Thursday 21 March 2013

సడక్‌బంద్ గ్రాండ్ సక్సెస్...



           టీజేఏసీ తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. అరెస్టులు, బైండోవర్‌లు, పోలీసుల, ప్రభుత్వ బెదిరింపులను ఖాతరు చేయకుండా జనం రోడ్డెక్కారు. హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎక్కడికక్కడే వందలాదిగా జనం తరలి వచ్చిన జనం ఎవరి పద్దతిలో వారు నిరసన తెలపారు. జైతెలంగాణ నినాదాలతో హైవే మారుమోగింది. షాద్‌నగర్ వద్ద యువకులు, టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు, జేఏసీ నేతలు భారీ సంఖ్యలో సడక్ బంద్‌లో పాల్గొన్నారు. 
      పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నా లెక్క చేయకుండా నిరసన కొనసాగించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కర్నూలు హైవేపై ఒక్క వాహనం కూడా తిరగలేదు. కొత్తకోట వద్ద రైతులు ఎడ్లబండ్లతో వినూత్న నిరసన తెలిపారు. హైవే పోడవునా వందల సంఖ్యలో పోలీసులు మొహరించి ఉద్యమకారులను భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినా తెగించి తెలంగాణవాదులు దూసుకుపోయారు. ఇక అలంపూర్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆద్వర్యంలో వందలా మంది కార్యకర్తలు రోడ్డెక్కారు. దాదాపు గంటసేపు రహదారిని దిగ్బందించారు. పోలీసులు ఈటెలను బలవంతంగా అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 
    ఉద్యమకారులు సహనం కోల్పోయి దాదాపు 50 వాహనాలను ధ్వంసం చేశారు. తెలంగాణవాదులు తెగింపును చూసి తట్టుకోలేక పోయిన పోలీసులు అరెస్టులకు తెగబడ్డారు. టీఆర్‌ఎస్, జేఏసీ నేతలతో పాటు విద్యార్థులు, న్యాయవాదులతో పాటు వేలాది మంది తెలంగాణవాదులను అరెస్టు చేసి పోలీస్టేషన్లకు తరలించారు. శంషాబాద్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు, పొలీట్‌బ్యూరో సభ్యులు డాక్టర్
 శ్రవణ్, నాయిని, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో పాటు పలువురిని అరెస్టు చేశారు. షాద్‌నగర్ వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 
   అలంపూర్ వద్ద జేఏసీ ఛైర్మన్ కోదండరాంతో పాటు రోడ్డుపై శాంతియుతంగానిరసన తెలుపుతున్న న్యాయవాదులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. అయినా సర్కారు నిర్బంధాన్ని లెక్క చేయకుండా తెలంగాణవాదులు హైవేపై నిరసనలను కొనసాగించారు. మొత్తంగా ఏడో నెంబర్ (కొత్త నెంబర్ 44)జాతీయ రహదారి బంద్‌తో హైదరాబాద్‌ నుంచి రాయలసీమ, కర్నాటకకు రాకపోకలు బందయ్యాయి. సర్కారు పోలీసుల సహాయంతో ఉక్కుపాదం మోపినా బెదరకుండా మహిళలు జంగ్ సైరన్ మోగించారు.

No comments:

Post a Comment