Saturday 12 January 2013

హస్తిన చర్చ.. రాజధానిపైనే


తాత్కాలిక ఉమ్మడి క్యాపిటల్‌గా హైదరాబాద్ ఎన్నేళ్లు?
* కాంగ్రెస్ కోర్ కమిటీలో నేతల తర్జనభర్జన.. విస్తృత అంశాల నడుమ తెలంగాణ చర్చ
* బైఠక్‌లోనే తెలంగాణపై తీర్మానం?.. చురుకుగా కదులుతున్న కాంగ్రెస్
*  ఢిల్లీలో సమావేశాల పరంపర

-  చింతన్ బైఠక్‌లో తీర్మానాలు.. అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చ

పెంచిన రైల్వే చార్జీల పర్యవసానాలేంటి?
-సరిహద్దు ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయి?
-  పెట్రో ధరల పెంపుదలపై ఏం చేద్దాం?
-  జార్ఖండ్ సంక్షోభాన్ని కొలిక్కితేవటం ఎలా?
-  ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో వ్యూహమేంటి?
-  కీలక అంశాలపై చర్చించిన నేతలు 
న్యూఢిల్లీ : కొద్ది రోజుల్లో జైపూర్‌లో జరగనున్న కాంగ్రెస్ చింతన్ బైఠక్ ఒకవైపు.. మధ్యలో ముందుకు వచ్చిన జార్ఖండ్ సంక్షోభం మరోవైపు.. తాజాగా భారత్-పాక్ మధ్య ఘర్షణపూరిత వాతావరణం.. రైల్వే చార్జీల పెంపుదల, పెట్రో ధరల అంశం.. ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ ప్రకటన! ఇంతటి విస్తృత చర్చనీయాంశాల జాబితా ఉన్నప్పటికీ.. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ కోర్ కమిటీ చర్చకు చేపట్టింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంతవరకు కొనసాగిన సమావేశాల పరంపరలో తెలంగాణ అంశానికి సైతం ప్రాధాన్యం దక్కినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తథ్యమని ఇప్పటికే సంకేతాలు ఇస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. రాజధాని విషయంలోనే తర్జన భర్జన పడినట్లు సమాచారం.
                ప్రధాని మన్మోహన్ నివాసంలో జరిగిన కోర్ కమిటీ సమావేశం.. హైదరాబాద్‌ను ఎన్నేళ్లపాటు తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న అంశంపైనే చర్చ జరిపినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు చెప్పాయి. తెలంగాణ విషయంలో హైదరాబాద్‌ను సీమాంధ్ర నేతలు వివాదాస్పదం చేస్తుండటం.. తెలంగాణవాదులు మాత్రం హైదరాబాద్ సహిత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పట్టుబట్టుతుండటంతో దీని పరిష్కారంపై చర్చ జరిగిందని తెలిసింది. అంతకు ముందు గతంలో ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జులుగా పని చేసినవారు, ఆంధ్రవూపదేశ్ రాజకీయాలతో సంబంధాల్లో ఉన్నవారు మధ్యాహ్నం సోనియా నివాసానికి వెళ్లి భేటీకావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
                  ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ, ఆర్థిక మంత్రి చిదంబరం, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వీరప్పమొయిలీ, గతంలో రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా పనిచేసిన దిగ్విజయ్‌సింగ్, సీనియర్ నేత అంబికాసోని తదితరులు ఉన్నారు. ఈ భేటీకి ముందే ఉదయం 11 గంటలకు హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే టెన్‌జన్‌పథ్‌కు చేరుకుని సోనియాతో భేటీ అయ్యారు. తిరిగి సాయంత్రం ఆరు గంటలకు ప్రధాని నివాసం సెవెన్ రేస్‌కోర్స్‌లో సోనియా సహా కోర్ కమిటీ సభ్యులందరూ మరోసారి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జైరాం రమేశ్, చిదంబరం, ఆంటోని, ఆజాద్, మొయిలీ, అంబికాసోనీ, దిగ్విజయ్ సింగ్ కూడా హాజరయ్యారు. సమావేశం దాదాపు రెండు గంటలపాటు జరిగింది. ఈ సందర్భంగా జైపూర్‌లో జరుగనున్న మేధో మథనంలో చేపట్టాల్సిన రాజకీయ తీర్మానాలు, జార్ఖండ్ రాజకీయ సంక్షోభంతోపాటు తెలంగాణపైనా చర్చించారు.
ఉత్కంఠ రేపుతున్న చర్చలు
