Tuesday 16 July 2013

ఆలంపూర్ జోగులాంబ..

అడుగడుగున గుడి ఉంది! 
                              

    భారతదేశంలోని అయిదవశక్తి పీఠంగా, శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా, దక్షిణకాశిగా ప్రసిద్ధిగాంచిన అలంపూర్ ఆలయ ప్రాంగణాల్లోకి అడుగు మోపిందే తడవు భువిపై వెలసిన దేవుళ్ల చెంతకు చేరామన్న అసాధారణ తృప్తి కలుగుతుంది. ఇక్కడి బాల బ్రహ్మేశ్వరుడు, జోగులాంబల దర్శనభాగ్యాన్ని ‘జన్మజన్మల పాపపరిహారం’గా భక్తులు నమ్ముతారు.ముఖ్య ఆలయంలో బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతామూర్తి. కాశీలో విశ్వేశ్వరుడు ఎంత ప్రాశస్త్యమో అలంపురంలో బాలబ్రహ్మేశ్వరుడు అంతగా ప్రసిద్ధిగాంచాడు. అక్కడ కాశీ, ఇక్కడ ‘హేమలాపురం’ (అలంపూర్ పూర్వనామం) అన్నదీ ప్రజల మాటే. ఒకనాటి హేమలాపురమే కాలక్రమేణా ‘హతఃపురం’, ‘జోగుళాపురం’గా మారి, ఇప్పటికి అలంపూర్ అయింది. మన దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఆలంపూర్ అయిదవది. కాశీలో విశాలాక్షి అమ్మవారుకు ఉన్నంత భక్తి ప్రాధాన్యమే ఇక్కడి జోగుళాంబదేవికి కూడా ఉన్నట్టు భక్తులు చెప్తారు. సాధారణంగా ఈశ్వరుని అన్ని లింగాలు స్థూపాకారంగా ఉంటాయి. కానీ, అలంపూర్‌లో మాత్రం మహాశివుడు ‘గోస్పాద ముద్రిక రసాత్మ లింగం’గా వెలిశాడు. అంటే ‘ఆవు పాదం మోపితే వచ్చేలాంటి ఆకృతి’ అన్నమాట. అందుకే, దీనిని విశేష లింగంగానూ చెబుతారు. 
‘ఊర్ధ దంత పంక్తి’ శక్తిపీఠం                  
 
