Tuesday 9 December 2014

నడిగడ్డ పౌరుషం.. గద్వాల సంస్థానం..

* యుద్ధంలో పెద్దసోమభూపాలుని వీర మరణం 
* నిజాం కాలంలో స్వతంత్య్ర రాజ్యంగా అవతారం 
* మేల్కొనకుంటే చరిత్రలో కలిసిపోయే ప్రమాదం
* కాకతీయుల ఏలుబడిలో వర్ధిల్లిన దో ఆబ్ ప్రాంతం
* 18వ శతాబ్దంలో కోట నిర్మాణం
* యుద్ధంలో పెద్దసోమభూపాలుని వీర మరణం
* నిజాం కాలంలో స్వతంత్య్ర రాజ్యం
* దుండగుల చేతిలో ధ్వంసమవుతున్న చారిత్రక కట్టడం
* మేల్కొనకుంటే కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం 
      రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా.. ఆనాటి కట్టడాలు ఇప్పటికీ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.. ఒకప్పుడు స్వతంత్య్ర రాజ్యంగా ఎదిగిన గద్వాల సంస్థానంలోని మట్టి ప్రాకారాలు, ఇప్పుడు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి.. కోటలో గుప్తనిధులు ఉన్నాయని కొందరు వాటిని ధ్వంసం చేయడంతో ఇప్పుడు కళావిహీనంగా తయారయ్యాయి.. మరికొన్నాళ్లు ఇలాగే కొనసాగితే కోట మచ్చకైనా కనిపించని పరిస్థితులు నెలకొనున్నాయి..
అనగనగనగా.. ఒక సంస్థానం.. కాకతీయుల కాలంలో దో ఆబ్ ప్రాంతంగా విరాజిల్లిన మహా నగరం.. ఆ నగరాన్ని ఆనుకొని 40 అడుగుల ఎత్తు ఉన్న మట్టి ప్రకారం.. చుట్టూ శత్రువులు దరి చేరలేని విధంగా మొసళ్లతో నిండిన పెద్ద కందకం.. అబ్బుర పరిచే శిల్ప కళా సౌందర్యం.. పౌరుషానికి మారుపేరుగా నిలిచిన ఇక్కడి రాజుల వీరమరణం.. ఇదంతా విద్వద్గద్వాలగా పేరుగాంచిన గద్వాల ఖిల్లా ప్రాశస్త్యం.. నవాబుల కాలంలో స్వతంత్య్ర రాజ్యంగా బాసిల్లి, సాహితి, సకల కళలకు పుట్టినిల్లుగా నిలిచిన ఆ సంస్థానంపై ప్రత్యేక కథనం..
సంస్థానం ఆవిర్భావం
చరిత్ర ప్రకారం.. గద్వాల సంస్థానం కాకతీయ సామ్రాజ్యం నుంచి ఉంద్భవించిందట. రుద్రాంబ, ప్రతాపరుద్రుని కాలంలో రాయచూర్, దో ఆబ్ (రెండు నదులు ఉన్న ప్రాంతం) అరణ్య ప్రాంతాలుగా ఉండేవట. కాకతీయ సామంతులైన గోన వం శానికి చెందిన కామారెడ్డి, అతని కుమారుడు కాటారెడ్డి దో ఆబ్ ప్రాంతాలను నివాసయోగ్యంగా మార్చి, అభివృద్ధిలోకి తీసుకొచ్చారట. ఐజ (అయిజ) నాడేగౌడ (ఒక ప్రాంతానికి అధిపతి) బుడ్డారెడ్డి స హాయ సహకారాలు అందించాడట. 
