Monday 16 March 2015

నగరాభివృద్ధికి 330 విభాగాలు

* 330 విభాగాలుగా నగర విభజన.. కమిటీల ఏర్పాటు 
* ఇంటికొక చెట్టు, రెండు చెత్తడబ్బాలు, వీధుల్లో సీసీ కెమెరాలు 
* వెంకటరమణ, మమతానగర్ కాలనీల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ 
* కాలినడకన కలియతిరుగుతూ సమస్యల పై ఆరా
ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. నాగోలు ప్రాంతంలోని వెంకటరమణ, మమతానగర్ కాలనీల్లో మార్చి 15న సీఎం పర్యటించారు. నగరాన్ని 330 విభాగాలుగా విభజించి ముఖ్యమంత్రితో సహా మంత్రులు, గవర్నర్, సీఎస్, డీజీపీ, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, రాష్ట్రస్థాయి అధికారులతో కమిటీలు వేస్తామన్నారు. ఈ కమిటీల ద్వారా వారికి కేటాయించిన కాలనీలను హరితవనంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలంతా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని.. రక్షణ కోసం చందాలు వేసుకుని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వెంకటరమణ కాలనీలో ప్రజలు స్వచ్ఛందంగా చందాలతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను సీఎం ప్రారంభించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారంటూ అభినందిస్తూ స్వయంగా వెయ్యి రూపాయల చందాను కాలనీ సంఘానికి అందజేశారు. ఎవరో వచ్చి ఏమో చేస్తారని ఆలోచించకుండా మనకు మనమే సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా ప్రతి ఇంట్లో రెండు చెత్త డబ్బాలు.. ప్రతి ఇంటికి చెట్టు.. రోడ్లకు ఇరువైపుల సుగంధ వాసననిచ్చే ఆయుర్వేద మొక్కలు.. ప్రతి కాలనీలో మహిళ, యువత, విద్యార్థులు కలిగిన వేర్వేరు కమిటీల ఏర్పాటు.. వివిధ విభాగాలతో గ్రేటర్‌ను గ్రీనరీగా తీర్చిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు. 
దేవుడి ఆశీస్సులతో...
వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకటరమణ, మమతానగర్ కాలనీలతోనే అభివృద్ధి ఆరంభం అవుతుందని సీఎం అన్నారు. ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగేలా ఈ రెండింటినీ మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలన్నారు. ఎల్బీనగర్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు యెగ్గె మల్లేశం చేత రెండు సీసీ కెమెరాలను ఇప్పించాలని సూచించారు. కాలనీలో ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలు పంపిణీ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్‌కు ఆదేశించారు. గత ప్రభుత్వాలు నగరానికి హైటెక్ సిటీగా పేరు తెచ్చామని చెపుతున్నారు.. కానీ నగరంలోని ప్రతి కాలనీలో సమస్యలున్నాయని అన్నారు. శివారులో ఉన్న బీహెచ్‌ఈఎల్‌లోని ప్రగతినగర్ కాలనీని సందర్శించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రభుత్వం తరుపున రెండు బస్సుల్లో మమతానగర్, వెంకటరమణ కాలనీ వాసులను తీసుకెళ్తుందన్నారు. అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులే స్ఫూర్తిగా ఈ కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రగతినగర్‌కు దోమలు లేని కాలనీగా పేరుంది. ఆ కాలనీలో ఔషధ మొక్కలు పెంచడమే అందుకుకారణమన్నారు. 
కాలనీలు కలియతిరిగి...
