Monday 12 September 2016

5 సెకన్ల లోపు తిన్నా ప్రమాదమే!

‘కింద పడిన ఆహారాన్ని ఐదు సెకన్ల లోపు తీసుకొని తింటే ఏ హానీ జరగదు. ఎందుకంటే అంత తక్కువ వ్యవధిలో బ్యాక్టీరియా వాటిలోకి ప్రవేశించదు’... ప్రస్తుతం ఎక్కువగా ప్రచారంలో ఉన్న ఓ భావన ఇది. అయితే, ఈ భావన తప్పని తాజా అధ్యయనం ఒకటి నిరూపించింది. కిందపడిన ఆహారంలోకి బ్యాక్టీరియా ఒక సెకను కంటే తక్కువ వ్యవధిలోనే వచ్చి చేరే అవకాశముందని స్పష్టంచేసింది. అమెరికాలోని రుట్జెర్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య డోనాల్డ్‌ స్కాఫ్నర్‌ నేతృత్వంలో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తుప్పుపట్టని ఉక్కు, సిరామిక్‌, కలప, కార్పెట్‌ ఉపరితలాలపై పుచ్చకాయ, వెన్న పూసిన బ్రెడ్డు వంటి వేర్వేరు ఆహార పదార్థాలను కిందపడేసి.. వేర్వేరు కాల వ్యవధిలో వాటిని పైకి తీసి పరిశీలించారు. పుచ్చకాయ వంటి తేమ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లోకి అత్యంత వేగంగా బ్యాక్టీరియా వచ్చి చేరుతున్నట్లు గుర్తించారు. చాలా సందర్భాల్లో ఇతర ఆహార పదార్థాల్లోకి కూడా ఐదు సెకన్ల కంటే తక్కువ వ్యవధిలోనే బ్యాక్టీరియా వచ్చేసిందని వివరించారు.
- ఈనాడు.

No comments:

Post a Comment