తించుకున్నాడు. సర్వాన్ ఆంధ్ర మహీపతింజిత్వ రణముఖే యశోలబ్దవాన్ అని రాసుకున్న సంస్కృత పదాలే దీనికి నిదర్శనం. అదే సమయంలో రుద్రమదేవి కూడా అతడి చేతుల్లోనే వీరమరణం పాలైనట్లు ఆధారాలు లభిస్తున్నాయి. 
      80 ఏండ్ల వయస్సులో ఉన్న రుద్రమను చంపానని చెప్పుకోవడం వీరత్వం అనిపించుకోనందునే.. త్రిపురాంతక శాసనంలో అంబదేవుడు ఆమె పేరు రాయలేదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. వీరమరణాలకు గుర్తుగా రుద్రమదేవి సేవకుడు పువ్వుల ముమ్మడి ఈ శాసనం వేయించాడు. 1289 నవంబర్ 27న రుద్రమ, మల్లికార్జుననాయకుడు శివసాయిజ్యం పొందినట్లు శాసనంలో లిఖించి ఉన్నది. శాసనం ప్రతిష్ఠించిన గద్దెకు పక్కనే సోమనాథ ఆలయానికి పువ్వుల ముమ్మడి కొంత భూమి దానం చేసినట్లు శాసనంలో ఉన్నది. గ్రామశివారులో ఉన్న నేటిచెరువు సైతం ఆనాడే రా-సముద్రం పేరుతో తవ్వించినట్లు శాసనం చెప్తున్నది. ఓరుగల్లు సామ్రాజ్య పాలకులైన కాకతీయులు ఆనాడు ఈ మార్గం నుంచే శ్రీశైలానికి వెళ్లే వారని, పిల్లలమర్రి, ఇనుపాముల, చందుపట్ల, పానగల్లు పట్టణాల మీదుగా పయనం సాగేదని చరిత్రకారులు చెప్తున్నారు. 
చందుపట్లలో చారిత్రక ఆనవాళ్లు అనేకం
గ్రామంలో ఈ శాసనం పక్కనే అలనాటి సోమనాథ ఆలయం కాకతీయుల కాలానికి ఆధారం. ప్రస్తుతం గ్రామ దేవతాలయంగా పూజలు అందుకునే ఇక్కడి గుడి ఒకప్పటి శివాలయమేనని ప్రచారంలో ఉంది. గ్రామం నడిబొడ్డున కనిపించే అనేక విగ్రహాలు భూమిలో కూరుకుపోతున్నా నాపరాతి బండలపై కొలువైన విగ్రహ రూపాలు కాకతీయుల శిల్పకళకు సాక్ష్యాధారాలుగా నిలుస్తున్నాయి. రామప్ప ఆలయంలో ఉండే గణపతి ప్రతిమను పోలిన ఓ విగ్రహం ఇక్కడ ఉన్నది. దానికి ఎదురుగా గుర్రంపై స్వారీ చేస్తున్న వీరవనిత ఆకారపు శిల్పం మరింత ఆసక్తి కలిగిస్తుంది. మరో తెల్లరాతి శిలపై ఒదిగిన శిల్పకళ సైతం చరిత్రకారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. 
గ్రామస్తుల కృషితో పాఠ్యాంశంగా శాసనం
రుద్రమదేవి శివసాయిజ్యం పొందడాన్ని ధ్రువీకరిస్తున్న ఈ శాసనం వెలుగులోకి తేవడానికి చందుపట్లలోని వివేకానంద యువజన మండలి కృషి చాలా ఉంది. వాళ్ల కష్టానికి ఫలితంగా ఐదేండ్ల కిందట ప్రతిష్ఠకు నోచుకున్న శాసనం వివరాలు దూరవిద్యను అభ్యసించే ఎంఏ తెలుగు విద్యార్థులకు ప్రథమ సంవత్సరంలో పాఠ్యాంశంగా చేర్చారు. చందు(డ్రు)పట్ల శాసనం పేరుతో పాఠంగా బోధిస్తున్నారు. అధికారులు, దాతల సహకారంతో శాసనం స్థాపించిన ప్రాంతానికి సమీపంలోనే రుద్రమదేవి విగ్రహం ప్రతిష్ఠించే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రూపుదిద్దుకుంటున్న రుద్రమదేవి కాంస్య విగ్రహాన్ని త్వరలో ప్రతిష్ఠంచనున్నారు.
రుద్రమదేవి వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహించాలి
- టంగుటూరి సైదులు, చందుపట్ల 
మా ఊరిలో శిలాశాసనం పునరుద్ధరణ కోసం చాలా కష్టపడ్డాం. అనేకమంది సహకారంతో ఐదేండ్ల క్రితం ప్రతిష్ఠించుకున్నాం. ఇప్పుడు రుద్రమదేవి విగ్రహాన్ని తయారుచేయించాం. త్వరలోనే ఇక్కడే ప్రతిష్ఠిస్తాం. ఇప్పటికే చం దుపట్ల శాసనం పాఠ్యాంశంగా దూరవిద్య తెలుగు పుస్తకంలో పొందుపరిచారు. దీన్ని పాఠశాలస్థాయి పుస్తకాల్లోనూ చేర్చితే మన ప్రాంత చరిత్ర భావితరాలకు తెలుస్తుంది. రుద్రమదేవి వర్ధంతిని సైతం ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుంది.

Tuesday 25 November 2014

హైదరాబాద్ నలుమూలలా ఐటీ పరిశ్రమలు


* ఐటీఐఆర్ క్లస్టర్ల సంఖ్య పెంచే యోచనలో ప్రభుత్వం
* భూములను దుర్వినియోగం చేసే కంపెనీలకు నోటీసులు 
* మండలిలో ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్
హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలకే పరిమితం చేయకుండా హైదరాబాద్ నగరం నలుమూలలా విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, కొంపల్లి యాదవరెడ్డి, ఎస్ జగదీశ్వర్‌రెడ్డి నవంబరు 24న శాసనమండలిలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ఐటీసీ పాలసీని ప్రతిపాదిస్తున్నదని తెలిపారు. ఐటీ పరిశ్రమలకు పలు రాయితీలు ఇవ్వడం ద్వారా రాష్ర్టానికి పెట్టుబడులు ఆకర్షించేవిధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టనున్న ఐటీఐఆర్ ప్రాజెక్టును ప్రస్తుతమున్న మూడు క్లస్టర్లకే పరిమితం చేయకుండా ఐదు క్లస్టర్లకు విస్తరిస్తామని ప్రకటించారు. దీనిపై ఇప్పటికే సమీక్ష జరిపామన్నారు. 
ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ పలు ఐటీ కంపెనీలకు కేటాయించిన భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పటాన్‌చెరు ప్రాంతంలో ఈ విధంగా భూదందా కొనసాగుతున్నదని, ఇక్కడ కంపెనీలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, పేదలకు ఇండ్ల స్థలాలుగా ఇవ్వాలని కోరారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ అటువంటి ప్రయత్నాలు చేస్తున్న కంపెనీలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలకు నోటీసులు ఇస్తామన్నారు. ఈ విషయంలో సభ్యులకు తెలిసిన సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. 
          ఇప్పటికే ప్రభుత్వానికి అందిన సమాచారం ఆధారంగా నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. కొన్ని సంస్థల నుంచి సమాధానం వచ్చిందని, ఇంకా కొన్ని కంపెనీల నుంచి సమాధానం రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉపాధి లభించేలా ఐటీ పరిశ్రమలను, ఇంజినీరింగ్ విద్యకు అనుసంధానం చేసేదిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే 70 కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఐటీ పరిశ్రమలు స్థాపించే ప్రాంతంలోని స్థానికులకు ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆదిబట్లలో ఏర్పాటుచేసిన ఓ కంపెనీలో సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ స్థానికులకు 90శాతం ఉద్యోగాలు కల్పించారని తెలిపారు.  రాష్ట్రంలోని మరమగ్గాల కార్మికుల వ్యక్తిగత రుణాలను లక్ష రూపాయల వరకు మాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల 1,325 మంది కార్మికులు లబ్ధి పొందనున్నారని చెప్పారు. రుణమాఫీ కోసం రూ. 5 కోట్ల 65 లక్షలను ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మరమగ్గాల కార్మికులను పట్టించుకోలేదనిఆవేదన వ్యక్తం చేశారు.

