Friday, 1 February 2013

తెలంగాణపై నిర్ణయం జరిగిపోయింది: శరద్ పవార్

             మొన్న లాలూ, నిన్న మాయ, నేడు పవార్ ఇలా యు పీ ఎ లో తెలంగాణా పై మద్దతు పెరుగుతూనే ఉంది, కాని కాంగ్రెస్ మాత్రం నిర్ణయాన్ని దాటవేస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతుంది..
ముంబై: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం జరిగిపోయిందని, సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మాణం జరిగే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఎన్సీపీ నేత శరద్‌పవార్ తెలిపారు. జనవరి 31న  ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. యూపీఏ సమన్వయ కమిటీలో చర్చించి వీలైనంత త్వరగా తెలంగాణ సమస్యను పరిష్కరించాలని తాను ప్రధానికి సూచించినట్టు పవార్ స్పష్టం చేశారు.అయితే, తెలంగాణ ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయం జరిగిపోయిందని, అనుకూలమైన సమయం కోసమే ఎదురు చూస్తున్నామని ప్రధాని మన్మోహన్‌సింగ్ తనతో అన్నారని పవార్ వెల్లడించారు. 
హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే: పవార్
                  హైదరాబాద్ నగరం తెలంగాణలో అంతర్భాగమేనని ఎన్సీపీ నేత శరద్‌పవార్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ అంశంపై ప్రదానితో చర్చించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అయితే, సీమాంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధానికి నిర్మించుకునే వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా వాడుకోవాలని ఆయన ప్రధానికి సూచించినట్టు తెలిపారు. 

Saturday, 12 January 2013

హస్తిన చర్చ.. రాజధానిపైనే


తాత్కాలిక ఉమ్మడి క్యాపిటల్‌గా హైదరాబాద్ ఎన్నేళ్లు?
* కాంగ్రెస్ కోర్ కమిటీలో నేతల తర్జనభర్జన.. విస్తృత అంశాల నడుమ తెలంగాణ చర్చ
* బైఠక్‌లోనే తెలంగాణపై తీర్మానం?.. చురుకుగా కదులుతున్న కాంగ్రెస్
*  ఢిల్లీలో సమావేశాల పరంపర

-  చింతన్ బైఠక్‌లో తీర్మానాలు.. అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చ

