Friday 13 March 2015

మిషన్ కాకతీయ పవిత్ర యజ్ఞం

* మన ఊరు- మన చెరువు పథకాన్ని సదాశివనగర్‌లో ప్రారంభించిన సీఎం కేసీఆర్ 
* పూడిక మట్టి తవ్వి.. తట్ట మోసిన ముఖ్యమంత్రి
* తెలంగాణ భుజాలపై మరో చరిత్రాత్మక సంకల్పం
* రాష్ట్రంలో 46వేల పైచిలుకు చెరువులు
* అన్నింట్లోనూ పూడిక పోవాలె
* అదృష్టం బాగుండి ఒక్క సంవత్సరం కాలమైతే..మూడేండ్లదాకా కరువు మర్రి చూడదు
* అందరం కలిస్తే మిషన్ విజయవంతమైతది
* దొంగ కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టండి
* మిషన్ కాకతీయ ప్రారంభోత్సవంలో కేసీఆర్
* ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వరాల జల్లు
* కామారెడ్డి జిల్లా కేంద్రం ఏర్పాటుకు హామీ
  మరో చరిత్రాత్మక సంకల్పాన్ని తెలంగాణ భుజానికెత్తుకున్నది! సమైక్య పాలకుల దశాబ్దాల వివక్షను సమాధి చేస్తూ కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. తన ఆయువుపట్టయిన చెరువులను పునరుద్ధరించుకునేందుకు ఇప్పుడు మరో ఉద్యమానికి సిద్ధమైంది! వేల ఏండ్లపాటు తెలంగాణను సస్యశ్యామలం చేసి.. దశాబ్దాలుగా నిర్లక్ష్యం పూడుకుపోయిన దాదాపు 46వేలకుపైగా చెరువులను మళ్లీ జలకళలాడించేందుకు కంకణం కట్టుకున్నది! అపురూపమైన ఈ సందర్భానికి నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌లోని పాత చెరువు వేదికైంది! పూడికతో నిండిపోయిన పాత చెరువు.. ఇప్పుడు కొత్త కాంతులీనేందుకు తయారవుతున్నది! కొత్తనీటిని పొదువుకుని.. చెరువుపై ఆధారపడిన సకల సామాజికవర్గాల బతుకు చిత్రాన్ని మార్చేయబోతున్నది! రాష్ట్రంలో పాత చెరువులాంటి 46వేలకుపైగా చెరువుల రూపురేఖలు మార్చేందుకు ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక మిషన్ కాకతీయ కార్యక్రమానికి అంకురార్పణ చేసిన ముఖ్యమంత్రి.. దీనిని పవిత్ర యజ్ఞంలా భావించాలని పిలుపునిచ్చారు. గురువారం పాతచెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం.. మిషన్ కాకతీయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడే గడ్డపార చేతబట్టి చెరువులోని పూడిక మట్టిని తవ్వారు. 
తవ్విన మట్టిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కలిసి తట్టలో ఎత్తారు. తట్టను మొదట మంత్రి హరీశ్‌రావు నెత్తిమీదకి ఎత్తడంతో ఆయన పక్కనే ఉన్న ట్రాక్టర్లో ఆ మట్టిని వేశారు. ఆ తర్వాత మంత్రి పోచారం, ఏనుగు రవీందర్‌రెడ్డి కలిసి సీఎం కేసీఆర్‌కు మట్టితట్ట నెత్తికెత్తారు. సీఎం తట్టలో మట్టిని మోస్తూ పక్కనే ఉన్న ట్రాక్టర్ వద్దకు నడిచివెళ్లి అందులో మట్టిని వేశారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన బహిరంగసభను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. చెరువు పునరుద్ధరణ కార్యక్రమాన్ని అందరూ ఏకమై విజయవంతం చేయాలన్నారు. గతంలో పనుల్లో అవకతవకలు చేసిన కాంట్రాక్టర్లకు మళ్లీ పనులు అప్పగించొద్దని, వారిని బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ఆంధ్ర పాలకులవల్లే చెరువులు పూర్తిగా నాశనమైపోయాయని కేసీఆర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. కామారెడ్డిని జిల్లా కేంద్రంగా చేస్తానని ప్రకటించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
అరవై ఏండ్ల సిలుము.. ఒక్కరోజుతోని వదుల్తాది