Monday 24 November 2014

ఓరుగల్లు వీర వనిత.. శ్రీ శ్రీ శ్రీ రాణీ రుద్రమ దేవి


కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి... శాత్రవ భయంకర నిత్య రుద్ర రూపిణి అరుదైన పాలనా దక్షురాలు.. అసమాన పరాక్రమశాలి.. శ్రీ శ్రీ శ్రీ రుద్రదేవ మహారాజు.. అలియాస్ రుద్రమ దేవి.. ఉరఫ్.. రుద్రాంబ. రాణీ రుద్రమ దేవి.. ఈ పేరు వింటేనే ఒళ్లు గగురుపొడుస్తుంది. రోమాలు నిక్కబొడుస్తాయి. ఆ నేమ్ ఒక ఫైర్ బ్రాండ్. దాదాపు ఎనిమిది వందల ఏళ్ల క్రితమే సమాజంలో బలంగా వేళ్లూనిన పురుషాధిక్యంపై సవాలు విసిరిన వీరనారి. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అన్న పురుషాధిక్యం తలలు వంచి నోళ్లు మూయించిన ధీర వనిత. నేటి స్వేచ్ఛా మహిళకు ఆమె ఒక ప్రతీక. స్త్రీ ఆత్మ గౌరవానికి సమున్నత పతాక. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గ ధారిణి... 
రాణీ రుద్రమదేవి గురించి మనకు తెలిసింది ఎంత? 
రాణీ రుద్రమ దేవి గురించి మనకు తెలిసినదానికన్నా తెలియనిదే ఎక్కువ. ఆమె జన్మ సంవత్సరం తెలియదు. ఉజ్జాయింపుగా ఊహించడానికి వీలుంది అని కాకతీయ యుగము గ్రంథంలో లక్ష్మీరంజనం రాశారు. నిజమే! రుద్రమదేవి గురించి చరిత్రకారులకూ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించిన ఏడో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో ఇలా ఉంది.          మీరు ఎప్పుడైనా అత్యంత ధైర్యసాహసాలు గల మహిళా పాలకురాలైన రుద్రమదేవి గురించి విన్నారా ? ఆమె తన శక్తిసామర్థ్యాలతో ప్రతి ఒక్కరినీ మెప్పించి దిగ్విజయంగా పాలనా వ్యవహారాలను నిర్వహించారు. ప్రఖ్యాత కాకతీయ వంశానికి చెందిన రుద్రమదేవి ఓరుగల్లు (నేటి వరంగల్లు) రాజధానిగా పరిపాలించారు. క్రీ.శ.1262 నుంచి 1289 వరకు సుమారు 27 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన చేశారు. మనదేశంలో మహిళాపాలకులు చాలా అరుదు. రాణీ రుద్రమదేవికి కొద్దికాలంముందే సుదూరంలో ఉన్న ఢిల్లీని రజియా సుల్తానా అనే మహిళ పరిపాలించారు.
      ప్రభువర్గాలకు చెందిన వారు స్త్రీపరిపాలన ఇష్టం లేక ఆమెను పాలకురాలిగా అంగీకరించక తుదముట్టించారు. ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించి, ఆమె పరిపాలన, ధైర్యసాహసాలను కొనియాడాడు. ఆమె పురుషుల దుస్తులు ధరించి నిర్భయంగా, సునాయాసంగా గుర్రాల స్వారీ చేసేవారని పేర్కొన్నాడు. నాటి శాసనాలలో రుద్రమదేవి రుద్రదేవ మహారాజుగా కీర్తించబడింది. రజియా సుల్తానా లాగా రుద్రమదేవి కూడా తన తండ్రి పాలనా కాలంలోని ముఖ్యమైన నాయకుల వ్యతిరేకతను విజయవంతంగా అణిచివేసింది. రుద్రమదేవి, ఆమె మనుమడైన ప్రతాపరుద్రుడి పాలనలో చెలరేగిన అనేక సామంత తిరుగుబాట్లను నియంత్రించడానికి పలు చర్యలు తీసుకున్నారు.
(పాఠం 14 : ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు -127వ పేజీ)
రాజ్ఞి రుద్రమ దేవిని గూర్చి రాస్తూ ప్రసిద్ధ చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖర శర్మ, డాక్టరు నేలటూరు వెంకటరమణయ్య ఇట్లా అభివర్ణించారు. 
          ఆంధ్ర దేశ పరిపాలకులలో రుద్రమదేవి నిస్సందేహంగా మహాఘనత చెందిన వ్యక్తి. రాజధర్మ విధులను ఆమె నిర్వహించిన తీరువలన తండ్రియామెకు ప్రసాదించిన పురుషనామము.. రుద్రదేవుడు అన్ని విధముల సార్థకమైనది. ప్రజలామెను రుద్రదేవ మహారాజు అని పిలుచుకునేవారు. దేశ పరిపాలనలో ఆమె చైతన్యవంతమైన పాత్ర వహించింది. ధైర్య సాహసములు విక్రమము కల యోధురాలు అవడమే కాక గొప్ప వ్యూహతంత్రజ్ఞురాలు. ఆమె రాజరికం చేసిన కాలంలో తరుచూ యుద్ధముల అలజడి కలిగినా ఆమె ప్రజలు సంతుష్టులు, సంప్రీతులు అయి సుఖించారు. అవును.. రుద్రమదేవి పాలన ప్రజారంజకమై భాసిల్లింది. శాంతి సుస్థిరతలతో విరాజిల్లింది. క్రీ. శ. 1000 నుంచి 1323 వరకు దాదాపు మూడు శతాబ్దాల పాటు తెలుగు నేల నేలింది కాకతీయ వంశం. వీరికాలంలోనే త్రిలింగ, ఆంధ్ర పదాలకు అర్థం, పరమార్థం ఏర్పడ్డాయి. కాకతీయ వంశంలో సప్తమ చక్రవర్తి అయిన గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు తలొగ్గిన ఆయన తన కూతురు రుద్రమదేవిని కుమారుడిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు ఆమె వయసు పద్నాలుగేళ్లే. అప్పటి నుంచి ఆమె తండ్రి చాటుబిడ్డగా పాలన సాగించింది. రుద్రమదేవి 1261 ప్రాంతం నుంచీ స్వతంత్రంగా పరిపాలించినట్లు కనబడుతుంది. కొన్ని శాసనాల్లో 1279 వరకు పట్టాభిషక్తురాలు కాలేదేమో అనే భావం కలిగించే రాతలున్నాయి.
ధీర వనిత
రుద్రమ దేవి పాలనాకాలమంతా యుద్ధాలతోనే గడిచింది. తొలుత స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి దాయాదుల నుంచి ఆమెకు తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. తండ్రి గణపతి దేవుని కాలంలో సామంతులుగా ఉన్న రాజులు రుద్రమ సింహాసనం అధిష్టించగానే ఎదురు తిరిగారు. తిరుగుబాట్లు లేవదీశారు.
         అయితే ఈ విపత్తులన్నింటినీ ఆమె సమర్థవంతంగా ఎదుర్కొంది. పరిపాలనా దక్షతలో నేర్పరి అయిన రాణీ రుద్రమ వారి అసూయను అణిచి వేసింది. దక్షిణాదిని పాలించే చోళులు, మరాఠా ప్రాంత యాదవులను సమర్థవంతంగా ఎదుర్కొని రాజ్యాన్ని కాపాడిన యోధురాలు రాణీ రుద్రమ. దేవగిరి యాదవ మహాదేవుడు ఎనిమిది లక్షల మహాసైన్యంతో రుద్రమపైకి దండెత్తి వచ్చాడు. మహదేవునిపై పదిరోజులకు పైగా జరిగిన భీకర పోరాటంలో రుద్రమ ప్రత్యక్షంగా పాల్గొన్నది. తన అపార శక్తి సామర్థ్యాలతో అపర భద్రకాళిలా విజృంభించింది. ఆమె తన చిరకాల ప్రత్యర్థి మహదేవుడ్ని ఆ యుద్ధంలో మట్టికరిపించి మూడు కోట్ల బంగారు వరహాలను పరిహారంగా గ్రహించింది. శత్రువును ఆర్థికంగా చావు దెబ్బకొట్టి మళ్లీ తలెత్తకుండా చేసింది. రుద్రమ జరిపిన పోరాటాలన్నింటిలో ఆమెకు బాసటగా నిలిచిన సేనానులు చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వీరిలో గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నయ్య ముఖ్యులు. 