పెంచిన రైల్వే చార్జీల పర్యవసానాలేంటి?
-సరిహద్దు ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయి?
-  పెట్రో ధరల పెంపుదలపై ఏం చేద్దాం?
-  జార్ఖండ్ సంక్షోభాన్ని కొలిక్కితేవటం ఎలా?
-  ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో వ్యూహమేంటి?
-  కీలక అంశాలపై చర్చించిన నేతలు 
న్యూఢిల్లీ : కొద్ది రోజుల్లో జైపూర్‌లో జరగనున్న కాంగ్రెస్ చింతన్ బైఠక్ ఒకవైపు.. మధ్యలో ముందుకు వచ్చిన జార్ఖండ్ సంక్షోభం మరోవైపు.. తాజాగా భారత్-పాక్ మధ్య ఘర్షణపూరిత వాతావరణం.. రైల్వే చార్జీల పెంపుదల, పెట్రో ధరల అంశం.. ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ ప్రకటన! ఇంతటి విస్తృత చర్చనీయాంశాల జాబితా ఉన్నప్పటికీ.. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ కోర్ కమిటీ చర్చకు చేపట్టింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంతవరకు కొనసాగిన సమావేశాల పరంపరలో తెలంగాణ అంశానికి సైతం ప్రాధాన్యం దక్కినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తథ్యమని ఇప్పటికే సంకేతాలు ఇస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. రాజధాని విషయంలోనే తర్జన భర్జన పడినట్లు సమాచారం.
                ప్రధాని మన్మోహన్ నివాసంలో జరిగిన కోర్ కమిటీ సమావేశం.. హైదరాబాద్‌ను ఎన్నేళ్లపాటు తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న అంశంపైనే చర్చ జరిపినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు చెప్పాయి. తెలంగాణ విషయంలో హైదరాబాద్‌ను సీమాంధ్ర నేతలు వివాదాస్పదం చేస్తుండటం.. తెలంగాణవాదులు మాత్రం హైదరాబాద్ సహిత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పట్టుబట్టుతుండటంతో దీని పరిష్కారంపై చర్చ జరిగిందని తెలిసింది. అంతకు ముందు గతంలో ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జులుగా పని చేసినవారు, ఆంధ్రవూపదేశ్ రాజకీయాలతో సంబంధాల్లో ఉన్నవారు మధ్యాహ్నం సోనియా నివాసానికి వెళ్లి భేటీకావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
                  ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ, ఆర్థిక మంత్రి చిదంబరం, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వీరప్పమొయిలీ, గతంలో రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా పనిచేసిన దిగ్విజయ్‌సింగ్, సీనియర్ నేత అంబికాసోని తదితరులు ఉన్నారు. ఈ భేటీకి ముందే ఉదయం 11 గంటలకు హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే టెన్‌జన్‌పథ్‌కు చేరుకుని సోనియాతో భేటీ అయ్యారు. తిరిగి సాయంత్రం ఆరు గంటలకు ప్రధాని నివాసం సెవెన్ రేస్‌కోర్స్‌లో సోనియా సహా కోర్ కమిటీ సభ్యులందరూ మరోసారి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జైరాం రమేశ్, చిదంబరం, ఆంటోని, ఆజాద్, మొయిలీ, అంబికాసోనీ, దిగ్విజయ్ సింగ్ కూడా హాజరయ్యారు. సమావేశం దాదాపు రెండు గంటలపాటు జరిగింది. ఈ సందర్భంగా జైపూర్‌లో జరుగనున్న మేధో మథనంలో చేపట్టాల్సిన రాజకీయ తీర్మానాలు, జార్ఖండ్ రాజకీయ సంక్షోభంతోపాటు తెలంగాణపైనా చర్చించారు.
ఉత్కంఠ రేపుతున్న చర్చలు