సదాశివనగర్ పాతచెరువులో ఏడు ఎనిమిది ఫీట్ల మట్టి పూడికపోయి ఉన్నది. మరి అరవై ఏండ్ల శిలుము కదా.. ఒకరోజుతోని వదుల్తాది! ఇంత నాశనం చేసిండ్రు! ఎక్కడబోయినా మన చెరువుల బతుకింతే. వాళ్లట్లచేస్తే.. మనం కూడా రైతులమేంజేసినం..? బస్త కాదు రెండు బస్తాలు చల్లుదాంరా అని జెప్పి చెర్లమట్టిని తీస్కపొయి పొలాల కొట్టుకునుడు కూడా బంజేసినం. మునుపైతే ఎండకాలమొస్తే.. అప్పుడు ట్రాక్టర్లు లేకుండే.. ఎడ్లబండ్లతోనైనా సరే చెర్లమట్టంతా పొలాలల్లకు కొట్టేది. మంచి సారం పెరిగేది భూమిలో. వాళ్లాంధ్రోళ్లట్ల జేసిండ్రు.. మనం ఎరువులు బస్తాలెక్కువేసి పొలాలు ఖరాబు చేసుకున్నం. చెర్లన్నీ పూడిక తెచ్చుకున్నం. దాని ఫలితమేమైంది? చెర్లన్నీ తాంబాళంలాగా మారిపోయినయి. అడవులు నరికేసిండ్రు. మంచి వర్షాలు పడేదే తక్కువ. ఎప్పుడన్నా గాచారం బాగుండి మంచికాలమైతే చెర్వులలో నీళ్లు నిల్వయ్. ఎక్కడియక్కడ ఎళ్లిపోతయ్. ఉద్యమం సమయంలో ప్రతీ ఉపన్యాసంలో నేన్జెప్పిన. కామారెడ్డిలో నేను ఇన్‌చార్జిగా వచ్చినప్పుడు ఆరోజు నేను నగర్‌కు కూడా ఓ రోజు వచ్చి ఉండిపోయిన. ఆరోజు కూడా ఈ చెర్వుల మీద నేను మాట్లాడిన.. మొత్తం చెరువులు నాశనమైనయని. మా తెలంగాణ రాష్ట్రం మేం తెచ్చుకుంటం. మళ్లీ కాకతీయ, రెడ్డిరాజులకు దండం పెట్టి మేం కచ్చితంగా మా చెరువులు కళకళలాడేటట్టు చేసుకుంటమని ఉద్యమ సందర్భంలో నేన్చెప్పిన. ఉద్యమం గెలిచింది. తెలంగాణ వచ్చింది. ఎన్నికలు జరిగినయ్. ఉద్యమ నాయకత్వానికే ప్రజలు పట్టం గట్టిండ్రు. ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, జైళ్లకు పోయిన నాయకులనే ఇయల ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా మీరే దీవించి అవకాశం ఇచ్చి నిలబెట్టిండ్రు. మరియాల ఏం జరగాల? యాడాది తిర్గకముందే మొత్తమంత కూడా.. అధికారులు లేకపోయినా, వననరులు సరిగా లేకపోయినా, కొత్త రాష్ట్రమైనా.. మొత్తం విషయాలన్నీ అర్థం చేసుకొని, సర్వే చేయించి ఇంజినీర్లను ఉరుకుల పరుగులబెట్టించి మొత్తం వివరాలు తెప్పించుకున్నం. పోయినయ్ పోయినయ్. మిగిలిన వాటిల్లో 46వేలచిల్లర చెరువులున్నయ్. వీటన్నింటిలో కచ్చితంగా మొత్తం పూడిక పోవాలె. కట్టలన్నీ బందబస్తు కావాలె. మత్తడ్లు, తూములన్నీ బందబస్తు కావాలె. పంటకాల్వలు కూడా మంచికావాలె. మన అదృష్టం మంచిగుండి ఒక్క సంవత్సరం కాలమైతే మూడేండ్లదాక కరువు మనదిక్కు మర్రి చూడదు. ఆ పరిస్థితి మనందరం తెచ్చుకోవాలె. కచ్చితంగా అందరం పిడికిలి పట్టాలె. అందరం ఎక్కడోళ్లమక్కడ పూనుకుంటేనే తయారైతది. నేను మంత్రి హరీశ్‌రావుగారికి చెప్పిన. ఎక్కడ్నైతే గ్రామాలలో రైతులు ముందుకొస్తరో.. పువ్వు మట్టి అంతా మీదమీదుండే మట్టి వాళ్ల పొలాలల్లకియ్యండీ.. మీరు గవర్నమెంటు తవ్వండి. ట్రాక్టర్లు వాళ్లు పెట్టుకుంటరు. మంచి లాభం జరుగుతదని నేన్చెప్పిన. రైతు సోదరులందరికీ నేను మనవి చేస్తావున్నా.. దయచేసి మీరందరు.. ఇంత మంచి అవకాశం దొరకదు. ఈ వేదిక నుంచి, నగర్‌నుంచి నేనీరోజు తెలంగాణ యావన్మంది రైతులకు ఈ సందేశం చెప్తావున్నా. ఈ రెండుమూడు నెల్లపాటు బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా.. మీరు చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా తొమ్మిదివేల చెరువుల మరమ్మతులు బ్రహ్మాండంగా జరగబోతాయి. 