ప్రజా సేవలో..
రాణీ రుద్రమ తనదైన శైలిలో, అరుదైన రీతిలో పాలన సాగించింది. ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఆమె అర్థం చేసుకున్నట్టుగా ఏ ఇతర రాజులూ అర్థం చేసుకోలేదు. రుద్రదేవుడి రూపంలో ఉన్న రుద్రమ పట్టోధృతి అంటే రాజప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేశమంతా కలియ తిరిగింది. ప్రజాసమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుంది. యువరాజుగా ఆమె ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించింది. రాజ్యంలో ఒక చోట ఒక తల్లి కాన్పులోనే కన్ను మూయడం చూసి రుద్రమ తల్లడిల్లింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. మహామంత్రీ! గ్రామగ్రామాన ప్రసూతి వైద్యశాలలు కట్టించండి. ఇకపై మన రాజ్యంలో ప్రసవ సమయంలో ఒక్క మాతృమూర్తి కూడా మృత్యువాత పడడానికి వీల్లేదు అని ప్రకటించింది.
          రుద్రమదేవి పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు. కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం విస్తరించింది. విరాజిల్లింది. భరతనాట్యం, కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యాలకు ధీటైన పేరిణీ శివతాండవమనే నూతన నృత్య విధానం పురుడుపోసుకుంది రుద్రమ కాలంలోనే. కాకతీయుల సైన్యాధిపతి అయిన జాయప సేనాని పేరిణీ నృత్య సృష్టికర్త. రుద్రమదేవి కాలంలో సంగీతం, సాహిత్యం, శిల్ప కళ, నృత్యం కలగలిసిపోయి విరాజిల్లాయి. 
అంబదేవుని దొంగదెబ్బ
అనేకసార్లు ఓటమి పాలైన సామంతరాజు అంబదేవుడు రుద్రమదేవిపై కక్షగట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించాడు. అదునుకోసం చూస్తున్న అంబదేవుడికి సమయం కలిసి వచ్చింది. రుద్రమ రాజ్యంపైకి పాండ్యులు, చోళులు, ఇతర సామంతులు ముప్పేట దాడికి దిగారు. దాన్ని అదనుగా తీసుకున్న అంబదేవుడు కుట్రలు, కుతంత్రాలతో ఇతర సామంత రాజులను ఏకం చేశాడు. రుద్రమకు అండగా నిలవాల్సిన తమ సేనలను రుద్రమపైకి ఎక్కుపెట్టాడు. అంబదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయి కత్తి పట్టి కదన రంగాన దూకింది.
          అప్పటికి ఆమె వయస్సు ఎనభై ఏళ్లు. ఇరు పక్షాల మధ్య దాదాపు రెండు వారాలకు పైగా భీకర పోరాటం సాగింది. ఆ వయసులోనూ రుద్రమను అంబదేవుడు ఓడించలేకపోయాడు. యుద్ధంలో రుద్రమను నేరుగా ఎదుర్కోలేక కపట మాయోపాయం పన్నాడు. ఆ రోజు రాత్రి క్షేత్రానికి సమీపంలో గుడారంలో కార్తీక సోమవారం సందర్భంగా పరమ భక్తురాలైన రుద్రమ ప్రత్యేక పూజల్లో నిమగ్నమై ఉంది. పూజారుల స్థానంలో తమ వాళ్లను పంపిన అంబదేవుడు తన దుష్టపథకాన్ని అమలు చేశాడు. పూజలో ఉన్న రుద్రమను అంబదేవుడి మనుషులు వెనుక నుంచి పొడిచారని చరిత్రకారులు చెబుతారు. 
శత్రువుల పాలిట సింహస్వప్నం..
మన రుద్రమ అసమాన పరాక్రమశాలి. కాకతీయ పాలకుల వైభవానికి సమున్నత కేతనం. రుద్రమ్మ భుజశక్తి, ధీయుక్తితో శత్రువుల పాలిట సింహ స్వప్నమైంది. అంతఃశత్రువులు, బయటి శత్రువుల కుట్రలు, కుతంత్రాలెన్నో సమర్థంగా ఎదుర్కొన్న వీరవనిత. సామ్రాజ్యాన్ని దక్షిణాన తమిళనాడులోని కంచి నుంచి ఉత్తరాన చత్తీస్‌ఘడ్ బస్తర్ సీమ వరకు, పడమరన బెడదనాడు నుంచి తూర్పున సముద్రం వరకు, ఈశాన్యంలో గంజాం.. అంటే అస్సోం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది. బలవంతులదే రాజ్యమన్న మధ్యయుగాల్లోనే రుద్రమ దక్షిణాపథంలో సువిశాల మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పింది. ఆమె సాహసానికీ, ధీరత్వానికీ, తెగువకూ, పాలనా దక్షతకూ మారు పేరుగా నిలిచింది. తెలంగాణ మహిళ పాలనా పటిమను, మన జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది. 
ఎప్పుడు చనిపోయింది?
రుద్రమ తన ప్రసిద్ధ సేనాని గోన గన్నారెడ్డితో కలిసి కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులో పలు దుర్గాలు వశపరుచుకుంది. గోన గన్నారెడ్డి వారి రాజ్యరక్షామణియైన విఠలనాథ దండనాథుడు మాలువ, హాలువ మొదలైన దుర్గాలు సాధించిన తర్వాత సర్వరాష్ట్ర సమస్త ప్రజారక్షణ కోసం రాయచూరులో దుర్గం నిర్మించినట్లు అతని శాసనం(1294) చెబుతోంది. రాయచూరు విజయం రుద్రమ దేవి కడపటి విజయమని భావిస్తున్నారు. కావున 1295 ప్రాంతమున మహారాజ్ఞి రుద్రమ శివసాయుజ్యం చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన నల్లగొండ జిల్లా చందుపట్ల శాసనంలో రుద్రమదేవి 1289 నవంబర్ 27న మరణించినట్లు అవగతమవుతున్నది. దీనిని ఇతర శాసనముల సాక్ష్యముతో సమన్వయించి నిర్ధారించవలసి ఉంది.
వీరభద్రునితో వివాహం
     పద్నాలుగవ యేటనే పాలనా పగ్గాలు చేపట్టిన రుద్రమకు ఇరవై ఐదో యేట నిడదవోలు రాజైన చాళుక్య వీరభద్రునితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ముమ్మడమ్మ, రుయ్యమ్మ. తనకు మగ సంతానం లేకపోవడంతో రుద్రమ తన పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కుమారుడైన ప్రతాపరుద్రుడ్ని దత్తత తీసుకుని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. విధి ప్రాతికూల్యం చేత రుద్రమ దేవి భర్త చాళుక్య వీరభద్రుడు క్రీ.శ. 1266 నాటికే మృతిచెందినట్లు ఆయన తల్లి ఉదయ మహాదేవి పాలకొల్లు శాసనంలో ఉంది. భర్త మరణానికి సమీప కాలంలోనే రుద్రమదేవికి మరొక తీరని దుఃఖం కలిగింది. వృద్ధుడైన గణపతి దేవ చక్రవర్తి 1267లో శివసాయుజ్యం చెంది ఆమెను నిస్సహాయురాల్ని చేశాడు. రుద్రమకు ఇద్దరు కూతుళ్లే కాక మరో కూతురు కూడా ఉందా? అనే అనుమానం ఆ మధ్య ఒక శాసనం కలిగించింది. ప్రకృతశాసనంలోని ఎల్లన దేవుని భార్య కూడా రుద్రమదేవి తనయ అని ఆ శాసనం చెబుతోంది. 