                       డిసెంబర్ 28న కేంద్రం తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించడం, అందులో నెలలోపు నిర్ణయం తీసుకుంటామని హోం మంత్రి షిండే ఉద్ఘాటించడం తెలిసిందే. అప్పటినుంచి కేంద్రంలో చర్చల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఏర్పాటును సీపీఎం, ఎంఐఎం మినహా మరే పార్టీ వ్యతిరేకించలేదు. ఎంఐఎం కూడా విభజించాల్సి వస్తే హైదరాబాద్‌తో కూడిన రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర విభజనను సీపీఎం వ్యతిరేకించినా.. సత్వరమే తేల్చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ నేపథ్యంలో తెలంగాణపై అనుకూలంగానే కేంద్రం నిర్ణయం ఉండబోతున్నదన్న సంకేతాలు వస్తున్నాయి. రషీద్‌అల్వీ తదితర నేతలు సైతం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు. దీంతో షిండే విధించుకున్న గడువులోపే నిర్ణయం వస్తుందన్న నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఏర్పడింది. గడువు దగ్గరపడుతున్నకొద్దీ కాంగ్రెస్ సంప్రదింపుల్లో వేగం పుంజుకుంది. సోనియా ఆధ్వర్యంలో జరిగిన వరుస కోర్ కమిటీసమావేశాలు ఆ నమ్మకాన్ని మరింత బలపరిచాయి. ఈ క్రమంలోనే శుక్రవారం నాటి కోర్‌కమిటీ సమావేశంలో ఇతర అంశాలతోపాటు తెలంగాణపైనా తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. 
 చింతన్ బైఠక్‌లో రాజకీయ తీర్మానాలు:
దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలకు సంబంధించిన పలు అంశాలపై జైపూర్ చింతన్ బైఠక్‌లో చేయబోయే తీర్మానాలపై కోర్‌కమిటీ సమావేశం కసరత్తు చేసినట్లు తెలిసింది. ఈ తీర్మానాల్లో తెలంగాణ అంశం కూడా ఉన్నదని విశ్వసనీయవర్గాల కథనం. తెలంగాణపై దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం.. రాజధాని అంశంలోనే తర్జనభర్జనలు పడిందని సమాచారం. దానితోపాటు అందరి అభివూపాయాలు తెలుసుకోవడం, పలువైపులనుండి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించడం వరకే సమావేశం పరిమితమైందని తెలుస్తోంది. ఏది ఏమైనా సోనియాగాంధీ మనసులో ఉన్న ఆలోచనే తెలంగాణపై ప్రకటనగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. 2004 ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై తాను ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని, పుట్టిన రోజు కానుక విషయంలో వెనక్కు తగ్గరాదని సోనియా భావిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. 
              ఈ నేపథ్యంలోనే తెలంగాణపై తుది ప్రకటనకు జైపూర్ మేధో మథనం వేదిక అవుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో మేధో మథనానికి ముందే ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఏఐసీసీ వర్గాలు చెబుతుండటం విశేషం. 2009 డిసెంబర్ 9 ప్రకటన అనంతరం ఆంధ్రవూపదేశ్‌లో నెలకొన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకునే ఈసారి చేయబోయే ప్రకటన విషయంలో సోనియా పకడ్బందీగా వ్యవహరించాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే బైఠక్‌లో చర్చించే ఇతర అంశాలతో సమానంగా తెలంగాణను సోనియా చూడటం లేదని, దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని ఏఐసీసీలో చర్చ జరుగుతోంది. 
              వివిధ రాష్ట్రాలలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న అపరిష్కృత సమస్యలను ఓ కొలిక్కి తెచ్చే దిశగా కోర్‌కమిటీ చర్చలు జరిపిందని సమాచారం. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పెంచిన రైల్వే చార్జీల పర్యవసానాలు, త్వరలో పెంచనున్న పెట్రోలు, డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ల పరిమితి, సబ్సిడీల కుదింపుతోపాటు.. జార్ఖండ్ విషయంలో వ్యవహరించాల్సిన వైఖరి, రాబోయే ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు తదితర అంశాలపైనా కోర్‌కమిటీ చర్చించిందని తెలుస్తోంది.

