Monday 20 August 2012

వేములవాడ రాజన్న

వేములవాడ  శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం (దక్షిణ కాశీ)
        వేములవాడ తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. వేములవాడ, కరీంనగర్‌కు 32 కిమీ ల దూరంలో కరీంనగర్‌-కామారెడ్డి దారిలో ఉంటుంది. ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుండీ ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాయమునకు వేములవాడ ప్రసిద్ధి చెందింది.
           చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట గాని, లేదా అతడు కట్టించినందువలన గాని ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు కలదు. గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. వద్దేగేశ్వర స్వామి దేవాలయము కూడా ఇక్కడ ఉన్నది.
                  శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్ధులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. ఇంకా, ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దానధర్మాలు చేస్తుంది.
         రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి. గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి రూ. 8 లక్షలు ఖర్చు పెడితుంది దేవస్థానం.కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం లను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వేంచేసాడని పురాణ కథనం. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజ రాజేశ్వర స్వామి అని, రాజన్న అనీ అంటారు. మూలవిరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజ రాజేశ్వరీ దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి.
            భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రముఖమైనది కోడెమొక్కు. భక్తులు గిత్తను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టివేస్తారు. దీనివలన భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు.
వివిధ మతావలంబికుల దర్శన స్థలం
    శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి.
ప్రాంగణంలో మసీదు
        ఈ దేవాలయానికి గల మరో విశేషమేమిటంటే దీని ప్రాంగణంలో 400 ఏళ్ళ నాటి మసీదు ఉన్నది. ముస్లిము మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ గుడిలో ఉంటూ, స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడు; అతని స్మృత్యర్ధం ఈ మసీదు నిర్మించారని ప్రతీతి. హిందువులు శివుణ్ణీ, ముస్లిములు అల్లా ను పూజించే ఈ దేవాలయ ప్రాంగణం మతసామరస్యానికి చిహ్నంగా భాసిల్లుచున్నది.
వీడియో
                   

No comments:

Post a Comment