Thursday 16 August 2012

పొట్టి శ్రీరాములును పొట్టనబెట్టుకున్నది ఎవరు?

    సీమాంధ్ర నేతల క్షుద్ర రాజకీయాలకు బలైన అమరజీవి పొట్టి శ్రీరాములు. 
         ఆయన ఆత్మ త్యాగానికి ఒక్క రోజు ముందు తీసిందీ ఫొటో.
     అబద్దాల పునాదుల మీద ఒక రాష్ట్రాన్ని నిర్మించబూనితే ఏమవుతుంది? ఆంధ్ర ప్రదేశ్ కి గత అయిదు దశాబ్దాలుగా ఏమవుతుందో అదే అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు అనేది పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లనేననే అబద్దం పునాదుల మీద  సీమాంధ్ర నాయకులు తెలుగు జాతిని నిలబెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న ఈ సమయంలో కూడా డిసెంబర్ 15 నాడు పొట్టి శ్రీరాములు వర్ధంతి  సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండు నిముషాలు మౌనం పాటించాలనే సర్కులర్ జారీ చేసి తమ తోక వంకరని మరోసారి నిరూపించుకున్నారు సీమాంధ్ర పాలకులు.
             అయితే గత పదేళ్ల మలిదశ తెలంగాణ ఉద్యమం పొట్టి శ్రీరాములుకు, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు ఏమీ సంబంధం లేదని కనీసం తెలంగాణ ప్రజలకు తెలియజెప్పగలిగింది.  అసలు పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగం వెనుక పెద్ద కుట్రనే దాగి ఉందని, సీమాంధ్ర రాజకీయ నాయకుల స్వార్ధ రాజకీయాలకు ఆయన అన్యాయంగా బలైపోయాడని ఇప్పుడు దొరుకుతున్న తాజా సాక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయి. తమ వ్యక్తిగత స్వార్ధం కొరకు ఒక నిండు మనిషి ప్రాణాలను అన్యాయంగా బలిపెట్టారని, అసలు పొట్టి శ్రీరాములు మరణం పూర్తిగా నివారించదగినదని మా దగ్గర ఉన్న సాక్ష్యాలు స్పష్టం  చేస్తున్నాయి. 
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికీ తెలియకుండా తొక్కిపెట్టిన ఈ చీకటి కోణంపై MissionTelangana బృందం ప్రత్యేక కధనం:
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు నేపధ్యం: 
        పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష ప్రారంభానికి దాదాపు రెండేళ్ల ముందే అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ (జవహర్ లాల్, వల్లభాయి పటేల్, పట్టాభి సీతారామయ్య-జె.వి.పి కమిటీ) ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయమని సిఫార్సు చేసింది. మద్రాస్ నగరంపై మాత్రం ఆంధ్రులు తమ హక్కు వదులుకోవాలని ఆ కమిటీ అభిప్రాయపడింది. ఈ కమిటీ సిఫారసులను ఆంధ్ర ప్రాంత ప్రజానీకం పెద్ద వ్యతిరేకత లేకుండానే ఒప్పుకుంది. ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ అయితే నవంబర్ 12, 1949 నాడు విజయవాడలో సమావేశం అయి జె.వి.పి. కమిటీ సిఫారసులకు అమోదముద్ర వేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
                                                      
                 ఆ తీర్మానం అమోదించిన వారిలో ప్రకాశం పంతులు, కళా వెంకట్రావు, బులుసు సాంబ మూర్తి, ఎన్ జి రంగా వంటి హేమాహేమీలు ఉన్నారు.  ఈ తీర్మానంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అప్పటివరకూ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని అటు తమిళులూ ఇటు తెలుగు వారూ సంతోషించారు.
             ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పంపకాలు చేయడానికి మద్రాస్ ప్రభుత్వం డిసెంబర్ 7, 1949 నాడు 8 మంది సభ్యులతో కూడిన పార్టీషన్ కమిటీని నియమించింది.
                                                 