ఆలంపూర్‌ను పరశురామ క్షేత్రంగా, భాస్కర క్షేత్రంగానూ పిలుస్తారు. ఇక్కడ నవబ్రహ్మల పేరుతో ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయంలో మూల స్వామితోపాటు బ్రహ్మదేవునికి ప్రత్యేకమైన విగ్రహాలూ ఉన్నాయి. వాటికి నిత్యం ఆగమ సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే కాశీని సందర్శించిన ఫలితం లభిస్తుందని స్కంద పురాణం పేర్కొంది. దాదాపు 1400 సంవత్సరాల క్రితం (6-7వ శతాబ్దాల కాలంలో) బాదామి చాళుక్య వంశంలోని రెండవ పులకేశి అలంపూర్‌లో ఈ ఆలయాలను నిర్మించినట్లు ఇక్కడ లభించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి అష్టాదశ శక్తి పీఠం ప్రతిష్ఠాపన వెనుక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది. ఈ శక్తిమాతకు చెందిన ‘ఊర్ధ దంతపంక్తి’ ఇక్కడ పడినట్లు పురాణ కథ చెబుతోంది. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం నిర్వహిస్తూ, అందరి ముందే శివనిందకు పాల్పడతాడు. ఈ అవమానాన్ని భరించలేని సతీదేవి దు:ఖంతో యజ్ఞగుండంలో పడి దేహత్యాగం చేస్తుంది. దీనికి ఆగ్రహించిన పరమేశ్వరుడు ప్రళయకాల రుద్రుడై దక్షుని యాగాన్ని సమూలంగా నాశనం చేసి, అగ్నికి ఆహుతైన సతీదేవి సూక్ష్మ శరీరాన్ని తన భుజస్కందంపై వేసుకుని రుద్రతాండవం చేస్తాడు. ఈ దక్షయజ్ఞం కథలోని ముగింపే అష్టాదశ పీఠాల స్థాపనకు కేంద్రమైంది.ఈశ్వరుడ్ని శాంతింప జేసేందుకు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని పద్దెనిమిది శకలాలుగా విభజించాడన్నది పౌరాణిక కథాంశం. ఆ పద్దెనిమిది భాగాలు భరతఖండంలోని వేర్వేరు ప్రదేశాల్లో పడ్డాయి. అవే పరమపవిత్ర శక్తిపీఠాలుగా వెలిశాయి. ఆదిశంకరాచార్యుల వారు వాటికి ఆయా పుణ్యస్థలాలలోనే ప్రాణ ప్రతిష్ట చేసినట్లు చరిత్ర. 
నవబ్రహ్మల దివ్యధామం
 జోగులాంబ శక్తిపీ ఇక్కడే నవవూబహ్మల ఆలయాలు ఉండడం మరో విశేషం. ‘బ్రహ్మదేవుడికి ఒకేచోట తొమ్మిది గుడులా?’- ఎవరికైనా ఆశ్చర్యమేస్తుంది. కానీ, ఇది నిజం. పద్నాలుగు శతాబ్దాల కిందటే అక్కడ ‘నవబ్రహ్మలు’ కొలువుదీరారు. అయితే, ‘వీళ్లు నిజంగా త్రిమూర్తుల్లోని బ్రహ్మదేవుని అవతారాలేనా?’ అంటే ఖచ్చితమైన సమాధానం లేదు. కాకపోతే, అన్ని శతాబ్దాల కిందట వెలసిన ఇక్కడి ఆలయాలలోని ఈ నవవూబహ్మల్లోని ఆరుగురు ఒకనాటి రససిద్ధులు ఉపయోగించిన ఓషధుల పేర్లుగా చరిత్రకారులు ఉటంకిస్తారు. మరి, మిగిలిన ముగ్గురు ఎవరు!? ఆధ్యాత్మికవేత్తలు అన్వేషించాల్సిన ప్రశ్నే ఇది.ఒకప్పుడు అదొక పెద్ద కోటగోడ ప్రాంతం. ఇప్పుడు చాలావరకు నాటి చారివూతక ప్రదేశాలు, గుళ్లు శిథిలమైనాయి. మొత్తం తొమ్మిది మంది నవబ్రహ్మల ఆలయాలకు గాను ఒకే ఒక ప్రధాన గుడి బ్రమేశ్వరాలయం) దివ్యంగా ఉంది. అందులో నిత్యం పూజా పురస్కారాలు జరుగుతున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే జోగులాంబ శక్తిమాత కొలువై ఉంది. మిగిలినవన్నీ నామమాత్రంగా ఉన్నవే. ఆ పరిసరాలలో ఎక్కడ చూసినా శిథిల ఆలయ స్తంభాలు, అద్భుత శిల్పాలు కనిపిస్తాయి. అవన్నీ ప్రభుత్వ ఆధీనంలో సంరక్షించబడుతున్నప్పటికినీ చరిత్రకారులు, భక్తులు, పర్యాటకులు వాటిలోని కళాకౌశలానికి ముగ్ధులవుతుంటారు.ఒక చిన్న ద్వారం గుండా కోట ప్రదేశం లోపలికి వెళితే మరో పెద్ద ద్వారం వస్తుంది. దాన్ని దాటి ముందడుగు వేస్తే నవబ్రహ్మల గుళ్ల చోటుకు చేరుకుంటాం. 
అవి:
బాల, కుమార, అర్క, వీర, విశ్వ, పద్మ, గరుడ, స్వర్గ, తారక బ్రహ్మలు.
వీటిలో మొదటి ఆరింటిని ఓషధుల పేర్లుగా చెప్తారు. ఈ నవవూబహ్మ ఆలయాల మీద అష్టదిక్పాలకులు, శివ, విష్ణు అవతారాలు, నటరాజు, పురాణ కథా శిల్పాలు ముగ్ధ మనోహరంగా సృష్టించబడ్డాయి. కోటగోడ ప్రవేశద్వారానికి చెందిన ఉత్తరాశిమీద ఉన్న శిల్పంపై ఆ గుళ్ల ప్రాశస్త్యాన్ని గురించిన చారివూతక కథను వెల్లడించే దృశ్యం చెక్కబడి ఉన్నట్టు ప్రసిద్ధ రచయిత ముల్క్‌రాజ్ ఆనంద్ గతంలో ‘ఆలంపురం’పై విడుదల చేసిన అద్భుత గ్రంథంలో పేర్కొన్నారు. ‘బ్రహ్మక్ష్రేత్ర మహత్యం’లోని అయిదో అధ్యాయంలో పేర్కొన్నట్టుగా విలసితుడు అనే రాజు దైవంపై నమ్మకం లేక ఈ గుళ్లను పడ గొట్టించాడట. దాంతో సిద్ధులు అతణ్ని శపిస్తారు. ఫలితంగా అతను రాజ్యవూభష్టుడవుతాడు. తర్వాత తానే తిరిగి జ్ఞానోదయానికి వచ్చి కూల్చిన గుళ్లను కట్టించి, బ్రహ్మేశ్వర స్వామిని ఆరాధించాడన్నది ఆ కథనం.కాగా, అలంపూర్‌కు సమీపంలోనే ‘పాపనాశని తీర్థం’ ఉంది. దీనినీ భక్తులు అధిక సంఖ్యలో సందర్శిస్తారు. ‘అష్టాదశ తీర్థాల’లో ఒకటిగా దీనిని చెబుతారు. ఇక్కడి మిగిలిన తీర్థాలు చాలావరకు శిథిలావస్థలోనే ఉన్నాయి. ఏమైనా, ప్రశాంత వాతావరణంలో సాగే ‘ఆలంపూర్ యాత్ర’ ప్రతి ఒక్కరికీ ఒక అద్వితీయ అనుభూతిని మిగులుస్తుంది. భక్తులకైతే పరిపూర్ణ తృప్తినిస్తుంది.
                                               - రఘునాథడ్డి (గద్వాల, టీమీడియా)

No comments:

Post a Comment