ఆ కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టండి
  కాంగ్రెస్ నాయకులు పాపం.. మాదంతా బూజువట్టిన యవ్వారం.. మాలెక్కనే మీరుగూడ ఉండాలంటరు. నేను ఇంజినీరు సోదరులకు మనవి చేస్తా వున్నా.. జిల్లా కలెక్టర్‌కు కూడా ప్రత్యేకంగా చెప్తావున్నా. గతంలో మీదమీద పన్జేసీ.. దొంగ బిల్లులు లేవట్టుకుంటే ఇదే జిల్లాలో మరమ్మత్తులు చేసిన అనేక చెరువులు తెగిపోయినయ్. ఆ తెగిపోవడానికి ఎవడెవడైతే బాధ్యుడున్నడో వాళ్లకెట్టి పరిస్థితుల పన్లు ఇయ్యొద్దని చెప్పి వాళ్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని చెప్పి ఈరోజు నేను అధికారులకు ఆదేశం ఇసావున్నా. ఈ దొంగ కాంట్రాక్టర్లు మనకవసరం లేదు. గతంలో ఏ చెరువుమీద ఎవడు పన్జేసిండు? ఏ చెరువు తెగిపోయింది? ఆ వివరాలనీ తీయించాలె. ఆ దొంగలు మళ్లా వస్తే మళ్లా మొదటికే వస్తది కాబట్టి ఆన్‌లైన్‌లో ఓపెన్ టెండర్లు పిలుస్తావున్నం. దానికి వీళ్లూవాళ్లనే బేధం లేదు. ఎవ్వరు టెండర్లేసినా పాల్గోవచ్చు. పనులు చేయవచ్చు. నాణ్యత ప్రకారం ఎవ్వరైతే చేయ్యరో జైలుకు పంపిచ్చేది కూడా ఖాయం. ఇది గత సమయం కాదు. గత ప్రభుత్వం కాదు. ఇది మన తెలంగాణకు ప్రాణం.
నేల విడిచి సాము చేయొద్దు
        ఎమ్మెల్యేలం, ఎంపీలం, మంత్రులమంటే నేలవిడిచి సాముచేయొద్దు. మనం చేసే పని ఎక్కడ్నో హైదరాబాద్‌లో లేదు. ఢిల్లీలోలేదు. ఇగో మనం చేసే పని సదాశివనగర్ పాత చెరువులో ఉన్నది. ఎల్లారెడ్డిలోని గ్రామ గ్రామన ఉన్న చెరువులో ఉన్నది. ఎమ్మెల్యేలందరూ చిన్నపాటి టెంటేసుకొని చెర్లనే పండాలె. చెర్లనే ఉండాలె. రైతులతోని కలిసి అన్నం తినాలె. అంత పట్టుపట్టాలె. అంత మొండి పట్టుపడితెనే పనివరుస అయితది. తెలంగాణ మాత్రం వట్టిగచ్చిందా మనకు. ఎన్ని బాధలు పడ్డం.. ఎన్ని తిప్పలు పడ్డం. చివరకు సచ్చెదాక తయారయినం. అంత తెగిస్తెనే తెలంగాణొచ్చింది. ఇపుడు కూడా తెలంగాణ నిలిసి గెలవాలె. దేశం ముందు రుజువు చేసుకోవాలె. భేష్.. తెలంగాణ బిడ్డలు గొప్పోళ్ల్రా.. సాధించుకున్నరు. అగ జూడు వాళ్లు కాకతీయ మిషన్ ఎట్ల చేసుకున్నరో. అగ జూడు రోడ్లెట్లజేస్కుంటున్నరో అని చెప్పి అద్భుతంగా దేశం ముందు మనం నిలిచి గెలిచి చూపెట్టాలె. దాని కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు దయచేసి నాలుగురోజులైతే అసెంబ్లీ అయితది. మీరు హైదరాబాద్‌ల కనవడద్దు. ఏ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే చెర్ల పొంట, కుంటల పొంటనే ఉండాలె. ఇగ మన ముందు కనబడ్తా ఉన్నది దరిద్రమంతా అగో.. అయ్యే లొట్టపీసు చెట్లంటం మనం. మొత్తంఅదే. నేను మళ్లా యాడాదినాడు హెలికాప్టర్‌ల గీడనే దిగుతా. కచ్చితంగా దిగుతా. ఇది నేను స్టార్ట్ చేసిన చెరువు కాబట్టి ఇది అన్ని రకాలుగా కావాలె. ఈ తూటిచెట్లు, లొట్టపీసు చెట్ల జాగల నీళ్ల తళకులు కనబడాలె. బ్రహ్మాండంగా నీళ్లు కనబడాలె. అప్పుడే మనకు సంతోషమైతది. ఇగవో కాంగ్రెస్‌యానున్నదీడ. యాదున్నదా మీకు? చెల్లని రూపాయొటుండే ఈడ. ఆ రూపాయి కామారెడ్డిల చెల్లలే.. నా ఎల్లారెడ్డిల చెల్లలే. కానీ యాడ చెల్లింది.. ఢిల్లీల సోనియా గాంధింట్ల చెల్లింది. ఆయనకో ఎమ్మెల్సీ పోస్టచ్చింది. దానికాయన ఫర్మానాల పెడ్తుండు ఫర్మానాలు. ఏం జేత్తన్నవ్ కేసీఆర్..! షబ్బీర్ అలీ.. దా! ఈడ నాలుగు తట్టలుమొయ్యి. మేం గీ పన్లో ఉన్నం. కనబడ్తలేవా నీకీపన్లన్నీ. ఏంజేసేదీ కనబడ్తలేదా..? మీరు రెండు వందల రూపాయల పెన్షనిస్తే.. ఈ రోజు మా తల్లులకు, మా అన్నదమ్ములకు, మా వృద్ధులకు వెయ్యి రూపాయల పెన్షనిచ్చేది కనబడ్తలేదా షబ్బీర్ అలీ? ఇస్తాండ్రామ్మా వెయ్యిరూపాయల పింఛన్లు.. వికలాంగులకు పదిహేను వందల పెన్షన్ ఇస్తున్నరా? రేషన్‌కార్డు మీద పరిమితిలేకుండా ఆరుకిలోల బియ్యం ఇస్తున్నరా? ఇస్తున్నరు కదా! నిన్న అంగన్‌వాడీలకు జీతాలు పెరిగినయ్‌కదా? ఉద్యోగస్తులకు జీతాలు పెరిగినయా? ఇయాల చెరువులు తవ్వుడు మొదలయిందా? బీడీ కార్మికులకు వెయ్యి రూపాయలొచ్చిందా? బీడీ కార్మికులందరికీ అక్కజెళ్లలకు ఒక్కటే జెప్తావున్నా. ఎవలెవలకతే వచ్చిందో వచ్చినవాళ్లు మీ పెన్షన్ తీసుకోండి. రాని వాళ్లు ఎమ్మార్వో ఆఫీసుకు పోయి దరఖాస్తియ్యండి. ప్రతీ బీడీకార్మికురాలికి సహాయమందించాలన్నదే మా ఉద్దేశం. జిల్లా కలెక్టర్ మంజూరు చేసి వారం పదిరోజుల్లో మీఇంటికి తీసుకొచ్చిస్తారు. సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు మనవి చేస్తున్నాం. వచ్చినవాళ్లకు మొదటి విడత ఇప్పించుకోండి.. రాని వాళ్లకు రెండో విడత ఎమ్మార్వో కార్యాలయంలో వెంటనే దరఖాస్తు పెట్టించుకోండి. ప్రతీ ఒక్క మనిషికి నేను ఇప్పిస్తానని హామీనిస్తావున్నా. ఎవరు కూడా దానికి చింతించాల్సిన అవసరం లేదు. ఇగ ఈవిధంగా పనిచేస్తున్నం షబ్బీర్ అలీ.. ఈ పనులన్నీ కనబడ్తలేవా? దళితబిడ్డలకు గిరిజన బిడ్డలకు పెండ్లిలయ్‌తుంటే కల్యాణలక్ష్మికింద 51వేల రూపాయలు మంజూరు చేస్తావున్నాం. 
     క్రైస్తవులకు గానీ, ముస్లింలకు గానీ సిక్కు సోదరులకు గానీ వాళ్ల ఇండ్లలో పిల్లలుంటేగూడ 51వేల రూపాయలు మంజూరు చేస్తావున్నాం. ఇవన్నీ పనులు చేసుకుంట ముందుకు పోతావున్నాం. పాతరాజకీయంలాగా లేదు. మీలాగ మేంజేస్తలేము. ప్రజలు మమ్మల్ని గెలిపిచ్చిండ్రు.. మిమ్ముల్ని పక్కకుండుమన్నరు. మీరు సొల్లుపురాణాలు మాని మీరు పక్కకుండండి. మేం పనిచేస్తాం. మేం పనిచేస్తేనే మళ్లీ ఐదేండ్లకు పరీక్ష పాసయితం. మీరు, మేము మళ్లా ఐదేండ్లకు తలపడదాం. ఇపుడు మాత్రం సొల్లువాగుడు బంజేయుండ్రని చెప్పి నేను మనవి చేస్తావున్నా. మీ పిచ్చి పురాణాలు మాని నిర్మాణాత్మకమైన సూచనలివ్వండి. మంచి పద్ధతుల్లో మీరు కూడా కార్యక్రమాల్లో పాల్గొనండి. పెన్షన్ ఎవలకన్నా రాకపోతే మాకు సూచించండి. ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నం. పిచ్చి ధర్నాలు చేసి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి ఆరోపణలు చేస్తే మీ గౌరవమే పోతది. సూర్యుని మీద ఉమ్మితే మీమీదనే పడుతది తప్పా ప్రభుత్వానికొచ్చే నష్టం కూడా ఏమిలేదని నేను మనవి చేస్తావున్నాను. 
ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వరాలు..