                       డిసెంబర్ 28న కేంద్రం తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించడం, అందులో నెలలోపు నిర్ణయం తీసుకుంటామని హోం మంత్రి షిండే ఉద్ఘాటించడం తెలిసిందే. అప్పటినుంచి కేంద్రంలో చర్చల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఏర్పాటును సీపీఎం, ఎంఐఎం మినహా మరే పార్టీ వ్యతిరేకించలేదు. ఎంఐఎం కూడా విభజించాల్సి వస్తే హైదరాబాద్‌తో కూడిన రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర విభజనను సీపీఎం వ్యతిరేకించినా.. సత్వరమే తేల్చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ నేపథ్యంలో తెలంగాణపై అనుకూలంగానే కేంద్రం నిర్ణయం ఉండబోతున్నదన్న సంకేతాలు వస్తున్నాయి. రషీద్‌అల్వీ తదితర నేతలు సైతం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు. దీంతో షిండే విధించుకున్న గడువులోపే నిర్ణయం వస్తుందన్న నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఏర్పడింది. గడువు దగ్గరపడుతున్నకొద్దీ కాంగ్రెస్ సంప్రదింపుల్లో వేగం పుంజుకుంది. సోనియా ఆధ్వర్యంలో జరిగిన వరుస కోర్ కమిటీసమావేశాలు ఆ నమ్మకాన్ని మరింత బలపరిచాయి. ఈ క్రమంలోనే శుక్రవారం నాటి కోర్‌కమిటీ సమావేశంలో ఇతర అంశాలతోపాటు తెలంగాణపైనా తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. 
 చింతన్ బైఠక్‌లో రాజకీయ తీర్మానాలు:
దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలకు సంబంధించిన పలు అంశాలపై జైపూర్ చింతన్ బైఠక్‌లో చేయబోయే తీర్మానాలపై కోర్‌కమిటీ సమావేశం కసరత్తు చేసినట్లు తెలిసింది. ఈ తీర్మానాల్లో తెలంగాణ అంశం కూడా ఉన్నదని విశ్వసనీయవర్గాల కథనం. తెలంగాణపై దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం.. రాజధాని అంశంలోనే తర్జనభర్జనలు పడిందని సమాచారం. దానితోపాటు అందరి అభివూపాయాలు తెలుసుకోవడం, పలువైపులనుండి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించడం వరకే సమావేశం పరిమితమైందని తెలుస్తోంది. ఏది ఏమైనా సోనియాగాంధీ మనసులో ఉన్న ఆలోచనే తెలంగాణపై ప్రకటనగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2004 ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై తాను ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని, పుట్టిన రోజు కానుక విషయంలో వెనక్కు తగ్గరాదని సోనియా భావిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. 
              ఈ నేపథ్యంలోనే తెలంగాణపై తుది ప్రకటనకు జైపూర్ మేధో మథనం వేదిక అవుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో మేధో మథనానికి ముందే ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఏఐసీసీ వర్గాలు చెబుతుండటం విశేషం. 2009 డిసెంబర్ 9 ప్రకటన అనంతరం ఆంధ్రవూపదేశ్‌లో నెలకొన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ఈసారి చేయబోయే ప్రకటన విషయంలో సోనియా పకడ్బందీగా వ్యవహరించాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే బైఠక్‌లో చర్చించే ఇతర అంశాలతో సమానంగా తెలంగాణను సోనియా చూడటం లేదని, దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని ఏఐసీసీలో చర్చ జరుగుతోంది. 
              వివిధ రాష్ట్రాలలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న అపరిష్కృత సమస్యలను ఓ కొలిక్కి తెచ్చే దిశగా కోర్‌కమిటీ చర్చలు జరిపిందని సమాచారం. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పెంచిన రైల్వే చార్జీల పర్యవసానాలు, త్వరలో పెంచనున్న పెట్రోలు, డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ల పరిమితి, సబ్సిడీల కుదింపుతోపాటు.. జార్ఖండ్ విషయంలో వ్యవహరించాల్సిన వైఖరి, రాబోయే ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు తదితర అంశాలపైనా కోర్‌కమిటీ చర్చించిందని తెలుస్తోంది.

No comments:

Post a Comment