           అందులో అంధ్ర తరఫున ప్రకాశం పంతులు, వెంకట్రావు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డిలు ఉండగా, తమిళుల తరఫున కుమార స్వామి రాజా, భక్తవత్సలం, మాధవ మీనన్, టి.టి. కృష్ణమాచారి ఉన్నారు.
        పార్టీషన్ కమిటీ మద్రాసు నగరం లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని జనవరి 26,1950 నాటికి ఏర్పాటు చేయాలని, ఆంధ్రకు వేరే రాజధాని నిర్మించాలని, మద్రాసు ప్రభుత్వం ఆంధ్రకు ఒక కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని నివేదిక ఇచ్చింది. దీన్ని ఆమోదించిన మద్రాసు ప్రభుత్వం ఏప్రిల్ 1, 1950 నాటికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
          తెలుగు వారికొరకు ఒక రాష్ట్రం ఉండాలని, మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడివడాలనే కోరిక 1910ల నుండే ప్రారంభమైనా వివిధ కారణాల వల్ల ఆ స్వప్నం నిజం కావడానికి నాలుగు దశాబ్దాల కాలం పట్టింది. అయితే ఈ ఆలస్యానికి చాలా వరకు కారణం బయటివారుకాక అప్పటి ఆంధ్ర నాయకుల మధ్య ఉన్న అపనమ్మకాలు, విభేధాలు, పరస్పర నమ్మకరాహిత్యం కావడమే విషాదం.చూడడానికి అంతా హేమాహేమీలే అయినా తమతమ వ్యక్తిగత అహాలు, స్వార్ధాల కారణంగా ఆనాడు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కుక్కలు చింపిన విస్తరిలా తయారయ్యింది.                కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్టు పార్టీ, ప్రజా పార్టీ, కృషికార్ పార్టీ, ఆంధ్ర మహాసభ, కిసాన్ మజ్దూర్ సభ…ఇలా అనేక పార్టీలు, సంస్థలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించే క్రమంలో రాష్ట్ర ఏర్పాటు ఒక కొలిక్కి రాకుండా చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వం, మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం రెండూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించినా, కొందరు ముఠాకోర్లు మద్రాస్ నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలనే డిమాండును తెరపైకి తెచ్చి రాష్ట్ర ఏర్పాటును జటిలం చేసుకున్నారు.
          పొట్టి శ్రీరాములు మరణానికి ప్రధానంగా నలుగురు సీమాంధ్ర నేతలు కారణమని అప్పటి ఘటనల క్రమం చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రకాశం పంతులు గురించి. స్వాతంత్రం రాకపూర్వమే మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన, తన మొండిపట్టుదల వల్ల ఏడాదికాలం కూడా ఆ పదవిలో కొనసాగలేకపోయాడు.చివరికి అప్పటి నెహ్రూతో కూడా విభేదించి కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చి ప్రజా పార్టీ అనే పార్టీని స్థాపించాడు.   ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పంపకాలు చేయడానికి 1949లో ఏర్పాటైన పార్టీషన్ కమిటీలో, ఏడుగురు సభ్యులు మద్రాసు నగరం లేకుండా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతిస్తే, ప్రకాశం పంతులు మాత్రం చెన్నపట్నం లేకుండా ఆంధ్ర రాష్ట్రం వద్దని తిరకాసు పెట్టాడు. అయితే ఆనాడు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజలకు మాత్రం మదరాసు నగరంపై పెద్ద వ్యామోహమేమీ లేదు. ఏదో ఒకలాగా రాష్ట్రం వస్తే చాలని ప్రజలనుకుంటుంటే, ప్రకాశం వంటి నాయకులేమో 1950, 1951 సంవత్సరాలు మొత్తం మద్రాసు నగరంతో పాటు ఆంధ్ర రాష్ట్రం కావాలని, లేదా మద్రాసును చీఫ్ కమీషనర్ స్టేట్ (కేంద్రపాలిత ప్రాంతం) చేయాలని ప్రకటనలు గుప్పించసాగారు. (ఇప్పుడు సీమాంధ్ర నాయకులు హైదరాబాదును కేంద్రపాలితప్రాంతం చేయాలని అనడం వెనుక నేపధ్యం అర్థం అయ్యిందా?)
            ఈ నాయకుల వలెనే మద్రాసులో పుట్టి పెరిగిన పొట్టి శ్రీరాములుకు కూడా మద్రాసు నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలనే కోరిక ఉండేది. అటు తమిళ, ఇటు తెలుగు నాయకులు మద్రాసు నగరంపై పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో నెలలు గడుస్తున్నా అసలు సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగుచెందిన పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ద్వారా మద్రాసు భవితవ్యాన్ని తేల్చాలని నిర్ణయించుకున్నాడు.  అక్టోబర్ 20 1952 నాడు బులుసు సాంబమూర్తి ఇంటిలో పొట్టి శ్రీరాములు తన ఆమరణ దీక్ష మొదలుపెట్టాడు. ఆ సందర్భంగా ఆయన స్పష్టంగా మద్రాసు నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కొరకే తాను దీక్షకు కూర్చున్నట్టు ప్రకటించాడు.
                                                                           
