Friday 11 January 2013

నిర్ణయం దిశగా

‘యుద్ధ’ ప్రాతిపదికన కాంగ్రెస్ కసరత్తులు
వార్ రూంలో మూడుగంటలపాటు భేటీ!
తెలంగాణపై తేల్చేద్దామని నిశ్చయం!..
  
తదుపరి పరిణామాలనూ పరిష్కరిద్దాం
మరింత స్పష్టతతో సాగుతున్న ప్రక్రియ..
 
న్యూఢిల్లీ: తెలంగాణపై ప్రకటనకు ఇక కొద్దిరోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్న నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ‘కీలక నిర్ణయం’ ప్రకటించే దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. తెలంగాణపై నిర్ణయం ప్రకటించే విషయంలో తాను అఖిలపక్షంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని కేంద్ర హోంమంత్రి ప్రకటించిన తరువాత కొద్ది సమయంలోనే కాంగ్రెస్ సీనియర్లు వార్ రూంకు చేరుకోవడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. గురువారం తల్‌కటోరా రోడ్డులోని వార్ రూంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, హోం మంత్రి షిండే, ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం, కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అయిన గులాం నబీ ఆజాద్‌లతోపాటు అహ్మద్ పటేల్ కూడా కీలక సమావేశంలో పాల్గొన్నారు. దిగ్విజయ్‌సింగ్, వీరప్ప మొయిలీ, జైరాం రమేశ్ కూడా హాజరైనట్లు సమాచారం. తెలంగాణపై ప్రకటనకు ముందు జరపాల్సిన కసరత్తుకు సంబంధించి మరోసారి వారు చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు కోర్ కమిటీ భేటీలలో తెలంగాణపై చర్చించిన సీనియర్లు రేపటి జైపూర్ మీటింగులో ‘కీలక నిర్ణయాన్ని’ చర్చకు ఉంచాలా వద్దా అని మల్లగుల్లాలు పడ్డట్టు ఏఐసీసీ వర్గాల సమాచారం. ఎన్నికల వ్యవహార కోణంలో తెలంగాణపై చర్చ కొనసాగిందని తెలిసింది. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి లాభమెంత నష్టమెంత అనే సాంకేతిక కోణంలో వారు తర్జనభర్జన పడ్డట్టు సమాచారం. తెలంగాణను ప్రకటించడం అనివార్యం కనుక రెండు ప్రాంతాల కాంగ్రెస్ నాయకులకు సంతృప్తి కలిగించే ప్రకటన చేసేందుకే వారు మొగ్గు చూపారని తెలిసింది. ఒకవైపు తెలంగాణలో బలమైన ప్రజాఉద్యమం, మరోవైపు తెలంగాణను అడ్డుకునే ‘విలువైన’ రాజకీయ నాయకులు.. వీటిని బేరీజు వేస్తూ నిర్ణయం ఉండాలన్నదే లక్ష్యంగా వారి చర్చ కొనసాగిందని తెలిసింది. తెలంగాణ విషయంలో సోనియా మాటను నిలబెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్న అహ్మద్ పటేల్ తెలంగాణను యథాతథంగా ప్రకటించాలని కోరినట్లు తెలిసింది. ఆయన వాదనతో ఏకీభవించిన ఆంటోనీ అందుకు మద్దతు పలికినట్లు సమాచారం. 
                   కాగా కొద్దిరోజులుగా ఢిల్లీలో మకాం వేసిన సీమాంధ్ర నాయకులను అప్రమత్తం చేస్తూ, అధిష్ఠానం పెద్దలకు వినతి పత్రాలు ఇప్పిస్తూ, సీక్రెట్‌గా కాంగ్రెస్ సీనియర్లను కలుస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఢిల్లీలో సీమాంధ్ర ‘ఆత్మ’గా సంచరిస్తున్నారని విశ్వసనీయ వర్గాల అంచనా. సదరు పెద్దమనిషి తెలంగాణ ఇస్తే రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలవుతుందని, 254 నియోజకవర్గాలలో కేవలం 50 నుంచి 60 నియోజకవర్గాల ప్రజలు మాత్రమే తెలంగాణ కోరుకుంటున్నారని, తదితర నిరుత్సాహపరిచే నివేదికలు తయారుచేయించి పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే రెండురోజుల క్రితం మంత్రి శైలజానాథ్ సీమాంధ్ర ప్రజావూపతినిధుల సంతకాలతో కూడిన వినతిపవూతాన్ని కేంద్ర హోంమంత్రి షిండేకు అందజేశారు. తనకు ‘కొంతమంది మిత్రులు ఇట్లా చెయ్యండి అట్లా చెయ్యండి అని రాతపూర్వక సమాచారమిస్తున్నారు’ అని షిండే గురువారం విలేకరుల సమావేశంలో చేసిన ప్రకటనను ఇదే కోణంలో నుంచి విశ్లేషిస్తున్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సంతకాల పేరుతో బయటకు కనిపించేది శైలాజ్‌నాథ్ మాత్రమే అయినా కనిపించని అదృశ్య శక్తులు ఢిల్లీలో సంచరిస్తున్నాయనేది వాస్తవమంటున్నారు. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ రెండు రోజుల క్రితం ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా అదే ఆరోపణ చేశారు. తెలంగాణపై కేంద్రం చేయబోయే ప్రకటనను అడ్డుకునేందుకు తెరచాటు ప్రయత్నాలను సీమాంధ్ర రాజకీయ నాయకులు ముమ్మరం చేశారని విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌కు కూడా షిండేకు ఇచ్చిన సమాచారాన్ని చేరవేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే గురువారంనాటి వార్ రూం సమావేశానికి ముందు ఆజాద్ సోనియాను కలిసి తన వద్దకు వచ్చిన సమాచారంపై చర్చించారని తెలిసింది. అక్కడినుంచి ఆజాద్ నేరుగా వార్ రూం సమావేశానికి వెళ్ళారు. వీటన్నింటిపై కూలంకషంగా చర్చించిన కాంగ్రెస్ సీనియర్లు ‘తెలంగాణపై సోనియా మాటను నిలబెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్న అహ్మద్ పటేల్ తెలంగాణను యథాతథంగా ప్రకటించాలని కోరినట్లు తెలిసింది. ఆయన వాదనతో ఏకీభవించిన ఆంటోనీ అందుకు మద్దతు పలికినట్లు సమాచారం. 

No comments:

Post a Comment