Monday 7 July 2014

గవర్నర్ పాలనకు కుట్ర

- బాబు లాబీయింగ్‌కు తలొగ్గుతున్న కేంద్రం.. 
- గవర్నర్ అధికారాల పేర రాష్ర్టానికి సర్క్యులర్
- సీమాంధ్రుల పరోక్ష పాలనకు రంగం సిద్ధం?
- సినీ, రాజకీయ పెద్దల చీకటి సమావేశం.. హైదరాబాద్‌ను యూటీ చేయాలని పట్టు 
- కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు.. భూ పరిపాలన గవర్నర్‌కు ఇవ్వాలని డిమాండ్
- రాష్ర్టానికి అందిన కేంద్రం సర్క్యులర్
- రెండు కమిషనరేట్లు, రంగారెడ్డి పోలీసింగ్ గవర్నర్‌కు
- హైదరాబాద్‌కు జనాభా దామాషాలో సీమాంధ్ర పోలీసులు
- ఉమ్మడి పోలీస్ సర్వీస్ బోర్డు ప్రతిపాదన
- తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ 
- ప్రతిపాదనలకు దీటైన జవాబు పంపడానికి సిద్ధం
తెలంగాణవాసుల నెత్తురు మరిగే అంశం.. హైదరాబాద్‌ను యూటీచేసే పథకం.. అవును.. సరిగ్గా అదేకుట్ర మళ్లీ ముందుకు వస్తున్నది. కాకపోతే గవర్నర్ పాలన ముసుగులో.. మరో రూపంలో. ఆరు దశాబ్దాలుగా తాము కట్టుకున్న అక్రమ సామ్రాజ్యాలను తెలంగాణవాడు బద్దలుకొడుతుంటే.. గురుకుల్, గోకుల్, ఎన్‌కన్వెన్షన్, ఎఫ్‌డీసీ.. ఇలా ఒక్కటొక్కటిగా చేజారిపోతుంటే గుండెజారిన సీమాంధ్రబాబులు, అక్రమ రియల్టర్లు, సినీ, మీడియా, పెట్టుబడిదారులు రహస్య సమావేశాలుపెట్టి పథకాలు పన్నుతున్నారు. అలుపెరుగని ఉద్యమం, పన్నెండు వందల మంది బలిదానాలతో సాధించిన స్వరాష్ట్రం గుండెలమీద సీమాంధ్రులు రాజ్యం సాగించే కుట్రచేస్తున్నారు. సందేహం లేదు.. ఈ చీకటి కుట్రకు కథానాయకుడు మళ్లీ చంద్రబాబే. స్వాతంత్య్రం సాధించిన ఆనందం తెలంగాణవాసుల ముఖంమీద తాజాగా ఉండగానే కండ్ల ముందే దాన్ని కబళించే కుట్రకు ఆయనే తెరతీశారు. గవర్నర్‌కు మరిన్ని అధికారాలు ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మీదకు ఉసిగొల్పుతున్నారు. ఈ విపత్కర స్థితిలో తెలంగాణ సమాజానికి అప్రమత్తత అవసరం. తస్మాత్ జాగ్రత్త. 
   తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ సీమాంధ్ర కుట్రలు మొదలయ్యాయి. హైదరాబాద్‌ను దొంగదారిలో ఏలేందుకు పచ్చమూకలు కుట్రలకు పాల్పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అక్రమ కబ్జాలపై యుద్ధం ప్రకటించడంతో బెంబేలెత్తిన సీమాంధ్ర శక్తులు నగరంలో తెలంగాణ సర్కారే లేకుండా చేయాలని పథకం రచించాయి. ఈ కుట్రలకు ఆజ్యం పోస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గవర్నర్ అధికారాలు పెంచాలని, కీలకమైన రెవెన్యూ భూపరిపాలన కూడా గవర్నర్‌కే అప్పగించాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. శాంతిభద్రతలు పూర్తిగా గవర్నర్ చేతిలో పెట్టాలని, నగరంలోని ఇద్దరు కమిషనర్లు సహా డీఎస్‌పీలు, సీఐలుకూడా గవర్నర్ అధీనంలోనే ఉండాలని అందులో డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రం వద్ద బలమైన లాబీయింగ్ జరిపారు. 
    ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కు అనేక అధికారాలు కట్టబెట్టే ప్రతిపాదనలున్న 12 అంశాలతో కూడిన ఒక సర్క్యులర్‌ను కేంద్రం రాష్ర్టానికి పంపింది. ఇందులోని అంశాలే కనుక అమలు చేస్తే తెలంగాణ రాజధానిలో తెలంగాణ ప్రభుత్వమే ఉండదు. హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి జిల్లాలను గవర్నర్ చేతికి అప్పగించాల్సి వస్తుంది. రాజధానిపై తెలంగాణ మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలు కూడా గవర్నర్ రద్దు చేయవచ్చునంటూ ఇందులో పొందుపరిచిన ఒక్క నిబంధనే చాలు.. ఈ సర్క్యులర్ ఎవరికోసం..ఎందుకోసం రెక్కలు కట్టుకుని వాలిందో...! ఈ ప్రయత్నాలపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్థికి విరుద్ధంగా చేసిన ప్రతిపాదనలకు కేంద్రానికి దీటైన జవాబు పంపడానికి సంసిద్ధమయ్యారు. ఆదివారం పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై పార్లమెంటులో పోరాడాలని ఆ పోరాటం దేశమంతా ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు. 
అసలు కథ ఏంటి?
    తెలంగాణ భూములు అడ్డంగా కబ్జా చేసి కోట్లు కొల్లగొట్టిన సినీ పరిశ్రమ పెద్దలు, సీమాంధ్ర పెట్టుబడిదారులు, రెండు ముఖ్య పార్టీల రాజకీయ పెద్దలు ఇటీవలే ఓ రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని నిఘావర్గాలు కూడా ధృవీకరించాయి. ఈ సమావేశంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల స్వాధీనం అంశాన్ని ప్రముఖంగా చర్చించారు. ప్రభుత్వం ఇంకా పలు కబ్జాలపై దృష్టి సారించనున్న నేపథ్యంలో వీటిని అడ్డుకోవాలంటే రాజధానిని యూటీగా మార్చేలా ఒత్తిడి చేయాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. 
సాధ్యపడని పక్షంలో విభజన చట్టంలో ఉన్న వెసులుబాటును ఉపయోగించి గవర్నర్ చేతికి హైదరాబాద్ పాలన అప్పగించేలా లాబీయింగ్ చేయాలని నిర్ణయించారు. తద్వారా తమ అక్రమ ఆస్తులు రక్షించుకోవడంతో పాటు పదేళ్ల పాటు హైదరాబాద్ మీద పెత్తనం చెలాయించవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ చీకటి సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారని నిఘా వర్గాల సమాచారం. తర్వాత ఈ కుట్రదారులంతా కేంద్రం పెద్దలను కలిసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని యూటీగానీ ఆ తరహా విధానం కానీ అమలు చేయాలని, తెలంగాణ ప్రభుత్వాన్ని నామమాత్రంగా మార్చాలని వీరంతా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసినట్టు తెలిసింది. ఈ కుట్రకు లాబీయింగ్ జరిపిన వారిలో సినీ హీరో పవన్ కల్యాన్, నాగార్జున వంటి వారు కూడా ఉన్నట్టు తెలిసింది. 
కేంద్రానికి చంద్రబాబు లేఖ...