                                                                                                                                                   
          అయితే ఇక్కడొక విషయం గమనించాలి. తెలుగువారికి మద్రాసు నగరంతో అనుబంధం ఉన్నమాట నిజమైనప్పటికీ ఏ విధంగా చూసినా వారికి ఆనాడు ఆ నగరం దక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆనాటికి మద్రాసు నగరంలో తమిళులే అధికం. దానికి తోడు అనేక ఏళ్ల నుండి ఉమ్మడి మదరాసు రాష్ట్రానికి రాజధానిగా ఉన్న మదరాసు నగరాన్ని వదులుకోవడానికి తమిళులు ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఇక మదరాసు నగరం తెలుగువారికే హక్కుభుక్తం కావాలని మొదటినుండీ మంకుపట్టు పడుతున్న టంగుటూరి ప్రకాశం పంతులు వాదన ఎంత అర్ధరహితమో ఒక ఉదాహరణ చెప్పాలిక్కడ.1952 జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మదరాసు నగరంలోని హార్బర్ నియోజకవర్గం నుండి శాసనసభకు ప్రకాశం పంతులు పోటీచేసాడు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి కృష్ణారావు గెలవగా, రెండో స్థానంలో నిలిచిన ఇబ్రహీం అనే ఇండిపెండెంటుకు 11 వేల ఓట్లు వస్తే, అప్పటికే మహా నాయకుడిగా, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో కీలక వ్యక్తిగా నిలిచిన ప్రకాశం పంతులు 7 వేల ఓట్లు మాత్రమే తెచ్చుకుని డిపాజిట్ కూడా దక్కక చిత్తుచిత్తుగా ఓడిపోయాడు.
       
                                 Source – Election Commission of India
       మరి ఇలాంటి పరిస్థితిలో మదరాసు నగరం తెలుగువారికి దక్కుతుందని ప్రకాశం వంటి ఆంధ్ర నాయకులు ఎలా అనుకున్నారు? ఇక పొట్టి శ్రీరాములు దీక్ష ప్రారంభం అయిన మరునాడే అప్పటి తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు పి. సుబ్బరాయన్ చెన్నపురి (మద్రాసు) ను వదులుకుంటే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం సులభం అవుతుందని ప్రకటించాడు.
కానీ, దీక్ష మొదలైన రెండో రోజు నీలం సంజీవరెడ్డి మదరాసు నగరాన్ని ప్రత్యేక కమీషనర్ రాష్ట్రంగా (కేంద్రపాలిత ప్రాంతం)గా ప్రకటించాలని డిమాండ్ చేశాడు.
      శ్రీ రాములు దీక్ష మొదలైన వారం రోజులకు రాష్ట్రోద్యమంలో చురుకుగా ఉన్న ప్రధాన పార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీ మొదట పరిస్థితి తీవ్రతను గ్రహించింది. నిర్వివాద ప్రాంతాలతో (మదరాసు లేకుండా) వెంటనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ కమిటీ తీర్మానించింది.
                                                                       