Friday, 11 January 2013

నిర్ణయం దిశగా

‘యుద్ధ’ ప్రాతిపదికన కాంగ్రెస్ కసరత్తులు
వార్ రూంలో మూడుగంటలపాటు భేటీ!
తెలంగాణపై తేల్చేద్దామని నిశ్చయం!..
  
తదుపరి పరిణామాలనూ పరిష్కరిద్దాం
మరింత స్పష్టతతో సాగుతున్న ప్రక్రియ..
 
న్యూఢిల్లీ: తెలంగాణపై ప్రకటనకు ఇక కొద్దిరోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్న నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ‘కీలక నిర్ణయం’ ప్రకటించే దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. తెలంగాణపై నిర్ణయం ప్రకటించే విషయంలో తాను అఖిలపక్షంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని కేంద్ర హోంమంత్రి ప్రకటించిన తరువాత కొద్ది సమయంలోనే కాంగ్రెస్ సీనియర్లు వార్ రూంకు చేరుకోవడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. గురువారం తల్‌కటోరా రోడ్డులోని వార్ రూంలో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, హోం మంత్రి షిండే, ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం, కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అయిన గులాం నబీ ఆజాద్‌లతోపాటు అహ్మద్ పటేల్ కూడా కీలక సమావేశంలో పాల్గొన్నారు. దిగ్విజయ్‌సింగ్, వీరప్ప మొయిలీ, జైరాం రమేశ్ కూడా హాజరైనట్లు సమాచారం. తెలంగాణపై ప్రకటనకు ముందు జరపాల్సిన కసరత్తుకు సంబంధించి మరోసారి వారు చర్చించినట్లు తెలిసింది. ఇప్పటికే పలుమార్లు కోర్ కమిటీ భేటీలలో తెలంగాణపై చర్చించిన సీనియర్లు రేపటి జైపూర్ మీటింగులో ‘కీలక నిర్ణయాన్ని’ చర్చకు ఉంచాలా వద్దా అని మల్లగుల్లాలు పడ్డట్టు ఏఐసీసీ వర్గాల సమాచారం. ఎన్నికల వ్యవహార కోణంలో తెలంగాణపై చర్చ కొనసాగిందని తెలిసింది. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి లాభమెంత నష్టమెంత అనే సాంకేతిక కోణంలో వారు తర్జనభర్జన పడ్డట్టు సమాచారం. తెలంగాణను ప్రకటించడం అనివార్యం కనుక రెండు ప్రాంతాల కాంగ్రెస్ నాయకులకు సంతృప్తి కలిగించే ప్రకటన చేసేందుకే వారు మొగ్గు చూపారని తెలిసింది. ఒకవైపు తెలంగాణలో బలమైన ప్రజాఉద్యమం, మరోవైపు తెలంగాణను అడ్డుకునే ‘విలువైన’ రాజకీయ నాయకులు.. వీటిని బేరీజు వేస్తూ నిర్ణయం ఉండాలన్నదే లక్ష్యంగా వారి చర్చ కొనసాగిందని తెలిసింది. తెలంగాణ విషయంలో సోనియా మాటను నిలబెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్న అహ్మద్ పటేల్ తెలంగాణను యథాతథంగా ప్రకటించాలని కోరినట్లు తెలిసింది. ఆయన వాదనతో ఏకీభవించిన ఆంటోనీ అందుకు మద్దతు పలికినట్లు సమాచారం. 
                   కాగా కొద్దిరోజులుగా ఢిల్లీలో మకాం వేసిన సీమాంధ్ర నాయకులను అప్రమత్తం చేస్తూ, అధిష్ఠానం పెద్దలకు వినతి పత్రాలు ఇప్పిస్తూ, సీక్రెట్‌గా కాంగ్రెస్ సీనియర్లను కలుస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఢిల్లీలో సీమాంధ్ర ‘ఆత్మ’గా సంచరిస్తున్నారని విశ్వసనీయ వర్గాల అంచనా. సదరు పెద్దమనిషి తెలంగాణ ఇస్తే రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలవుతుందని, 254 నియోజకవర్గాలలో కేవలం 50 నుంచి 60 నియోజకవర్గాల ప్రజలు మాత్రమే తెలంగాణ కోరుకుంటున్నారని, తదితర నిరుత్సాహపరిచే నివేదికలు తయారుచేయించి పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే రెండురోజుల క్రితం మంత్రి శైలజానాథ్ సీమాంధ్ర ప్రజావూపతినిధుల సంతకాలతో కూడిన వినతిపవూతాన్ని కేంద్ర హోంమంత్రి షిండేకు అందజేశారు. తనకు ‘కొంతమంది మిత్రులు ఇట్లా చెయ్యండి అట్లా చెయ్యండి అని రాతపూర్వక సమాచారమిస్తున్నారు’ అని షిండే గురువారం విలేకరుల సమావేశంలో చేసిన ప్రకటనను ఇదే కోణంలో నుంచి విశ్లేషిస్తున్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సంతకాల పేరుతో బయటకు కనిపించేది శైలాజ్‌నాథ్ మాత్రమే అయినా కనిపించని అదృశ్య శక్తులు ఢిల్లీలో సంచరిస్తున్నాయనేది వాస్తవమంటున్నారు. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ రెండు రోజుల క్రితం ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా అదే ఆరోపణ చేశారు. తెలంగాణపై కేంద్రం చేయబోయే ప్రకటనను అడ్డుకునేందుకు తెరచాటు ప్రయత్నాలను సీమాంధ్ర రాజకీయ నాయకులు ముమ్మరం చేశారని విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌కు కూడా షిండేకు ఇచ్చిన సమాచారాన్ని చేరవేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే గురువారంనాటి వార్ రూం సమావేశానికి ముందు ఆజాద్ సోనియాను కలిసి తన వద్దకు వచ్చిన సమాచారంపై చర్చించారని తెలిసింది. అక్కడినుంచి ఆజాద్ నేరుగా వార్ రూం సమావేశానికి వెళ్ళారు. వీటన్నింటిపై కూలంకషంగా చర్చించిన కాంగ్రెస్ సీనియర్లు ‘తెలంగాణపై సోనియా మాటను నిలబెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్న అహ్మద్ పటేల్ తెలంగాణను యథాతథంగా ప్రకటించాలని కోరినట్లు తెలిసింది. ఆయన వాదనతో ఏకీభవించిన ఆంటోనీ అందుకు మద్దతు పలికినట్లు సమాచారం. 

