* సీఎం కేసీఆర్ కోరిక మేరకు గుట్ట క్షేత్రం పేరుమార్చిన చినజీయర్స్వామి
* చుట్టూ ఎనిమిది గుట్టలతో నవగిరులుగా అభివృద్ధి
* యాదాద్రిపై నరసింహస్వామి 32 అవతారాల ప్రతిష్ఠాపన
* ఆగమశాస్త్రం ప్రకారమే గుట్ట అభివృద్ధి: సీఎం కేసీఆర్
* చినజీయర్స్వామితో కలిసి ఏరియల్ సర్వే
* ఆరున్నర ఎకరాల్లో ఆలయం విస్తరణ
* భక్తులు, పర్యాటకుల కోసం మోనోరైలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఇక నుంచి యాదాద్రిగా అభివృద్ధి చెందనుంది. యాదగిరీశుడి చల్లని దీవెనలతో భక్తులకు కొంగుబంగారంగా భాసిల్లుతున్న యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం తన చుట్టూ ఉన్న మరో ఎనిమిది గిరులతో కలిసి నవగిరులుగా ప్రసిద్ధికెక్కనుంది. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని దేశంలోని ప్రముఖ హిందూ క్షేత్రాలన్నింటికీ దీటుగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కోరికమేరకు త్రిదండి చినజీయర్స్వామి పుణ్యక్షేత్రం పేరు మార్చారు. యాదగిరిగుట్టకు యాదాద్రిగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో యాదాద్రితోపాటు దానికి ఆనుకొని ఉన్న ఎనిమిది గుట్టలను కలుపుకొని నవగిరులుగా పిలుచుకొంటామని ముఖ్యమంత్రి తెలిపారు. వాటికి కూడా నామకరణం చేయాలని చినజీయర్స్వామిని కోరగా, త్వరలో వాటిపేర్లు ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

ప్రధాన గుడి ముందు హరితనందనం
గుట్టపై ప్రధాన గుడికి ముందు భాగంలో మరో పెద్ద నిర్మాణం రాకుండా విశాలమైన ప్రాంగణాన్ని హరితనందనంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. స్వామివారికి నైవేద్యం సమర్పించే పదార్థాల తయారీకి ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే వంటశాల ఏర్పాటు చేస్తామన్నారు. గుట్టపైన వంద వాహనాలు, గుట్ట కింద ఐదువేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రధాన ఆలయంఉన్న యాదగిరిగుట్టతోపాటు చుట్టూఉన్న మరో ఎనిమిది గుట్టలను కలుపుకొని నవగిరులను గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. భక్తులు, పర్యాటకుల కోసం మోనోరైలు ఏర్పాటుచేస్తామని సీఎం వివరించారు.
సీఎం, జీయర్స్వామి ఏరియల్ సర్వే

యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లోని రిజర్వు ఫారెస్టును నరసింహస్వామి అభయారణ్యంగా మార్చే ప్రతిపాదన ఉన్నదని చెప్పారు. జాతీయరహదారి, రైల్వే లైను పక్కనే ఉండటంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు సులువుగా పుణ్యక్షేత్రానికి రావచ్చని వివరించారు. అనంతరం 12 గంటలకు కొండపైకి చేరుకొని లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత చినజీయర్స్వామికి ఆలయ ప్రాంగణంలోని అణువణువును ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చూపించారు. పద్నాలుగున్నర ఎకరాల స్థలం గుట్ట పైభాగంలో వేర్వేరు ఎత్తుల్లో అందుబాటులో ఉందని, ఆరు ఎకరాల్లో ప్రధాన ఆలయం అభివృద్ధి చేస్తామని చెప్పారు. దాని చుట్టూ మాడ వీధులు నిర్మిస్తామని మ్యాప్ల ద్వారా ముఖ్యమంత్రి వివరించారు. ప్రతిపాదిత స్థలాలను, దిక్కులను చూపించారు.

No comments:
Post a Comment