     అయితే అదే రోజు ప్రకాశం పంతులు , తెన్నేటి విశ్వనాధం వంటి నాయకులు మాత్రం ఇంకా మదరాసులో అరవవారికన్నా తెలుగువారే అధికంగా ఉన్నారనే అసంబద్ధపు ప్రకటన చేశారు.
       అక్టోబర్ 27 నాడు పార్లమెంటు సభ్యుడు లంకా సుందరం నిర్వివాద ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం నిర్మించి మదరాసును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని రాష్ట్రపతిని కోరాడు.
    అక్టోబర్ 28 నాడు బులుసు సాంబమూర్తి కూడా ఒక సభలో మాట్లాడుతూ మదరాసును కేంద్రపాలిత ప్రాంతం చేసి ఆంధ్ర రాష్ట్రం ప్రకటించాలని డిమాండ్ చేశాడు.
      ఇక పొట్టి శ్రీరాములు దీక్ష మొదలైన 10 రోజులకు అన్నిటికన్నా ఘోరమైన విషయం జరిగింది. అప్పటిదాకా మద్రాసు లేకుండా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించిన ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. రెండేళ్ల కిందటి తీర్మానానికి మద్ధతు పలికిన నేత నీలం సంజీవరెడ్డి ఇప్పుడు ప్లేటు ఫిరాయించి మదరాసుపై ఆంధ్రులు హక్కును వదులుకోరని ప్రకటించాడు.  అంతే కాదు ఇంకో అయిదేళ్ల వరకూ ఆంధ్ర రాష్ట్రం వచ్చే పరిస్థితి లేకపోవడం వల్లనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్ధించుకున్నాడు.
                     
           ఎంత దుర్మార్గమో చూడండి. ఒకవైపు నిరాహార దీక్షకు కూర్చున్న
 పొట్టి శ్రీరాములు ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణిస్తున్న వేళ సాక్షాత్తూ నీలం సంజీవ రెడ్డే ఇంకో అయిదేళ్ల వరకూ రాష్ట్రం రాదని చెబుతున్నాడు. మరి అటువంటి పరిస్థితులో పొట్టి శ్రీరాములు దీక్ష కొనసాగిస్తుంటే దాన్ని ఆపకుండా ఎందుకు ఉన్నట్టు?
           అక్టోబర్ 30, 1952 నాడు మదరాసులో జరిగిన లా కాలేజి విద్యార్ధుల సభలో పలువురు ఆంధ్ర రాష్ట్ర నేతలు, మేధావులు పాల్గొన్నారు. ఆనాడు సభకు అధ్యక్షతవహించిన ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ “ఒక కొసన ఉన్న చెన్నపురి (మదరాసు) ఆంధ్ర రాష్ట్రనికిగాని, తమిళ రాష్ట్రానికిగానీ ముఖ్యపట్టణంగా పనికిరాదనీ, చెన్నపురి తమకు దూరం కాబట్టి తాము ఒరిస్సాలో చేరగలమని శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలవారు అనవచ్చునని కాబట్టి చెన్నపురి సమస్యను రాష్ట్ర నిర్మాణానికి ప్రతిబంధకం కానివ్వరాదని అన్నారు.