Thursday, 3 January 2013

ఇతర రాష్ట్రాల డిమాండ్‌తో తెలంగాణను ముడిపెట్టొద్దు ..

* నెలలోగా నిర్ణయం 
* వస్తుందని ఆశిస్తున్నాం
 *తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్‌కు  గుండెకాయలాంటిది
* ఏఐసీసీ నేత రషీద్ అల్వీ
     తెలంగాణను ఇతర రాష్ట్రాల డిమాండ్‌తో ముడిపెట్టొద్దని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు. అనేక రాష్ట్రాల డిమాండ్లున్న మాట వాస్తవమే అయినప్పటికీ తెలంగాణ అంశాన్నే ముందు పరిష్కరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రమని, అందులో తెలంగాణ ప్రాంతం తమకు గుండెకాయ లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అఖిలపక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటించినట్లుగా నెలరోజుల్లో నిర్ణయం తీసుకుంటారని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. ఆయన జనవరి 1న  ఏఐసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 
            గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడిపై లోకాయుక్త విచారణ, యువతి గ్యాంగ్ రేప్ తదితర విషయాలపై మాట్లాడిన అనంతరం తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోందంటూ విలేకరులడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అఖిలపక్షం నిర్వహించారు. అన్ని పార్టీలతో చర్చించారు. నెలరోజుల్లో నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం’ అని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.
         తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అనే ప్రశ్నకు సమాధానమిస్తూ- ‘మొన్నటి అఖిలపక్షంలో కేంద్ర హోం మంత్రి చెప్పారు. షిండే ప్రకటన కాంగ్రెస్ పార్టీ వైఖరిగానే ఉంటుంది’ అని తెలిపారు. దేశంలో విదర్భలాంటి ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లున్నాయి కదా.. వాటి పరిస్థితి ఏమిటి అని అడిగిన ప్రశ్నకు- ‘విదర్భ రాష్ట్ర డిమాండు కూడా పురాతనమైనదే. అట్లా ఇంకా అనేక రాష్ట్రాల డిమాండ్లున్న మాటా వాస్తవమే. అయితే తెలంగాణ రాష్ట్ర డిమాండును ఇతర రాష్ట్రాల డిమాండుతో ముడిపెట్టరాదు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్  కీలక రాష్ట్రం. అందులో తెలంగాణ ప్రాంతం మాకు గుండెకాయ లాంటిది’ అని రషీద్ అల్వీ అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించిన తర్వాతనే మిగిలిన రాష్ట్రాల సమస్యలపై దృష్టి పెడతామన్నారు.