ఒక ఊళ్లే ఎగిర్తం సుట్టమొచ్చిండట ఒకాయనె. పొద్దుగాల్నుంచి నేను జెల్దిపోతా జెల్దిపోతా అంటే ఇంట్లో పెద్దమనిషుండి బిడ్డా శాన దూరం పోవాలెకదా.. అన్నం కాకపాయె. బుక్కెడంత సలన్నం ఉన్నది తినిపోతవ బిడ్డా అన్నదంట. ఎందుకు పెద్దమ్మా చలన్నం తింటా. ఉడుకన్నమయెదాక ఉంటా అన్నడంట. రవీందర్‌రెడ్డిది కూడా గదే కతున్నది. చెరువుమందమేమో రమ్మన్నడు. ఈడికచ్చినంక ఇగ దుకాణం మొదలుపెట్టిండు. పెట్టవల్సిందే. ఇట్లాంటి ఎమ్మెల్యేలుంటనే సమస్యలు తెగితెనే బాగుపడ్తం. ఆయన స్పిరిట్‌కు అభినందిస్తావున్నా. ఆయనకు ఆరాటం బాగున్నది అని కేసీఆర్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో 132కేవీ సబ్‌స్టేషన్, 11 33/11కేవీ సబ్‌స్టేషన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తాడ్వాయి మండల కేంద్రంలో ఐటీఐ, ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆస్పత్రిని ఆయన మంజూరు చేశారు. కాగిత లంబాడీలను ఎస్టీల రిజర్వేషన్ల పెట్టేందుకు కమిటీ నియామకం జరిగిందని సీఎంతెలిపారు. కాగితపు లంబాడీలను కచ్చితంగా లంబాడా కులంలో కలిపే బాధ్యత నేను తీసుకుంటా. మీకందరికీ త్వరలోనే ఈ శుభవార్త కూడ వస్తది. ఎస్టీలకొచ్చే సదుపాయమంతా కాగితపు లంబాడీ అన్నదమ్ములకు కూడా వస్తది అని చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని చెరువుల మరమ్మతులకు రూ.30 కోట్లకు బదులు మరో రూ.60 కోట్లు పెంచుతున్నామని, శుక్రవారమే జీవో విడుదల చేస్తామని ప్రకటించారు. త్వరలోనే తెలంగాణలో కొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. వందశాతం కామారెడ్డి జిల్లా చేసే బాధ్యత నాది. కామారెడ్డి జిల్లా అయినతర్వాత పునాది రాయి వేయడానికి నేను వస్తానని చెప్పి కూడా హామీ ఇస్తావున్నాను. గంపగోవర్ధన్‌కు కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తావున్న. 
సమాజానికి వాస్తవాలు చెప్పిన విద్యాసాగర్‌రావు
      ప్రభుత్వ నీటిపారుదలరంగ సలహాదారుడు ఆర్ విద్యాసాగర్‌రావును కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమం జరిగే రోజులలో.. ఒక చీఫ్ ఇంజినీర్‌గా రిటైరయిపోయి కూడా నేను మౌనం పాటించకూడదు.. నా తెలంగాణ బిడ్డలు పోరాటం చేస్తున్నరు. కచ్చితంగా తెలంగాణ బిడ్డలకు నీళ్లలో జరిగే అన్యాయమేందో ఊరూరికి తిరిగి చెప్తా.. అని ప్రతిజ్ఞ తీసుకొని అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చేసి, తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పి.. నీళ్లు-నిజాలు అనే అద్భుతమైన పుస్తకాన్ని, వాస్తవాల్ని.. నిప్పులాంటి నిజాల్ని ప్రపంచం ముందు పెట్టారు అని కేసీఆర్ ప్రశంసించారు. 
     తెలంగాణ ప్రజలకు నాదొక విజ్ఞప్తి మంచినీళ్ల బాధ ఉండకూడదని సుమారు 40వేల కోట్ల రూపాయల్తోని చాలా బ్రహ్మాండంగా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టొకటి చేపడ్తున్నం. ఇది ఆశామాషి కార్యక్రమం కాదు. కచ్చితంగా నాలుగేండ్లలోపు నల్లాతో మంచినీళ్లియ్యపోతే టీఆర్‌ఎస్ వచ్చే ఎన్నికల్లో ఓట్లడగదని చెప్పిన. ఆ మాటకు కట్టుబడి ఉన్నా. కేసీఆర్ మాటంటే తప్పుడు. మీకు తెల్సావిషయం. తలతెగన్నవడాలె. అది అమలన్నాకావాలె. ఈ పనిచేయడంలో జిల్లాలో ఎమ్మెల్యేలతో, మంత్రులతో, అందరితో నేనుకోరుతా ఉన్నా. పదిహేను వేల జాగలలో మనం చాలా విషయాలు దాటాలి. రోడ్లు దాటాలె. రైలు పట్రీలు దాటాలె. అనేక కాలువలు దాటాలె. చిన్నచిన్న వాగులు వంకలు వొర్రెలన్నీ దాటాలె. అట్లయితేనే ఆ నీళ్లు మనకు రాగల్గుతయ్. ఎవల ఊరికాడ ఏ సమస్య వచ్చినా దయచేసి ఏ గ్రామస్తులు ఆ గ్రామస్తులు ఆ గ్రామానికి కథానాయకులై పైప్‌లైన్లు ముందుకు పోయేటట్లు మీరు సాకారం చేయాలె. వీటితో పాటు రోడ్లకోసం పదిహేను వేల కోట్లు మంజూరు చేస్తున్నాం. ఆర్‌అంబ్‌బీ గానీ పంచాయతీరాజ్ రోడ్లు గానీ వాటిని కూడా మీమీ గ్రామాల్లో పనులు జరిగేటప్పుడు మీరందరు కాపలా కాయాలె. నాణ్యతతోని రోడ్లు వేయించుకోవాలె. దొంగ కాంట్రాక్టర్లుంటే తరిమి కొట్టాలె. ఆ రోడ్డు మనకేస్తే ఐదేండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండాలె. భారతదేశంలో మంచిరోడ్లు ఎక్కడున్నయ్‌రా అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి రావాలె. అంత బాగా రోడ్ల నిర్మాణం కూడా జరగబోతా ఉంది. సంక్షేమకార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఐటీ రంగంలో గానీ పరిశ్రమల రంగంలో కానీ ప్రపంచంలోనే ఉత్తమమైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీ మనం తెచ్చినం. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలె. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టం కావాలె. పేదలు, రైతులు ప్లస్ పరిశ్రమలు మూడు భాగాలుగా చేసుకొని ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీ అండదండలు మీ దీవనెలు ఉంటే అన్నిట్లో కూడా తప్పకుండా విజయం సాధిస్తమని మనవి చేస్తున్నాను. 
