Thursday 29 January 2015

మహా 'వరంగల్'..

* గ్రేటర్ కార్పొరేషన్‌గా మార్చేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు 
* రాష్టంలో రెండో నగరానికి గ్రేటర్ హోదా
* 42 పంచాయతీల విలీనంతో10లక్షలకు చేరిన జనాభా
* చారిత్రక, పర్యాటక ప్రత్యేకతల నెలవు
కాకతీయ వైభవానికి నిలువుటద్దంగా నిలిచి, జాతీయస్థాయిలో వారసత్వ నగరంగా గుర్తింపు పొందిన వరంగల్‌కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మహానగర హోదా కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సీఎం కేసీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శి ఎంజీ గోపాల్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితర శాఖల అధికారులతో జనవరి  28న సమీక్ష సమావేశం నిర్వహించారు. 
      వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాల సమాహారమైన వరంగల్ నగరం రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని సమావేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పారిశ్రామిక, విద్యారంగంలో రాష్ట్ర రాజధానికి దీటుగా వరంగల్‌ను తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలియజేశారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కొద్దికాలంక్రితం 42 గ్రామపంచాయతీలను కలుపడంతో నగరం బాగా విస్తరించిందని.. దీంతో జనాభా 10 లక్షలకు చేరుకుందని సీఎం వివరించారు. చారిత్రక, పర్యాటకపరంగా వరంగల్‌కు ఉన్న ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకొని వరంగల్‌కు గ్రేటర్ హోదా కల్పించాలని నిర్ణయించినట్లు అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు.
1934లో మేజర్ మున్సిపాలిటీగా:
అద్భుతమైన చారిత్రక వారసత్వ సంపద కలిగిన వరంగల్ సీమాంధ్రుల పాలనలో తీవ్ర వివక్షకు గురైంది. నిజాంల కాలంలో 1934(1344 ఫస్లీ)లోనే మేజర్ మున్సిపాలిటీ స్థాయికి అభివృద్ధి చెందిన వరంగల్ పట్టణాన్ని సీమాంధ్ర పాలకులు నిర్లక్ష్యం చేశారు. దీంతో ఏనాడో గ్రేటర్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించాల్సిన వరంగల్ ఇప్పటివరకు నిరాదరణకు గురైంది. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి బంగారు తెలంగాణ నిర్మాణానికి నడుం బిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కాకతీయుల రాజధానిని గ్రేటర్ కార్పొరేషన్ చేసి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతనే వరంగల్‌కు కేంద్రస్థాయిలో గుర్తింపు వచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం తాను అభివృద్ధి చేయతలపెట్టిన వంద స్మార్ట్ సిటీల జాబితాలో వరంగల్‌ను చేర్చింది. 
     వరంగల్ నగరం 1934లో మేజర్ మున్సిపాలిటీగా అవతరించింది. రాచరిక పాలన తరువాత 1952లో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ మున్సిపాలిటీకి మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించింది. 1959లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ హోదా రాగా, 1960లో సెలెక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. 1994 ఆగస్టు 18న మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆనాటిప్రభుత్వం డిక్లేర్ చేసింది. 20 ఏండ్ల తర్వాత సీఎం కేసీఆర్ వరంగల్ నగరాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించారు.
గ్రేటర్ వరంగల్ విస్తీర్ణం 409 చదరపు కిలోమీటర్లు: 
కొంతకాలం కిందటే 42 గ్రామ పంచాయతీల విలీనంతో వరంగల్ విస్తీర్ణం 100 చదరపు కిలోమీటర్ల నుంచి 409 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న వరంగల్ నగరంలో కాకతీయ యూనివర్సిటీతోపాటు ప్రతిష్ఠాత్మకమైన ఎన్‌ఐటీ ఉన్నది. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వీటన్నిటి నేపథ్యంలో ఏకశిలా నగరంగా ప్రత్యేక గుర్తింపు పొందిన వరంగల్ గ్రేటర్ కావడంతో మరింత అభివృద్ధి అయ్యే అస్కారం ఉన్నది.
మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాలు
         అల్లాపూర్,  అయోధ్యపురం,  భట్టుపల్లి, కడిపికొండ, కుమ్మరిగూడెం, పైడిపల్లి,  చింతగట్టు, పెద్దపల్లి, ఎల్లాపూర్, మొగిలిచర్ల, రాంపూర్, వంగపహాడ్, ఆరెపల్లి, ఎనుమాముల, గోపాలపరం, గుండ్లసింగారం, కొత్తపల్లి(హెచ్), కొత్తపేట, మడికొండ, మామునూర్, నక్కలపల్లి, పలివేల్పుల, టేకులగూడెం, తరాలపల్లి, తిమ్మాపూర్, భీమారం, దేవన్నపేట, హసన్‌పర్తి, కోమటిపల్లి, ముచ్చెర్ల, మునిపల్లి, ధర్మారం, దూపకుంట, గొర్రెకుంట, పొతరాజుపల్లి, స్థంభంపల్లె, వసంతపూర్, జన్‌పాక, ఉంకిచర్ల, సింగారం, బొల్లికుంట, గడిపల్లె.
- (నమస్తే తెలంగాణ)

No comments:

Post a Comment