Thursday 5 July 2012

స్వచ్చమైన నది మూసి..?


                      
మూసీ నది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని దక్కన్ ప్రాంతములో కృష్ణా నది యొక్క ఉపనది. హైదరాబాదు నగరం మధ్యనుండి ప్రవహిస్తూ చారిత్రక పాత నగరాన్ని, కొత్త ప్రాంతం నుండి వేరుచేస్తూ ఉంటుంది. పూర్వము ఈ నదిని ముచుకుందా నది అని పిలిచేవారు. హైదరాబాదు యొక్క త్రాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ యొక్క ఉపనదిపై హుస్సేన్ సాగర్ సరస్సు నిర్మించబడింది. మూసి అంటే అర్థం స్వచమైన అని.
  
  మూసీనది హైదరాబాదు నగరానికి 90 కిలోమీటర్లు పశ్చిమాన రంగారెడ్డి జిల్లా, వికారాబాదు వద్ద అనంతగిరి కొండల్లో పుట్టి నల్గొండ జిల్లా, వాడపల్లి (వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 2,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాదు గుండా ప్రవహిస్తుంది. నగరాన్ని దాటిన తర్వాత మూసీలో చిన్నమూసీ నది మరియు అలేరు నదులు కలుపుకొని దక్షిణపు దిశగా మలుపు తిరుగుతుంది. మూసీలో ఆలేరు కలిసేచోట సూర్యాపేట వద్ద 1963లో పెద్ద జలాశయాన్ని నిర్మించారు. ఆ తరువాత పాలేరు నదిని కలుపుకొని వజీరాబాదు వద్ద కృష్ణానదిలో కలిసేటప్పటికి 200 అడుగుల ఎత్తుకు దిగుతుంది. మూసీ నది యొక్క బేసిన్ వైశాల్యము 4,329 చదరపు మైళ్ళు. ఇది మొత్తం కృష్ణానది యొక్క బేసిన్ వైశాల్యములో 4.35%, సాధారణంగా చిన్న వాగులాగా ప్రవహించే ఈ నది వరదలు వచ్చినప్పుడు భీభత్సము, అత్యంత జననష్టము కలిగించిన చరిత్ర కలదు.

మూసీ నదిపై హైదరాబాదు నగరంలో దాదాపు ఏడు వంతెనలు ఉన్నప్పటికీ పురానా పూల్ (పాత వంతెన) అత్యంత పురాతనమైనది. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీలు 16వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఇప్పటికీ ఈ వంతెన వాడుకలో ఉంది. నయా పూల్ (కొత్త వంతెన) వంతెన హైకోర్టు సమీపములో అఫ్జల్ గంజ్ వద్ద ఉన్నది. ఇవికాక ఇతర వంతెనలు డబీర్‌పూరా, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, నాగోల్ మరియు ఉప్పల్ కలాన్ వద్ద ఉన్నవి. విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి 7, వరంగల్ వెళ్ళే జాతీయ రహదారి 202 ఈ నది యొక్క ఉత్తర మరియు దక్షిణపు ఒడ్డుల వెంట సాగుతాయి.  20వ శతాబ్దపు తొలి దశాబ్దాల వరకు మూసీ నది తరచూ వరదలకు గురై హైదరాబాదు నగరాన్ని ముంచెత్తి నాశనం చేసేది. 1908 సెప్టెంబరు 28, మంగళవారము నాడు ఒక్కరోజులో 17 అంగుళాల వర్షం నమోదయ్యింది. ఈ భారీ వర్షము ధాటికి మూసీనది పొంగి వరదై హైదరాబాదు నగరమంతా పారింది. అఫ్జల్ గంజ్ వద్ద నీటిమట్టము 11 అడుగుల ఎత్తుకు చేరింది. మరికొన్ని ప్రాంతాలలో అంతకంటే ఎత్తుకు కూడా చేరింది. ఈ వరదలు హైదరాబాదు నగర జనజీవనాన్ని స్తంభింపజేసి అపార ఆస్తినష్టం కలుగజేసింది. జంటనగరాల అభివృద్ధిలో ఆధునిక శకం 1908లో ఈ వరదల తర్వాతనే ప్రారంభమైంది. దీనితో అంచెల వారిగా ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి అనివార్యమైంది.

నగారాభివృద్ధికి ప్రణాళికను తయారుచెయ్యటానికి నియమించబడిన సాంకేతిక నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, వరదల పునరుక్తిని నివారించడానికి మరియు నగరంలో మౌళిక పౌర సౌకర్యాలను మెరుగుపరడానికి కొన్ని సూచనలు చేస్తూ 1909, అక్టోబర్ 1న తన నివేదిక సమర్పించాడు. ఏడవ నిజాం 1912లో ఒక నగరాభివృద్ధి ట్రస్టును ప్రారంభించాడు. వరదలను నివారించేందుకు ఒక వరద నివారణ వ్యవస్థను కట్టించాడు. 1920లో మూసీ నదిపై ఒక నగరానికి పది మైళ్ళ ఎగువనఉస్మాన్ సాగర్ ఆనకట్టను కట్టించారు. 1927లో మూసీ ఉపనదైన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ అనే మరో జలాశయము నిర్మించారు. ఈ రెండు జలాశయాలు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడముతో పాటు హైదరాబాదు నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి.
   సీమాంధ్రుల పాలనలో మూసి:-
    1980వ దశకము నుండి హైదరాబాదు నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలలో వెలువడిన పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలను మూసీ నదికి నీరును జతచేసే చిన్న చిన్న నాలాల్లో వదలడం, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికినీరును మూసీనదిలోకి వదలడంతో మూసీ ఒక మురికి కాలువ స్థాయికి చేరించి. ప్రతిరోజూ జంటనగరాల నుండి వెలువడుతున్న 350 మిలియన్ లీటర్ల మురికినీరు మరియు పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలు నదిలో కలుస్తున్నవని అంచనా. ఆ తరువాత 1990వ దశకంలో ఈ మురికినీటిని శుద్ధి పరచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే మూసీ నది వెంట అంబర్ పేట ప్రాంతంలో కలుషిత నీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించారు. కానీ దీనికి కేవలం 20% నీటినే పరిశుద్ధ పరచగల సామర్ధ్యం ఉన్నది. 2000లలో నగరంలో నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీటు కాలువ ద్వారా ప్రవహింపజేసి ఆ విధంగా సమకూరిన నదీతలాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేసేందుకై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నందనవనం అనే ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. నందనవనం ప్రాజెక్టులో భాగంగా మూసీ నదీగర్భంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించారు. కానీ, మూసీ బచావ్ ఆందోళన్ వంటి సామాజిక సంస్థలు మరియు రాజకీయ ప్రతిపక్షాలు మరియు వామపక్షాల వ్యతిరేకతతో అది సాధ్యం కాలేదు. ఈ మురికివాడల్లో 20 వేల మంది పైగా ప్రజలు ముప్పై ఏళ్లుగా నివసిస్తున్నారని అంచనా.
    ఎ ప్రాంతంలో అయితే సహజవనరులు పరి రక్షించబడుతాయో ఆ ప్రాంతం నిజంగా అభివృద్ది చెందినట్టు అని చెప్తుంది ఐక్య రాజ్య సమితి, మరి సమైక్యంద్ర పాలకులు ఒక జీవనదిని అందున స్వచ్చమైన నీటిని కలిగిన మూసి నదిని మృతనదిగా మార్చారు, మరి అభివృద్ది అంటే ఇదేనా..? 
                                                                  - నా తెలంగాణ బ్లాగు నుంచి  

No comments:

Post a Comment