పాత చెరువుకు అదనంగా కోటిన్నర
ఈ చెరువు కూడా హరీశ్‌రావు 38 లక్షలేమో ఇచ్చిండు. అవి ఏటూ సరిపోవు. దీన్ని నేను చేసినకాబట్టి నా డబ్బుల్నుంచి ఇంకా ఒక కోటి యాభై లక్షలు మంజూరు చేస్తావున్నా. మినీ ట్యాంక్‌బండ్‌లాగా.. సదాశివనగర్ ఆడబిడ్డలు, అన్నదమ్ములు బతుకమ్మ ఏసుకున్నా ఈ చెరువు కట్టమీద గర్వంగా కుసుండి సద్దులు తినే విధంగా చెరువు కట్ట బల్వాలె. ఈత చెట్లు పెట్టాలె. మన గీతకార్మికులు చక్కని ఈత కల్లుపోయాలె. ఈ మందుకల్లు బందుకావాలె. మొత్తం చెర్లల్ల ఈత చెట్లన్నీ కూడా తయారు చేస్తున్నం. ఇప్పటికే 28 లక్షలున్నాయ్. కట్టకింది భాగానా నిమ్ము బాగుంటది. దాని వాళ్ల ఈత చెట్లు ఏపుగా పెరుగతయ్. కళ్లుకూడా బాగపారతది. చాలా బ్రహ్మాండంగ ఉంటది. నాకు ఇంజినీర్లు చెప్పిండ్రు. ఈత చెట్టు పెట్టాల్సార్ అని. కట్ట బుంగలు పడుతదేమోనని అంటే.. పడది సార్.. బాగ గట్టిగా కట్టని కాపాడ్తది. మనంకూడా కింది భాగంలో ఈదులు పెట్టుకోవాలని చెప్పిండ్రు. నిజామాబాద్ జిల్లాకు మీకు ప్రత్యేకంగా చెట్లు ఎక్కువ ఇప్పిస్తాం. అన్ని చెరువులకు ఈత చెట్లు ఇప్పిస్తాం. గీతకార్మికులకు కూడా సాయం చేసినట్లవుతది. ఒకటి, ఒకటి చేసుకుంటూ తెలంగాణ మొత్తం ముందుకు పోవాలె. చెరువులు చేసుకోవాలె. ప్రాజెక్టులు చేసుకోవాలె. తప్పకుండా ప్రాణహిత చేవెళ్ల నీళ్లు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కనీసం 50 వేల ఎకరాలకు రావాలె. తెచ్చి ఇస్తా. అది నా బాధ్యత. వందశాతం ఆ నీళ్లు వీలైనంత సమయంలో.. అందరితో పాటు మీకుకూడా వచ్చేటట్లు చేస్తా. మీకెక్కడ్నో ప్రాణహిత నంచిరావు. మన ఎస్సారెస్పీ డ్యామ్ నుంచి రావాలె. దానికి మార్గాలున్నయ్. సర్వేలు చేసిపెట్టిండ్రు. అంచనాలు తయారయినయ్. చెరువులతో పాటు ఇక్కడికా నీళ్లు కూడా రావాలె. 
విరాళాల వెల్లువ..
గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమంకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు - మన చెరువు పథకం మిషన్ కాకతీయకు ప్రారంభోత్సవంనాడే విరాళాల వరద రావడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. నాలుగు చెరువులను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చిన సైమెట్ ల్యాబ్స్ చైర్మన్ దొడ్డ మోహన్‌రావు మిషన్ కాకతీయ పథకానికి కోటి 50లక్షల విరాళం ప్రకటించడంతో ఆయనను ముఖ్యమంత్రి అభినందించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజక వర్గంలోని కమాలాపురం పెద్దచెరువుతోపాటు వరంగల్ జిల్లాలోని ఆయన స్వంత గ్రామమైన లింగాగిరి గ్రామంలోని మూడు చెరువుల అభివృద్ధికి మోహన్‌రావు కోటిన్నర చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. నల్గొండ జిల్లాకు చెందిన రిజెన్సిస్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి బొమ్మల రామారంలోని నల్లచెరువు అభివృద్ధికి పది లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. 
