Monday 12 January 2015

హైదరాబాద్‌లో స్మార్ట్‌సిటీ!


హైదరాబాద్‌లో దుబాయ్ తరహా స్మార్ట్‌సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సిటీ ఏర్పాటు చేయాలని దుబాయ్ స్మార్ట్ సిటీ (దుబాయ్ హోల్డింగ్) కంపెనీ ప్రతిపాదించింది. ఇందుకోసం ఆ కంపెనీ బృందం నేడు నగరానికి వస్తున్నది. దుబాయ్ హోల్డింగ్ కంపెనీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరుంది. వివిధ దేశాల్లో స్మార్ట్‌సిటీలు నిర్మించిన అనుభవం ఉంది. ఇప్పటికే మన దేశంలోని కేరళ రాష్ట్రం కొచ్చిన్‌లో కూడా స్మార్ట్‌సిటీ నిర్మాణం జరుపుతున్నది. దుబాయ్ బృందం రాష్ట్రంలో రెండు రోజులపాటు విస్తృతంగా పర్యటించనుంది. 
పారిశ్రామిక విధానానికి స్పందనగా..
దుబాయ్ హోల్డింగ్ కంపెనీ రాష్ట్ర పర్యటనకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం బాట వేసింది. ఇటీవల దుబాయ్‌లో పర్యటించిన రాష్ట్ర పంచాయత్‌రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు బృందం.. టీఎస్-ఐ పాస్, టీ-ఐడియా, టీ-ప్రైడ్ వంటి పారిశ్రామిక విధానాలను విస్తృతంగా ప్రచారం చేశారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సదస్సులు నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాలను, ప్రోత్సాహకాలను వివరించారు. దానికి అనేక కంపెనీలు సానుకూలతను వ్యక్తం చేశాయి. లూలూ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు అక్కడికక్కడే సంసిద్ధత ప్రకటించి ప్రభుత్వంతో చర్చించింది. అలాగే దుబాయ్ స్మార్ట్ సిటీ(దుబాయ్ హోల్డింగ్) కంపెనీ కూడా పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శించింది. హైదరాబాద్ నగర శివార్లల్లో స్మార్ట్ సిటీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి కేటీఆర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర, టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్‌లు దుబాయ్ స్మార్ట్ సిటీని సందర్శించారు. కంపెనీ ప్రతినిధులను తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు. ఆ నేపథ్యంలోనే దుబాయ్ హోల్డింగ్ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అబ్దుల్‌లతీఫ్ అల్‌ముల్లా, స్మార్ట్ సిటీ చీఫ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ అనిరుధ్ డామ్కీ, స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ బాజు జార్జ్‌లతో పాటు మరో ఇద్దరు అధికారులు సోమవారం రాత్రి హైదరాబాద్‌కు వస్తున్నారు.
గతంలోనూ వచ్చిన బృందం..
వాస్తవానికి దుబాయ్ స్మార్ట్ సిటీ ప్రతినిధి బృందం నాలుగేండ్ల క్రితం కూడా స్మార్ట్ సిటీ ప్రతిపాదనతో సమైక్య రాష్ట్ర పాలకుల దగ్గరికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాడు నేతల బేరసారాలకు దిగడంతో విసిగి మన దేశంలోనే కొచ్చిన్ సిటీకి వెళ్లినట్లు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి నమస్తే తెలంగాణకు వివరించారు. అక్కడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో స్మార్ట్‌సిటీ అక్కడికి తరలింది. కొచ్చిలో గవర్నమెంట్ ఆఫ్ మాల్టా, స్థానిక ప్రభుత్వం సంయుక్తంగా 120 ఎకరాల్లో స్మార్ట్‌సిటీ మల్టాను నిర్మిస్తున్నాయి. దీనితో కొచ్చి ఈయూ, నార్త్ ఆఫ్రికా కంపెనీలకు గేట్‌వేగా మారే ఛాన్స్ వచ్చింది. ఈ కంపెనీకి స్మార్ట్‌సిటీల నిర్మాణంలో దశాబ్ద కాల అనుభవం ఉంది. ఇప్పటికే దుబాయ్‌లో నిర్మించిన స్మార్ట్ సిటీ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. హైదరాబాద్‌లో కూడా భూములు, ప్రాంతాన్ని బట్టి ఏ స్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నారో కూడా పర్యటన పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించే డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులో తెలియజేస్తారని టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్ తెలిపారు.
అభివృద్ధిపై అధ్యయనం..
దుబాయ్ బృందం రెండు రోజుల పాటు తెలంగాణలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజి, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, ప్లాస్టిక్ వంటి రంగాల్లో అభివృద్ధిని అధ్యయనం చేయనుంది. స్మార్ట్‌సిటీ ఏర్పాటుకు 150 ఎకరాల వరకు స్థలం అవసరమని కంపెనీ ప్రాథమికంగా ప్రతిపాదించింది. తెలంగాణ పురోగతిని సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత ఏ స్థాయిలో పెట్టుబడి పెట్టే అంశాన్ని కంపెనీ వెల్లడించనుంది. 
         బృందానికి ప్రధానంగా పారిశ్రామిక ల్యాండ్ బ్యాంక్‌లోని రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల్లోని భూములను టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ జయేష్‌రంజన్ ప్రత్యక్ష్య పర్యవేక్షణలో చూపించనున్నారు. ఈ మూడు జిల్లాలకు ఔటర్ రింగ్ రోడ్డు అనుసంధానంగా ఉంది. దానికి తోడు మరో ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలో ఉన్నాయి. ఇవి హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉండడంతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 నుంచి 45 నిమిషాల్లోనే చేరుకునే మెరుగైన రవాణా వ్యవస్థ ఉంది. అలాంటి భూములనే దుబాయ్ బృందానికి చూపించనున్నట్లు తెలిసింది.
(టీ మీడియా సౌజన్యంతో)

No comments:

Post a Comment