Wednesday, 26 December 2012

కాకతీయ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణం

* కోటను ముంచిన కులపోరు
* రెడ్డి-వెలమల ఆధిపత్యపోరు
* రెడ్డి సామంత రాజులు యుద్ధానికి దూరం

               కులాధిపత్య పోరు! నేటి రాజకీయాల్లో సర్వసాధారణమైన ఈ జాడ్యమే.. అలనాడు కాకతీయ సామ్రాజ్య పతనానికీ కారణమైందన్న సంగతి చాలా మందికి తెలియదు. స్వామిద్రోహం, నయవంచన.. కలగలిసి రెండు వందల సంవత్సరాల చరిత్ర పరిసమాప్తికి దారితీశాయన్న సంగతీ తెలియదు. గణపతి దేవుడి పాలనలో తమకు లభించిన ప్రాధాన్యం.. రుద్రమదేవి, ప్రతాపరుద్రుడి కాలంలో దక్కకపోవడంపైరెడ్డి కులానికి చెందిన సామంత రాజులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. 
                తమకు ప్రాధాన్యం లేకపోవడమే కాక.. సైన్యంలో పద్మనాయకుల (వెలమల)కే ప్రాధాన్యం ఉండడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. 1323లో ఢిల్లీ సుల్తాన్ సేనలు ఓరుగల్లుపై దండెత్తి వచ్చినప్పుడు రెడ్డి సామంత రాజులు ఈ కారణంతోనే సహాయ నిరాకరణ చేశారు. దీనికితోడు.. కాకతీయ సేనలను న్యాయబద్ధంగా ఎదిరించడం అసాధ్యమని తెలుసుకున్న మహ్మద్ బిన్ తుగ్లక్ రెడ్లు, వెలమల నడుమ వైరాన్ని పావుగా వాడుకున్నాడు. కాకతీయ సైన్యంలోని తేరాల బుచ్చారెడ్డి అనే కమాండర్‌కు 18 లక్షల బంగారు నాణేలు ఇస్తానని ఆశ చూపాడు. అందులో సగం ముందే ఇచ్చాడు. 
                     ఆ సొమ్ము తీసుకున్న బుచ్చారెడ్డి అతని మిత్ర సామంతులు.. సుల్తాన్‌తో యుద్ధంలో తామే ముందుండి పోరాడతామని ప్రతాపరుద్రుణ్ని నమ్మించారు. వారిని నమ్మిన ప్రతాపరుద్రుడు యుద్ధరంగాన ఘోరంగా మోసపోయాడు. పోరు కీలక దశలో ఉన్నప్పుడు.. బుచ్చారెడ్డి తన సైన్యాన్ని యుద్ధరంగానికి దూరంగా తరలించాడు. మరికొందరు రెడ్డి సామంతరాజులు కూడా బుచ్చారెడ్డిని అనుసరించారు. బొబ్బారెడ్డి అనే సామంత రాజు ప్రతాపరుద్రుడి పక్షాన యుద్ధరంగానికి వచ్చినప్పటికీ తన బలగాలను దూరంగా మోహరించాడు. యుద్ధరంగంలో 'తన' అనుకున్న వాళ్ల నుంచే జరుగుతున్న వం చన గురించి ఆలస్యంగా తెలుసుకున్న ప్రతాపరుద్రుడు.. స్వయంగా గజారూఢుడై యుద్ధరంగంలోకి దిగాడు. 
                ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్న తుగ్లక్ ఆయనవైపునకు పెద్ద ఎత్తున బలగాలను నడిపించాడు. ప్రతాపరుద్రుడి బలగాలను హతమార్చి ఆయన్ను బందీగా పట్టుకున్నాడు. సమీపంలోనే తన బలగంతో మాటువేసి ఉన్న బొబ్బారెడ్డి.. ఆ సమయంలో తన బలపరాక్రమాలు ప్రదర్శించి రాజు మెప్పు పొందాలనుకున్నాడుగానీ అప్పటికే సమయం మించిపోయింది. ఇక, ప్రతాపరుద్రుడి సైన్యంలోనే అత్యంత కీలకస్థానంలో ఉన్న పద్మనాయక (వెలమ) సేనాని గన్నయ.. బందీగా ఢిల్లీ చేరాక ఇస్లాం స్వీకరించి మాలిక్ మఖ్‌బూల్‌గా పేరు మార్చుకొన్నాడు. తన కుయుక్తులతో ఏకంగా ఢిల్లీకి వజీరు కాగలిగాడు. అనంతరకాలంలో.. కాకతీయులు పాలించిన ప్రాంతానికి ఇతణ్ని రాజుగా నియమిస్తే ఈ ప్రాంత పద్మనాయకులు తరిమితరిమికొట్టారు. దీంతో మాలిక్ మఖ్‌బూల్ ఢిల్లీకి పరారయ్యాడు.