      నల్గొండ జిల్లా మాందాపురం సర్పంచ్ సోలిపురం రాంరెడ్డి బెంజెరు వారి చెరువు అభివృద్ధికి ఆరు లక్షల 27వేల రూపాయలు విరాళం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని నీటి పారుదల శాఖ ఇంజినీర్లు తమ ఒక రోజు వేతనాన్ని మిషన్ కాకతీయకు అందచేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడుగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వ్యవహరించగా.. మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జీవన్‌రెడ్డి, షకీల్ అహ్మద్, బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ దఫేదార్‌రాజు, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి జోషి, ఇంజినీరింగ్ చీఫ్ మురళీధర్‌రావు, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, జాయింట్ కలెక్టర్ ఏ రవీందర్‌రెడ్డి, ఎస్పీ ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి, స్థానిక సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 
మిషన్ కాకతీయ విరాళాలకు..
మిషన్ కాకతీయ పథకానికి విరాళాలు ప్రకటించే దాతలు రాజధానిలోని పంజాగుట్ట స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లోని అకౌంట్ నంబర్ 62400709179కు నేరుగా పంపవచ్చు. 
నీరడిలా పనిచేస్తా: మంత్రి హరీశ్‌రావు
చెరువులను పునరుద్ధరించే కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు. ఇంత గొప్ప కార్యక్రమానికి మనమంతా సాక్షులమైతే.. సీఎం కేసీఆర్ చరితార్థులు అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. పాతరోజుల్లో నీరడి ఉండేవాడు. చెరువులో ఉండే నీటిని రైతులకు అందించే నీరడిలా తెలంగాణ రాష్ర్టానికి పనిచేస్తా. ప్రతీ జిల్లాలో రైతులందరికీ నీళ్లందించేందుకు కృషిచేస్తా అని ప్రకటించారు. మిషన్ కాకతీయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. వెయ్యేండ్ల్లక్రితం కాకతీయుల కాలంలో గణపతిదేవుడు తవ్వించిన చెరువులివన్నీ. రాష్ట్రంలో 46,445 చెరువులున్నాయి. బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనన్ని చెరువులు ఇక్కడున్నాయి అని చెప్పారు. ఇంత వారసత్వ సంపద అయిన చెరువులను ఆంధ్రపాలకులు ఒక్కరోజుకూడా పట్టించుకున్న పాపాన పోలేదని దయ్యబట్టారు. తెలంగాణ సాధించుకున్న వెనువెంటనే ఇక్కడి ప్రజలకు తక్షణం ప్రయోజనం కలిగించే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి సీఎం రూపకల్పన చేశారని హరీశ్ తెలిపారు. పాతరోజులు మళ్లీ మనకొస్తాయి. ఒకప్పుడు గంగాళంలా ఉండే చెరువులు ఇప్పుడు తాంబాళంలా మారిపోయాయి. మొత్తం పూడికమట్టితో నిండిపోయాయి. పూడికనంతా తొలగించి చెరువుల్లో పూర్వపు సామర్థ్యాన్ని సాధించడమే మిషన్‌కాకతీయ లక్ష్యం అని చెప్పారు. గత ప్రభుత్వాలు పనిచేసినా.. కేవలం కాంట్రాక్టర్లు, కార్యకర్తలు జేబులు నింపుకునే కార్యక్రమాలు చేపట్టాయని హరీశ్‌రావు విమర్శించారు. కట్టమీద మట్టిపోసి తప్పుడు బిల్లులు లేపి జేబులు నింపుకునే కార్యక్రమాలు చేశారని ఆరోపించారు. మిషన్ కాకతీయను ప్రజా ఉద్యమంగా నిర్వహించాలన్నదే కేసీఆర్ ఆకాంక్షని చెప్పారు. వెయ్యేండ్ల క్రితం గణపతిదేవుడు చెరువులు తవ్విస్తే ఇప్పటికీ ఆయన్ను గుర్తుచేసుకుంటున్నామని హరీశ్ అన్నారు.
చెరువులే అన్నింటికీ ఆలంబన: పోచారం శ్రీనివాస్‌రెడ్డి
  చెరువు బాగుంటే ఆయకట్టు బాగుంటుందని, అన్ని కులాలకు ఆలంబనగా ఉంటుందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ట్రాక్టర్లు పెట్టుకొని రైతులు పూడిక తీసుకొని పొలాల్లో వేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఎండకాలం పోచారంలో పొలంలో మట్టిని తరలించేవాళ్లమని తన అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గడంతో ఖర్చులు తగ్గుతాయని, అదే సమయంలో దిగుబడి పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంపై కాంగ్రెస్ నాయకుల విమర్శలను ప్రస్తావిస్తూ.. ఆన్‌లైన్ టెండర్లు పిలుస్తున్నాం. ఎక్కడా మా కార్యకర్తలకిచ్చుకునే సంస్కృతి మాకులేదు. మీ కడుపుబ్బుతున్నది. రాబోయే రోజుల్లో పుట్టగతులుండవనే భయంతోనే ఆరోపణలు చేస్తున్నారు అని పోచారం మండిపడ్డారు. 
