Saturday 17 January 2015

రాజధానిలో రియల్‌ఎస్టేట్ దూకుడు..


* నివాస, వాణిజ్య భవనాలకు భారీగా దరఖాస్తులు
* బల్దియాకు నెలరోజుల్లో రూ.90కోట్ల ఫీజులు
* క్యాంపస్‌ల ఏర్పాటుకు ప్రఖ్యాత సంస్థల ప్రణాళికలు
   హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ దూసుకుపోతున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు నూతన భవనాల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క నవంబర్ మాసంలోనే అనుమతి ఫీజుల కింద జీహెచ్‌ఎంసీకి రూ. 90కోట్ల ఆదాయం సమకూరింది. ఇది గత ఏడాది నవంబర్ నెలతో పోల్చుకుంటే రూ. 30కోట్లు అధికం. నగరంలోని అన్ని జోన్లలోనూ ఇదే తీరు. మొత్తానికి మొత్తం ఐదు జోన్లలోనూ నూతన నిర్మాణాలకు భారీగా దరఖాస్తులొస్తున్నాయి. వీటికితోడు పలు ప్రఖ్యాత సంస్థలు సైతం నగరంలో నూతన క్యాంపస్‌లు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మందగించిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని జీహెచ్‌ఎంసీకి వస్తున్న దరఖాస్తులు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాకే నూతన నిర్మాణాలకు దరఖాస్తుల సంఖ్య పెరిగినట్లు జీహెచ్‌ఎంసీ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. 
           తాజా గణాంకాలను బట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం 30 శాతం నిర్మాణాల్లో వృద్ధి కనిపించింది. ఇప్పటికే ఖాళీ జాగాలే లేవంటూ ప్రచారాలు జరిగిన సెంట్రల్‌జోన్ సహా అన్ని జోన్లలోనూ కొత్త అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణానికి భారీగా దరఖాస్తులు అందాయి. ఆసక్తికరమైన అంశం ఏమంటే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సౌత్‌జోన్‌లో కూడా భారీగా అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి రియల్ ఎస్టేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ జోన్‌లో అత్తాపూర్ ప్రాంతంలో 25ఎకరాల్లో దాదాపు 10లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంగల నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది నగరంలో మెరుగుపడ్డ శాంతిభద్రతలకు అద్దం పడుతున్నది. అలాగే నార్త్‌జోన్‌లోని కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, అల్వాల్‌లో ఐదు అంతస్తుల నివాస, వాణిజ్య భవనాల నిర్మాణం కోసం ప్రతినెలా 12నుంచి 15వరకూ జీహెచ్‌ఎంసీకి దరఖాస్తులొస్తున్నాయి. ఇక వెస్ట్‌జోన్ మొదటినుంచి బంగారు బాతుగుడ్డే. గచ్చిబౌలీ ప్రాంతంలో సుమారు 23ఎకరాల విస్తీర్ణంలో సుమారు 15లక్షలకుపైచిలుకు ఎస్‌ఎఫ్‌టీ నివాస, వాణిజ్య భవనాలు నిర్మించేందుకు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. బయోడైవర్శిటీ పార్కు సమీపంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ ప్రాంతంలో సుమారు 250ఎకరాల విస్తీర్ణంలో నివాస, వాణిజ్య భవనాల నిర్మాణానికి పలు సంస్థలు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నాయి.అంతేకాదు, గచ్చిబౌలీ ప్రాంతంలోని నాలెడ్జ్‌సిటీ ప్రాంతంలో దాదాపు 200ఎకరాల్లో నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి ఆయా సంస్థలు ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నాయి. 
ఏడు నెలల్లో ఆరువేల దరఖాస్తులు..
        ఇంటి అనుమతులకోసం జనవరి 1, 2011నుంచి జూన్ 30, 2014వరకు దాదాపు మూడున్నరేళ్లలో జీహెచ్‌ఎంసీకి 34,614దరఖాస్తులొచ్చాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జూన్ 2, 2014నుంచి ఈ ఏడాది జనవరి 16వ తేదీవరకు ఇప్పటికే 5970దరఖాస్తులు రావడం విశేషం. అంటే, దాదాపు ఏడు నెలల్లో ఆరువేల దరఖాస్తులొచ్చినట్లు చెప్పవచ్చు. వచ్చే మార్చిలోగా ఈ సంఖ్య 12వేలు దాటే అవకాశముందని అధికారులు చెబుతున్నాయి. గతంలో ఏటా సగటున పదివేలలోపు దరఖాస్తులు రాగా, తాజాగా ఏడు నెలల్లోనే దాదాపు ఆరు వేల దరఖాస్తులు రావడం గమనార్హం. 
ఇవీ అనుకూలంశాలు....
నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని సర్కారు సంకల్పించడం రియల్ రంగానికి మంచి ఊపునిచ్చింది. ప్రథమంగా నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఏ రాష్ట్రం చేపట్టని స్థాయిలో ఏర్పాట్లు చేయడం సత్పలితాలనిచ్చింది. అలాగే నగరంలో అభివృద్ధి కోసం దాదాపు 20వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేసింది. మరోవైపు నిర్మాణసంస్థలకు సంబంధించి వివిధ సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. పలు రకాల పన్నుల మినహాయింపునకు కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. సిమెంటు ధరలు పెరిగినపుడు ప్రభుత్వం కల్పించుకుని ఉపశమనం కలిగించింది. ఇవన్నీ భవన నిర్మాతల్లో విశ్వాసాన్ని పాదుకొల్పాయి. 
       దీనికితోడు సమశీతోష్ణస్థితి, భూకంపాలు, ప్రకృతి విపత్తులకు అవకాశాలు చాలా తక్కువగా ఉండడంతో పలు ప్రఖ్యాత సంస్థలు మన నగరంలో సంస్థలు నెలకొల్పేందుకు ఆసక్తిచూపుతున్నాయి. ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే మన నగరంలో ఇళ్లు ఎంతో చౌకగా ఉన్నాయి. ఇక్కడ అత్యంత విలాసవంతమైన ఫ్లాట్లలో ఇప్పటికీ ఒక చదరపు అడుగు ధర మూడున్నర వేలనుంచి నాలుగువేలకు మించలేదు. అదే బెంగుళూరులో సుమారు రూ. ఏడు వేలు, చెన్నయ్‌లో రూ. ఎనిమిది వేలు ఉండగా, ముంబాయిలో తక్కువలో తక్కువ ఒక ఎస్‌ఎఫ్‌టీ ధర రూ. 12వేల వరకూ ఉంది. వడ్డీరేట్లను తగ్గిస్తూ గత గురువారం ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగం పుంజుకునే వీలుందని జీహెచ్‌ఎంసీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
కొత్తగా రానున్న నివాస, వాణిజ్య భవనాల్లో కొన్ని..
* అత్తాపూర్‌లో సుమారు 25ఎకరాల్లో 10అంతస్తుల్లో సుమారు 10లక్షల చదరపు అడుగులమేర అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు. బెంగుళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ వీటి నిర్మాణం చేపట్టనుంది.
గచ్చిబౌలీలో బయోడైవర్సిటీ పార్కు సమీపంలో 23ఎకరాల్లో భారీ నివాస, వాణిజ్య అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి ప్రణాళికలు. ప్లానింగ్ తయారీ, అనుమతుల కోసం బల్దియా అధికారులతో చర్చలు
బయోడైవర్శిటీ పార్కువద్ద ఐటీసీ సంస్థ ఆధ్వర్యంలో ఏడు నక్షత్రాల హోటల్‌కు మొదలైన పనులు.
* నార్త్‌జోన్ పరిధిలోని కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజ్‌గిరి సర్కిళ్లలో ప్రతినెలా 10నుంచి 12 ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు.
* ఈస్ట్‌జోన్ పరిధిలోని ఎల్బీనగర్‌లో ప్రతినెలా 150నుంచి 200ఇండ్లకు అనుమతులు.
* గోపనపల్లిలో సుమారు 100ఎకరాల స్థలంలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ నిర్మాణానికి సిద్ధమవుతున్న మాస్టర్ ప్లాన్. అనుమతుల కోసం బల్దియా అధికారులతో సంప్రదింపులు.
* గోపన్‌పల్లిలో 23ఎకరాల్లో ప్రతిష్టాత్మక ది ఎనర్జీ అండ్ రీసోర్స్ ఇనిస్టిట్యూట్ క్యాంపస్ నిర్మాణానికి ప్రణాళికలు. అనుమతులపై జీహెచ్‌ఎంసీ అధికారులతో చర్చలు. 
* గచ్చిబౌలీ స్టేడియం ఎదురుగా 100ఎకరాల స్థలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీస్థాయిలో డేటా సెంటర్‌సహా క్యాంపస్ నిర్మాణానికి ఏర్పాట్లు. ఇప్పటికే అక్కడ ప్రాథమికంగా ఓ డేటా సెంటర్‌తోపాటు ట్రైనింగ్ సెంటర్‌ను నెలకొల్పగా త్వరలో దీన్ని దేశం మొత్తానికి సరిపోయే విధంగా డేటా సెంటర్‌ను ఏర్పాటుచేయాలని నిశ్చయించారు. భూకంపాలు, తుపానులు తదితర ప్రకృతి విపత్తులకు అవకాశం లేదనే ఉద్దేశంతో ఇక్కడ డేటా సెంటర్ నెలకొల్పాలని నిర్ణయించారు. 
* ప్రఖ్యాత బీపీఓ సంస్థ డెలాయిట్ నగరంలోని గచ్చిబౌలీలో క్యాంపస్ ఏర్పాటుచేసేందుకు మూడు మిలియన్ల ఎస్‌ఎఫ్‌టీ కమర్షియల్ భవనాన్ని 30ఏళ్లకు అద్దెకు తీసుకుంది. ఈ మేరకు ఒప్పందం కూడా జరిగింది.
                                                                             - (నమస్తే తెలంగాణ)

No comments:

Post a Comment