ఈ సమావేశాలు, లాబీయింగ్ తర్వాత ఉమ్మడి రాజధానిలో గవర్నర్ పాత్ర, అధికారాలపై ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్ పరిపాలన గవర్నర్ చేతికి అప్పగించాలని అందులో కోరారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ మొత్తం గవర్నర్‌కే అప్పగించాలని, ఉమ్మడి రాజధానిలో ఇరు ప్రాంతాల పోలీస్ సిబ్బందిని నియమించాలని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి రాజధాని స్ఫూర్థి నిలపాలంటే రాజధానికి సంబంధించిన రెవెన్యూ, భూ పరిపాలన అంశాలు కూడా గవర్నర్‌కే అప్పగించాలని ఆయన అందులో కోరారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు, రంగారెడ్డి జిల్లా ఎస్పీలు తెలంగాణ ప్రభుత్వంతో పనిలేకుండా నేరుగా గవర్నర్‌కే రిపోర్ట్ చేసేలా సిఫారసు చేయాలని చంద్రబాబు ఆ లేఖలో డిమాండ్ చేశారు. 
కేంద్ర హోంశాఖ నుంచి లేఖ...
ఇదిలా ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్ పదేళ్ల ఉమ్మడి రాజధానిలో తన పాత్ర, అధికారాల పరిధిపై కేంద్ర హోంశాఖను కొన్ని వివరాలు గతంలో అడిగారు. అపుడు సమాధానం పంపని కేంద్రం చంద్రబాబు లేఖ అందగానే గవర్నర్ లేఖను సాకుగా చూపుతూ కేంద్ర హోంశాఖ పేరు మీద తెలంగాణ ప్రభుత్వానికి ఒక సర్క్యులర్ పంపింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధాని పోలీస్ వ్యవస్థలో కామన్ పోలీస్ బోర్డు ఏర్పాటు చేసి, అందులో ఇరు రాష్ర్టాల పోలీస్ అధికారులకు స్థానం కల్పిస్తామని ప్రతిపాదించింది. ఇంకా అందులో పేర్కొన్న ప్రతిపాదనల ప్రకారం...హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి ఎస్పీలు శాంతి భద్రతల నివేదికలు నేరుగా గవర్నర్‌కే సమర్పిస్తారు. తీవ్రమైన అంశాల్లో గవర్నర్ ఆదేశాల మేరకే రక్షణ వ్యవస్థ పనిచేయాలి. పోలీసు సర్వీస్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఇందులో తెలంగాణ డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు ఉంటారు. వీటి పరిధిలోని పోలీసుల బదిలీలన్నింటిపైనా అధికారం గవర్నర్‌దే. రాజధాని అంతా జనాభా ప్రాతిపదికన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులను నియమిస్తారు. తెలంగాణ ఇతర జిల్లాల్లో కూడా అవసరమైతే శాంతి భద్రతలకు సంబంధించి నివేదికలను గవర్నర్ నేరుగా అడగవచ్చు. మొత్తంగా రాజధానిని సీమాంధ్ర పోలీసులతో నింపడం. తెలంగాణ ప్రభుత్వానికి అధికారం అనేదే లేకుండా చేయడం ఈ సర్క్యులర్ ప్రధాన లక్ష్యంగా కన్పిస్తోంది. 
సీఎం కేసీఆర్ యుద్ధ ప్రకటన...
ఈ సర్క్యులర్‌లోని అంశాలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ప్రభుత్వ ప్రయత్నాలకు ఇది తీవ్ర విఘాతమని ఆయన భావిస్తున్నారు. ఆదివారం జరిగిన ఎంపీల సమావేశంలో ఈ అంశంపై ఆయన విస్తతంగా చర్చ జరిపారు. దేశంలోని 28 రాష్ర్టాల్లో ఎక్కడా అమల్లో లేని వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో అమలుచేయాలనడం చూస్తే కేంద్రం కక్షకట్టినట్లే అవుతుందని అన్నట్లు సమాచారం. ఫెడరల్ స్ఫూర్తిగా పూర్తిగా విరుద్ధమైన అంశాలతో కేంద్ర పంపిన సర్క్యూలర్‌కు దీటైన సమాధానం పంపిస్తామని, సర్క్యూలర్‌లోని అంశాలను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. 
తెలంగాణ పోలీసుల్లో అలజడి...
ఇదిలాఉంటే హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి పోలీస్ వ్యవస్థను గవర్నర్‌కే అప్పగిస్తే పరిస్థితి ఏమిటన్న దానిపై తెలంగాణ పోలీసుల్లో అలజడి మొదలైంది. 60 ఏళ్లుగా పోలీస్ శాఖలో ఏకపక్షనిర్ణయాలతో తెలంగాణ పోలీసులను తీవ్ర ఇబ్బందులు గురిచేసిన వైనాలు పునరావృతమవుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ అధికారులను మార్చి, వారికి సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఈశాన్య రాష్ట్ర ఐపీఎస్‌లను ఆ పోస్టుల్లో నియమించేందుకే గవర్నర్ పాలనకు తెరదీస్తున్నారని ఉన్నతాధికారులు సైతం భయపడుతున్నారు. 
సర్క్యులర్‌లోని అంశాలు....
-ఉమ్మడి రాజధాని పరిధిలో తీసుకునే నిర్ణయాలతో పాటు, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలను కూడా సమీక్షించడానికి గవర్నర్‌కు అధికారం ఉంటుంది. 
-హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీలు శాంతిభద్రతలకు సంబంధించిన నివేదికలను గవర్నర్‌కే అందించాలి
-తీవ్రమైన, అత్యంత తీవ్రమైన అంశాల్లో గవర్నర్ ఇచ్చే అదేశాల మేరకే రక్షణ వ్యవస్థ పనిచేయాలి
-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన ప్రజల మధ్య విద్వేషాలు (హేట్‌క్రైమ్) పెరిగినప్పుడు నిరోధించేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలి. దీనికి ఐజీస్థాయి ర్యాంకు అధికారి బాధ్యుడిగా ఉంటారు. హేట్‌క్రైమ్ విషయంలో సత్వర చర్యల అధికారం గవర్నర్‌దే
-అంతర్గత భద్రత విషయంలో కూడా స్పెషల్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. దీనికి కూడా ఐజీస్థాయి అధికారి బాధ్యుడిగా ఉంటారు.
-పోలీస్ సర్వీస్‌బోర్డును ఏర్పాటు చేయాలి. ఇందులో తెలంగాణ డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు ఉంటారు. ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోని డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌ఓల బదిలీల అధికారం గవర్నర్‌దే
-రెండు కమిషనరేట్ల పరిధిలో జాయింట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి. రాష్ర్టాల ఫేర్‌షేర్ ప్రకారం డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌వోలు ఉండాలి
-గవర్నర్ అవసరం అనుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అదనపు బలగాలను అడుగవచ్చు
-శాంతిభద్రతలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా నివేదికలను కోరవచ్చు.

