Friday 22 March 2013

సీతారాముల పర్ణశాల

      రామాయణ కాలం నాటి చారిత్రాత్మక ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయని నమ్మే పర్ణశాల ఖమ్మం జిల్లా భద్రాచలానికి 36 కి.మీ. దూరంలో ఉంది. మారీచుడిని వధించిన స్థలంగా దీన్ని పేర్కొంటరు. బంగారు లేడి ఉదంతం జరిగిన ప్రదేశంగానూ, రావణుడు సీతను అపహరించిన ప్రాంతంగానూ ఇది ప్రచారంలో ఉంది. ఇక్కడి గోదావరి నదీ దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటది. 
నిర్మల్ కొయ్య బొమ్మలు
      ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మల్ బొమ్మలు, చిత్రకళకు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. నాడు అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్‌ను పాలించిన నిమ్మనాయుడు కొయ్యబొమ్మలు తయారుచేసే కళాకారులను ఇక్కడికి తీసుకువచ్చి ఉపాధి కల్పించాడు. అలా ఆ కుటుంబాలు ఇప్పటికీ అక్కడ అదే వృత్తిని కొనసాగిస్తున్నయి. హైదరాబాద్‌లోని లేపాక్షి ఎంపోరియం ద్వారా అన్ని దేశాలకు ఈ బొమ్మలను ఎగుమతి చేస్తున్నరు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్, ఇచ్చోడ అటవీ ప్రాంతాల్లో లభించే ‘పొనికి’ చెట్ల కలపతో వీటిని తయారు చేస్తరు.
కార్ఖానా జిందా తిలిస్మాత్:


        హైదరాబాద్‌లో అంబర్‌పేట ప్రాంతంలో మహమ్మద్ మోహినొద్దీన్ ఫరూఖీ 1920లో ఈ ప్యాక్టరీని ప్రారంభించారు. యునానీ వైద్యంలో డిగ్రీ చేసిన పరూఖీ నొప్పుల బాధ నివారణ కోసం జిందా తిలిస్మాత్‌ను ఉత్పత్తి చేసే ఈ కర్మాగారాన్ని తన కలల ప్రాజెక్టుగా స్థాపించారు. శతాబ్దానికి పైగా చరిత్ర గల ఈ పరిశ్రమ నేటికీ తన ఉత్పత్తిని కొనసాగిస్తోంది.
ఎల్లమ్మ జాతర

               
తెలంగాణలో గ్రామదేవతలకు జరిగే జాతరలో పోలేపల్లి జాతర కూడా చాలా పెద్దది. మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం పోలేపల్లి గ్రామంలో వెలసిన ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా మహా శివరాత్రికి ముందు వచ్చే శుక్రవారం ఘనంగా జరుగుతయి. ఇటివల మూడు రోజుల పాటు జరిగిన ఈ జాతరలో ప్రధాన ఘట్టం సిడె కార్యక్రమం. ఆ వేడుక తెలిపేదే ఈ ఫొటో. 200 సంవత్సరాల చరిత్ర గల ఈ జాతరను కనులారా దర్శించడానికి మహారాష్ట్రలోని షోలాపూర్, భీవండి, గుజరాత్‌లోని సూరత్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం రెండు లక్షల మంది దాకా భక్తులు హాజరయ్యారు.
ఇల్లందకుంట రామాలయం

      ‘అపర భద్రాద్రి’ గా పిలువబడే అత్యంత పురాతనమైన ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలానికి 5 కి.మీ. దూరంలోని ఇల్లందకుంట గ్రామంలో ఉంది. పూర్వం శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా దండకారణ్యంలో విహరిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నాడంటరు. అప్పుడే దశరథుడు మరణించాడని తెలియడంతో ‘ఇల్లంద’ విత్తనాలతో ఇక్కడ పిండ ప్రధానం చేయడం మూలంగా ఈ ప్రాంతానికి ఆ పేరు స్థిరపడిందని గ్రామస్తులు అంటరు.

No comments:

Post a Comment