Wednesday 8 May 2013

సౌర విద్యుత్తుకు ప్రోత్సాహకాలు

*  పైకప్పు యూనిట్లు, వ్యవసాయ పంపుసెట్లకు వర్తింపు 
* పైకప్పు యూనిట్ల నుంచి విద్యుత్తు ఇస్తే డబ్బులు 
* 30 శాతం రాయితీ ఇస్తున్న కేంద్రం 
దీనికి అదనంగా 20 శాతం ఇచ్చేందుకు ముందుకొస్తున్న
    సర్కారు 
సంక్షేమ హాస్టళ్లకు సౌర వెలుగులు 
* మంత్రివర్గ ఉపసంఘం ముందు ప్రతిపాదనలు                  
ఈనాడు - హైదరాబాద్‌:
 
ఇంటి పైకప్పుపై సౌర విద్యుదుత్పత్తిదారులు, సౌర విద్యుత్తు పంపుసెట్లు ఏర్పాటు చేసుకుంటే పెట్టుబడిలో 20 శాతం రాయితీగా భరించడానికి ప్రభుత్వం ముందుకొస్తోంది. కేంద్రం ఇచ్చే 30 శాతం రాయితీకి ఇది అదనం. అలానే ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో సౌర వాటర్‌ హీటర్లు, వంటశాలలతోపాటు దీపాలు ఏర్పాటు ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. మంగళవారం సౌర విద్యుత్తు విధానంపై మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్‌లో సమావేశమైంది. ఈ సందర్భంగా పై మూడు ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చ కొనసాగింది. వివరాల్లోకి వెళితే.. ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్తు యూనిట్లు(రూఫ్‌టాప్‌) ఏర్పాటుచేసుకునేందుకు ప్రభుత్వం నెట్‌ మీటరింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఉత్పత్తి చేసిన విద్యుత్తుని సొంతానికి వాడుకోవడంతో పాటు గ్రిడ్‌(డిస్కంలకు) ఇవ్వడానికి అనుమతించింది. గ్రిడ్‌కి విద్యుత్తు ఇస్తే సగటు కొనుగోలు ధర(యూనిట్‌కి రూ.3.50 వరకు ఉండొచ్చు) ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలానే రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్తు యూనిట్లు పెట్టుకుంటే అయ్యేవ్యయంలో 30 శాతం వరకు కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ రాయితీగా చెల్లిస్తోంది. ఇలా 3 కిలోవాట్‌ల సామర్థ్యం కలిగిన రూఫ్‌టాప్‌ యూనిట్లకు రాయితీ ఇస్తోంది. ప్రస్తుత విద్యుత్తు సంక్షోభం నేపథ్యంలో ఈ విధానాన్ని మరింత ప్రోత్సహించడానికి కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున 20 శాతం రాయితీ ఇచ్చే విషయాన్ని ఉపసంఘం చర్చించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. సౌర నీటి వేడి యంత్రాలు(సోలార్‌ వాటర్‌ హీటర్లు)కు కూడా కేంద్రం ఇచ్చే 30 శాతంతోపాటు రాష్ట్రప్రభుత్వం 20% రాయితీ ఇవ్వ డానికి ఉపసంఘం సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్తు యూనిట్లకు 50%రాయితీ లభిస్తుంది.
సంక్షేమ హాస్టళ్లకు సౌర వెలుగులు:             రాష్ట్రవ్యాప్తంగా 5600 సంక్షేమ వసతి గృహాలు, దాదాపు 1000కిపైగా గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో 80 శాతం సొంత భవనాలున్నాయి. వీటికి రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మంత్రివర్గ ఉపసంఘం ముందుకొచ్చింది. సౌరవంట(సోలార్‌కుకింగ్‌), సౌర నీటి వేడి(సోలార్‌ వాటర్‌ హీటర్‌), సౌర విద్యుత్తు సరఫరా చేయాలనే ప్రతిపాదనకు ఉపసంఘంలో సానుకూలత వ్యక్తమైంది. దీనికి ఎంత ఖర్చవుతుంది, ఏ మేరకు అమలు సాధ్యమవుతుందో వివరాలతో రావాలని రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(నెడ్‌క్యాప్‌)ను ఆదేశించింది.
సౌర పంపుసెట్లకు ప్రోత్సాహం:
      వ్యవసాయానికి సౌర విద్యుత్తు పంపుసెట్లు పెట్టుకుంటే ప్రోత్సాహకం అందించడానికి ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించనుంది. ఇందిర జలప్రభ కింద 5 హెచ్‌పీ, 3 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన పంపుసెట్లకు సౌర విద్యుత్తు యూనిట్‌లను ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల నుంచి వంద శాతం రాయితీపై ఇవ్వడానికి ఉపసంఘం ప్రతిపాదించినట్లు మంత్రి ఆనం తెలిపారు. విద్యుత్‌ సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీలకు కూడా వంద శాతం రాయితీపై సౌర విద్యుత్‌ యూనిట్లు ఇస్తామన్నారు. ఇతర రైతులకు కేంద్రం నుంచి 30 శాతం, రాష్ట్రం నుంచి 20 శాతం రాయితీతో యూనిట్లు ఇచ్చే విషయమై ఉపసంఘం చర్చించింది. రాష్ట్రంలో 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్తు ప్రాజెక్టులకు నిర్వహించిన టెండర్లను త్వరలో పూర్తి చేయనున్నట్లు మంత్రి ఆనం మీడియాకు తెలిపారు. సగటు ధర కింద యూనిట్‌కి రూ.6.49 నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదేధరకు ముందుకు వచ్చే కంపెనీలకు అవకాశం ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. జూన్‌ 4 వరకు కంపెనీలకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. అలానే క్యాప్టివ్‌ సౌర విద్యుత్తు యూనిట్ల కోసం 274 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు ముందుకొచ్చాయనీ.. ఇందులో 19 మెగావాట్ల ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు.

No comments:

Post a Comment