   క్రీ.శ. 1290 లో బుడ్డారెడ్డిని కాకతీయ సామంతులు మానవపాడు, బెళుదోణ, రాయచూర్, మోసలకల్లు, అలంపు రం, ఆదోని, ఐజ అనే ఏడు సీమలకు నాడగౌరికం (ఆధిపత్యాన్ని) ఇచ్చారట. క్రీ.శ.1323లో కాకతీయ సామ్రాజ్యం పతనం కావడంతో, సామంతులంద రూ స్వాతంత్య్రం ప్రకటించుకున్నారట. అదే సమయంలోనే ఐజ నాడేగౌడలు స్వస్థలం వీడి కర్నూలు మండలం గోసునూరు, అనంతపురములకు వెళ్లి, అక్కడి పాలకులైన వడెము వంశీయులకు సామంతులయ్యారట. అదే సమయంలో విజయనగరం రాజులు కర్నూలు, నంద్యాల తదితర భూ భాగాల ను స్వాధీన పర్చుకోగా, 1344లో హరిహరుడు ఏకశిలా నగరమును ముట్టడించినప్పుడు ఆ ముట్టడి లో ఐజ నాడేగౌడలు రాజుకు సహాయపడ్డారట. అందుకు ప్రతిఫలంగా నాడేగౌడలకు కర్నూలు మం డలంలోని కొన్ని గ్రామాలకు అధిపతులుగా చేశారట. 1347లో బహమనీ సుల్తానులు కర్నూల్, దో-ఆబ్, రాయచూర్ ప్రాంతాలను జయించడంతో, గౌడాలు సుల్తానుల వశమయ్యారట. తిరిగి వారి ప్రాం తాలను సాధించుకునేందుకు, బీజాపూర్ రాజులను సామంతులుగా కావాలని కోరారట. 15వ శతాబ్దం నాటికి ఐజ ప్రాంతాన్ని తిరిగి సాధించుకున్నారట. 17వ శతాబ్దం ప్రారంభంలో పెద్దనృపతి ఐజ, కందనూలు (కర్నూల్), సీమలకు నాడేగౌడగా నియమితులయ్యారట. ఇతను పూడూరు సీమకు నాడగౌడగా ఉన్న వీరారెడ్డి కూతురు బక్కమాంబను పెండ్లి చేసుకొని, పూడూరు సీమకు అధిపతి అయ్యాడట. పెద్దనృపతి కుమారుడు పెదసోమభూపాలుడు 166 3-1712 మధ్య నాడ గౌడరికంకు వచ్చాడట. ఇతని ఆధ్వర్యంలోనే గద్వాల సంస్థానం రూపుదిద్దుకున్నదట.
మట్టి గోడలతో కోట నిర్మాణం
18వ శతాబ్దం ప్రారంభంలో గద్వాల ప్రాంతానికి వచ్చిన పెదసోమభూపాలునికి, ఈ ప్రాంతంలో వేట కుక్కలను కుందేలు తరిమిన దృశ్యం కనిపించిందట. పౌరుషానికి పేరుగాంచిన ఈ గడ్డపై కోటను నిర్మించాలని భావించి, వెంటనే ఇక్కడ నిర్మాణాన్ని చేపట్టాడట. 40 అడుగుల ఎత్తు ఉన్న మట్టి గోడలను ఏర్పాటు చేసి, కోటను నిర్మించాడట. చుట్టూ పెద్ద కందకాన్ని తవ్వించి, శత్రువులు కోటలకి రాకుండా అందులో మొసళ్లను వదిలాడట. కోట మధ్యలో రాజప్రసాదాలు, సౌద ప్రాంగణాలు, ఏడంకణాల సోఫా, ప్రాకారాలను నిర్మించాడట. పూడూరును చాళుక్యులు పాలించగా, చాళుక్యులు, పల్లవులకు జరిగిన యుద్ధంలో పెదసోమభూపాలుడు గద, వాలము అనే ఆయుధాలను ప్రయోగించాడట. అందుకుగానూ తాను చేపట్టిన కోటకు గదవాల అని పేరు పెట్టారట.
వీర మరణం పొందిన సోమభూపాలుడు
1663లో అస్తిత్వంలోకి వచ్చిన గద్వాల సంస్థానం ఆనాటి నుంచి 1712 వరకు రాజా పెదసోమభూపాలుని హయంలో స్వత్రంత్య రాజ్యంగా ఉండేదట. ఢిల్లీలో మొగల్ సింహాసనాన్ని అధిష్టించిన బహదూర్‌షా బలహీనుడుగా ఉండడంతో, దక్కన్ సుబేదార్ నిజాముల్‌ముల్క్ తనకుతానుగా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడట. బహదూర్‌షా అనుయాయులైనందున గద్వాల సంస్థానాన్ని, సంస్థానం ఆధీనంలో ఉన్న రాజ్యాలను స్వాధీనం చేసుకునేందుకు ముల్క్ తన సేనాని దిలీప్‌భానుడిని గద్వాల సంస్థానంపై దాడి చేసేందుకు పంపించాడట. పెదసోమభూపాలుడికి, దిలీప్‌భానుడికి మధ్య కర్నూల్ సమీపంలోని నిడుమార్ వద్ద యుద్ధం జరుగగా, సోమభూపాలుడు వీరమరణం పొందాడట. కాని నిజాం సంస్థానాన్ని వశం చేసుకోలేదట. పెదసోమభూపాలుని భార్య లింగమ్మ ముల్క్‌తో సంధి చేసుకొని, అతని అధికారాన్ని అంగీకరించిందట. నిజాం రాజ్యంలో గద్వాల సంస్థానం స్వతంత్య్ర రాజ్యంగా అవతరించి, 1949 వరకు నిజాం రాజ్యంలో విశేష మర్యాదలు అందుకున్నదట.