వెల్లువలా తరలొచ్చిన జనం

మిషన్ కాకతీయ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఇందూరు జనం జాతరలా సదాశివనగర్‌కు తరలివచ్చారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభోత్సవం ఉండగా దాదాపు రెండు గంటల పాటు కార్యక్రమం ఆలస్యమైంది. ఉదయం తొమ్మిది గంటలకే సభాస్థలికి చేరుకున్న అశేష జనం.. సీఎం రాకకోసం ఓపికగా ఎదురు చూశారు. ఈలోపే ఆటపాటలతో ఉద్యమ గీతాలతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది. పండుగ వాతావరణాన్ని తలపించింది. మిషన్ కాకతీయ పనుల ప్రారంభోత్సవంలో భాగంగా పాత చెరువును పునరుద్ధరించే పనుల్లో సీఎం స్వయంగా గడ్డపార చేబూని పూడిక మట్టిని తవ్వి, తవ్విన మట్టిని తట్టలోకెత్తి నెత్తిపై మోసి ట్రాక్టర్‌లో వేయడం.. అక్కడికి చేరుకున్న ప్రజలు, రైతుల్లో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపింది. రాష్ట్ర సాధన ఉద్యమంలాగే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో శుక్రవారంనుంచి ఇక రాష్ట్రవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ పనులు ఉద్యమంలా ఉరకలెత్తనున్నాయి.
చెరువు మన కల్పతరువుచెరువు మన గుండెకాయ. చెరువు మన కల్పతరువు. అది బాగుంటే ఎన్నెన్ని బాగుంటయో హరీశ్ చెప్పిండు. ఒక చెరువు మంచిగుంటె ఎంత మంది బత్కుతమో.. ఎంత మందికి ఆదెరువుంటదో వివరించి చెప్పాడు. చెరువు నిండితే ఎట్లుంటదో.. చెరువు ఎండితే ఎట్లుంటదో మాకన్న మీకే బాగ తెల్సు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవాలె. యావత్ తెలంగాణ రైతాంగం కచ్చితంగా దీన్నొక పవిత్ర యజ్ఞంలాగా భావించాలె. మన భవిష్యత్తుకు బతుకుకు ఆధారంగా ఈ చెరువులన్నీ అద్భుతంగా తయారు చేసుకోవాలి. చెరువులంటే ఏందో నేర్పిన కాకతీయులువెయ్యేండ్ల కింద కాకతీయ, రెడ్డిరాజులు వాటర్‌షెడ్డంటే ఏందో ప్రపంచానికే నేర్పించే విధంగా అద్భుతమైనటువంటి డ్బ్భై, ఎనభై వేల గొలుసుకట్టు చెరువులు తెలంగాణలో నిర్మాణం చేసినారు. అప్పుడు తెలంగాణ అద్భుతంగా అన్నం తిన్నది. చాల గొప్పగ బత్కినం. ఒకప్పుడు కాకతీయ రాజులు.. తదనంతరం కులీకుతుబ్‌షాలు.. ఆ తదనంతరం నిజాం నవాబులు నిర్మించినటువంటి చెరువులన్నీ కూడా 15నుంచి 16 లక్షల ఎకరాలకు తెలంగాణ ప్రాంతంలో నీళ్లందించేవి. ఈరోజు లక్షా రెండు లక్షలు గూడ లేదు. ఎక్కడికిపోయింది మన ఆయకట్టు? ఎవలెత్కోని పోయిండ్రు? ఇయాల తెలంగాణ సమాజం బాగా గట్టిగ ఆలోచించాల్సిన విషయం ఇది. 
   కాకతీయ, రెడ్డిరాజులు ఆనాడు ఒక శిలాశాసనం పెట్టిండ్రు. ఆ శాసనమేందంటే.. రాజులన్నప్పుడు యుద్ధాలు, ఆక్రమణలు జరుగుతయ్ కాబట్టి ఒకవేళ మా సామ్రాజ్యం మీద ఎవలైనా రాజులు దండయాత్ర చేసి మా రాజ్యాన్ని గుంజుకుంటే గుంజుకున్నరు.. మనుషులను చంపినా మంచిదే. మా బురుజులు, కోటలు కూలగొట్టిన మంచిదేగానీ.. ప్రజలకు అన్నంపెట్టే చెరువులు మాత్రం ధ్వంసం చేయొద్దని పదకొండు వందల ఏండ్లనాడు మన రాజులు శత్రువులకు కూడా విజ్ఞప్తి చేసిండ్రు. కాకతీయులు చాల యుద్ధాలు చేసిండ్రు. చాల దాడులు జరిగినయ్. శత్రురాజులొచ్చి ఆక్రమించుకున్నరు. ఆనాటి రాజులు.. శత్రురాజులైనప్పటికి కూడా మన చెరువులు నాశనం చేయలే. నిబద్ధతను పాటించినారు. కానీ 1956లో మన ఖర్మకాలి ఆంధ్రప్రదేశ్‌లో కలిసినపుణ్యానికి ఆంధ్రా రాజులు మాత్రం మన చెరువులన్నీ నాశనం చేసినారు. 
- (నమస్తే తెలంగాణ)

No comments:

Post a Comment