విశ్వసనీయతే కాకతీయుల విశిష్టత
అధికారం కోసం పాకులాడలేదు
శాసనాల ప్రకారం వారిది విస్తి వంశం
కులం, మతంపైనా భిన్న వాదనలు
రాయగజకేసరి శిల్పాల్లో రుద్రమదేవి రూపం
80వ ఏట వీర మరణం
                                 - చరిత్రకారుడు పి.వి. పరబ్రహ్మాశాస్త్రి

హైదరాబాద్: ప్రజా క్షేమం, సమాజాభివృద్ధే ధ్యేయంగా సాగిన కాకతీయుల పరిపాలన ఘనకీర్తి పొందింది. రెండు వందల ఏళ్ల స్వర్ణయుగానికి సాక్ష్యంగా అనేక శాసనాలు, చెరువులు, వ్యవస్థలు ఇప్పటికీ కంటిముందే నిలుస్తున్నాయి. సంగీత, సాహిత్య, శిల్పకళల్లో కాకతీయులు చేసిన కృషి ఆంధ్ర దేశానికే వన్నె తెచ్చింది. కాకతీయుల చరిత్రపై విశేష అధ్యయనం చేసిన చరిత్రకారుడు పి.వి. పరబ్రహ్మశాస్త్రి 'ఆంధ్రజ్యోతి'కి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. కళ్యాణి చాళుక్యుల నుంచి రాజ్యం పొందిన కాకతీ రాజులపై ఓ అపవాదు ప్రచారంలో ఉంది. 
        చాళుక్యులపై తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చారని చరిత్రకారులు సమర్థిస్తూ వచ్చారు. కానీ శాసనాల ఆధారంగా చూస్తే కళ్యాణి చాళుక్యులపై కాకతీయులు తిరుగుబాటు చేసినట్లు ఎక్కడా కనబడదు. కళ్యాణి చాళుక్యులు రాజ్యం కోల్పోయిన తర్వాత కర్ణాటకలోని మైసూర్ ప్రాంతంలో తలదాచుకున్నారు. వారు తిరిగి వస్తే వారికి రాజ్యం అప్పజెప్పటానికి కూడా కాకతీయులు చాలాకాలం ఎదురుచూశారు. ఇక కళ్యాణి చాళుక్యులు తిరిగి వచ్చే అవకాశం లేదని తేలిన తర్వాతే 1158లో రుద్రుడు తన సార్వభౌమత్వాన్ని ప్రకటించుకున్నాడు. అధికారం కోసం కాకుండా విశ్వసనీయతతో మెలగడం కాకతీయుల విశిష్టత. 
            నిజానికి కాకతీయులు విస్తి వంశీయులు. వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములను సాగులోనికి తీసుకువచ్చి వ్యవసాయం ద్వారా వచ్చిన మొత్తాన్ని కర్ణాటక రాజులకు అందించే వారినే 'విస్తి'లు అనేవారు. అందుకే కాకతీయుల శాసనాలలో తాము విస్తి వంశీయులమని, చతుర్థ వంశీయులమని పేర్కొన్నారు. అందుకే కాకతీయుల తొలి శాసనాలు కన్నడ భాషలో ఉన్నాయి. క్రమంగా వీరు రాష్ట్రకూట రాజుల దగ్గర సేనానులుగా మారారు. ఇక వీరి మతానికి సంబంధించి కూడా అనేక అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. కాని కొన్ని ఆధారాల ప్రకారం వీరిని జైనులుగా కూడా భావిస్తున్నారు. 
             'కాకండి' అనే జైన దేవత పేరు మీద వీరికి కాకతీయులు అనే పేరు వచ్చిందన్న వాదన ఉంది. దీనితో పాటుగా వీరు కర్ణాటకలో 'కాకతీ' అనే గ్రామానికి చెందిన వారనే ప్రతిపాదన కూడా ఉంది. ఇక కాకతీయుల కాలంలో కర్ణాటకలో రెడ్డి కాపులు ఉండేవారు. తొలి కాకతీయులు ఏ కులం వారో చెప్పడానికి ఇప్పటివరకు చరిత్రకారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇక రుద్రమదేవి తప్పితే కాకతీయరాజులెవరూ తమ విగ్రహాలను చెక్కించుకోలేదు. శాసనాల ఆధారంగానే రుద్రమ దేవి రూపాన్ని అధ్యయనకారులు తెలుసుకోగలిగారు. రుద్రమదేవికి రాయగజకేసరి అనే బిరుదు ఉంది. 