       పొట్టి శ్రీరాములు దీక్ష కొనసాగినన్నాళ్ళూ ఆయన ప్రాణాలు రక్షించడానికి పాపం నార్ల గారు చేయని ప్రయత్నం లేదు. ఆనాడు ఆంధ్ర ప్రభ తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ గలిగిన పత్రిక. తన పత్రికలో రోజూ వార్తలు, కార్టూన్లు, సంపాదకీయాల ద్వారా ప్రకాశం వంటి ఆంధ్ర నాయకుల మూర్ఖపు, నిర్హేతుక వైఖరులను, ఫట్టుదలలను విమర్శించేవారు నార్ల వెంకటేశ్వరరావు గారు. అయితే ఆంధ్ర రాష్ట్రోద్యమ నాయకులు మాత్రం ఎవరి హితోక్తులూ వినలేదు.
          రోజులు గడుస్తున్నా, పొట్టిశ్రీరాములు ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతున్నా పట్టించుకోకుండా ఇటు ప్రకాశం పంతులు, అటు నీలం సంజీవరెడ్డిలకు తోడు దీక్ష వేదికగా తన ఇల్లును ఇచ్చిన బులుసు సాంబమూర్తి, ఇంతకు ముందొకసారి ఆంధ్ర రాష్ట్రం కొరకు దీక్షచేసి విరమించిన స్వామిసీతారాం – ఈ నలుగురూ వివిధ వేదికలపై మదరాసు నగరంపై వింతవింత వాదనలు చేయడం మొదలుపెట్టారు. మచ్చుకు 30 అక్టోబర్, 1952 నాడు లా కాలేజీ విద్యార్ధుల సభలో నీలం సంజీవరెడ్డిగారు అన్న ఈ ఆకుకు, పోకకు అందని ఈ వ్యాఖ్యలు చూడండి. “అపుడూ మదరాసుపై హక్కులు వదులుకున్నాం అని చెప్పాం, కానీ అది అరవలకు ఇస్తున్నామని అంగీకరించలేదు….మదరాసులో అరవలు ఎక్కువ ఉన్నారని ఒప్పుకోవచ్చు, కాని, అరవేతరులు అంతకన్న ఎక్కువ కనుక మదరాసును అరవలు కోరరాదు…మదరాసు అరవలకు, ఆంధ్రులకు ఉమ్మడిగానుంటే కష్టమేమిటి? మదరాసులో వారు చెప్పినట్లు అరవలు 80మంది ఉన్నా, 16గా ఉన్న ఆంద్రుల హక్కులు కాపాడడానికైనా, అది ఉమ్మడిగా ఉండాలి”
         చూశారుగా, ఇది చూస్తే ఇప్పుడు సీమాంధ్ర నేతలు తెలంగాణపై చేసే అడ్డగోలు వాదనలు గుర్తుకురావట్లేదూ?
ఇటు ఆంధ్ర నేతలు, అటు తమిళ నేతలు మదరాసు నగరంపై సవాళ్లూ ప్రతిసవాళ్లూ విసురుకుంటూ, పొట్టి శ్రీరాములు ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటం చూసి, మదరాసు యువజన ఫెడరేషన్ కు చెందిన కేశవలాల్ తరవాది అనే గుజరాతి యువకుడు చేసిన ఈ హెచ్చరిక చూడండి.                                                                             
        6 నవంబర్, 1952 నాడు మదరాసు నగరంలో సమావేశమైన ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్షణమే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని, మదరాసును ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. దీనికి సరిగ్గా వారం రోజుల ముందు తమిళ కాంగ్రెస్ పార్టీ మదరాసుపై తెలుగు వారికి ఎట్టి హక్కు లేదని తీర్మానం చేయడం గమనార్హం.
                                                                       