Saturday 31 May 2014

పోలవరంతో 600 గ్రామాలు మునకే..


- పోలవరంపై నిజాలు దాస్తున్న అధికారులు
- వరద పోటెత్తితే అనూహ్య పరిణామాలు
- సాక్ష్యంగా నిలుస్తున్న గత అనుభవాలు
- ఇప్పటికి రెండుసార్లు 180 అడుగుల వరద నీరు
- 1986లో 183 అడుగులకు చేరిన వరద
- మునిగిపోయిన భద్రాచలం ఆలయ మెట్లు
- ప్రాజెక్టు కడితే ఆలయానికి పెను ప్రమాదం
      పోలవరం ప్రాజెక్ట్ ముంపు పరిధిని అధికారులు దాచిపెడుతున్నారా? ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు వస్తాయని వరద ప్రమాదాన్ని తగ్గించి చూపుతున్నారా? అవుననే అంటున్నారు జలవనరుల నిపుణులు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ముంపు గ్రామాల సంఖ్య భారీగా పెరుగుతుందని వారంటున్నారు.
    పోలవరం వరద పోటెత్తితే దాదాపు ఆరువందల గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని గత చరిత్రను పరిశీలిస్తే తెలుస్తుంది. పోలవరం డ్యామ్‌ను 150 అడుగుల ఎత్తు వరకు నిర్మిస్తే దాదాపు 35ఱగామాలు ముంపునకు గురవుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. కానీ నిజానికి పోలవరంలో వరద శివాలెత్తితే కనుక దాదాపు ఐదారు వందల గ్రామాలను ముంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని పక్క రాష్ర్టాలైన ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లు పసిగట్టాయి. ఆంధ్ర అధికారులు మాత్రం ప్రాజెక్ట్ అంత ప్రమాదకరమైనది కాదని బుకాయిస్తున్నారు.
         ప్రాజెక్ట్ పై మరింత వ్యతిరేకత రాకుండా నిజాలు దాస్తున్నారు. అదే సమయంలో సమీపభవిష్యత్‌లో ముంపుగ్రామాలను క్రమంగా పెంచే విధంగా గుట్టుచప్పుడు కాకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంతసేపు డ్యామ్‌లో నీటినిల్వ చేస్తే ఉండే నీటిమట్టం వరకే లెక్కలు కట్టి ముంపును కేవలం 150అడుగులకే కుదించి లెక్కగడుతున్నారని, అయితే వరదలు పోటెత్తితే నీటిమట్టాలు గణనీయంగా పెరిగిపోతాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. వరద ఉధతి వల్ల భవిష్యత్తులో భద్రాద్రి రాముడు కూడా ముంపునకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. 
      గతంలో జరిగిన అనుభవాలు ఈ వాదనను బలపరుస్తున్నాయి. 1986లో ఎలాంటి అడ్డుకట్ట లేని కాలంలోనే దాదాపు 183అడుగుల ఎత్తులో వరద వచ్చింది. అప్పట్లో భద్రాచలం గుడి మెట్లు కూడా వరద నీటిలో మునిగిపోయాయి ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా సరిహద్దుల్లోని కుంటామోటు వద్ద దాదాపు 180అడుగుల మేరకు వరదనీరు చేరి అనేక గ్రామాలను ముంచి వేసింది. ఇక్కడ ఎలాంటి ఆనకట్టలేకుండానే దాదాపు 179 అడుగుల మేరకు వరద నీరు చేరుతుందని 2006 జనవరి 2న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొనడం గమనార్హం. నాలుగు దశాబ్దాలలో భద్రాచలం వద్ద ఇప్పటికి రెండు సార్లు వరద 168నుంచి 180 అడుగుల వరకు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి.
  ప్రస్తుతం 150 అడుగులనే లెక్కలోకి తీసుకుంటే తెలంగాణలో 270 ఆంధ్ర,ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌లలో మరో వంద గ్రామాలు నీట మునుగుతాయని తాజాగా లెక్క తేల్చారు. కానీ భవిష్యత్తులో వచ్చే వరద ప్రళయాలను విస్మరించి కొందరు అధికారులు ఏదో ఒక రకంగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే తర్వాత చూసుకోవచ్చన్న విధంగా వ్యవహరిస్తున్నారు. 1986 మాదిరిగా 36లక్షల క్యూసెక్‌ల వరద వస్తే ప్రాజెక్ట్ డిజైన్ మార్చకుండా పూర్తి చేస్తే ఊహకందని విధంగా మునక ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఛత్తీస్‌ఘడ్, ఒరిస్పా రాష్ర్టాలు మన అధికారులు వేసిన అంచనా కంటే ఐదు రెట్లు ముంపు ఎక్కువ ఉంటుందని లెక్క వేసుకున్నారు. ఆ రాష్ర్టాల్లో కేవలం 30నుంచి 50 గ్రామాలు మాత్రమే ముంపునకు గురవుతాయని ఆంధ్రప్రదేశ్ అధికారులు లెక్కలు వేస్తే.. కాదు 150 నుంచి 200 గ్రామాలకు ముంపు ముప్పు ఉందని వాళ్లు అంచనా వేశారు. అంటే ఆ రెండు రాష్ర్టాల అధికారులు ఎంతో ముందు చూపుతో ఉన్నారో అర్థమవుతుంది.
     భద్రాద్రి వద్ద గోదావరి వరద ఉధతి 36 లక్షల క్యూసెక్‌లను దాటే అవకాశముంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే గనక జరిగితే ప్రాజెక్ట్ కారణంగా బ్యాక్ వాటర్ మరింత పెరిగి మొత్తం భద్రాచలం ఆలయానికే ప్రమాదముంటుందని ఈ ప్రాజెక్ట్‌పై పరిశోధన జరిపిన తెలంగాణకు చెందిన మాజీ చీఫ్ ఇంజనీర్ భీమయ్య అంటున్నారు. 
మరింత నష్టం....
   డిజైన్ మార్చుకుని ముంపును తగ్గించటానికి అన్ని అవకాశాలున్నా మొండి పట్టుదలతో ఆదివాసీలను ముంచటానికే యంత్రాంగం సిద్ధమైంది. ఫలితంగా పోలవరం లో మరిన్ని గ్రామాలు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. 2005లో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును తెరపైకి తెచ్చినప్పటి నుంచి ఆదివాసీలు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎన్నో తీర్మానాలు చేశారు.
     గ్రామ సభలు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు కూడా సమర్పించాయి. ముంపు గ్రామాలతోపాటు ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపటాన్ని అన్ని మండల పంచాయితీలు వ్యతిరేకించినా ప్రజల మనోభావాలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ముంపు గ్రామాల ప్రజలు తెలంగాణలో ఉండాలని కోరుకుంటున్నారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఆదివాసీల ఉనికిని దెబ్బ తీయటానికి వీల్లేదు. వాళ్ల అభీష్టం, మనోభావాలకు వ్యతిరేకంగా వేరే ప్రాంతానికి పంపించటానికి వీల్లేదు. పోలవరం ప్రాజెక్టు వల్ల భారతదేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ రాష్ర్టాల్లో 3,500 హెక్టార్ల అడవి అదశ్యమవుతుంది. దాదాపు 2.5లక్షలమంది ఆదివాసీలు నిరాశ్రయలు కానున్నారు. మూడు రాష్ర్టాల్లోని ఆదివాసీ ప్రాంతాలతో కలిపి మొత్తానికి భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూమికి బదులు భూమి ఇవ్వాలి. అటవీ భూముల్లో ఎక్కడ వారికి పునరావాసం కల్పిస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఆరు దశాబ్ధాలుగా తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటం ఫలించిన తరుణంలో ఈ సంస్కతిలో భాగమైన ఆదివాసీలు మనుగడను కోల్పోతున్నారు.