               ఏనుగుల్లాంటి శత్రువులను జయించిన సింహాల వంటి రాజు అని దాని అర్థం. వరంగల్ కోటలోని స్వయంభూ ఆలయంలో 'రాయగజకేసరి' పేరిట కొన్ని శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలలో ఒక ఏనుగు, దానిపై ఒక సింహం, దానిపై ఒక యువతి కూర్చుని ఉంటుంది. యాదవ రాజును జయించిన తర్వాత రుద్రమదేవి ఈ శిల్పాలను చెక్కించింది. ఈ శిల్పంపై ఉన్నది రుద్రమదేవే! అయితే ఈ విషయాన్ని ఇప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. కేంద్ర పురావస్తుశాఖ వద్ద ఈ తరహా శిల్పాలు నాలుగైదు ఉన్నాయి. వాటిపై పరిశోధన చేస్తే రుద్రమదేవి రూపాన్ని అంచనా వేసే అవకాశాలున్నాయి. త్రిపురాంతకం వద్ద అంబదేవుడితో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించింది. 
               ఆ సమయానికి ఆమెకు దాదాపు 80 ఏళ్లు. ఆమెను యుద్ధానికి మల్లికార్జునుడు అనే సేనాని తీసుకువెళ్లాడు. అంబదేవుడి దాడిలో సేనాని కూడా చనిపోయాడు. ఇది 1289లో జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత 11వ రోజున మల్లికార్జునుడి కుమారుడు చెందుబట్ల శాసనం వేయించాడు. రుద్రమదేవి ఎప్పుడు చనిపోయిందో ఆ శాసనంలో స్పష్టంగా ఉంది. ఇక ప్రతాపరుద్రుడిది ఆత్మహత్య అనటానికి కూడా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మహ్మదీయ సేనల చేతిలో బందీకావటం ఇష్టం లేక ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడని అనితల్లిరెడ్డి వేయించిన శాసనం చెబుతోంది. ఈ శాసనంలో 'స్వేచ్ఛఐవ' అని ఉంటుంది. అంటే ఆత్మహుతి చేసుకున్నాడని అర్థం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన కాకతీయ రాజులకు ఆం«ద్రుల చరిత్రలో దక్కాల్సినంత స్థానం దక్కలేదన్న వాదన చరిత్రకారుల్లో వినిపిస్తోంది.                                                                                                                                                                      - ఆంధ్రజ్యోతి