(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి)                                                                                          
         పొట్టి శ్రీరాములు గారి దీక్ష మొదలై దాదాపు నెలగడిచాక మదరాసులో ఆంధ్ర విద్యార్ధి విజ్ఞానసమితి వారి విజ్ఞానోత్సవం సభలో పాల్గొంటూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒక గొప్ప మాట చెప్పారు. “ఇక మదరాసు సమస్య ఇటీవల వచ్చింది. దీనికోసం పోట్లాడుకుంటూ కూర్చుంటే, పొలంగట్టు కోసం దావాలకు దిగి, ఖర్చులకోసం పొలం అమ్ముకున్నట్లవుతుంది. ఆంధ్ర రాష్ట్రం సంపాదించడం మన ప్రధాన సమస్యా లేక మదరాసు సంగతి తేల్చడం ప్రదాన సమస్యా? అని ఆలోచించాలి.
         మదరాసు గురించి మనవారు సూచిస్తున్న మూడు ప్రతిపాదనలతో మదరాసు ఆంధ్ర రాష్ట్రంలో భాగం కాదని రుజువవుతున్నది. మనదీ అనడానికి దమ్ములు లేక, చెరిసగం అని, ప్రత్యేక రాష్ట్రమని, అరవలకు పోరాదని అంటునారు, కనుక, వివాదం లేని ప్రాంతాలతో రాష్ట్రం తీసుకొని, తరువాత తక్కినవాటికై పోట్లాడాలని, నెహ్రూని లొంగదీయగల ఉద్యమం నేడు లేవదీయలి. దానికి విద్యార్ధులు పూనుకోవాలి”
            డిసెంబర్ మొదటి తారీఖు కల్లా పొట్టి శ్రీరాములు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. 3వ తారీఖునాడు ఆచార్య ఎన్ జి.రంగా, నల్లారెడ్డి నాయుడు, వి. రాజగోపాలరావు, ఎన్ శేషయ్యగార్లతో కూడిన నలుగురు పార్లమెంటు సభ్యుల బృందం వెంటనే నిర్వివాద ప్రాంతాలతో (మదరాసు లేకుండా) ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసి పొట్టి శ్రీరాములు ప్రాణాలు కాపాడాలని ప్రధాని నెహ్రూకు ఒక లేఖ రాసింది.
 పొట్టి శ్రీరాములు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఆంధ్ర నాయకులంతా డిసెంబర్ 7 నాడు ఒక అత్యవసర అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం జరిగేనాడు ఆంధ్రప్రభ ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావుగారు తన దినపత్రికలో ఆంధ్ర నాయకులు ఇలాగే జాగుచేస్తే పొట్టి శ్రీరాములు ప్రాణాలు కాపాడుకోవడం కష్టమని అత్యంత ఆవేదనతో ఇలా రాశారు:                                                                                    
                                     (ఆంధ్రప్రభ దినపత్రిక నుండి)
           కానీ కొండకు (మదరాసుకు) వెంట్రుక (పొట్టి శ్రీరాములు ప్రాణం) కట్టి లాగుతున్నాం, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది అన్న చందాన వ్యవహరించారు అప్పటి సీమాంధ్ర నాయకులు. ఆనాటి సభలో ప్రకాశం పంతులు చాలా అన్యాయంగా ప్రవర్తించాడు. ఆద్యంతం నవ్వుతూ, చలోక్తులతో, జోకులేస్తూ ప్రసంగించాడు.
      దీక్ష మొదలుపెట్టాక తాను పొట్టి శ్రీరాములును ఒక్కసారి మాత్రమే కలిసానని చెప్పుకున్నాడు. ఆయన ప్రసంగంలో ఈ వాక్యం చూడండి: “గత కొలది దినాలుగా ఆయన పరిస్థితి ప్రమాదంలో పడింది. ఏ క్షణంలో అయినా ఆయన ప్రాణం కాస్తా హరీ అనవచ్చు. అప్పుడు ఆంధ్ర దేశంలో, మద్రాసు నగరంలో ప్రజలలో ఉద్రేకం విపరీతంగా పెరిగిపోవడం తధ్యం”
          పొట్టి శ్రీరాములు ప్రాణాల పట్ల ఆంధ్ర రాష్ట్రోద్యమ ముఖ్య నాయకుడిది ఎంత నేరపూరిత నిర్లక్ష్యమో చూశారా?
ఈ సభలో ప్రకాశంతో పాటు అనేక మంది ఆంధ్ర నాయకులు మళ్ళీ పాత పాటనే పాడారు. మదరాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని, కుదరని పక్షంలో మదరాసును కేంద్రపాలిత ప్రాంతం చేసి ఉమ్మడి రాజధానిగా అన్నాఉంచాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టారు.
       ఈ తీర్మానాన్ని గౌతు లచ్చన్న వంటి కొంత మంది ఆంధ్ర నాయకులు, ముఖ్యంగా కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారు. సభలో ఇరు పక్షాలూ కేకలు వేసుకున్నారు. ప్రకాశం పంతులు, తరిమెల నాగిరెడ్డి అయితే వేదికపైనే పరస్పరం వాదనలకు దిగారు.
చివరికి వేదికను ఎక్కిన ప్రముఖ కమ్యూనిస్టు నేత తరిమెల నాగిరెడ్డి మాట్లాడుతూ:
     ఈ తీర్మానం కనుక ఆమోదిస్తే రాష్ట్ర ఏర్పాటు 50 సంవత్సరాలు వాయిదా పడుతుందని, ఈ తీర్మానం వల్ల రాష్ట్రమూ రాదు, శ్రీరాములు గారి ప్రాణమూ రక్షించడం సాధ్యం కాదన్నారు. చివరికి మందబలంతో ప్రకాశం పంతులు వాదనే నెగ్గింది. ఆ సభలో అమోదం పొందిన తీర్మానం ఒకవిధంగా పొట్టి శ్రీరాములు మరణశాసనం!
      డిసెంబర్ 9 నాడు స్టేట్ కౌన్సిల్ లో మాట్లాడుతూ నిర్వివాద ప్రాంతాలతో (మదరాసు లేకుండా) ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రధాని నెహ్రూ ప్రకటించాడు.
                                                                