రాజులు, మహారాణుల పాలన
1663 నుంచి 1712 వరకు రాజా పెదసోమభూపాలుడు (49సంవత్సరాలు), దక్కన్ సుబేదార్ నిజాముల్‌ముల్క్‌తో సంధి ఒప్పందం కుదుకుర్చుని పెదసోమభూపాలుని భార్య లింగమ్మ 1712 నుంచి 1723 వరకు తనకు నమ్మిన బంటు అయిన కళ్ల వెంకటన్న, రమణయ్యలతో రాజ్య పాలన సాగించారు. అనంతరం అమ్మక్క 1723-24 వరకు, రాణి లింగమ్మ 1724-1737, రాజా తిరుమల్‌రావు 1739-1742, రాణి మంగమ్మ 1742-1743, రాణి లింగమ్మ, రాణి చుక్కమ్మ 1743-47, రాజారామభూపాలరావు 1748-61, రాజా సోమభూపాలుడు 1762-93, రాజా రామభూపాలుడు-2 1794-1807, రాజా సీతరామభూపాలుడు-1 1807-40, 1840-41 రాణి లింగమ్మ పాలించింది. రాజాసోమభూపాలుడు-1 (ఒక్క ఏడాది), సీతారామభూపాలుని మూడో భార్య రాణి వేంకట లక్ష్మమ్మ 1841-65, రాజారాంభూపాల్-2 1865-1901, రాజా సీతారామభూపాలుడు 1901-24, అనంతరం అతని భార్య మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ 1924-49 వరకు పాలనను కొనసాగించారు.
ప్రభుత్వ ఆధీనంలో రాజప్రసాదాలు
1949లో రాణి పాలన ముగిసిన అనంతరం కోటలోని వివిధ రాజప్రసాదములు, అద్భుత కట్టడాలలో కళాశాలను ఏర్పాటు చేశారు. అందులో మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ డిగ్రీ కళాశాలతోపాటు వివిధ విభాగాల పరిశోధన కార్యాలయాలను ఏర్పాటు చేశారు. కళాశాలకు సెక్రటరీగా దివంగత నేత పాగపుల్లారెడ్డి వ్యవహరించారు. అనంతరం డీకే సత్యారెడ్డి వ్యవహరించారు. 1965లో కళాశాలను ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. 
ఆలయాలు మంత్రాలయం పరం
కోటలోని భూలక్ష్మీ చెన్నకేశవస్వామి, లక్ష్మిదేవి, శ్రీ రాముని ఆలయాలతోపాటు ఎన్నో ప్రధానాలయాలు ఉన్నాయి. రాజుల పాలన అంతరించడంతో వాటికి ఆదరణ తగ్గింది. నానాటికి ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటుడడంతో ఆ ఆలయాలను సంరక్షించాలన్న ఉద్దేశ్యంతో మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి మంత్రాలయ పీఠాధిపతులతో సంప్రదింపులు జరిపి సంస్థానాధీశుల వారసుల అనుమతితో 2007లో మంత్రాలయ పీఠానికి అప్పచెప్పారు. అప్పటి నుంచి నేటి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు మంత్రాలయ పీఠాధిపతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ధ్వంసమవుతున్న శిల్ప సంపద
కోటలోని ప్రధాన కట్టడాలు ధ్వంసమయ్యాయి. కొందరు గుప్తనిధులు ఉన్నాయనే ఉద్దేశంతో ఇప్పటికే కోటలోని చాలా కట్టడాలను ధ్వంసం చేశారు. కోట గోపురం మీద ఉన్న ఐదు కలశాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇవే గాక కోటలోని చాలా చోట్ల తవ్వకాలు చేపట్టారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అ లసత్వం కారణంగా ప్రస్తుతం కోట శిథిలమైపోయిం ది. కోట బురుజులు ఆక్రమణకు గురయ్యాయి. చుట్టూ ఉన్న కందకాలు పరుల పాలయ్యాయి. 
ప్రభుత్వంపైనే భారం
సీమాంధ్రుల పాలనలో ఇక్కడి కట్టడాలు ఆదరణలకు నోచుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, అందున తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడి ప్రజల్లో ఆశలు రెక్కెత్తున్నాయి. అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలోని పురాతన కట్టడాలు, కోట అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అందరూ ఎదురు చూస్తున్నారు.

No comments:

Post a Comment