నాగోల్ ప్రాంతంలోని వెంకటరమణ, మమతా నగర్ కాలనీలను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు స్వయంగా కాలినడకన కలయతిరిగారు. నగరంలోని ప్రజలకు నేను ఉన్నా అంటూ.. సీఎం భరోసా ఇచ్చారు. కాలనీలోని ఖాళీస్థలాలతో పాటు, శ్మశాన వాటికను సందర్శించి పలు సూచనలు చేశారు. విదేశాల తరహాలో జీహెచ్‌ఎంసీ శ్మశాన వాటికలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. 
శాంతి భద్రతల సంఘం....
కాలనీలోని యువకులు, విద్యార్థులు, మేధావులు, మహిళలతో వేరువేరుగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. దీంతో కాలనీలోని ప్రతి ఒక్కరిని గుర్తుపట్టడానికి వీలుంటుందన్నారు. కాలనీలో నివసిస్తున్న, అద్దెకు ఉంటున్నవారి వివరాలను తీసుకోవడంతో దొంగల ఆచూకీని సీసీ కెమెరాలతో తెలుసుకునే ఆవకాశం ఉంటుందన్నారు. విభాగాల వారీగా ఉన్న కమిటీలు కలిసి శాంతి భద్రతల సంఘం కమిటీని నియమించుకొని సమస్యలను చర్చించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఆర్‌ఎస్ ఎల్‌బీనగర్ ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు యొగ్గె మల్లేశం, వీరమల్ల రాంనర్సింహగౌడ్, చెరుకు ప్రశాంత్‌గౌడ్, వస్పరి శంకర్, జిన్నారం విఠల్‌రెడ్డి, తుమ్మల పల్లి రవీందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జగన్‌గౌడ్, జహీర్‌ఖాన్, పాండు గౌడ్, రాగిరి ఉదయ్‌గౌడ్, మమతానగర్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటరమణ కాలనీ అధ్యక్షుడు షౌకత్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. 
మాటలు కాదు.. చేతల సీఎం
  సీఎం కేసీఆర్ పర్యటన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించిన సీఎం కేసీఆర్... అంటూ కీర్తించారు. పదికాలాల పాటు సీఎం చల్లగా ఉండాలని దీవించారు. సీఎం కేసీఆర్ కాలనీకి వస్తానని చెప్పడమే కాదు.. ఆదివారం నాగోల్ ప్రాంతంలోని మమతానగర్, వెంకటరమణ కాలనీ వీధుల్లో కాలినడకన తిరిగి సమస్యలపై ఆకలింపు చేసుకున్నారు. కాలనీలను ఎలా తీర్చిదిద్దుకోవాలో విడమరిచి చెప్పారు. సున్నితంగా మందలిస్తూ ఆపై అన్ని సమస్యలు తీరుస్తానంటూ హామీ ఇచ్చారు. కాలనీల్లో చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ సూచనలు చేస్తూ అందుకు ఓ కథను చెప్పి ప్రజలను తనదైన రీతిలో ఆకట్టుకున్నారు. సీఎం కేసీఆర్ సొంత మనిషిలా తమ కాలనీలోని వీధుల్లో తిరుగుతూ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు అభివృద్ధికి నిధులు ఇస్తానని హమీ ఇవ్వడంతో కాలనీవాసులంతా ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇలాంటి సీఎంను ఎక్కడా చూడలేదని, సినిమాల్లోనే చూశామంటూ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రియల్ హీరో.. అంటూ జేజేలు పలికారు. 
జీవితాంతం రుణపడి ఉంటాం...
-మమతానగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
మాట ఇచ్చి.. మళ్లీ వచ్చి మాపై వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. మా కాలనీ సమస్యలన్నీ తీరిపోతే సుందరకాలనీగా మారుతుంది. రోడ్ల కోసం రూ. 2.20 కోట్లు మంజూరు చేయాలని కోరాం. సీఎం మా దగ్గరకొచ్చి.. మాతో మాట్లాడటం మా అదృష్టం. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ నుంచి మూసీ వరకు ఉన్న ఓపెన్ నాలా బాగు చేయాలని కోరాం. కాలనీ అధ్యక్షుడిని పిలిచి సమస్యలు అడిగి తెలుసుకోవడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. రియల్ హీరో కేసీఆర్. సాధారణంగా సీఎంలు మాటలతోనే సరిపెడతారు.. కాని మన సీఎం కేసీఆర్ చేతల సీఎం. 
- నమస్తే తెలంగాణ,

No comments:

Post a Comment