        అయినా ఆంధ్ర నాయకులు తమ మూర్ఖపు పట్టుదల విడువలేదు. డిసెంబర్ 10 నాడు నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును గూర్చి చేసిన ప్రకటన అటు మెజారిటి తెలుగు ప్రజలు, నాయకులు ఆమోదించారు. కానీ ప్రకాశం బృందం మాత్రం తమ అత్యాశ మానుకోలేదు.
      డిసెంబర్ 11, 1952 నాడు ఆంధ్ర ప్రభ పత్రికలో ప్రచురితమైన ఈ కార్టూన్ అప్పటి వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతుంది.
                                                                  
           ఆంధ్ర రాష్ట్రం అనే స్త్రీని కారాగారంలో వేసి దానికి మదరాసు అనే తాళం బిగించి, దానిని ఎవరూ తీయకుండా దుడ్డుకర్ర పట్టుకుని కాపలాకాస్తున్న ప్రకాశం బృందం!
       13 డిసెంబర్ నాటికి పొట్టి శ్రీరాములు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అనేకమంది ఆంధ్ర రాజకీయ నాకులు, ప్రముఖులు ప్రకాశం  బృందం తమ బెట్టువీడాలని, మదరాసు లేకుండా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఒప్పుకోవాలని విజ్ఞప్తులు చేశారు. పొట్టి శ్రీరాములు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ప్రజలు అనేకచోట్ల రైళ్లను అడ్డగించడం, ర్యాలీలు తీయడం మొదలుపెట్టారు.
          
   
              చాలా పట్టణాల్లో మదరాసులేకుండా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని, పొట్టి శ్రీరాములు ప్రాణాలు కాపాడాలని ఊరేగింపులు  జరిగాయి.   
                                                                        
         దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థం అయ్యేదేమిటంటే మదరాసు నగరాని కోరుకున్నది గుప్పెడు మంది స్వార్ధ రాజకీయనాయకులే కానీ ఆనాటి ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కారని.  డిసెంబర్ 16 నాడు ఆంధ్రప్రభ పత్రిక తన సంపాదకీయంలో ప్రకాశం పంతులు, బులుసు సాంబమూర్తి, స్వామి సీతారాంల వైఖరిని తీవ్రంగా ఎండగట్టింది.  “ఎవరు ద్రోహులు?” అనే శీర్షికతో వచ్చిన ఆ సంపాదకీయంలో
       ” ఈ పరిస్థితిలో ముక్కోటి ఆంధ్రుల అభిమతం ఈడేరడం ముఖ్యమా? ఈ ముగ్గురు ముసలివారి మంకుపట్టు నెగ్గడం ముఖ్యమా? ఇప్పుడిక లోకమే నిర్ణయించాలి. ఆంధ్ర రాష్ట్రానికి అడ్డుగా నిలుస్తున్నవారెవరో, ఆంధ్రజాతికి ద్రోహం చేస్తున్నవారెవరో” అని రాశారు.
        16 డిసెంబర్ నాడు అదే ఆంధ్రప్రభలో ప్రచురితమైన ఈ కార్టూన్ చూడండి ఎంత చక్కగా అప్పటి వాస్తవ పరిస్థితి ప్రతిబింబిస్తుందో  :
                                                                  
         చివరికి పూర్తిగా ఆరోగ్యం క్షీణించడంతో 15 డిసెంబర్ 1952 అర్ధరాత్రి 11:23 నిముషాలకు పొట్టి శ్రీరాములు తుదిశ్వాస విడిచాడు…గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయన చనిపోవడానికి కొన్ని గంటల ముందే పూర్తిగా స్పృహ తప్పారు. అటువంటి పరిస్థితిలో కూడా ఆయనకు ఎందుకు వైద్య సహాయం అందించలేదనేది జవాబులేని ప్రశ్న.
       స్వార్ధ ప్రయోజనాలే పరమావధిగా ప్రకాశం వంటి సీమాంధ్ర రాజకీయ నాయకులు మదరాసు నగరాన్ని చేజిక్కించుకునేందుకు ఆడిన జూదంలో పొట్టిశ్రీరాములు ప్రాణాలు ఫణంగా సమర్పించారు అని చెప్పొచ్చు.

-MissionTelangana 

No comments:

Post a Comment