Friday 23 May 2014

ఆంధ్రా ఉద్యోగులు ఒక్కరూ ఉండరు


- సచివాలయంలోనూ వారికి స్థానం లేదు
- కయ్యానికి కాలుదువ్వితే దేనికైనా రెడీ
- ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్
- సకల జనుల సమ్మె కాలానికి ప్రత్యేక సెలవు
- విద్యుత్ సెక్టార్ ఇక పబ్లిక్ సెక్టార్
- ఆర్‌టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు 
- ఉద్యమం నుంచి వచ్చిన స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవులు
- తెలంగాణ ఉద్యోగ సంఘాల సమావేశంలో కేసీఆర్
హైదరాబాద్, (టీ మీడియా): తెలంగాణ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులను అనుమతించే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టంచేశారు. జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంటు ఏర్పడనున్నదని తెలిపారు. ఏ విషయంలోనూ, ఏ సందర్భంలోనూ, ఏ సమస్యలపైన కూడా తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేసీఆర్ భరోసా ఇచ్చారు. 
తెలంగాణ రాష్ర్టానికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల పంపిణీ మాత్రమే పూర్తయిందని ఆయన చెప్పారు. ఈ అధికారులెవ్వరూ బ్రిటిష్ పాలనలో ఉన్నట్టుగా తెలంగాణ ప్రజలను, ఉద్యోగులను టర్రుబుర్రుమంటూ భయపెట్టడానికి వీల్లేదని ఆయన హెచ్చరించారు. విభజన ప్రక్రియకు జూన్ రెండో తేదీ తర్వాతనే స్పష్టత వస్తుందని, ఒకవేళ ఈలోగానే సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణ రాష్ర్టానికి కేటాయిస్తే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. సెక్రెటేరియట్‌లో కల్తీ ఉండటానికి వీల్లేదన్నారు. కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఉండగా క్షేత్ర స్థాయిలో సీమాంధ్ర ఉద్యోగులు కొనసాగడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
    అందుకని తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సెక్రటేరియట్ వరకు తెలంగాణ ఉద్యోగులే ఉంటారని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదని హామీ ఇచ్చారు. గురువారం కొంపల్లిలోని ఆర్‌డీ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. సాధారణంగా ఎవ్వని అయ్యకు తెల్వకుండా సమస్యలు పరిష్కరించుకునే సంస్కృతి, సత్తా తెలంగాణకు ఉన్నది. ఒక వేళ సామరస్యంగా వినకపోతే, కొట్లాడాల్సి వస్తే కేసీఆర్ కొట్లాడేందుకు సిద్ధం. ఎవ్వరికి భయపడేది లేదు.
       ఏడికైతే గాడికాయే అని టీఆర్‌ఎస్ అధినేత హెచ్చరించారు. రాష్ట్రం వేరైనా దేశం ఒక్కటే అనే మహోన్నత సంస్కారాన్ని పాటించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధ్దంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు సంయమనంతో వ్యవహరిస్తూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పండుగను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, ఇలాంటి సందర్బంలో సీమాంధ్రులు కయ్యానికి కాలుదువ్వడం సమంజసం కాదన్నారు. రాష్ర్టాలు విడిపోయిన సందర్భాల్లో విభజనలో తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి తెలంగాణకు కావాల్సిన విధానాలను ఏర్పరుచుకునే స్వేచ్ఛ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ స్వేచ్ఛలో సీమాంధ్రులు జోక్యం చేసుకోవద్దు ఆయన హెచ్చరించారు. 
కొట్లాటకు కూడా తయ్యారుగా ఉన్నాం అని ఆయన చెప్పారు. కయ్యానికి కాలుదువ్వితే దేనికైనా సిద్ధమేనని తెలిపారు. తెలంగాణ ప్రజల పక్షాన న్యాయం ధర్మం ఉన్నదని, సహనంలో తెలంగాణ ప్రజలకు ఎవ్వరూ సాటిరారని అన్నారు. అందుకే పంచాయతీలు వద్దనుకున్నామని, భారతదేశానికే ప్రజాస్వామ్య సంస్కారాన్ని చాటిచెప్పడానికి తెలంగాణ సిద్ధంగా ఉన్నదని కేసీఆర్ చెప్పారు.తెలంగాణ ప్రజలతో వ్యవహరించాల్సిన తీరుపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని, తెలంగాణ ప్రజల ఆశల వెలుగులో పని చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుందని టీఆర్‌ఎస్ అధినేత వ్యాఖ్యానించారు.
   ఉన్నతాధికారులు, ప్రభుత్వ పథకాలను అమలుచేసే ఉద్యోగులు సంయమనంతో, ప్రజాస్వామ్య పద్ధతిలో, సంతోషంతో, ఉల్లాసంగా ప్రజలతో మమేకమవుతూ ప్రజల మెప్పును పొందుతూ పనులు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జెన్కో ఇక నుంచి పబ్లిక్ సెక్టార్ విధానంలో పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
      తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కె. స్వామిగౌడ్, వి. శ్రీనివాస్‌గౌడ్ ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదని ఆయన అన్నారు. అయితే ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వాలని సమావేశంలో నినాదాలు రావడంతో ఈ మేరకు వెంటనే కేసీఆర్ ఓకే..ఓకే అంటూ తమ సమ్మతి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఒక గంట ఎక్కువ సమయం పనిచేసి అయినా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు. తెలంగాణలో ప్రతి శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పూర్తి వివరాలను టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వార్‌రూంకు వివరించాలని, వివిధశాఖల నాయకులు ఈ బాధ్యతను తీసుకోవాలన్నారు. తద్వారా సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించడం వీలుకలుగుతుందని ఆయన పేర్కొన్నారు. నవ్వుతూ నవ్విస్తూ, సమస్యలను ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారాలను తెలియచేస్తూ కేసీఆర్ ఈ సమావేశంలో ప్రసంగించారు. ఉద్యోగుల విభజన సందర్భంలో ఉత్పన్నమయ్యే ప్రతీ సమస్యను పరిష్కరించేందుకే టీఆర్‌ఎస్ కార్యాలయంలో వార్‌రూం ఏర్పాటు చేశామని చెప్పారు.
       ఆంధ్రప్రదేశ్ పునరవ్యస్థీకరణ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత చేసిన డీపీసీలు, పదోన్నతులు, డిప్యుటేషన్లు రద్దుచేస్తామని ఆయన ప్రకటించారు. జిల్లా, జోనల్ కేడర్లలో ఎక్కడోళ్లు అక్కడే ఉంటారని సీమాంధ్ర ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులు లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదని కేసీఆర్ అన్నారు. తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమంలో వారి పోరాట పటిమ ప్రపంచమంతా చూసిందన్నారు. ఉద్యోగులు నడిపిన సకల జనుల సమ్మె అపురూప దృశ్యకావ్యంగా నిలిచిపోతుందని చెప్పారు. 
       సకలజనుల సమ్మె జరిగిన 42రోజులకు ప్రత్యేక సెలవు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని పేర్కొన్నారు. కేంద్ర పే స్కేల్ విధానాన్ని రాష్ట్ర ఇంక్రిమెంట్ పద్ధ్దతులను తెలంగాణ ఉద్యోగులకు వర్తింపజేస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డుల విధానాన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు. రెండు మాసాలలో ప్రతీ శాఖలో డీపీసీలు ఏర్పాటు చేసి ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పిస్తామని క్షేత్రస్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఏర్పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
     కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ విధానం తెలంగాణ ప్రభుత్వంలో ఉండబోదని ఆయన స్పష్టంచేశారు. రెండు నెలల్లో కొత్త ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీచేసే విధంగా చర్యలు తీసుకుంటామని టీఆర్‌ఎస్ అధినేత ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే డిమాండ్‌ను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా సింగరేణి, ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల సమస్యలు వేర్వేరుగా చర్చించి వారి ఇబ్బందులన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వేదికగా వార్ రూంను ఏర్పాటు చేశామని శుక్రవారం నుంచి టీఆర్‌ఎస్ కార్యాలయంలో వార్‌రూం పనిచేస్తుందని ఆయన చెప్పారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా వెంటనే వార్‌రూంకు మెసేజ్, విజ్ఞాపన, మరే ఇతర పద్ధ్దతుల్లోనైనా సమాచారం అందించాలని కోరారు. 
      తెలంగాణ పవర్‌సెక్టార్ పబ్లిక్ సెక్టార్‌గా మారనున్నదని ఆయన చెప్పారు. గడువులోపే తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటిస్తామని తెలంగాణ ఉద్యోగులందరూ సంతోషంగా ఉండే విధంగా పదో పీఆర్సీ ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటుచేసి వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. వారికి ప్రసూతి సెలవు దినాలను పెంచడం జరుగుతుందన్నారు. విభజన సందర్భంలో సీమాంధ్రులు చేస్తున్న కుట్రల గురించి మాట్లాడుకునే సమయం ఇది కాదని, మన శ్రీకాంతాచారిని, మన వేణుగోపాల్‌రెడ్డిని, మన జయశంకర్ సారును ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందామని కేసీఆర్ ఉద్వేగంతో అన్నారు.
      ప్రభుత్వంలోని విధానకర్తలు, వార్‌రూం బాధ్యులు, మంత్రిమండలి సభ్యులు, ఉద్యోగ సంఘాల నేతలు అందరూ కలిసి చర్చించి రేపటి తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగులకు సమస్యలు ఏర్పడకుండా చక్కని విధానాలను రూపొందిస్తారని ఆయన వివరించారు. ఈ కన్వెన్షన్ సెంటర్‌కు రావడానికి ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ సిబ్బంది వ్యతిరేకించారని అయితే తెలంగాణ ఉద్యోగులే మా సైనికులని తాను వివరించినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు చారిత్రాత్మక భూమిక పోషించి కేసుల పాలయ్యారని, భార్యా బిడ్డలను వదిలి ఉద్యమంలో అనేక బాధలు పడ్డారన్నారు. ఉద్యమ జెండాను వదిలిపెట్టకుండా తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి తెలంగాణ రాష్ట్రం సిద్దించే వరకు మడిమతిప్పలేదని కేసీఆర్ ఉద్యోగులపై ప్రశంసల వర్షం కురిపించారు.